Thursday, February 5, 2026

 *చిలుకముక్కు చిన్నోడు* - సంయుక్త అక్షరాలు లేని కథ - డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212
**************************
     ఒక అడవిలో ఒక పిల్లోడు వుండేవాడు. వాడు చానా మంచోడు. బాగా చదువుతాడు. మంచి ఎత్తు. చక్కని రంగు. రింగులు తిరిగిన జుట్టు వుండేది. కానీ పాపం వాని ముక్కు కొంచెం పెద్దగా వుండి, ముందు భాగం వంపు తిరిగి అచ్చం చిలకముక్కులా వుండేది. దాంతో అందరూ వాన్ని ''రేయ్‌... చిలకముక్కోడా'' అని బాగా ఎగతాళి చేసేవాళ్ళు. వానికి అద్దంలో తన ముక్కు చూసుకున్నప్పుడల్లా చానా బాధ కలిగేది. ఒక్కడే కూచోని కళ్ళనీళ్ళు పెట్టుకునేవాడు. ఎప్పుడూ అదే ఆలోచన. ఒకటే బాధ. దాంతో నెమ్మదిగా చదువు అటకెక్కింది. బడిలో బాగా వెనుకబడిపోయాడు.

ఆ పిల్లోని ఇంటి వెనుక పెరడులో ఒక మామిడిచెట్టు వుంది. దాని మీద ఒక అందమైన రామచిలుక గూడు కట్టుకుంది. ఒకరోజు ఆ పిల్లోడు పెరటిలో మంచమేసుకొని పడుకున్నాడు. ఎదురుగా కనబడిన చిలుకను చూసి ''ఏయ్‌... చిలుకా.. నీ ముక్కు నా ముక్కు ఒకేలా వున్నాయి. కానీ నీ ముక్కు చూసి అందరూ అబ్బ... ఎంత ముచ్చటగా వుంది అని పొగుడుతారు. నా ముక్కు చూసి 'ఛీ...ఛీ... ముక్కెలా వుందో చూడు అచ్చం చిలకముక్కులా అంటూ తిడతారు. ఈ ముక్కు వంకర పోయి చక్కగా ఎప్పుడు మారతాదో ఏమో'' అన్నాడు.

ఆ మాటలకు చిలుక చిరునవ్వు నవ్వి ''ఈ లోకంలో అందరికీ అన్నీ వుండవు. ముక్కు బాగుంటే మూతి బాగుండదు. కన్ను బాగుంటే కాలు బాగుండదు. కొందరు ఎత్తుగుంటే ఇంకొందరు పొట్టిగుంటారు. కొందరు లావుగుంటారు. మరికొందరు బక్కగా వుంటారు. కొందరికి అవయవాలన్నీ బాగున్నా అందమైన మనసు వుండదు. సరే ఇవన్నీ ఎందుకుగానీ నా మీద ఎక్కి కూచో. నీకు కొన్ని చూపించాలి'' అంది.

వాడు పకపక నవ్వి ''నువ్వుండేదేమో జామకాయంత. నేనుండేదేమో పనసకాయంత. ఎలా కూచుంటా నీమీద'' అన్నాడు.

''అదా నీ అనుమానం. పరవాలేదు. నేను అలాంటిలాంటి అల్లాటప్పా చిలుకను గాదు. దేవలోకంలో దేవతల దగ్గర పెరిగినదాన్ని. కొంతకాలం ఈ అందమైన భూమి ఎలా వుంటుందో చూద్దామని వచ్చా. నేను కావాలంటే ఏనుగంత పెద్దగా మారగలను. చీమంత చిన్నగా కాగలను. ఒక్క నిమిషం ఆగు'' అంటూ నెమ్మదిగా పెరగడం మొదలు పెట్టింది. ముందు పావురమంత అయ్యింది. తరువాత కోడిపుంజంత అయ్యింది. మరునిమిషం నెమలంత అయ్యింది. ఇంకో నిమిషంలో నిప్పుకోడంత అయ్యింది. ఆ మరునిమిషమే గండభేరుండమంత అయ్యింది. అది చూసి వాడు సంబరంగా దాని మీదకు ఎక్కాడు.

రామచిలుక రివ్వున గాల్లోకి ఎగిరింది. అలా ఎగురుతా... ఎగురుతా... ఒక పెద్ద ఆఫీసు మీద వాలింది. ''ఆ కిటికీలోంచి కిందికి తొంగిచూడు'' అంది. వాడు తొంగి చూశాడు. అక్కడ ఒక బెంచీ మీద చూడముచ్చటైన ఒక యువకుడు కూచొని వున్నాడు. ఆరడుగుల ఎత్తు, తెల్లని ఛాయ, ముద్దొచ్చే మొగం, రింగుల రింగుల జుట్టు.... చూడడానికి సినిమా హీరోలెక్క వున్నాడు. పెళ్ళయిన ఆడవాళ్ళు చూసినారంటే చాలు... అబ్బ... కంటే ఇలాంటి కొడుకునే కనాలి అనుకుంటారు. అదే పెళ్ళికాని అమ్మాయిలు చూసినారంటే చాలు... అబ్బ! చేసుకుంటే ఇలాంటి చూడచక్కనోన్నే మొగునిగా చేసుకోవాలి అనుకుంటారు. అంత చక్కనోడు వాడు.

''ఎలా వున్నాడా యువకుడు'' అంది చిలుక.

''అబ్బ... ఆకాశంలో మెరిసే చుక్కలా వున్నాడు. అడవిలో పురి విప్పి తిరిగే నెమలిలా వున్నాడు. గాలిలో ఎగిరే సీతాకోకచిలుకలా వున్నాడు. నేను గూడా అలా వుంటే ఎంత బాగుండో'' అన్నాడు.

అంతలో ఆఫీసు లోపలి నుంచి ఒకతను బైటకు వచ్చాడు. పొట్టిగా, నల్లగా, బట్ట నెత్తితో, అందవికారంగా వున్నాడు. అతను బైటకి రాగానే ఈ ఆరడుగుల అందగాడు ఒక్కసారిగా పైకిలేచి ''సార్‌... సార్‌...'' అంటూ భయంభయంగా వంగి వంగి సలాములు చేసుకుంటూ, వణుకుతున్న చేతులతో అతని చేతిలోని సంచీని అందుకొని అతని వెనుకనే పరుగులాంటి నడకతో వినయంగా బైలుదేరాడు. అతను హుందాగా అడుగులో అడుగు వేసుకుంటూ పోతుంటే ఎక్కడివాళ్ళక్కడ లేచి నిలబడి వినయంగా తల వంచి నిలబడుతున్నారు. అతను కారు దగ్గరికి పోగానే ఒకడు వురుక్కుంటా పోయి కారు తలుపు తెరిచి నిలబడ్డాడు. అతను అందులో ఠీవిగా కూచోని వెళ్ళిపోయాడు.

చిలుక ఆ పిల్లోని వంక తిరిగి ''చూశావా... అతడంత అందవికారంగా వున్నా... అందరూ ఎలా గౌరవం ఇచ్చారో. దీనికంతా కారణం చదువే. నిజమైన గౌరవం అందం నుంచి రాదు. తెలివితేటలు, అధికారం, నిజాయితీ నుంచే అందుతుంది. ఈ వెక్కిరించడాలు, వేళాకోలాలు అన్నీ చిన్నతనంలోనే. నువ్వు బాగా చదివి పెద్ద అధికారిగా మారావనుకో... గౌరవం దానంతటదే పరుగెత్తుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర చేరుతుంది. ఈ నడుమ నువ్వు అనవసర ఆలోచనలతో చదువులో బాగా వెనుకబడుతున్నావట గదా. పనీపాటాలేని వాళ్ళ మాటలను పట్టించుకోకుండా మనసంతా చదువు మీదే వుంచు. ఏం సరేనా'' అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది.

''అలాగే ... ఆగు. నువ్వు చెప్పినట్టే వింటాను. నన్ను ఇంటి దగ్గర దించు. ఇలా వదిలి వెలితే ఎలా'' అంటూ ఆ పిల్లోడు గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు అప్పుడే అక్కడకు వచ్చిన వాళ్ళ అమ్మ ''ఏరా... హాయిగా చెట్టు కింద పడుకోని పగటిపూటనే భలే కలలు కంటున్నావే. లెయ్‌లెయ్‌. ఇంక పడుకుంది చాలు'' అంటూ కుదుపుతూ లేపింది.

''ఇంతసేపూ వచ్చింది కలనా. కానీ అది కల కాదు. నిజం. చిలక చెప్పిన నిజం. ఇకపై చదువులో అస్సలు వెనుకబడగూడదు'' అనుకుంటూ మంచం మీద నుంచి కిందికి దిగాడు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 **పలుకే బంగారమాయెనా!*చిన్నకథ*

****
    పిల్లలు తమపిల్లలను తీసుకొని సెలవలకు వస్తున్నారన్న ఫోన్ కాల్సు వచ్చినప్పటినుండీ పార్వతీ,పరమేశ్వర్రావులు చాలాసంతోషపడి పోతున్నారు.అసలాసంతోషంలో కాలూచెయ్యీ ఆడటంలేదు.
     తమపిల్లలకు ఏమేమి ఇష్టమో తెలుసుకనుక అవన్నీ సమకూర్చుకొన్నారుకానీ,మనవలకు ఏమీష్టమో తెలియక వారడిగినదెే తడవు చేసిపెట్టవచ్చన్నట్లుగా, ముడిసరకులూ సమకూర్చుకొన్నారు వారు.
     బిలబిలబిల్లాడుతు నాలుగు దేశాలనుంచీ ఎనిమిదిమంది మనవలతో దిగిన తమసంతానాన్ని,వారి భార్యలనూచూసి సంబరపడి పోయారా దంపతులు.
     "హాయ్ !హల్లో!ఆంటీస్ ,అంకుల్స్ !గ్రాండ్ మా!గ్రాండ్ ఫా!"అంటూ ముక్తసరి పలకరింపులు.పిల్లలైతే ఒకరినిచూసి ఒకరు నవ్వనా ,వద్దా అన్నట్లుగా చిన్న చిరునవ్వులరువ్వులు. పలకరింపులైపోయాయి.చెరువంత సూట్ కేసులనుంచి,చేటంత టాబ్ లు తీసారు పిల్లలు,వారితల్లితండ్రులు లాప్ టాప్ లూతీసి ఎలాకూర్చుని వర్క్ చెేసుకొంటే,సుఖంగా బాగుంటుందో అలాకూర్చుని,వారి వారి పనులలోకి దిగారు.
     పిల్లల నవ్వులూ,మాటలూ ,ఆటలూ అన్నీ ఆ లాప్ తాప్ లూ,టాబ్ ల్లోనే.ఆ ఆదేశాలపిల్లలతోనే. "అమ్మా!నానమ్మా! నాకదికావాలి ఇదికావాలన్న మారాములేవు. అమ్మలు నోట్లో ముద్దలు కుక్కుతుంటే,వారి పిల్లలు ,ఆకుక్కేదేదో తెలియకుండానే,"కక్కొచ్చేలావుంది చాలమ్మా!అంటూ తల్లుల్ని వేరే భాషలో గదమాయింపులు.. తమపిల్లలైతే,"అమ్మా !అదిచేసిపెట్టు,నాన్నా!ఆ నాకిష్టమైనవి దొరుకుతాయేమో కొనితెండి!"అంతవరకే మాటలు.అదీ లాప్ టాప్ ల్లోంచి తలబయటపెట్టకుండానే. కూతుళ్ళు మర్యాద చెడకుండా,అత్తింటికి,చిన్నప్పటి స్నేహితులతోనూ ఫోన్లూ,కోడళ్ళు ఆత్మీయంగా పుట్టింటికీ,అక్కడి స్నేహితులకూ ఫోన్లు.సాయంత్రమైతే మాల్సుకీ,సినీమాలకీ,స్నేహితుల ఇళ్ళకీ
విహారాలు.
      బంధువులందరికలియక వారిమధ్య ఆత్మీయసమ్మేళనం అవుతుందనుకొన్న ఆ దంపతులకు అసంతృప్తే మిగిలింది.వారాసించిందిఒకటీ,జరి గింది మరోటి.  ఆమెకు బండెడు చేకిరీ,ఆయనకు డబ్బుఖర్చుతోకూడిన శ్రమా మిగిలాయి.
     'వచ్చారయ్యా రామాహరీ!
వచ్చి వెళ్ళారయ్యా కృష్ణాహరీ!' అన్నట్లైయ్యింది.
  తమ పిల్లలూ,వారిపిల్లల
ఆత్మీయ పలకరింపులూ  కరవైన విషయాన్ని గ్రహించినవారు,' 'పలుకే బంగారమాయె,'అన్న రామదాసు కీర్తనను గుర్తుతెచ్చుకొని పాడుకొంటూ విరక్తిగా నవ్వుకొని,
'కాలమహిమ' అని సరిపెట్టుకొన్నారు.
           సత్యవాణి
 అంతేలే అదంతేలే
(ప్రభాకర్ పెదపూడి)

