Saturday, May 2, 2020

భగవంతుడికి గుడిని ఎక్కడ కట్టాలి, అంతటి పవిత్రమైన చోటు ఎక్కడుంది? ఆ గుడిని ఎంత ధనం ఖర్చుచేసి కట్టాలి? విగ్రహాన్ని ఎంతటి ఖరీదైన లోహంతో చేయాలి?

👌భగవంతుడికి గుడిని ఎక్కడ కట్టాలి, అంతటి పవిత్రమైన చోటు ఎక్కడుంది? ఆ గుడిని ఎంత ధనం ఖర్చుచేసి కట్టాలి? విగ్రహాన్ని ఎంతటి ఖరీదైన లోహంతో చేయాలి?.👌

రామాపురం అనే గ్రామంలో నివసించే ప్రజలు అందరూ కలిసి తమ గ్రామంలో ఒక రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించు కొన్నారు. అందుకొరకు అవసరమైన ధనాన్ని చందాల రూపంలో వసూలు చేయాలని అనుకొన్నారు. అలా చందాల కోసం ఊరంతా తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి చందాలు అడుగుతూ ఉన్నారు. చందాలు బాగానే వసూలు అవుతున్నాయి. అలా వారు ఆ ఊరిలోని బాగా ధనాన్ని ఆర్జించిన కొంతమంది గొప్పవారని కూడా కలిశారు. అందులో రెడ్డెప్ప అనే ఒక కాంట్రాక్టర్ గర్భగుడికి అయ్యే ఖర్చును మొత్తంగా తానే భరిస్తానన్నాడు. ఇంకొక ధనవంతుడు ప్రహరీ గోడకు, మరొక వ్యాపారి ఫ్లోరింగుకు, మరొకరు సారా కాంట్రాక్టర్ విగ్రహానికి, ఇంకొకరు కటాంజనం గ్రిల్, మరొకరు తలుపులకు గడపలకి అవసరమైన చందాలు ఇస్తామంటూనే తమ పేర్లను వాటిపైన పెద్ద పెద్దగా, గొప్పగా శిలాఫలకాలపైన ముద్రించాలంటూ నియమ నిబంధనలను పెట్టారు.

అందుకు దేవాలయం కమిటీ వారు కూడా సరే ఏదో ఒక విధంగా ధనసమీకరణ జరుగుతుంది కదా అనుకుంటూ, వారి నిబంధనలకు ఒప్పుకొన్నారు. అలా నిబంధనలు పెట్టిన ఆ గొప్ప ధనవంతు లందరికీ ఆరోజు రాత్రి భగవంతుడు వారి కలలోకి వచ్చి, మీరు ఎంతో సంపాదిస్తున్నారు, అలాగే ఎంతో ఖర్చు పెడుతున్నారు. ఇందులో గొప్పతనం, వీరత్వం, శూరత్వం ఏముంది? మీరు కోట్లు సంపాదించినా లేక కోట్లు ఖర్చు చేసినా బయటివారి కోసం కాదుకదా. కేవలం మీకోసం, మీ కుటుంబం కోసం, మీ గొప్పతనాన్ని ఇతరులకు చూపించడం కోసం. దేవాలయాలు, సత్రాలు కట్టించినా, వాటిపైన మీ పేరు వ్రాసుకునేది మీ గొప్పను అందరికీ చూపెట్టుకోవడానికే కదా. అలాగే మీరు చందాలను ఇచ్చింది కూడా పవిత్రమైన మనసుతో కాదు. ఈ రకంగా నైనా చేసిన పాపాలను, మోసాలను కొన్నైనా తగ్గించుకోవచ్చు అన్న దుర్బుద్ధి తోనే కదా !

అలా మీరిచ్చిన చందాలతో నేను మీకు వశం అవుతానని, మీ గొంతెమ్మ కోరికలు తీరుస్తానని కలలు కంటున్నారా? అసలు నెనేమైనా మీ వద్దకు వచ్చి నేను ఉండటానికి ఒక గుడి కట్టించడ్రా అని అడిగానా? పోనీ మీరిచ్చే ఆ చందాల డబ్బును నీవేమైనా ధర్మ పదంగా సంపాదించావా? ఎంతో మందిని పీడించి, బాధపెట్టి, అన్యాయంగా, అక్రమ మార్గంలో పన్నులు ఎగవేసి, ప్రభుత్వాన్ని మోసగించి, ఇతరుల కష్టార్జితాన్ని దోచుకొని అలా నీవు ఆర్జించిన, సంపాదించిన ఆ దొంగ సొమ్ముతో నా పేరు చెప్పి, నాకు గుడి కట్టించి నంత మాత్రాన నీవు పరమ పవిత్రుడవు అవుతావని ఎలా అనుకుంటున్నావు? అన్నారు.

