Wednesday, October 2, 2024

 Vedantha panchadasi:
కామ్యాది దోషదృష్ట్యాద్యాః కామాది త్యాగహేతవః. ౹
ప్రసిద్ధో మోక్షశాస్త్రేషు తానన్విష్య సుఖీ భవ ౹౹58౹౹

58.  కామము మొదలైన దోషములను పరిత్యజించుటకు వానియందలి బంధహేతుత్వము, తేజోహాని,క్షణికత్వము మొదలగు దోషములను గూర్చి విచారించుట మొదలగు ఉపాయములు మోక్షశాస్త్రములందు చెప్పబడినవి. వానిని అన్వేషించి అవలంబించి సుఖముగ ఉండును.

త్యజ్యతామేవ కామాది ల్మనోరాజ్యే తు కా క్షతిః ౹
అశేషదోషబీజత్వాత్ క్షతిర్భగవతేరితా ౹౹59౹౹

59.(ఆక్షేపము:)కామాదిదోషములు పరిత్యజింపబడుగాక.వానిని గూర్చి ఊహించుచు పగటికలల కనుటయందేమి హాని కలదు?
(సమాధానము:)అట్లాలోచించుట అశేషములైన యనర్థములకు మూలమని కృష్ణభగవానుడు చెప్పెను.

ధ్యాయతో విషయాన్పుంసః సంఙ్గస్తే
షూప జాయతే ౹
సజ్గాత్సంజాయతే కామః కామాత్క్రోధోభి జాయతే ౹౹60౹౹

60.  కామ్యవిషయములను గూర్చి ఆలోచించు మానవులకు వాని యందు ఆసక్తి కలుగును.ఆసక్తి వలన అవి కావలెననే కాంక్ష ఉదయించును.ఈ కాంక్ష తీరుటకు ఆటంకము కలిగినచో క్రోధముప్పతిల్లును.
(భగవద్గీత 2.62)

క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్ స్మృతి విభ్రమః ౹
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ౹౹60౹౹

60. క్రోధము వలన మనస్సునందు మూఢత కలుగును.దాని వలన గురుశాస్త్రోపదేశములు మరచిపోవును.అవి జ్ఞాపకమునకు రావు.దీని వలన యుక్తాయుక్త వివేకము నశించును.తత్ఫలితంగ సర్వనాశనము కలుగును.(ఈ శ్లోకము చాల మూలప్రతులందు అలభ్యము.)

రాగద్వేషాదులతో దూషితమగు చిత్తమే సంసారము. దృశ్యములేనేలేదు అను బోధతో రాగ ద్వేషాదులు నశించును.

దృశ్యము లేనేలేదు అను బోధయే సత్యమైన(బోధ)జ్ఞానము.అదియే కేవలభావము.

నేను,నీవు,జగత్తు,ఈ దృశ్యభ్రమ శమింపగా దృశ్యమంతయు అసత్తు కాగా మిగిలియున్న స్థితియే కైవల్యము.ఆత్మస్థితి.

మనస్సుతో భావింపబడినవాడై జీవుడు దేహవాసన కలిగి యుండును దేహవాసన పోయినపుడు ఆ పిమ్మట అతడు దేహధర్మములతో అంటుకొనడు.

మనస్సు ఒక కల్పము యొక్క మహాకాలమును ఒక్క క్షణముగా చేయును.ఒక్క క్షణమును ఒక్క కల్పకాలము అనుభవింపజేయును.
సంసారమంతయు మనో వికాసము మాత్రమే అని నిశ్చయము.

దుష్ప్రవర్తనను విడిచి పెట్టని వాడు, అశాంత మనస్కుడు, సమాధానము లేనివాడు,
కేవల ప్రజ్ఞాబలముతో ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు.
 క్రోధము వలన గురుశాస్తోపదేశములు మరుపుకు వచ్చి మూఢత ఆవహించును.యుక్తాయుక్త వివేకము నశించి సర్వనాశనము కలుగును.

"మమ-నమమ" ఈ రెండు పదములు బంధమునకు మోక్షమునకు కారణములై యున్నవి.

"మమ" అనుకొని జీవుడు బద్ధుడగును.
"నమమ" అనుకొని ముక్తుడగును.

మనోవ్యాధికి చికిత్స ఏయే వస్తువులు ప్రియమైనవో ఆయా వస్తువులను త్యజించుచు పోయినచో మోక్షము లభించును.
అసంకల్పమను శస్త్రముతో ఈ చిత్తమును ఛేదించవలెను.అప్పుడే సర్వరూపమగు,సర్వగతమగు,
శాంతమయమగు పరబ్రహ్మము ప్రాప్తించును.

చేతనా చేతనాత్మకమగు ఈ జగత్తు "జీవేశ్వరాది" రూపమున ప్రకాశించుచున్నది.ఈ క్షణాది ప్రవేశాంతమగు ఈ సృష్టి ఈశ్వరకల్పితమై యున్నది.

జాగ్రదవస్థ నుండి మోక్షము వచ్చు వరకున్న
ద్వంద్వరహితమై,
నిర్గుణమై,
సత్యమై చిద్ఘనమైనట్టి బ్రహ్మానందమును, తన ఆత్మరూపముగ తెలిసికొనిన మానవుడు ఇంక ఎప్పుడును భయపడడు.

చక్కని ఆత్మ విచారముతో మనస్సు అమనస్సు కావలెను.అదియే మనస్సు అంతర్ధానమైన స్థితి,అమనస్కము.
"అవిద్యానాశము".
ఇదియే "బ్రహ్మపదము".  

No comments:

Post a Comment