చలికి కాబోలు చెట్లు కదలకుండా ముడిచిపెట్టుకున్న ముసలాడిలా ఉన్నాయి. మాణిక్యం కప్పుకున్న రగ్గు అవసానదశలో ఉందని చలికి తెలుసు, అందుకే ఎప్పుడు లోపలకు దూరదామా అని  కాచిబెట్టుకుంది. మాణిక్యం నిద్రలో రగ్గుని తలమీదకి లాక్కున్నాడు. కాళ్లదగ్గర సందుదొరికేసరికి చలితోపాటు, గుప్పెడు దోమలుకూడా రగ్గులోకి దూరాయి.  ఇక నిద్రపోవడం వాడి తరంకాలేదు, అటుఇటూ దొర్లి గబుక్కున లేచి కూర్చున్నాడు. ‘‘మాయదారి దోమలు, నిద్రలేకుండా చేసాయి’’ అనుకుంటూ రగ్గును జాగ్రత్తగా మడతపెట్టి రేకు పెట్టెమీద పడేసాడు. ఖాళీపెట్టెకదా దబ్బుమని చప్పుడైంది. పాకలోంచి బయటకివచ్చి అరుగుమీద గోడకు జారబెట్టిన తడక, తలుపుస్ధానంలో గుమ్మానికి అడ్డంగా పెట్టాడు. గుమ్మందగ్గర తడక ఎంత భద్రమో మాణిక్యానికి తెలుసు అయినా అదో తృప్తి.  మాణిక్యాన్నిచూసి మట్టి అరుగుమీద గోడవారగా పడుకున్న నల్లకుక్క విశ్వాసం లేదనుకుంటారని మర్యాదపూర్వకంగా తోకూపి మళ్ళీ ముడుచుకు పడుకుంది.

 మాణిక్యం దొరగారింట్లో చిన్నతనంనుండి నౌకరు.  ఆచుట్టుపక్కల పది పదిహేను గ్రామాల్లో దొరగారంత డబ్బుచేసినోడు మరోడు లేడు.  దొరగారు ఊరుమీదకి బయల్దేరాడంటే వెంట మాణిక్యం ఉండాల్సిందే, దొరగారు దీపావళి లక్ష్మీ టపాకాయ ఐతే, మాణిక్యం వత్తిలాంటోడు.  ఇంతెందుకు మాణిక్యంవెంట లేనిదే ఆయన అడుగు బయటపెట్టరు. దొరగారు వెండిగ్లాసుతో కాఫీతాగి గ్లాసు బల్లమీదపెట్టి ‘‘ఒరేయ్‌! మాణిక్యం అలా షికారెళ్ళోద్దాం  రా! ’’ అన్నారు. పదినిమిషాల్లో మాణిక్యం దొరగారిముందు ఉన్నాడు, వాడి భుజాన కాఫీప్లాస్కు, ఐదారువరకు చుట్టలున్న వెండి భరిణ, మీటనొక్కితే పుటుక్కున తెరుచుకునే గొడుగు పట్టుకు నిలబడ్డాడు.  

 ఇద్దరూ నడుస్తున్నారు. ఆరడుగులున్న దొరగారికి ఎండతగలకుండా ఐదున్నరడుగులున్న మాణిక్యం గొడుగు పట్టాలంటే కాస్తంత శ్రమపడాల్సిందే, జబ్బలాగేస్తున్నా పట్టుకోవాలి తప్పదు. చిన్నతనంనుండి ఆయనదగ్గర నౌకర్నికదా, చివరాకర్న ఏదైనా ఇస్తాడేమోననే ఆశ మూటకట్టుకుని జాగ్రత్తగా మసులుకుంటున్నాడు మాణిక్యం.   ‘‘ ఉరేయ్‌! ఊరంతా యమా కళకళలాడిపోతోంది, ఏంటి కత! ’’ దొరగారు చుట్టవెలిగిస్తూ అన్నారు. ‘‘ ఆ ఏముందండి ఇంకోనెల్లో సంక్రాంతి కదండీ! అల్లుళ్ళొచ్చి శుబ్బరంగా ఉన్న నాలుగు డబ్బులు ఊడ్చుకెళ్ళి పోతారు కదండీ! ‘‘పదిపదిహేనురోజుల్లో మాఆయనతోపాటు వస్తాం, కూసింత కానుకలు పోగుచేయండి’’ అనిచెప్పిపోడానికి           పై ఊళ్ళల్లో ఉన్న కూతుళ్ళంతా సొంతూరొచ్చారండీ, అదీ కత ’’ చెప్పడం ఆపి వెకిలిగా నవ్వాడు మాణిక్యం, దొరగారుకూడా చిరునవ్వులు నవ్వారు.  ‘‘ఒరేయ్‌! మాణిక్యం ఈరోజు చెరువుగట్టుమీదకి షికారెల్దాంరా! దమయంతినిచూసి చాలా కాలం అయింది’’ చుట్టని కిందపడేసి కాలితో నలిపేస్తూ అన్నారు దొరగారు.

 రాజుగారికి రాణివున్నా భవనంలో రమణులకు కొదవలేనట్లు, దొరగారికి బంగారంలాంటి భార్యవున్నా సరదాపుట్టినప్పుడు ఇలా చెరువుగట్టుమీద దమయంతి ఇంటిలో మకాంవేస్తారు.  ఇది ఊరంతటికీ బహిరంగ రహస్యమే! దమయంతిలాంటి అందగత్తె ఆచుట్టుపక్కల ఊళ్ళల్లో నాస్తి అని దొరగారి అభిప్రాయం.  దొరగారు సరిగా చూడకగానీ రాణీగారే దీనికంటే అందగత్తె అని ఊరాడోళ్ళంతా చెవులు కొరుక్కొవడం కద్దు. దొరగారు చెరువుగట్టు ఎక్కగానే దమయంతి అంతరాత్మ విషయం పసిగట్టి గుండెజల్లుమనిపించింది, వెంటనే దొరగారొచ్చేస్తున్నారని తెగయిదైపోయింది. 

దమయంతి ఇంటి ముందుకి రాగానే, అంతవరకు దొరగారికి ఎండతగలకుండా పట్టుకున్న గొడుగు ముడిచి గోడవారన పెట్టి,   చుట్టల భరిణె దొరగారి చేతికందించి ‘‘నేను మళ్ళీ సాయంత్రం వొత్తానండి’’ అన్నాడు మాణిక్యం. ‘‘ఒరేయ్‌! మాణిక్యంగా! నీకు బుద్ది రావాలని వినాయకుడి గుడిలోకి వెళ్ళి ప్రార్ధించుకో, ముందసలు చిన్నరాణీగారు లోనవుందోలేదో తెలుసుకోరా’’ చిరాగ్గా అన్నారు దొరగారు.  మాణిక్యం గబుక్కున లోనకెళ్ళి, అసలు దొరగారంటే ఎవరో తెలియనట్లు నటించేస్తున్న దమయంతిని, ముసిలితనం ముంచుకొస్తున్నా ముసిముసినవ్వులు మానని దమయంతి తల్లినిచూసి, ‘‘లేకేమండి! ఉన్నారండి, తమర్ని లోనికి దయచేయమన్నారండి’’ వ్యంగాన్ని రంగరించి, అతి చనువును ప్రదర్శిస్తూ అన్నాడు మాణిక్యం.  ‘‘సగంకాల్చిన చుట్టని గేటు పక్కన పడేసి’’ లోపలికి ఠీవిగా నడిచారు దొరగారు. 

 దొరగారు ముందుగదిలో సోఫాలో కాలుమీద కాలేసుకుని దమయంతి గురించి ఎదురుచూస్తున్నారు.  అరగంట తర్వాత దమయంతి బదులు తల్లి వచ్చి మంచి నీళ్ళ గ్లాసు అందిస్తూ ‘‘ దొరవారు ఈమధ్యమరీ నల్లపూసైపోయారు ’’ లేటువయస్సులో సిగ్గును అభినయిస్తూ అంది.  ముసలిదాని సిగ్గుచూసి దొరగారికి చిరాకొచ్చి చేతిలో నీళ్ళగ్లాసు పెరట్లోకి విసిరేసారు.  ఈ హఠాత్‌ పరిణామానికి దమయంతి తల్లి పరుగులాంటి నడకతో నిష్క్రమించింది  ‘‘ క్షణంలో దమయంతి ప్రత్యక్షమైంది’’ అంతవరకు గుగ్గిలంలావున్న దొరగారు, దివినుంచి సర్రున భువికి జారిన రంభలావున్న  ఆమె అందాన్నిచూసి మంచుముక్కైపోయారు. బెల్లంపాకంలో దిబ్బరొట్టి నంజుకుతిన్న  ఫీలింగొచ్చేసింది.  

 కాసేపు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాక పడగ్గది తలుపులు మూతపడ్డ మరుక్షణం దమయంతి కళ్ళల్లో కన్నీటి చెరువు గట్టు తెగిపోయింది, చిల్లుపడ్డ కుండలోంచి నీళ్ళు కారిపోయినట్లు కన్నీళ్ళు బొటబొటా కారిపోతున్నాయి.  దమయంతి చీరకొంగు కన్నీటిని పీల్చలేక ఉక్కిరిబిక్కిరౌతోంది.  గారంగా దమయంతిని దగ్గరకు తీసుకుంటూ ‘‘ దమ్మూ!’’ అన్నారు దొరగారు. దమయంతికి ఇంకా ఏడుపొచ్చేసింది, దిండులో తలదూర్చి కుళ్ళికుళ్ళి  ఏడ్చింది. విషయాన్ని కనిపెట్టిన దొరగారు  ‘‘ ఇదిగో! మీ అమ్మమీద చిరాకు పడ్డందుకు శిక్షగా ఇదిగో ఈ ఉంగరం ఉంచు ’’ అంటూ బొటనవేలికి పెట్టుకున్న బండలాంటి ఉంగరం దమయంతి కొంగుకు కట్టారు.  దొరగారికి తనమీదున్న ప్రేమను మోయలేక ఆయన ఒళ్ళో ఒరిగి కరిగిపోయింది దమయంతి.