అలా మీరిచ్చే డబ్బుతో కట్టే ఆ గుడిలో నేను ఎలా నెలవై ఉంటానని మీరెలా అనుకుంటున్నారు. కానీ నిజానికి మానవుని దేహమే ఒక దేవాలయం. అందులోని మంచి మనసే విగ్రహం. ఆ నీ మనసులోని మానవత్వమే భగవంతుని దైవత్వం. అలాంటి పవిత్రమైన దేహాలలో నేను ఎప్పుడూ నెలవై ఉంటాను అన్నాడు భగవంతుడు. అందుకు ఆ ధనవంతుడు స్వామి మరి మీరు ఇప్పుడు నా దేహంలో ఉన్నారా? లేరా? అని సందేహంగా అడిగాడు.

అందుకు భగవంతుడు చిన్నగా నవ్వి నీ దేహం ఇప్పటికే అపవిత్రమై ఉంది కాబట్టే అది బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్, పక్షవాతం వంటి ఇంకా అనేక రకాల జబ్బులకు నెలవై ఉంది. ఆ దేహంలోని మెదడు కూడా అపవిత్రమైన ఆలోచనలతో నిండిపోయి ఉంది. కొద్ది రోజుల తర్వాత నీ దేహం ఎంతగానో భ్రష్టు పట్టి పోతుంది. నీ శరీరం నుండే కాదు, నీ హృదయం నుంచి కూడా దుర్వాసన వస్తోంది. నేను మీలాంటి అపవిత్రమైన వారి దేహంలో ఉండలేను. అయినా నాకు బంగారంతో కట్టిన మందిరాలుగానీ, పండితులైన పూజారులతో గానీ నాకు అవసరం లేదు. నేనే స్వయంగా వేదాలను సృష్టించిన వాడిని, నాకెందుకు నీ మంత్రాలు, తంత్రాలు, అభిషేకాలు. అన్నీ నేనే అయినప్పుడు నాకు ఇంకో దేవాలయం అవసరం లేదు. అందుకే నీకు ఇష్టమైన నీ హృదయాన్ని పవిత్రం చేసి, నాకు ఇవ్వు చాలు. నేను శాశ్వతంగా అక్కడ కొలువై ఉంటాను " అని అన్నాడు భగవంతుడు.

మరి నేనిప్పుడు ఎంచేస్తే నా దేహంలో కొలువైతారు అని అడిగాడు ఆ ధనవంతుడు. అందుకు భగవంతుడు నీ దేహాన్ని ముందుగా మంచి, మానవత్వం, సేవాభావాలతో శుభ్రం చెయ్యి, దాన్ని గుడిగా పవిత్రంగా మలుచు, ప్రస్తుతం "ఈ కరోనా వైరస్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది వలస కూలీలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి నీ ధనాన్ని ఉపయోగపెట్టు, ప్రభుత్వాల దగ్గర అవసరమైనంత ఆర్థిక వనరులు లేవు. ఇలాంటి కష్టకాలంలో ఎంతో మంది వేలు, లక్షలు, కోట్ల రూపాయలను డొనేషన్స్ రూపంలో ఇచ్చి ఆదుకొంటున్నారు. మరి నీవు కూడా సహృదయంతో, సామాజిక బాధ్యతతో నీ వంతుగా, బాధిత ప్రజలకు, ప్రభుత్వానికి ధన సహాయం చేయ్యి ". ఎందుకంటే నీవు సంపాదించింది ఈ సమాజం నుండి, అందులోని ప్రజలనుండే కదా, అలా చేస్తే నువ్వు నాకు నీ హృదయంలో గుడి కట్టించినట్లే. అప్పుడు నేను ఆనందంగా అక్కడే నివాసముంటాను. నేను నీ దగ్గరే ఉండిపోదలుచుకున్నాను. అందుకు నీవేంచేయాలో వెంటనే చేసేయ్యి అన్నాడు భగవంతుడు.

కాబట్టి మిత్రులారా ! ఇప్పటి వరకు కరోనా పీడితులకు ఆర్థిక సహాయం అందించిన వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే వారు చేసింది భగవత్ కార్యం. అందుకే వాళ్ళు గుడిలోని భగవంతుడితో సమానం. కాబట్టి మీరు కూడా మీ వంతు సహాయాన్ని కరోనా బాధితులకు అందించి భగవత్ స్వరూపులుగా నిలవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ..

సర్వే జనా సుఖినోభవంతు.*

No comments:

Post a Comment