Tuesday, July 16, 2024

త్వమేవాహమ్‌

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏼
🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్ 

*🌺త్వమేవాహమ్‌🌺*

         కన్నతల్లి కడుపులోంచి బయటపడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే *నేను*

          *ఈ *నేను* ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు

           * ఊపిరి ఉన్నంతదాకా *నేను*’ అనే భావన కొనసాగుతూనే ఉంటుంది

           * జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ *నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది

          *ఈ *నేను* లోంచే *నాది* అనే భావన పుడుతుంది!

         *ఈ *నాది* లోంచి నావాళ్ళు, నాభార్య, నాపిల్లలు, నాకుటుంబం, నాఆస్తి, నాప్రతిభ, నాప్రజ్ఞ, నాగొప్ప... అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ *నేను* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.

              * *అహం* అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *నేను*  *నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది.

            *నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.

             *పంతాలతో పట్టింపులతో, పగలతో ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది

              * బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన *నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

               *వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

               *సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.

              * సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన *నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

              *కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.

               *మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

             *మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.

              * *నేనే* శాసన కర్తను, *నేనే* ఈ భూమండలానికి అధిపతిని, *నేనే* జగజ్జేతను... అని మహోన్నతంగా భావించిన *నేను* లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది.

               *ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన *నేను* కథ అలా సమాప్తమవుతుంది.

               * అందుకే ఊపిరి ఆగకముందే *నేను* గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత.

             * చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే. 

             *అది శాశ్వతం కానే కాదు*

* *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది.

             * *వైరాగ్యం* అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. *దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం*.  తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం.

             *స్వర్గ నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.

              * మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే *నరకం*

              * అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమే *స్వర్గం*

              *ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం*.

              * నిజాయతీగా, నిస్వార్థంగా, సద్వర్తనతో, సచ్ఛీలతతో భగవత్‌ ధ్యానంతో జీవించమనేదే *వేదాంతసారం*.

              *అహం బ్రహ్మాస్మి* అంటే 
*అన్నీనేనే* అనే స్థితి నుంచి *త్వమేవాహమ్‌* అంటే- *నువ్వేనేను* అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే *మానవజన్మకు సార్థకత*.
     జై గురుదేవ్ 🙏🏻🙏🏻.

No comments:

Post a Comment