 ‘‘అయ్యగారు గతంలో పదిలక్షలు ఇస్తానని ఒట్టేసారు, బహుశా మరిచిపోయారేమో! ’’ మంచి సమయంచూసి ఆయన ముదురుబుగ్గమీద వేలితో గుండ్రాలు చుడుతూ అంది దమయంతి.  ‘‘ పదికేం ఖర్మ పాతికిస్తాను, దేని కైనా టైమురావాలిరా దమ్మూ! ’’ దమయంతి బుగ్గమీద చిటికేసి అన్నారు దొరగారు.  ‘‘ చీటికి మాటికి చిటికలు బాగానే వేస్తారు, డబ్బులే రాల్చరు’’ బుంగమూతి పెట్టి అంది. ‘‘ ఇదిగో నేను ఇవ్వకుండానే నీనడుంచుట్టూ ఈవడ్డాణం, మెడలో దిగేసుకున్న హారాలు, వేళ్ళకు ఉంగరాలు ఎక్కడనుండి వచ్చాయి. నాకు చిరాకు తెప్పించావంటే రేపు ఈపాటికి మాణిక్యంచేత పాతిక లక్షలు పువ్వుల్లో పెట్టి పంపించేస్తాను ’’ దమయంతిని దగ్గరకు లాక్కుంటూ అన్నారు దొరగారు, దమయంతి గుబురుల్లో దాక్కున్న సంపెంగలా దొరగారి గుండెలమీద వాలిపోయింది. 

 మాణిక్యం దొరగారి ఎదురుగా కూర్చుని చుట్టలు చుడుతున్నాడు.  ఆయన వెండిగ్లాసుతో కాఫీ తాగుతున్నారు.  అటువంటి సమయంలో ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు.  ‘‘ఒరేయ్‌! మాణిక్యం ఊరంతా మారిపోయిందిరా. కుర్రోళ్ళంతా పెద్దబళ్ళమీద బుర్రుబుర్రుమని చీటికిమాటికి  కాకినాడ పోతున్నార్రా. ప్రతివాడిచేతిలో చేటంత సెల్లు, అది చెవులోపెట్టుకుని బళ్ళు ఒకటే తొక్కుడు, బొత్తిగా ప్రాణంమీద భయం లేకుండా పోయిందిరా ’’ చుట్ట వెలిగిస్తూ అన్నారు దొరగారు.  ‘‘అవునండీ ! మొన్న మాబామ్మరిది రామిగాడి కొడుకు ఫోను మాట్లాడుతూ బండిని ఓతొక్కేస్తుంటే, అది పుసుక్కున రోడ్డుదాటి కాలవలోకి ఈడ్చేసిందండి, వెన్నెముక్కి దెబ్బతగిలి సంసార జీవితానికి పనికిరాడని చెప్పేసారండి, ఇప్పుడు కొంపలో పడక్కుర్చీలో కూలబడి సెల్‌మాట్లాడు కుంటున్నాడండి ’’ ఒకింత నవ్వుమొహంపెట్టి చెప్పాడు మాణిక్యం.  ‘‘అంటే జీవితం దొబ్బినా ఆడు సెల్‌ మాట్లాడటం మానలేదన్నమాట’’ హాశ్చర్యపోయారు దొరగారు.  

 ‘‘ఉరేయ్‌! మాణిక్యం నేను పూలబుట్ట ఇస్తాను, జాగ్రత్తగా పట్టికెళ్ళి చిన్నరాణిగారికి ఇచ్చిరా!  ’’ రహస్యం చెప్పినట్లు చిన్నగా చెప్పారు.  మాణిక్యం బుర్రూపి ‘‘అలాగేనండి, చెరువుగట్టుమీద రాణీగారే కదండి ’’ అన్నాడు.    ‘‘ ఒరేయ్‌! నీఫేమ్లీ అంతా పూర్వంనుంచి నాకాడే పడున్నారుకాబట్టి నువ్వు బతికిపోతున్నావ్‌, ఇకమీదట సనువుతీసుకుని, ఎదవజోకులుకానీ వదిలావంటే, కదలకుండా చేసెయ్యగల్ను, నోరుమూసుకుని చీకట్లుముసురుకున్నాక, ఎవరూచూడకుండా ఎల్లొచ్చెయ్‌. పొరపాటున దానమ్మక్కానీ ఇచ్చావంటే వీపు విమానంమోత మోగించెత్తాను ’’ గట్టిగానే చెప్పారు దొరగారు. ‘‘పూలబుట్టకి ఇంత హడావిడెందుకో’’ సణుక్కున్నాడు మాణిక్యం.

 దొరగారిచ్చిన పూలబుట్టపట్టుకుని దమయంతి దగ్గరకి బయలుదేరాడు మాణిక్యం. బుట్ట బరువుగానే     ఉంది. పూలబుట్ట బరువుండటంతో చేతులు మార్చుకున్నాడు. ‘‘పెద్దవాళ్ళిచ్చే పూలు బరువుగా ఉంటాయి         కాబోలు ’’ సరిపెట్టుకున్నాడు.  సూర్యుడు పడమటింట్లోకి జారుకుని చాలా సేపయింది. ఏదో పనున్నట్లు చంద్రుడు గబగబా మునసుబుగారి మావిడితోటలోంచి పైకొచ్చేసాడు. నల్లటి మేఘాలు ఆయన్ను రాసుకుంటూ వెళ్ళిపోతున్నాయి.

 జనసంచారం పల్చబడింది, పాకల్లో బుడ్డిదీపాలు మిలుకు మిలుకు మంటున్నాయి.   దిక్కులుచూస్తూ నడుస్తున్న మాణిక్యం ఉన్నట్లుండి ఓరాయిని తన్నేసి బోర్లాపడిపోయాడు.  పూలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి, వాటితోపాటు నోట్లకట్టలు కూడా పడ్డాయి.  మాణిక్యం మతిపోయింది.  గబగబాలేచి నోట్లకట్టలు బుట్ట అడుగున పెట్టి పైన పువ్వులుపేర్చి పక్కనేవున్న కాలవగట్టుమీద కూర్చున్నాడు.  బొటనవేలుకి దెబ్బతగిలింది, మోకాలు కొట్టుకుపోయింది, రక్తం చేతికి జిగురుగా తగిలింది. మామూలుగా అయితే అవి గట్టిదెబ్బలే డబ్బుకట్టలు కంటబడేసరికి దెబ్బలమీద మత్తుమందు రాసినట్లు పెద్దగా నొప్పనిపించలేదు. డబ్బుచేస్తే నొప్పితెలియదు కాబోలు అనుకున్నాడు. 

 అప్పుడే వాడి బుర్ర చురుగ్గా పనిచేసింది. భుజాన్నున్న ఎర్రతుండు గట్టుమీద పరిచి నోట్లకట్టలు మూటగాకట్టి, ఇంటికొచ్చి రేకుపెట్టెలో పడేసాడు. గుమ్మానికి తడక అడ్డంపెట్టి ఇనపతీగలు బలంగా కట్టాడు. తుప్పట్టి శిధిలావస్తలోవున్న రేకుపెట్టె మాణిక్యానికి ఆసమయంలో ఇనప్పెట్టెలా కనపడింది.  పూలబుట్ట దమయంతి ఇంట్లో ఇచ్చేసాడు. ‘‘అబ్బ ఎన్ని పూలో, రేపు దండకట్టి దొరగారు మెళ్ళో వేయాలి’’ బుట్టెడుపూలుచూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది అసలు విషయం తెలియని దమయంతి. కొంతమందిచేత దేవుడు కొన్ని నిజాలు పలికిస్తూ ఉంటాడు ??

 మాణిక్యం బుర్రలో పాదరసం పరుగులు పెట్టింది.  ఏడుపు నటిస్తూ దొరగారింట్లో అడుగుపెట్టాడు. పడక్కుర్చీలో దొరగారు జారబడి కూర్చున్నారు. చేతిలో వెండిగ్లాసు, అందులో సగం కాఫీ ఉంది.  నెమ్మదిగా దొరగారి ప్రక్కనే కూర్చుని ‘‘సామీ!  నాచేతిలో పూలబుట్టని చీకట్లో ఎవరో ఇద్దరువచ్చి లాక్కుపోయారండి’’ స్వరంపెంచి ఏడుస్తూ అన్నాడు. వాడు ఆక్షణంలో నటనలో ఆరితేరిపోయిన నటుడైపోయాడు.  అయినా దొరగారు మాట్టాడలేదు, ఉలకలేదు పలకలేదు.  అనుమానంవచ్చిన మాణిక్యం ముక్కుదగ్గర చెయ్యిపెట్టిచూసి ఒక్కసారి ఘొల్లు మన్నాడు.  జనం పోగయ్యారు.  డాక్టరువచ్చి ‘‘ హార్టు ఎటాక్‌, పోయి చాలాసేపయింది ’’ చెప్పాడు. ఊరంతా ఏడ్చింది.  దొరగారుచేసిన మంచిపనులు  ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు.  విషయం తెలిసిన దమయంతి ‘‘చచ్చేలా ఏడ్చింది, పాతికలక్షలు ఇస్తానన్నాడు, ఇవ్వకుండానే గుటుక్కుమన్నాడు, పువ్వుల్లో పెట్టి ఇస్తానన్నాడు,  ఉత్తి పూలబుట్ట ఇచ్చాడు’’ డబ్బును తల్చుకుని తల్చుకుని ఏడ్చింది.  ‘‘ఇంక ఏడ్వటం అనవసరం అనుకుని ’’ కాసేపు ఏడ్చి ఇంటికెళ్ళిపోయింది. దమయంతితో వచ్చిన అమ్మ రాత్రి దొరగారు పంపిన పూలు దండగుచ్చి తెచ్చింది కాబోలు ‘‘ఈ దండ ఇలా వేయాల్సి వస్తుందనుకోలేదు ’’ అనుకుని శవంమెళ్ళోవేసి ముక్కు తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది.

 ‘‘పాపం దొరగారికి ఎంతో నమ్మకస్తుడు. ఎలా బ్రతుకుతాడో ఏంటో ’’ నటనలో జీవించేస్తున్న మాణిక్యాన్నిచూసి అనుకున్నారు ఊరోళ్ళు. పదిరోజుల తర్వాత రాణిగారు మాణిక్యాన్ని పిలిచి ‘‘ వారికి నువ్వు చిన్నతనంనుండీ ఎన్నో సేవలుచేసి, వారికి తలలో నాలుకలా ఉండేవాడివి, నీ ఋణం ఏమిచ్చినా తీరదు ఇవి ఉంచు అంటూ ‘‘ డబ్బుల కట్టొటి’’ మాణిక్యం చేతిలో పెట్టారు.  మాణిక్యం ఆవిడ దగ్గర విపరీతంగా నటించేసాడు, మళ్ళీ కుళ్ళికుళ్ళి ఏడ్చాడు.
 క్రమ సంఖ్య  12/2026
తేది 04/02/2026

*ధీర*

by - బ్రిస్బేన్ శారద

ఆఫీసులో నా కేబిన్లో ఎప్పట్లానే పనిలో తల మునకలుగా వున్నాను. ఈ రిపోర్ట్ శుక్ర వారం కల్లా పంపాలి. వున్నట్టుండి మీటింగ్ అలర్ట్ మోగింది. పొద్దున్న తొమ్మిదింటికి ఏం మీటింగ్? చిరాగ్గా కంప్యూటర్ మీద కేలండర్ తెరిచి చూసాను. అంజనాతో మీటింగ్!

అంజన నా టీంలో ఒక యేణ్ణర్థం కింద చేరింది. పర్సనల్ మీటింగ్ రిక్వెస్టు పెట్టింది
నాలుగు రోజుల క్రితం. గుర్తొచ్చింది.

