Thursday, October 2, 2025

 *శ్రీ శివ మహా పురాణం*
*390.భాగం*

*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-తొమ్మిదో అధ్యాయం* 

*సృష్టి స్థితి లయములు* 

*మునులు ఇట్లు పలికిరి:* 

పరమేశ్వరుడు ఈ జగత్తునంతనూ సృష్టించి తన ఆజ్ఞచే పాలించి, మరల ఉపసంహరించి గొప్ప క్రీడను చేయుచున్నాడు. ఆ విధమెట్టిది?  మున్ముందుగా ఏది సృష్టించబడినది? ఈ సర్వము దేనిచే వ్యాప్తమై యున్నది? ఎవడు మరల దీనినంతనూ కబళించి వేయును? వాని పొట్ట చాల పెద్దది అయి ఉండును! 

*వాయువు ఇట్లు పలికెను:* 

ముందుగా శక్తి ఉద్భవించెను. ఆ తరువాత శాంత్యతీతపదము (శాంతికి అతీతముగా నుండే ధామము) ఉద్భవించెను. తరువాత శక్తితో కూడియున్న ఆ పరమేశ్వరునినుండి మాయ, ఆ తరువాత అవ్యక్తము (వివిధరూపములలో ప్రకటమైన జగత్తుయొక్క బీజరూపము) పుట్టినవి. శక్తి నుండి శాంత్యతీతపదము, శాంతిపదము ఆ వరుసలో ప్రకటమైన వి. శాంతిపదమునుండి విద్యాపదము, దానినుండి ప్రతిష్ఠాపదము పుట్టినవి. అదే వరుసలో ప్రతిష్ఠాపదమునుండి నివృత్తిపదము పుట్టినది. ఈ విధముగా ఈ శ్వరుని ప్రేరణచే జరిగిన సృష్టి పైనుండి క్రిందికి వరుసలో సంగ్రహముగా చెప్పబడినది. దీనికి విరుద్ధమగు క్రమములో ప్రళయము జరుగును. ఈ అయిదు పదములకంటె ఉత్కృష్టుడగు సృష్టికర్త వీటిచే సూచించబడుచున్నాడు. కావున, ఈ జగత్తు అంతయు ఈ అయిదు కళలచే వ్యాప్తమై యున్నది. సర్వకారణమగు ఆ అవ్యక్తము ఆయా రూపములలో తానే పరిణమించి ప్రకటమగుచున్నది. మాయాశక్తి మహత్తత్త్వమునుండి మొదలిడి పంచభూతములలోని విశేషగూణముల వరకు సృష్టించునని అంగీకారమే. కాని ప్రకృతి జడమగుట వలన, పురుషుడు అజ్ఞాని యగుట వలన, వాటి సృష్టి విషయములో కర్తృత్వము అవ్యక్తము (ప్రకృతి) నకు గాని, ఆత్మకు గాని లేదు. ప్రధానము (ప్రకృతి) నుండి పరమాణువుల వరకు సర్వము జడము. చైతన్యరూపమగు కారణము లేనిదే వాటియందు స్వయముగా కర్తృత్వము పొసగదు. జగత్తు కార్యము (పుట్టుక గలది), మరియు అవయములు గలది. కావున, దానికి కర్త ఒకడు అపేక్షించబడు చున్నాడు. కావున, శక్తితో కూడియున్నవాడు, స్వతంత్రుడు, సకలశక్తులు గలవాడు, సర్వము తెలిసినవాడు, ఆది-అంతములు లేనివాడు, గొప్ప ఈశ్వరభావము గలవాడు, మహాదేవుడు అగు ఆ మహేశ్వరుడే జగత్తును అంతనూ సృష్టించి, పాలించి, సంహరించుచున్నాడు. ఆయన జగత్తుకంటె విలక్షణుడై, కేవలము మిథ్యారూపమగు జగత్తునకు అధిష్ఠానమై యున్నాడు. ప్రకృతి యొక్క పరిణామము, మరియు పురుషుని ప్రవృత్తి సత్యసంకల్పుడగు పరమేశ్వరుని శాసనము వలన మాత్రమే సంభవమగుచున్నవి.

 సత్పురుషుల మనస్సులో ఈ రకమగు నిష్ఠ (జ్ఞానమునందు నిలకడ) స్థిరముగా నుండును. కాని అల్పమగు ప్రజ్ఞగల వ్యక్తి ఈ పక్షమునాశ్రయించి ఉండడు. సృష్టి ఆరంభమై, తరువాత గొప్ప ప్రలయము వచ్చుసరికి బ్రహ్మగారి వంద సంవత్సరముల ఆయుర్దాయము అంతయు గడచిపోవును. అవ్యక్తమునుండి జన్మించిన బ్రహ్మగారి ఆయుర్దాయమునకు పరము అని పేరు. ఆ పరములో సగము కాలమునకు పరార్ధము అని పేరు. రెండు పరార్ధముల కాలము గడచిన తరువాత ప్రలయము వచ్చును. అపుడు అవ్యక్తప్రకృతి తననుండి పుట్టిన జగత్తును తనలోనికి ఉపసంహరించుకొని యుండును. అవ్యక్తము తననుండి పుట్టిన జగత్తును ఉపసంహరించి తన రూపములో నిలిచియుండగా, ప్రధానపురుషులిద్దరు సమానధర్మము గలవారై యుందురు. తమస్సు, సత్త్వము అనే గుణములు గల వినాశము లేని వీరిద్దరు సంక్షోభము (గుణముల పాళ్లలో మార్పు) లేని సామ్యావస్థలో ఒకరితోనొకరు పడుగు పేకవలె పెనవేసుకొని యుందురు. గుణముల సామ్యావస్థ గలది, విభాగములు లేనిది, చీకటితో నిండియున్నది, ప్రకృతి అంతయు ఉపశమించియున్నది, జలముల (చైతన్యము) లో కదలిక లేనిది అగు ఆ సమయములో ఏదియు విశిష్టముగా తెలియబడదు. జగత్తు అవ్యక్తములో విలీనమై యున్న ఈ సమయములో మహేశ్వరుడొక్కడే రాత్రి అంతయు సర్వజగత్తుకంటె ఉత్కృష్టమగు మహేశ్వరశక్తిని ఉపాసించి, తరువాత  రాత్రి తెల్లవారిన తరువాత ప్రధానపురుషులిద్దరియందు ప్రవేశించి, ఆ మహేశ్వరుడు మాయాసంబంధముచే వాటియందు సంక్షోభమును కలిగించును. అప్పుడు మరల పరమేశ్వరుని ఆజ్ఞచే సృష్టిలయములకు నిధానమగు అవ్యక్తప్రకృతినుండి సకల ప్రాణుల సృష్టి జరుగును. విశ్వమునకు అతీతమగు ప్రకృతికంటె అతీతుడు, విచిత్రమగు సంకల్పశక్తి గలవాడు. సగలజగత్తులకంటె విలక్షణమైనవాడు (అధిష్ఠానమగుచున్ననూ జగద్ధర్మములతో సంపర్కము లేనివాడు) అగు ఆ పరమేశ్వరునకు నమస్కారము. ఆయనయొక్క శక్తిలోని చిన్న అంశములో సర్వజగత్తు సమాప్తమగుచున్నది. మోక్షమార్గమును గురించి తెలిసిన జ్ఞానులు మోక్షమార్గమునకు ప్రభువు అగు ఆ ఈశ్వరుని ఆత్మరూపునిగా వర్ణించుచున్నారు.

*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో సృష్టిస్థితిలయములను వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.*

No comments:

Post a Comment