Monday, April 18, 2022

ఆహారం – వ్యవహారం

👉 ఆహారం – వ్యవహారం

“ఆహారం” అంటే స్వీకరించేది- “వ్యవహారం” అంటే ఇవ్వబడేది. మామూలు మనుష్యల ఉద్దేశ్యంలో “స్వీకరించేది” అంటే శరీరం కోసం లోపలకు తీసుకునే ఆహారం. “ఇవ్వబడేది” అంటే బయట చేసే వ్యవహారం. ఆహారం తీసుకోవటం అంటే శరీరానికి పోషక పదార్థం యివ్వటం. ఇది ప్రతి ప్రాణీ చేసేదే. దీనిలో ఏ ప్రత్యేకతా లేదు. మరి మనిషి పుట్టినందుకు మనకు కొంత పరిణితి ఉండాలి కదా! పొట్ట నింపుకోవటం అవసరమే. కానీ దానితోనే పరిమితం కారాదు.

ఆహారాలు నాలుగు రకాలు. (1) శారీరక పరమైన ఆహారం (2) మానసిక పరమైన ఆహారం (3)బుద్ధి పరమైన ఆహారం
(4) ఆత్మ పరమైన ఆహారం

మొదటిది శారీరకమైన ఆహార స్వీకరణం - ఎవ్వరూ చెప్పక పోయినా అందరూ చేస్తూ వున్నదే. “మానసిక పరమైన ఆహార స్వీకరణం” అంటే సూర్యోదయం, సూర్యా స్తమయం, పండు వెన్నెల, ప్రకృతి అందాలు.. ఇవన్నీ మనస్సుకు అత్యంత ఆహ్లాదాన్నీ+ ఆనాందాన్నీ యిస్తాయి. మనస్సు పండుగ చేసుకుంటుంది కాబట్టి వాటిల్లో మనస్సు నిమగ్నమయినప్పుడు దాని ఆరోగ్యం ద్విగుణీకృతమవుతుంది.

“బుద్ధి పరమైన ఆహార స్వీకరణం” అంటే బుద్ధి పరిశుద్ధి కావటానికి అవసరమైన అసలైన ఆధ్యాత్మిక గ్రంథాలు విరివిగా చదవాలి. ఈ ఆరోగ్యం ఉన్న వారి బుద్ధి.. భగవద్గీత, బైబిల్, న్యూఏజ్ స్పిరిచ్యువల్ బుక్స్‌ లాంటివి చదావాలని ఉవ్విళ్ళూరుతూ వుంటుంది. గొప్ప గొప్ప వాళ్ళను పదే పదే చదవటం వలన అందరి గొప్పతనాన్ని మనలో నింపు కోగల్గుతాం.

ఇంక అన్నింటికంటే అత్యున్నతమైనది… ”ఆత్మ పరమైన ఆహార స్వీకరణం” అదే “ధ్యానం” ! ధ్యానం ద్వారా మనం ప్రాణ శక్తినీ – విశ్వ జ్ఞానాన్నీ- విజ్ఞాన సంపత్తినీ విశేషంగా పొందటమే ఆత్మ పరమైన ఆహార స్వీకరణం. అందువలననే మన “P.S.S.M.” వారం ఈ ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాదుల ద్వారా నాల్గు రకాల ఆహారాన్ని పొందుతూ రోజు రోజుకూ మహా శక్తి వంతులమౌతున్నాం. మనమే కాకుండా జగత్తు మొత్తం మన లాగానే తయారు చేయాలనేదే మన మౌలిక సిద్ధాంతం.