టైపు చేస్తున్న డాక్యుమెంటు మూసి, కంప్యూటర్‌లోంచి లాగవుట్ చేసి, ఆఫీసు కిచెన్‌లోకి వెళ్ళి ఒక కప్పు వేడి కాఫీ తెచ్చుకుని కూర్చున్నాను. ఫోన్ తెరిచి ఊరికే మెసేజీ లు చూస్తూండగానే తలుపు తెరుచుకొని లోపలికొచ్చింది అంజన.

“గుడ్ మార్నింగ్ మేడం!” కుర్చీలో కూర్చుంటూ అంది.

“గుడ్ మార్నింగ్ అంజనా. ఎలా వున్నావ్?”

“బానే వున్నాను మేడం.”

“ఆఫీసులో పనీ, టీం మేట్స్ అంతా అలవాటయ్యారా? హోప్ దేర్ ఆర్ నో ప్రాబ్లంస్,” ఆమె వంక నిశితంగా చూస్తూ అడిగాను. సాధారణంగా పర్సనల్ మీటింగ్ రిక్వెస్ట్ అంటే పని మార్చమనో, గ్రూపు మార్చమనో రిక్వెస్టు వుంటుంది. ఇదీ అలాటిదే అయి వుంటుంది.

అంజన కొంచెం సర్దుకోని కూర్చుంది. గొంతు సవరించుకుంది. మొహం
సీరియస్‌గా వుంది.

“అదీ, మేడం! ఇది కొంచెం సీరియస్ మేటర్.” కొంచెం ఆగింది.

నేను ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాను. ఇటువంటి సంభాషణల్లో అవతలి వారి
ఆలోచనలు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఆలోచనలనీ, మాటల్నీ కూడదీసుకునేందు కు కావాల్సిన సమయం ఇస్తూ మౌనంగా వుంటే చాలు. చెప్పదల్చుకున్నది వాళ్ళే చెప్తారు. మనం వినాలి.

“మేడం, ఇది శ్రీనాథ్ సార్ గురించి. మీరిద్దరూ కొలీగ్సే కాదు మంచి ఫ్రెండ్స్ అట కదా?”

ఆశ్చర్య పోయాను. శ్రీనాథ్ గురించా? శ్రీనాథ్ నేనూ ఈ సంస్థలో ఒకేసారిట్రెయినీలు గా చేరాం, పదిహేనేళ్ళ క్రితం. ఇద్దరమూ అందుకే మంచి స్నేహితులం కూడా. కొంచెం వృత్తిపరమైన పోటీ వున్నా, ఇద్దరమూ ఒకే టీం కావడంతో పరస్పర సహకారంతోనే పని చేసుకుంటున్నాము. శ్రీనాథ్ అధ్వర్యంలో ఒక నలుగురు జూనియర్ ఇంజినీర్లు పని చేస్తున్నారు. వాళ్ళలో అంజన కూడా ఒకర్తి. ఇప్పుడు శ్రీనాథ్ గురించేం చెప్తుంది తను? ఇంకొంచెం అటెంటివ్ మోడ్‌లోకి వచ్చి అన్నాను,

“అవును అంజనా, శ్రీనాథ్ నేనూ ఒకే బాచ్‌లో ట్రెయినింగ్ మొదలు పెట్టాం.  పదిహేనే ళ్ళుగా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి, వీ హేవ్ అ గుడ్ రాపో. అయితే, అదంత ముఖ్యమైన విషయం కాదు. ఏం చెప్పదలుకున్నావో నిర్భయంగా చెప్పు.”

“మేడం, శ్రీనాథ్ సారు ఒక ఆరు నెలలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు.మొదట
కొంచెం అతి పర్సనల్‌గా మాట్లాడటం, నా డెస్కు దగ్గర అతి దగ్గరగా నిల్చోవటం, అనవసరంగా భుజాల చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కోవడం, నా బట్టలూ, మేకప్పూ గురించి సలహాలివ్వడం మొదలు పెట్టారు. ఆ తరవాత ఇంకొంచెం డోసు పెంచారు. నాకు చాలా ఇబ్బందిగా వుంది. చాలా స్ట్రెస్‌ఫుల్ గా అనిపిస్తుంది. ఇలా బయటికి చెప్తే అన్నీ చిన్న విషయాలే అనిపిస్తుంది కానీ, చాలా చిరాగ్గా వుంది. ”

చాలా ఆశ్చర్యపోయినా, మొహం మీద అదేమీ కనపడనీయలేదు.

“ఆర్ యూ ష్యూర్?” అన్నాక ఆమె నా వైపు చూసిన చూపు చూసి, అలా అడగకుండా
వుండాల్సింది అనుకున్నాను.

“మేడం, నా దుస్తుల సైజు అడగటం, అసభ్యమైన సినిమా పాటల గురించిచర్చలు
లేవదీయడం, ఇవన్నీ ఆయన అందరు అమ్మాయిలతో చేస్తారో లేదో తెలియదు. నాకు మాత్రం ఆ ప్రవర్తన అసలు నచ్చడం లేదు. ఒక నెల రోజుల కింద ఆదివారం సాయంత్రా లు మా ఇంటికి రావడం మొదలు పెట్టారు. అమ్మా నాన్నలకి సర్ది చెప్పేసరికి చాలా కష్ట మయింది. ఆఖరికి ఒక రోజు నేనే ఆయనతో చెప్పాను, మా ఇంటికి ఆయన రావడం నాకు నచ్చడం లేదని. మొకంగంటు పెట్టుకోని నాతో మాటలు తగ్గించారు. కానీ టీం మీటింగ్స్‌ లో నాతో చాలా మొరటుగా మాట్లాడడం, అందరిలో నన్ను హేళన చేయడం మొదలు పెట్టారు. మొన్న నేను ఒక రిపోర్టు అందరికీ పంపితే, దాని గురించి ఫీడ్ బేక్ పేరిట చాలా
దురుసుగా వ్యాఖ్యానాలు రాసి, అందరికీ ఈమెయిలు లో పెట్టారు. దట్ వాస్ వెరీ ఇన్‌సల్‌ టింగ్.” ఆమె మొహం ఎర్రబడింది.

“సరే, అయితే, ఇప్పుడేం చేయాలని? పై స్థాయికి కంప్లైంట్ చేయాలని వుందా?”

“తెలియదు మేడం. అందుకే మీ దగ్గరికి సలహా కోసం వచ్చాను. మీరు చెప్పండి,
నేనేం చేయాలి?”

“నువ్వు కంప్లైంట్ చేయగానే ముందుగా ప్రూఫ్ అడుగుతారు. నీ దగ్గర అలాటి
వేమైనా వున్నాయా?”

“ప్రూఫ్‌లా?”

“ఏదైనా పర్సనల్ టోన్‌తో వున్న మెసేజీలో, ఈ-మెయిల్సో, లేకపోతే అతను నిన్నిబ్బంది పెడుతూంటే చూసిన వాళ్ళో..”నా గొంతులో ఎంత అణుచుకుందామనుకు న్నా కొంచెం అసహనం, చిన్న ఇరిటేషన్ చోటు చేసుకుంది. ఆమెకి నా మొహంలో అపనమ్మకం కనిపించిందో ఏమో, కొంచెం చిన్నబోయింది.

“మీరు నన్ను నమ్మట్లేదు మేడం,” అంది నిరాశగా.

“అంజనా, నా నమ్మకంతో ఇక్కడ పనిలేదు. మేనేజ్‌మెంట్ దృష్టికి ఇది తీసికెళ్ళా లంటే నువ్వు అన్ని రకాలుగా తయారయి వుండాలి. ఎనీ హౌ, నాకొక్క వారం రోజులు టైమివ్వు, ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకుందాం. ఈలోగా, కావాలంటే నిన్ను ఇంకొక టీంలోకి మార్చడానికి ప్రయత్నిస్తాను.”

“టీం మారొచ్చు మేడం, కానీ నాకు ఇప్పుడు నేను చేస్తున్న పని చాలా నచ్చింది. ఇంకో టీంలోకి మారితే, నేను మళ్ళీ అన్నీ కొత్తగా నేర్చుకోవాలి. నేనేం తప్పు చేసానని నాకు పనిష్‌మెంట్?”

“నాకు తెలుసు అంజనా. సరే, నాక్కొంచెం టైమివ్వు. హెచ్ ఆర్ టీంతో కూడా
ఒకసారి మాట్లాడతాను. ఓకె? కొంచెం కాఫీ ఏమైనా తాగుతావా?”

“నో మేడం. మీ సజెషన్ కోసం ఎదురు చూస్తూ వుంటాను. ప్లీజ్ ఏం చేయాలో
చెప్పండి.”

అంజన లేచి బయటికి వెళ్ళింది. ఏం చేయాలో ఆలోచిస్తూ కొంచెం సేపు కాఫీ తాగుతూ కూర్చున్నాను.

***

          పదిహేనేళ్ళ క్రితం మా సంస్థ నిర్వహించిన గ్రాడ్యుఏట్ రిక్రూట్‌మెంట్ లో భాగంగా నేనూ శ్రీనాథ్, ఇంకా చాలా మంది ఫ్రెష్ ఇంజినీర్లం చేరాం. ఆ తరవాత సంస్థతో పాటు మేమూ ఎదిగాం. శ్రీనాథ్ చాలా తెలివైనవాడు, కష్టపడి పనిచేస్తాడు కూడా. కానీ  కొన్ని సార్లు అతని మాటలూ, ఆలోచనలూ పరిచయమైన కొత్తలో చిరాకెత్తించేవి. మా బాచిలో
నలుగురమే ఆడపిల్లలం. మిగతా అంతా మొగ పిల్లలే. తరవాత బేచీల్లో అమ్మాయిలు బాగ చేరేవారనుకోండి. మాదొక మేనుఫేక్చరింగ్ యూనిట్ కావడంతో ఎక్కువగా  మెకానిక ల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లని ఎక్కువగా ఉద్యోగాల్లోకి తీసుకునేవాళ్ళు.

అయిదేళ్ళ క్రితం నుంచీ మాకొక పూర్తి ఐటీ శాఖ తెరిచి చాలా మంది కంప్యూటర్ గ్రాడ్యుఏట్‌లని తీసుకోవడం మొదలు పెట్టారు. అలా మా గ్రూపులో చేరిన అమ్మాయి బీ టెక్ కంప్యూటర్స్ చేసిన అంజన. మా గ్రూపుకి కావాలసిన చిన్నా-పెద్దా వస్తువుల గురించి న వివరాల డేటా బేస్ నిర్వహణ ఆమె డ్యూటీ. ప్రోగ్రామింగ్, డేటా బేస్ మాత్రమే కాకుండా తను కంప్యూటర్ హార్డ్‌వేర్ విషయాల్లో కూడా చాలా సమర్థురాలు. గ్రూపులో చీఫ్ మెకానిక ల్ ఇంజినీరు శ్రీనాథ్ ఆమె తయారు చేసిన డేటాబేస్‌ని ఎప్పటికప్పుడూ సర్టిఫై చేస్తూ వుండాలి. అందుకే ఎప్పుడు అతనికి అందుబాటులో వుండాలి. అది అతనికి ఏవో లేని పోని ఆలోచనలనిచ్చిందా?

ఇంతవరకూ అతను ఆడవాళ్ళపట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ, మాట్లాడడం కానీ నా దృష్టికైతే రాలేదు మరి. అయితే అంజన అబధ్ధం చెప్తూందా? పోనీ పొరపాటు పడిందా? అసలీ విషయాన్ని శ్రీనాథ్‌తో ప్రస్తావించడం ఎలా?

ప్రస్తావించాలా లేకపోతే చూసీ చూడనట్టు వదిలేయాలా? ఇటు వంటి సమస్య
ఎప్పుడూ ఎదురుపళ్ళేదు నాకు. ఆఫీసుల్లో వెకిలిగా మాట్లాడే మగవాళ్ళకు తక్కువేమీ లేదు మా సంస్థలో. కానీ ఇంత వరకూ దాన్ని గురించి బయట మాట్లాడింది ఎవరూ లేరు, నాతో సహా. అయితే మాకిలాటి ఇబ్బదికరమైన పరిస్థితులు ఎదురుపడ్డప్పుడు మాట్లాడ డానికి సీనియర్ కేడర్‌లో ఆడవాళ్ళెక్కువ వుండే వారు కాదు. వున్న ఒకరిద్దరితో మాకు ఎక్కువ చనువూ, మాట్లాడే ధైర్యమూ వుండేవి కాదు. అలాగే తిట్టుకుంటూ, పళ్ళ బిగువున
పని చేసుకుంటూ పోవడం అలవాటై పోయింది. ఇప్పుడేం చేయాలో అర్థం కాని ఈ పరిస్థితి. ఒకవైపు సహృదయుడూ, వృత్తిలో మంచి మిత్రుడూ అయిన శ్రీనాథ్, ఇంకో వైపు ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన అమ్మాయి. ఇద్దరిలో ఎవరిని సమర్థించాలి?

***

          సాధారణంగా ఆఫీసు విషయాలు ఇంటిదాకా తీసుకుపోవడం నాకిష్టం వుండదు కానీ, ఆ రాత్రి పడుకునేటప్పుడు ఆనంద్‌తో ఈ విషయం చెప్పాను.

          మా బాచ్‌లో అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి, ఒకరి పెళ్ళికి ఒకరం వెళ్ళొచ్చాం కూడా. మా సంస్థ మాకని కట్టి ఇచ్చిన ఇళ్ళల్లో ఒకే టౌన్‌షిప్ లో వుండడంతో సహజంగా  కుటుంబ స్నేహాలు కూడా పెరిగాయి.

          శ్రీనాథ్, ఆనంద్ కూడా మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ ప్రతీ వారం కలిసి టెన్నిస్ ఆడతారు. ఒకవేళ శ్రీనాథ్ మనస్తత్వంలో కానీ, ప్రవర్తనలో కానీ మార్పులొస్తే ఆనంద్ దృష్టిలోకి రాకుండా వుండదు.

          “ఏమిటీ? శ్రీనాథ్ అసభ్యంగా ప్రవర్తించాడా? అన్‌బిలీవబుల్. అసలు ఈ మధ్య ఆడపిల్లలు చచ్చేంత అటెన్షన్ సీకింగ్‌గా తయారవుతున్నారు. వాళ్ళ వైపు చూసినా తప్పే, చూడకపోయినా తప్పే. లేకపోతే శ్రీనాథ్ ఎవరో ఆడపిల్లని వేధించడం ఏమిటి? తను చెప్పినా నువ్వెలా నమ్మావ్?”

          “ఆడపిల్లలు ఇటు వంటి విషయాల్లో అబధ్ధం ఎందుకు చెప్తారు ఆనంద్?”

          “టు ప్రువ్ దట్ దే ఆర్ డిజైరబుల్! ఎవరో తమని కోరుకుంటున్నారన్న విషయం వాళ్ళ అహాన్ని సంతృప్తి పరుస్తుందేమో! ఎవడికి తెలుసు?”

          నిర్లక్ష్యంగా అన్నాడు. అతని మాటలకి చిరాకు ఎక్కువై చర్చ పొడిగించ లేదు.

          ఆ పై ఆదివారం నేనూ, ఆనంద్ వూరికే శ్రీనాధ్ ఇంటికి వెళ్ళాం. శ్రీనాథ్ భార్య అనిత బేంకులో పని చేస్తారు. ఇద్దరూ చక్కటి జంట. ముత్యాల్లాటి ఇద్దరు ఆడపిల్లలు.
మేం వెళ్ళేసరికి భార్యా భర్తలిద్దరూ హాయిగా టీవీలో ఏదో సినిమా చూస్తూ వున్నారు. రెండు మూడు గంటల సేపు సరదాగా గడిపాం. మేం తీసుకెళ్లిన పావ్ భాజీ తిని అనిత చేసిన టీ తాగి బోలెడు కబుర్లు చెప్పుకున్నాం.

          శ్రీనాథ్‌లో అసలు ఎటువంటి మార్పూ కనబడలేదు. ఎప్పట్లాగే ఆఫీసు మేనేజి మెంటునీ, హైదరాబాదు ట్రాఫిక్కునీ తిట్టిపోసాడు. పిల్లలతో పాటు కార్టూన్లు చూసి పడీ పడీ నవ్వాడు. భార్య మీద బోలెడన్ని జోకులు వేసాడు. ఎప్పట్లాగానే సందడిగావున్నాడు.
అంజనానే ఏదో పొరబడి వుంటుంది.

          అంజనా అబద్ధం చెప్పకపోతూ వుండొచ్చు, కానీ శ్రీనాథ్ చూపించే మామూలు
స్నేహాన్నీ, ఎక్స్‌ట్రావొర్టెడ్ బాడీ లాంగ్వేజీని తప్పుగా అర్థం చేసుకుని వుండొచ్చు. సర్ది చెప్తే తనే తెలుసుకుంటుంది. శ్రీనాథ్‌ని కూడా కొంచెం జాగ్రత్తగా వుండమని చెప్తే సరి. ఇంత చిన్న విషయానికి ఒక మనిషి నిర్మించుకున్న కుటుంబాన్నీ, కుటుంబ సభ్యుల మనశ్శాంతినీ, ప్రొఫెషనల్ గుర్తింపునీ పాడు చేయటం అవసరమా? ఎన్నో యేళ్ళ పరిశ్రమ అది. ఏదో చాపల్యం కొద్దీ అతను అతి చనువు చూపించే వుండొచ్చు. ఇంత చిన్నదానికి మేనేజిమెంట్ దాకా వెళ్ళి అందరి బ్రతుకుల్నీ చిందర వందర చేయడం
అవసరమా? ఆ ఆలోచన మనసుకి కొంచెం రిలీఫ్ ఇచ్చింది కానీ ఎందుకో నిద్ర సరిగా పట్టలేదు.

***

          “పూజా! బాగున్నావా?” ఫోన్‌లో తార గొంతు చాలా రోజుల తరవాత విన్నాను. తారా నేనూ చిన్నప్పుడు పక్క పక్క ఇళ్ళల్లోనే వుండి, ఒకే కాలేజీలో చదువుకున్నాం. తరవాత ఉద్యోగాలు పెళ్ళిళ్ళతో ఇదే నగరంలో చెరో మూలా వున్నాం. అప్పుడప్పుడూ ఫోన్‌లో పలకరింపులూ, పిల్లల పుట్టినరోజు వేడుకల్లాటి వాటిల్లో కలుసుకోవడాలు, అంతే.

          “హాయ్ తారా! బాగున్నావా? చాలా రోజులయింది నిన్ను చూసి.”

          “బాగున్నా పూజా. నీకొక ఎక్సైటింగ్ వార్త చెప్దామని ఫోన్ చేసా. నీకు మనచిన్నప్పుడు మన కాలనీలో మనతో పాటు బస్సులో వచ్చే సుచిత్ర గారు గుర్తున్నారా? ఆ రోజుల్లో మనం ఆవిడని భలే ఆరాధించే వాళ్ళం. ఆవిడ మొన్న నాకు ఒక సినిమా థియేటర్‌లో కనిపించారు. మనం కాలేజీ వదిలిన ఇన్నేళ్ళలో మళ్ళీ ఆవిడని చూడనేలేదు. నేను గుర్తు పట్టి పలకరించాను. ఆవిడ అడ్రసు తీసుకున్నా. మనిద్దరం ఒకసారి వెళ్ళొద్దామా?”

          “అవునా? అలాగే. ఎప్పుడు వెళ్దాం? పై ఆదివారమా? సరే. వెళ్ళొద్దాం.”

          ఇంకాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసాను. ఉన్నట్టుండి సుచిత్ర గారి ప్రసక్తి నా బ్రతుకు లోకి ఇప్పుడు రావడమేంటి, విచిత్రమైన కోఇన్సిడెన్స్ కాకపోతే! దాదాపు ఇరవైయేళ్ళ క్రితం కాలేజీ రోజుల్లో నేనూ, తారా, ఇంకొంత మంది స్నేహితులమూ కలిసి రోజూ వెళ్ళే బస్సు గుర్తొచ్చింది.

***

          బీటెక్ చదివే రోజుల్లో ఇంకొంత మంది అమ్మాయిలతో కలిసి నేను రోజూ బస్సులో యూనివర్సిటీకి వెళ్ళొచ్చేదాన్ని. మేమంతా ఆ బస్సు కండక్టరుని చూస్తే రావణాసురుణ్ణి చూసినట్టే భయపడేవాళ్ళం. చూడ్డానికి మామూలుగానే వుండేవాడు. కానీ ఆ చూపులే తేడాగా, ఒళ్ళంతా తడిమేస్తూ, చాలా చిరాగ్గా, ఇబ్బంది పెట్టేవి. పైగా, “టికెట్, టికెట్”
అంటూ భుజం మీద తట్టి అడిగేవాడు. కొన్నిసార్లు మెడమీదా, కొన్నిసార్లు జడమీదా, అతని చేతి స్పర్శ ఇన్నేళ్ళ తరవాత కూడా గొంగళి పురుగు పైన పాకినట్టనిపిస్తుంది.

అతని ఆ పరమ నికృష్టమైన టచ్ తలుచుకుంటే మాకు ఆ బస్సు ఎక్కబుద్ధయ్యేది కాదు. కొన్ని రోజులు బస్సు మార్చి చూసాం కానీ, ఎన్ని రోజులు కాలేజీకి ముందో, ఆలస్యంగానో వెళతాం?

          అక్కడికీ, ఒక చిన్న ఉపాయం కనిపెట్టాము ఆడపిల్లలమంతా. మాలో ఒక్కళ్ళం అతడి మీదే దృష్టి నిలబెట్టి, అతడు మా దగ్గరికి రాగానే బస్సు పాసులు తీసి పట్టుకుని అతడి కళ్ళ ముందు ఆడించేవాళ్ళం, “పాస్, పాస్” అని అరుస్తూ. అయినా ఎవరికో ఒకరికి భుజం మీద వాడి చేయీ, వెకిలి నవ్వూ తప్పేవి కావు.

          ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. పవర్ సిస్టమ్స్ లో పరీక్ష. ఎంత చదివినా ధైర్యం రావడం లేదు, బస్సులో కూడా టెన్స్‌గా నిలబడ్డాను. చేతిలో బాగు కూర్చున్న ఒక అమ్మాయికిచ్చి నా నోట్స్‌లోకే దీక్షగా చూస్తున్నాను. వున్నట్టుండి చేతి మీద మోచేతికీ మణికట్టుకీ మధ్య పాము పాకినట్టు స్పర్శ. దాదాపు కెవ్వు మన్నాను. వెనక్కి తిరిగి చూస్తే ఏ భావమూ లేని మొహంతో గుంట నక్క ఎక్స్‌ప్రెషనుతో కండక్టరు. “టికెట్ వుందా” అంటున్నాడు. కడుపులో తిప్పి, దాదాపు వాంతయినంత పనయింది. పరీక్ష టెన్షనూ, అనుకోని అదురుపాటూ, అసహ్యమూ అన్ని కలిసి కళ్ళల్లో నీరు తిరిగాయి. “పాస్ వుంది” అన్నాను బలహీనంగా. “ఏదీ, చూపించు” అన్నాడు అదే ఎక్స్‌ప్రెషన్‌తో. వణుకుతున్న చేతుల్తో బస్ పాస్ తీసి చూపించాను. వేళ్ళు తాకిస్తూ ఆ పాస్ అందుకోని అటూ ఇటూ తిప్పి చూసి మళ్ళీ వేళ్ళు తాకిస్తూ నా చేతికిచ్చి వెళ్ళిపోయాడు దరిద్రుడు.