ఈ పరి పూర్ణమైన “చతుర్విధ ఆహార స్వీకరణం సమగ్ర విధానం” వలన మన “జీవితం” పరమాద్భుతంగా తయారు అవుతుంది. మన నోటి నుండి వచ్చే “వ్యవహారం” సదా మన మైండ్‌లో ఉండే ఆహారం పైనే నూటికి వెయ్యి పాళ్ళు ఆధార పడి వుంటుంది. మానసిక పరమైన, బుద్ధి పరమైన, ఆత్మ పరమైన ఆహారాలు అందించినప్పుడు మైండ్ మనకు తెలీయకుండానే వశమయి పొతుంది. దాని వలన ఆటోమేటిక్‌గా మాట సరిగ్గా వస్తుంది. మాట సరిగ్గా వున్నప్పుడు చేత తనంతట తానే సరిగ్గా మారిపోతుంది. అంచేత “ఆహార వ్యవహారాల” లో కాదు, “ఆహారం” లోనే జాగ్రత్తగా వుండాలి. ప్రొద్దన్నే లేచి రెండు గంటలు ధ్యానం ద్వారా ఆత్మకు ఆహారం యిచ్చి బయటకు వెళ్ళి వ్యవహారం చేసి చూస్తే ముఖవర్ఛస్సు ఎంతో పెరిగి ప్రతి పనీ విజయవంతమయి తీరుతుంది!

మనిషి ముఖ్యం – అతని ‘నీడ’ ముఖ్యం కాదు! “నా నీడ నా వెంట వస్తుందో, రాదో” అని భయపడడు! ఎందుకంటే నీడ మనలను ఎప్పుడూ వీడడు” నీడ గురించి అటువంటి అవసరమే లేదు! మన ఆహారానికి.. వ్యవహారం అన్నది ‘నీడ’ మాత్రమే! “యధారాజా తధా ప్రజా” అన్నట్లే “యధా ఆహారం – తధా వ్యవహారం”. రాజు చేతులలో ప్రజలు ఉంటారు. “ఆహారం అంటే రాజు – వ్యవహారం అంటే ప్రజలు”. రాజు చక్కగా ఉంటే ప్రజలూ సహజంగానే చక్కగా వుంటారు.

మనం నాస్తిక పిడి వాద గ్రంథాలు ఎక్కువగా చదివితే ఆ భావాలే పెరిగి ఎలా నాస్తికం అవుతామో బుద్ధుడు – మహ వీరుడు లాంటి వారి యొక్క గ్రంథాలు చదివితే బుద్ధి వికసించి వారంతట వారం అవుతాం! బావిలో బ్రతికే కప్ప లాంటి జీవితం మామూలు నాస్తిక వాదులదైతే.. విశాలమైన సముద్రంలో బ్రతికే తిమింగలం లాంటి జీవితం ధ్యానులది!

ప్రతి ఒక్క వ్యక్తీ సకల ప్రాణి కోటి నుండీ అన్నీ నేర్చుకోవాలి. “నిరంతరం నేర్చుకోవటం” అనేది ఉండాలి! నేర్చుకోవాలనే కోరిక, గమనింపు ఉండాలే గాని ఒక చీమ, ఒక పాము, ఒక ఏనుగు, ఒక అటెండరూ అందరి దగ్గరా – అన్నింటి దగ్గర నేర్చుకోవలసింది ఏదో ఒకటి ఖచ్చితంగా వుంటుంది! కత్తి యుద్ధం నేర్చుకోవాలనుకున్న వాడెవ్వడూ ఎప్పటికీ తన కత్తిని తుప్పు పట్ట నివ్వడు! ఎప్పటికప్పుడు దానికి సాన పెడ్తూ… ఇంకా ఇంకా మెళకువలు తెల్సుకుంటూ అభ్యాసం చేస్తూనే వుంటాడు. దాని వల్లనే నిజంగా యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు జయం పొందుతాడు. ఒక కర్మాగారంలో ఒక పారిశ్రామిక వేత్త ముడి సరకు నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూనే వుంటాడు.

సాధనా తీవ్రతను బట్టీ, సాధనా శ్రద్ధను బట్టే సాధ్యా సాధ్యాలు సానుకూలం అవుతూ వుంటాయి. కొందరికి ధ్యానం మొదల పెట్టిన మూడవ రోజుకే మూడవ కన్ను తెరుచుకుంటుంది. “అదృష్టం” అనుకుంటారు అజ్ఞానులు.. అయితే ఏదీ అయాచితంగా రాదు. అంతకు ముందు జన్మల్లో అఖండంగా చేసిన ధ్యాన సాధనా ఫలితమిది! హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపటానికి శతవిధాల ప్రయత్నించాడు. ప్రహ్లాదుడిగా పుట్టిన ఆ బాలుడు ఆ ప్రహ్లాద జన్మలో ఏ సాధనా చేయలేదు. అయితేనేం? దానికి ముందు జన్మలోనే పదిలపరచుకొన్న “ధ్యాన పటిమ” బ్రహ్మాండంగా వికసించి వుంది. అంచేత హిరణ్యకశిపుని వల్ల ఏమీ కాలేదు. కాదు కూడా. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అతి చిన్న వయస్సులోనే సంగీతాన్ని ఆలపించారు. ఆస్వాదించాడు. ఎవ్వరూ విశిష్టంగా నేర్పలేదు. ఎక్కడ నుండి వచ్చింది ఆ నాణ్యత? అంతా కూడా పూర్వ జన్మలో నేర్చేసుకున్నాడు కాబట్టి వచ్చింది!

పూర్వ జన్మల్లోనూ – మరి ఈ జన్మలోనూ సాధన లేని వారి సంగతి ఏమిటి? వాళ్ళ కోసమే మన “P.S.S.M.” స్థాపించబడింది! మన చేతికి ఐదు వ్రేళ్ళు ఉన్నాయి. చిటికెన వ్రేలు శారీరక ఆరోగ్యం, ఉంగరపు వ్రేలు మానసిక ఆరోగ్యం, మధ్య వ్రేలు బుద్ధి పరమైన ఆరోగ్యం, బొటన వ్రేలు సంఘ పరమైన ఆరోగ్యాలకు సంకేతాలుగా వున్నాయి. “నేను బాగుండాలి” అనేది ఆత్మపరమైన ఆరోగ్యం- “అందరూ బాగుండాలి” అనుకోవటం సంఘపరమైన ఆరోగ్యం.

“సూక్ష్మంలో కొండంత మోక్షం” ధ్యానులకు సిద్ధిస్తే “స్థూలంలో రవ్వంత మోక్షం” పుణ్య కార్యాలు చేసేవారికి లభిస్తుంది! కొండంత పుణ్య కార్యాలు చేస్తే వచ్చే మోక్షం – రోజుకు రెండు గంటల సేపు కాసింత ధ్యానం చేస్తే వచ్చేస్తుంది!

పలాన వాడి జీవితం “మూడు పువ్వులూ -ఆరు కాయలుగా ఉంది” అంటాం. అయితే ధ్యానం చేసేవారికి “ముప్ఫైపూవులు అరవై కాయలు” గా వుంటుంది జీవితం! అంటే ధ్యాని కాని వాడికి దక్కేవి… “మూడు భాగ్యాలు… మహా అయితే ఆరు భాగ్యాలు” అదీ ఎన్నో వందల, వేల పుణ్యకార్యాలు చేసి వుంటేనే. ధ్యాని అయినవాడికి “ముప్ఫై, అరవై” అబ్బో అంతులేనన్ని భాగ్యాలు!

శరీరానికి నీళ్ళు పోసుకుంటే అది స్నానం. ఆత్మకు ప్రాణం పోసుకుంటే అది ధ్యానం! కాబట్టి కేవలం “శరీరానికి మాత్రమే ఆహారం” అనుకోకుండా ప్రతి వ్యక్తీ ప్రతి రోజూ ధ్యానం తప్పనిసరిగా ఆచరించి ఈ జన్మలోనయినా శారీరకపర, మానసికపర, బుద్ధిపర, ఆత్మపర, సంఘపరమైన ఆరోగ్యాలను పొందగలరు!

ఈ విధంగా ప్రహ్లాద అపురూపమైన – అరుదైన సందేశం ధ్యాన మాస్టర్లందరికీ లభించింది

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂



సేకరణ

No comments:

Post a Comment