నాకు కొంచెం ముందుగా నిలబడి వున్నారు సుచిత్ర గారు. ఆవిడ సెక్రెటేరియట్‌లో పని చేసేవారు. అప్పుడప్పుడూ మా బస్సులోనే వచ్చేవారు. ఆ రోజు ఆవిడ మనసెలా వుండిందో కానీ ఆ కండక్టరు మీద ఆడపులిలా విరుచుకు పడ్డారు.

“అలా ముట్టుకోని మరీ టికెట్ టికెట్ అని అమ్మక్కర్లేదు. మాకు బాగానే వినిపిస్తుం ది. అసలేమైనా మర్యాదా, సంస్కారం వున్న మనిషివేనా? రోజూ చుస్తున్నా, ఆడపిల్లల్ని తాకుతూ కానీ మాట్లాడలేవా?” ఆవిడ గొంతూ, ఆ గొంతులో వున్న కోపమూ మా  అందరి కెంత సంతోషాన్నిచ్చాయో చెప్పలేము.

కండక్టరూ ఊరుకోలేదు.

“నా పని నేను చేస్తున్నానండీ. మీ దగ్గర టికెట్లు లేకపోతే నా నెత్తిమీది కొస్తుంది. ఎవరి గాలీ సోకద్దనుకుంటే కార్లో వెళ్ళాలి, ఇటువంటి బస్సుల్లో అందరితో పాటు ఎందుకొస్తారు?”

“నిన్నెవ్వరూ టికెట్లివ్వొద్దనట్లేదు. ముట్టుకోని మాట్లాడక్కర్లేదంటున్నా. అర్థం కావట్లేదా? అయినా అందరూ స్టూడెంట్సూ, ఉద్యోగస్తులే వుంటారీ బస్సులో. ఆ మాత్రం బాధ్యత మాకూ తెల్సు. నీకంటే పల్లెల్లో గొడ్లు కాసుకునే వాళ్ళు నయం. మర్యాదగా ప్రవర్తిస్తారు. ఇంకోసారి బస్సులో ఆడవాళ్ళ మీద చేతులేస్తే నిన్నొదిలేది లేదు. నీ పై ఆఫీసరుకి కంప్లెయింటిచ్చి సస్పెండు చేయిస్తా! ఏమనుకుంటున్నావో!” ఆవిడ ఛడా మడా దులిపేసారు.

చుట్టూ వున్న మగవాళ్ళు, “వూరుకొండి మేడం. అతనితో ఏంటి గొడవ”, అని
కొందరూ, “అబ్బ, ఏదో కొంచెం చేయి తగిలితే ఇంత అల్లరి చేయాలా,” అని కొందరూ
వ్యాఖ్యానాలు మొదలు పెట్టారు.

ఆవిడ, “మీరూ కొంచెం అర్థం చేసుకోండి సార్. మీ ఇంట్లో ఆడవాళ్ళకీ ఇటువంటి ఇబ్బందులూ, సమస్యలూ ఎదురవుతూనే వుంటాయి. ఎవరూ సహాయం చేయరు. సమస్య మాది కాదనుకోని మీరంతా పట్టనట్టే వుంటారు. మీ ఇళ్ళల్లో ఆడపిల్లలు బయట ఎంత బిక్కు బిక్కు మంటూ వుంటారో ఒక్కసారి అడిగి చూడండి. మా బాధేంటో  మీ కప్పుడు అర్థమవుతుంది,” అన్నది.

ఆమె ధాటీకి కండక్టరూ, మిగతా మగవాళ్ళూ కొంచెం బెదిరారు. నిశ్శబ్దంగా అయిపోయారు.
ఆ తర్వాత మా వైపు తిరిగి, “మీరిల్లా మేక పిల్లల్లా వుండొద్దమ్మా. పిచ్చి వేషాలేస్తే చెప్పు తెగుతుంది, అని భయపెట్టాలి. లేకపోతే జీవితాంతం ఇలా గుడ్లల్లో నీళ్ళూ, నోళ్ళల్లో చెంగూ కుక్కుకోవటం తప్ప వేరే దారుండదు,” అని ఇక మౌనంగా వుండి పోయింది.

ఆ తరవాత యేడాది పాటు ఆ బస్సులో కండక్టరు మా దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ప్రవర్తించాడు. ఆవిడ ఆ బస్సులో ఎక్కువగా వొచ్చేవారు కాదు, కానీ బయట కాలనీలో ఆవిడతో నాకూ, తారకూ బాగా స్నేహం కుదిరింది. ఆవిడ స్నేహంలో నేనెన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆవిడ చూపించిన ధైర్యంతో ఇంకొకరోజు ఆడపిల్లలమంతా బస్సులో ఆడపిల్లలకి ఒళ్ళంతా రాస్తూ నిలబడే ఇంకొక గుంట నక్కకి పదిమందిలోగట్టిగా బుద్ధి చెప్పాం. ఆ రోజు ఎంత గర్వంగా అనిపించిందో! ఆ తరవాత సుచిత్ర గారు ట్రాన్స్‌ఫరయి ఇంకేదో ఊరికి వెళ్ళిపోయారు. కానీ నేను ఆవిడని మాత్రం మరిచిపోలేదు. లేకపోతే మరిచిపోయానా?

***

          ఆ పై ఆదివారం నేనూ తారా ఆటోలో ఆవిడ చెప్పిన అడ్రసుకి వెళ్ళాం. రిటైరై వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఫ్లాటు కొనుక్కోని వొంటరిగా వుంటున్నారావిడ.

“ఎంత పెద్దైపోయావు పూజా! పెద్ద ఇంజినీరువయ్యావట కదా? సో హేపీ!” అన్నారు ఆవిడ నన్ను ప్రేమగా హత్తుకొని. ముగ్గురం చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం. మాటల్లో ఆవిడ ఆ రోజు కోప్పడ్డ కండక్టురుని గుర్తు చేసుకున్నాం.

“అసలు అంతకు ముందు చాలా రోజుల్నించే నేను వాణ్ణి గమనిస్తూనే వున్నా.

ఎలాగూ తమని ఎవ్వరూ ఏమి అనరన్న నమ్మకమే అలాటి వాళ్ళకి వుండే ధైర్యం. ఒక్క సారి ఆ నమ్మకం మీద దెబ్బ కొడితే వాళ్ళు తోక ముడుస్తారు. అంతే. ఆడవాళ్ళు ధైర్యంగా నోరు విప్పితే ఇటు వంటి ప్రెడేటర్స్ నుంచి కొంతైనా తమని తాము  కాపాడుకోగలుగు తారు. “ఆవిడలో చిన్నప్పటి ఆవేశమూ కోపమూ ఏమీ తగ్గలేదు అనిపించింది.” కొన్ని సార్లు పాపం ఆడవాళ్ళు గొంతెత్తడానికి ధైర్యం చేసినా, ఎవరూ మద్దతు ఇవ్వరు. ఆడ వాళ్ళం కొంచెం సంఘటితంగా వ్యవహరిస్తే, ఒకరికొకరం కనీసం మోరల్ సపోర్ట్ ఇచ్చు కుంటే, గొంతెత్తి మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. మనం మన ఇబ్బందులు చెప్పుకున్న ప్పుడు చుట్టూ వున్నవారు, “అబ్బ, ఇంతేనా?” అని మన సమస్యని చిన్నదిగా చేసి పక్కన
పెట్టించేస్తారు మనతోనే. ఆ మాటకొస్తే, అసలు తప్పంతా నీదే అని కూడా వాదిస్తారు. ఇప్పుడు దీన్ని గేస్ లైటింగ్ అనో ఏదో అంటారటకదా? నా బ్రతుకంతా ఇలా గేస్ లైటింగ్ అవుతూనే గడిపాను. కానీ మనం వొదలకూడదు.

చిన్నదో, పెద్దదో, ఈ పరిస్థితి నాకు నచ్చటం లేదు అని నోరు విప్పి చెప్పుకునే అవకాశం, పరిస్థితీ అందరికీ వుండాలి. “సుచిత్ర గారి మాటలు వింటూ ఆలోచనలో పడిపోయాను.

***

          ఆ రాత్రి పడుకునే ముందు అంజనాకి తన మొబైల్‌కి ఫోన్ చేసాను.

“అంజనా, నువ్వు చెప్పిన విషయం గురించి మనం ఇంకా వివరంగా మాట్లాడు కుందాం. రేపు నేను ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లో వుంటా. నువ్వు మా ఇంటికి రా. మనకి మాట్లాడుకోవడానికి టైమూ ప్రైవసీ వుంటాయి. ఇక ముందు చేయాల్సిందేమిటో ప్లాన్ చేద్దాం.”

ఏం చేస్తానో నాకూ తెలియదు. కానీ ఏదో చేస్తాను. ఒక నిశ్చయానికి వచ్చాక
హాయిగా నిద్ర పట్టింది.

*****

🪻🍃💦🙏💦🍃🪻

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అమలు చేయవలసిన జీవిత పాఠాలు 🙌🏻🙏🏻 1/9

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అమలు చేయవలసిన జీవిత పాఠాలు 🙌🏻🙏🏻
1/9


When Love Becomes Control: Parenting Mistakes That Ruin Children’s Growth | Telugu Podcast

When Love Becomes Control: Parenting Mistakes That Ruin Children’s Growth | Telugu Podcast

https://m.youtube.com/watch?v=zWJMQBAmQbg


https://www.youtube.com/watch?v=zWJMQBAmQbg

Transcript:
(00:04) కొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలు రెండు రకాలుగా కనిపిస్తారు. వాళ్ళ మాట వింటే బంగారు కొండలుగా వినకపోతే తలనప్పిగా మారుతారు. అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక నలుగురి కంటే బాగా సంపాదిస్తే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో మంచు పిల్లలు అవుతారు. అలానే అదే పిల్లలు తమ దారిలో నడిస్తే వాళ్ళ ప్రేమకు శరతులు మొదలవుతాయి. ఇక్కడ పేరెంట్స్ అనుకునేది ఏమిటంటే మన పిల్లలు మన సొంతం అనుకుంటారు.
(00:32) కానీ నిజంగా పిల్లలను కంట్రోల్ చేయగలరా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు పొలం దున్ని విత్తనం వేసి నీళ్లు పెడతాడు. కానీ వర్షం పడుతుందా లేదా పంట ఎలా పెరుగుతుంది? ఎంత దిగుబడి వస్తుంది అనేవి రైతు చేతుల్లో ఉండవు. అతను ఆ పంట నా సొంతం నేను పండించాను గనుక నేను చెప్పినట్టే పెరగాలి అని చెప్పగలడా? అలానే తల్లిదండ్రులు పిల్లలకు ఒక శరీరాన్ని క్రియేట్ చేసి ఇస్తారు.
(00:59) ఈ ప్రాసెస్ లో x క్రోమోజోమ్స్ y క్రోమోజోమ్స్ కలిస్తేనే ఈ పిల్ల అనే శరీరం పుట్టడం స్టార్ట్ అవుతుంది. ఆ క్షణంలో ఏ తల్లిదండ్రులైనా పుట్టబోయే బేబీ కోసం కలవరు. ఆ టైం కి జీవితం వలన ఒక మార్గంగా ఉపయోగిస్తుంది. సో తల్లిదండ్రులు ఆ ప్రక్రియలో పాల్గొనేవారు మాత్రమే దాని ఫలితమే బేబీ కానీ ఇక్కడ ఒక ఆడదాని కంటే మగాడు మాత్రం లైఫ్ లో ఏదో సాధించాడు అనే గొప్ప ఫీలింగ్ లో ఉంటాడు.
(01:26) అదేంటో దానికి నేనే కారణం నా వల్లే జరిగింది అని. బట్ రియాలిటీ ఏంటంటే నాకు మీలాగానే ఇంటిమేట్ అయ్యాను ఒక మగాడిని అని నిరూపించుకోవడానికి. అదే ఇప్పుడు ఇద్దరిలో ఎవరికో ఒకరికి ప్రాబ్లం ఉంటే సిచువేషన్ చాలా డల్ గా మారిపోతుంది. దీనిని అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమందే గిబ్రాన్ చెప్పినట్టు పిల్లలు మీ ద్వారా వస్తారు కానీ మీ వాళ్ళు కాదు.
(01:52) పట్టణాలకు దూరంగా ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతని పేరు ఎవ్వరికీ గుర్తుండేది కాదు కానీ అతన్ని అందరూ విల్లు తయారీదారుడు అని పిలిచేవారు. అయితే అతని గొప్పతనం ఏమిటంటే అతని చేతుల నుంచి వచ్చిన విల్లు చాలా ప్రత్యేకంగా ఉండేది. ప్రతి విల్లు తయారు చేసే ముందు చెట్టుతో మాట్లాడేవాడు. అలానే అతనికి ఒక అలవాటు ఉంది.
(02:15) అతను తయారు చేసిన ప్రతి విల్లును కొన్ని రోజులు తన దగ్గరే ఉంచుకొని దాన్ని గమనించేవాడు. దాని ఒంపు దాని బలం దాని సహనం ఇలా అన్నీ అతనికి తెలియాల్సిందే విల్లు బలంగా ఉండాలి కానీ గట్టిగా కాదు బంగాలి కానీ విరగకూడదు అని అనుకునేవాడు. అతని జీవితంంతా ఇలానే గడిచింది. ప్రేమ, సహనం, శ్రమ వాటితోనే అయితే ఒకరోజు ఎప్పుడూ చేసేదానికంటే కొంచెం గొప్పగా ఒక విల్లును చేసి మురిసిపోయాడు.
(02:42) ఆ విల్లు కోసం ఒక బాణాన్ని కూడా రెడీ చేశాడు. అది సూటిగా మరి పదునుగా ఉంది. ఆ విల్లు ఆ బాణాన్ని చూసి అనుకుంది నువ్వు నావల్లే ఉన్నావు నాతో ఉంటేనే నీకు వాల్యూ ఉంటుంది అని అలా కొన్ని రోజులు గడిచాక ఒక వేటగాడు వచ్చి అతని విల్లును పట్టుకొని బాణాన్ని ఎక్కించాడు. లక్ష్యం చాలా దూరంలో ఉంది. ఆ క్షణంలో విల్లు భయపడింది.
(03:05) నేను వదిలేస్తే బాణం నన్ను వదిలి వెళుతుంది అని కానీ వేటగాడు వెనక్కి తగ్గలేదు. బాణాన్ని వదిలాడు. బాణం గాలిలోకి దూసుకెళ్ళింది. దూరంగా ఉన్న లక్ష్యాన్ని తాకింది. అప్పుడు ఆ విల్లు ఖాళీగా మారింది. అప్పుడే వేటగాడు అన్నాడు నేను వదులకపోతే అది తన గమ్యాన్ని చేరేది కాదు. నువ్వు బలంగా లేకపోతే అది ఎంత దూరం వెళ్లేది కూడా కాదు అని ఆ మాటలు విన్న విల్లు నిజాన్ని అర్థం చేసుకుంది.
(03:31) తన పని పట్టుకొని ఉంచడం కాదు వదిలే అంత బలంగా ఉండడం అని అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ కథలో విల్లు తల్లిదండ్రులు అయితే బాణం పిల్లలు అన్నమాట. తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువగా భయంతోనే కలిసిపోతుంది. నా మాటే వినాలి నా దారిలోనే నడవాలి అనే భ్రమ ప్రేమలా కనిపిస్తుంది. కానీ పిల్లలు బాణాల లాంటివారు ముందుకు వెళ్ళడానికి పుట్టారు ఆగిపోవడానికి కాదు.
(03:58) గిబ్రాన్ ఆన్ చిల్డ్రన్ లో చెప్పింది కూడా ఇదే. పిల్లలు మన ద్వారా ఈ లోకానికి వస్తారు. కానీ మన సొంతం కాదు. వాళ్ళ ఆలోచనలు మనవిగా ఉండకపోవచ్చు. వాళ్ళ కలలు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ వాటిని ఆపే హక్కు మనకు లేదు. మన పని వాళ్ళను బలంగా చేయడం మాత్రమే శారీరకంగా కాదు భావోద్వేగంగా ఆలోచనల్లో అంటే పేరెంట్స్ విల్లు లాంటివారు వాళ్ళు ఎంత బలంగా ఉంటే పిల్లలు అంతే దూరం వెళ్ళగలరు.
(04:27) కానీ ఆ బలం కంట్రోల్ లోనో ఆపేయడంలోనో కాదు ఒక సపోర్ట్ గైడెన్స్ ను ఉంటుంది. పిల్లలను మన భయాలకు కట్టి పడేయడం వాళ్ళను రక్షించడం కాదు అది ఒక రకంగా వాళ్ళ ఎగిరే రెక్కలను కత్తరించినట్టే దీనిని ప్రేమ గారాబో అని చెప్పుకుంటూ బ్రతికేదాన్ని ప్రేమ అని అనరు. నిజమైన ప్రేమ దానికి స్వేచ్ఛ దొరికే సరైన సమయానికి వదిలేయడమే. ఈ కథలో చివరికి ఏమైంది విల్లు తన బాధను వదిలేసింది అర్థం చేసుకుంది.
(04:56) బాణం ఎంత దూరంగా వెళ్ళడం తన ఓటమి కాదు అది విజయం అనుకుంది. అదేవిధంగా పిల్లలు తమ జీవితాల్లో ముందుకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు ఒక ఎంటీ వస్తుంది. అది నిజానికి ఒక గర్వంగా మారాలి. నేను నా పని చేశాను అని అనుకోగలిగితే అదే నిజమైన తల్లిదండ్రత్వం. మన లైఫ్ లో ఎవరో ఒకళ్ళు మన దగ్గర నుంచే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు శిష్యులు మనం ప్రేమించే వాళ్ళు అని బట్ మన కర్తవ్యం ఏంటి వీలైనంతవరకు సపోర్ట్ ఇస్తూ బలంగా తయారు చేసి వదిలేయడమే.

హిందువులారా చూశారా...బ్రీతింగ్ ప్రాబ్లెమ్ వచ్చే కెమికల్ తో షాపుల్లో ధూపం...| Public Health Concern

హిందువులారా చూశారా...బ్రీతింగ్ ప్రాబ్లెమ్ వచ్చే కెమికల్ తో షాపుల్లో ధూపం...| Public Health Concern

 https://youtube.com/shorts/d7Xilh4zyWs?si=vio0Z2ldavLgtSy2


https://www.youtube.com/watch?v=d7Xilh4zyWs

Transcript:
(00:01) కలుపుతాం ఇది ఎప్పుడు ఇది బ్రీతింగ్ ప్రాబ్లమే కదా మరి ఆ షాపులలో పోయి గల్లాలలో వేస్తావు కదా మరి ఇది బ్రీతింగ్ ప్రాబ్లమే కదా ఆ ఏంది ఎవరు చెప్తే చెప్పుకో అంటే ఏంటి ఏ పని ఆ బ్రీతింగ్ అది కలపడానికా ఆ అసలు వేయొచ్చా అది ఆ ఖురాన్లో చెప్తుంది అది అట్లా వేయమని అన్న ఖురాన్లో చెప్తుందా ఖురాన్లో సామ్రణ్య ఏమన్నదా గుగ్గిలో ఏమన్నాదా లేక
(01:04) తీసు కెమికల్ కలిపిన పౌడర్లు ఏమన్నదా మసీదులో వేస్తావా అన్నది ఆ దర్గాలో దర్గాలో అది వేస్తుంది చూపెడతావుగా పెద్ద మసీదు కడిగిపోతుందా పెద్ద మసీదులోకి పోదా ముజార్ని పిలుతుందా తీసుకపో ఆ ఏ ఊరు నీది ఎక్కడ ఎక్కడ అంటే ఇక్కడ అంటే అది ఇక్కడే పో ఏ రాగి అన్న చెప్పు తెగిద్ది నువ్వు రాగి అంటే చెప్పు తెగిద్ది ఏమనుకుంటానో ఊళలో నుంచి కూడా బయట పెట్ట ఏంది అసలు నువ్వు కెమికల్ కనిపేయది షాపులలో ఎందుకు ఎత్తావ్ స్వామ

 రామాయణానుభవం....3

నారదమహర్షి చే ఉపదేశం పొందిన సంక్షేప రామాయణాన్ని మననం చేస్తూ మధ్యాహ్న సమయానికి తమసానది తీరమునకు తన శిష్యుడైన భరద్వాజుని తో కలసి వెళ్లెను వాల్మీకి మహర్షి.

నిరంతరం  రామకథాగానం చేయడం మూలన మనస్సు నిర్మలమైనది. ఆభావాలే ప్రకృతి లో కనపడ్డాయి....పక్కనే ఉన్న భారద్వాజుని తో నది లో ఉన్న నీటి ని చూస్తూ అనేశాడు కూడా...
ఓ భరద్వాజా బురద లేని స్వచ్ఛమైన నీటి ని చూసావా నిర్మలమైన  ఉత్తమ మనుజుని వలే ఉన్నది అని చెబుతున్న సమయం లో నే ఆశ్చర్యాన్ని కలిగించే ఓ దృశ్యం మహర్షి కంట పడింది.....

ఓ క్రౌంచ పక్షుల జంట...ప్రేమాతిశయముతో ఒకటిని విడచి మరొకటి ఉండని స్థితి....
ఆసమయంలో ఓ బోయవాడు ఆ జంటలో మగ పక్షిని బాణం తో కొట్టేసాడు.....ఆ ప్రదేశం అంతా ఆ పక్షి రక్తం తో నిండినది ఆడ పక్షి  తన రెక్కతో విసురుతూ విల విల లాడుతూ మగ పక్షి చుట్టూ తిరుగుతోంది.దీనం గా రోదిస్తోంది.
పక్కనే బోయ వాడు విల్లంబులతో నిలుచు కొని వున్నాడు.....

అత్యంత అల్ప సమయం లో జరిగిన ఈ దృగ్విషయాన్ని వాల్మీకి కన్నులతో కాక హృదయం తో చూసాడు....

అంత వరకు ప్రశాంతం గా ఉన్న మనసు లో ఒక్క సారి అలజడి చెలరేగింది.....ఒక్క సారి హృదయాంతరాలలో నుండి శోకం తో కూడిన మాటలు తన్నుకొని వచ్చాయి.....

శ్లో! మానిషాద! ప్రతిష్ఠాం త్వ! మగమః శాశ్వతీస్సమా: | 
యత్ క్రౌంచమిధు నాదేక మవధీఃకామమోహితమ్౹౹

ఓ కిరాతకుడా! నీవు కామవసా న  క్రౌంచపక్షుల జంటనుండి మగ పక్షి ని చంపినావు కనుక నీవు చాలాకాలం లోకం లో అప్రతిష్ఠితను పొందుదువు.

వాల్మీకి నోటి వెంబడి వచ్చిన మాటలు ఏదో శాపం గా కనుబడుతున్నాయి అని చింతిస్తున్నాడు....

పక్కన ఉన్న భరద్వాజుడు గురువాక్కు ను నిశితంగా చూస్తున్నాడు.
4 పాదాలుగా ఉన్నాయి....
 ఒక్కో పాదానికి 8 అక్షరాలున్నాయి....
ఒక క్రమబద్దం గా ఉన్నాయి....
గతం లో చదవని విధం గా కనబడుతున్నాయి అని ఆశ్చర్యానికి లోనవుతున్నాడు....
అవును ఈ శ్లోకం ఛందోబద్ద రచనకు మూలం. మొదటి శ్లోకరూప వాజ్ఞ్మయం....
ఆది కావ్యం రామాయణం,
ఆది కవి వాల్మీకి ......
వాల్మీ రామాయణ రచనకు పునాది.....

శ్లోకాన్ని పరిశీలిస్తే ఓ  శాపం గా కనపడుతుంది కానీ కావ్య ఆరంభము మంగళ వాక్యాలతో మొదలు కావాలి మరి ఇదేమిటి ఇలా ఉంది అని మన పెద్దలు విస్తుపోయారు .....
పరికించారు దివ్యదృష్టి తో దర్శించారు అప్పుడు  ఆ శ్లోకమే ఇలా అగుపించింది.

మా నిషాద-లక్ష్మికి నివాసస్థాన మైన విష్ణువా ! త్వమ్=నీవు, యత్ = ఏ కారణమువలన, క్రౌఇ్చమిథునాత్ =రాక్షసదంపతు లైన రావణమండోదరులనుండి కామమోహితమ్=కామపరవశ మగు, ఏకమ్=ఒక డైన రావణుని, అవధీః శాశ్వతీ:,స్థిరము లైన, సమాః సంవత్సరములయందు, ప్రతిష్టామ్=మాహాత్మ్య
మును, అగమః=పొందితివి.

. ఓ శ్రీనివాసుడా! రావణమండోదరు లను రాక్షసదంపతులవద్దకు వెళ్లి, వారిలో ఒకడును, మన్మథపరవశుడై 
సీతాదేవి నపహరించిన వాడును అగు రావణుని చంపితివి గాన నీవు శాశ్వతకాలము మాహాత్మ్యము పొందితివి.

ఇలా చూస్తే ఓ మంగళకరమైన శ్లోకం గా కనిపిస్తుంది.

ఈ ఛందోబద్ధమైన శ్లోకాన్ని గురుశిష్యులు ఇద్దరూ స్మరణ చేస్తూ వికారానికి లోనైన మనసులతో ఆశ్రమం చేరారు.
వాల్మీకి మహర్షి ఆచమనం చేసి తదేకదృష్టితో   శ్లోకాన్ని స్మరణ చేయడం ప్రారంభించాడు.అపుడే ఆశ్రమానికి చతుర్ముఖ బ్రహ్మ గారు విచ్చేసారు.

చక్కెర.తులసీకృష్ణ.
 *సల సల కాగే సూరీడు... సల్లా సల్లని చందమామ (జానపద సరదా కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
         ఒకూర్లో ఒకామె వుండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్దోని పేరేమో సూర్యుడు. చిన్నోని పేరేమో చంద్రుడు. వాళ్ళు చానా బీదోళ్ళు. ఆమె ఆ ఇంట్లో, ఈ ఇంట్లో వనులు చేసి వచ్చిన డబ్బులతో పిల్లలకు మంచి తిండి పెట్టేది. ఒక రోజు ఆమెకు పెద్ద జ్వరమొచ్చి మంచంలో పడిపోయింది. నెలైనా జ్వరం కొంచెం కూడా తగ్గలేదు. ఇంట్లో వున్న దబ్బులన్నీ అయిపోయినాయి. ఆమె పిల్లలిద్దరికీ ఏదో ఒకటి పెట్టి తాను మాత్రం ఏమీ తినకుండా పుత్త మంచినీళ్ళు తాగి కడుపు నింపుకొనేది. పిల్లల కోసం జ్వరంలోనూ ఆకలితో పస్తులుండేది. అంతలో ఒకరోజు ఆ వూరిలో ఒక పెద్ద పెళ్ళి జరుగుతా వుంటే వీళ్ళను భోజనానికి పిల్చినారు. పెళ్ళి భోజనమంటే ఉత్త అన్నం, పప్పు పెట్టరు కదా. మంచి మంచి రుచికరమైన వంటకాలు వడ్డిస్తారు. ఆమె చానా రోజుల నుండి వస్తులుంది కదా. దాంతో నోరూరింది. పిల్లలతో సహా తానూ పోయి బాగా కడుపునిండా తిని రావాలనుకోనింది. కానీ చానా రోజుల నుండి తిండి లేదు కదా. అదీకాక జ్వరం ఇంకా తగ్గలా. దాంతో నీరసమొచ్చి మంచం మీద నుండి కొంచగూడా లేవలేకపోయింది. అడుగు తీసి అడుగు వేయలేక పోయింది. దాంతో సూర్యున్ని, చంద్రున్ని పిలిచి "రేయ్... మీరిద్దరూ పెళ్ళికి పోయి బాగా తిని రండి. అట్లాగే వచ్చేటప్పుడు నాక్కూడా ఏమైనా పట్టుకోని రండి. చానా ఆకలిగా వుంది. ప్రాణం పోయేటట్లు ఉంది" అని చెప్పింది. సరేనని ఇద్దరూ పెళ్ళికి పోయినారు.
సూర్యుడు భోజనానికి కూర్చోగానే అమ్మ చెప్పిన మాట మరిచిపోయినాడు. బచ్చాలు, లడ్లు, కర్జకాయలు, పాయసం అన్నీ బాగా మెక్కి ఉత్త చేతులు పూపుకుంటా ఇంటికొచ్చినాడు. వాళ్ళమ్మ సూర్యున్ని చూడగానే తన కోసం అన్నీ తెచ్చింటాడు అనుకోని ఆశతో "ఏరా! నా కోసం ఏమి తెచ్చినావు" అనడిగింది. దానికి సూర్యుడు "అరెరే! నీ సంగతే మర్చిపోయినా. నాకసలు గుర్తే లేదు" అన్నాడు. తాను రోజూ ఏమీ తినకుండా కడుపు కాల్చుకోని అన్నీ వీళ్ళకే పెడతా వున్నా కనీసం ఒక్కపూట కూడా తనకు తేలేదు కదా అని ఆమె చానా బాధ పడింది.
చంద్రుడు మాత్రం అన్నానికి కూర్చోగానే పెట్టినేవి పెట్టినట్లు సూర్యుని మాదిరి బెరబెరా తినకుండా “పాపం అమ్మ రోజూ తానేమీ తినకుండా అన్నీ మాకే పెడతా వుంది. కనీసం ఈ ఒక్కరోజైనా ఇవన్నీ తీస్కోనిపోయి అమ్మకు పెట్టాలి" ఆనుకొని ఎవరూ చూడకుండా విస్తరాకులో పెట్టినేవి పెట్టినట్టు అంగీలో దాచి పెట్టుకోని ఇంటికి తీసుకొచ్చినాడు.
అమ్మ చంద్రుని చూస్తానే “ఏరా! నువ్వన్నా ఏమన్నా తెచ్చినావా, లేక మీ అన్న మాదిరే అన్నీ బాగా మెక్కి ఉత్త చేతులు వూపుకుంటా వచ్చినావా" అనడిగింది. ఆ మాటలకు చంద్రుడు నవ్వుతా “అమ్మా... ముందు నువ్వు కాళ్ళూ చేతులు కడుక్కొని రాపో... తిందువుగానీ" అంటూ విస్తరి వేసి తెచ్చినవన్నీ ప్రేమగా అమ్మకు కొసరి కొసరి తినిపించినాడు. అవన్నీ తిని ఆమె చానా సంబరపడింది.
ఆ తరువాత సూర్యున్ని పిలిచి "చూడు... వీడు నీకన్నా చిన్నోడే అయినా అమ్మ కోసం ఏమీ తినకుండా అన్నీ తెచ్చినాడు. నువ్వు పెద్దోనివై మాత్రం ఏం లాభం?" అంటూ "నేను ఎట్లాగైతే ఆకలితో మలమల మాడిపోయినానో, అట్లాగే నువ్వు కూడా ఇప్పన్నించీ సలసలసల మండిపోవాల" అని శపించింది.
చంద్రున్ని పిల్చి "మలమల మాడిపోతా వున్న నా కడుపు నిండా అన్నం పెట్టి దాన్ని చల్లగా చేసినావు. అందుకని ఇప్పన్నించీ నువ్వు చల్లగా బతకాల" అని దీవించింది. అందుకే ఆరోజు నుండి ఆకాశంలో సూర్యుడు సలసలసల కాగిపోతా సెగలు కక్కుతా వుంటే, చంద్రుడేమో వెన్నెల కురిపిస్తా హాయిగా వున్నాడు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 గుర్తుకొస్తున్నాయి
 *************
 బడి సంచీలు
-----------
    అప్పుడు మా చిన్నప్పుడు మాకు బడికెళ్ళడానికి  యూనీఫామ్ లు లేవు.నిజానికి మేం మా రౌతులపూడి బళ్ళోచదువతున్నప్పుడు అసలామాటనే అప్పట్లో  మేము విననేలేదు.మాసంగతి వదిలేయండి.మావి బొత్తిగా వానాకాలం చదువులు. నాతర్వాత ,నా చెల్లెళ్ళూ,తమ్ముళ్ళ చదువుల సంగతి చెపుతున్నాను.
           అయితే వాళ్ళచదువుల సమయానికి కూడా యూనిఫరాలననేవిలేవు.అయితే స్కూలు బట్టలనేవి వేరే వుండేవి.అవి ఖరీదైనవా, ,కొత్తవా, కావా అనే పట్టింపులేదుకానీ ,పరిశుభ్రతగా వున్నాయా లేవా? అన్నదిమాత్రము మాఉపాద్యాయులు చూసేవారు.చిరిగినా ఫరవాలేదుకానీ, మాసినవి మాత్రం కాకూడదు  అన్నమాట.ఆరోజుల్లో బడి బట్టలతో ఇంట్లోకి రానిచ్చేవారుకాదు.ఇంచుమించు అవి మైలబట్టలతో సమానం.అందుకని ఇంట్లోవాళ్ళు.బడినుంచి రాగానే, మా మెట్లగదిలో మూలగా స్టాండుమీద బడిబట్టలు తగిలించి  ,ఆగదిలోనే దూరంగా పెట్టుకొన్న ఇంటి బట్టలు కట్టుకొని లోపలకు వచ్చేవారం.
       ఇప్పట్లా వందల వేల ఖరీదులుచేసే స్కూలు బ్యాగులనేవి వుంటాయనే సంగతే ఆనాడు తెలియదు. అప్పట్లో మాకు.అసలు పుస్తకాలుంటేగదా బేగులుండడానికి.
మా అమ్మ చిరిగిపోయిన మడతమంచం గుడ్డలతో చెరువంత సంచీలను మా ఆస్థాన టైలరు తాతబ్బాయిచేత కుట్టించేది, ఆడపిల్లలకూ మగపిల్లలకూ. ఒకటవ తరగతిలో కుట్టించిన మడతమంచం గుడ్డ సంచీ  పదవతరగతిలోకొచ్చినా పాడవడమన్న మాట లేనేలేదు.
         అయితే ,మా బడిలో పిల్లలందరికళ్ళూ కుట్టేలా ,ఈరంకి దత్తుడుగారమ్మాయిలు మటుకు రామలక్షీ ,కామేశ్వరీ ,పద్మా వాళ్ళూ మాత్రం తళతళా మెరిసిపోతూ ,డబడబా చప్పడయ్యే సిల్వర్ స్కూలు పెట్టెలు తెచ్చుకొన్నప్పుడు ,ఆ అమ్మాయలను చూస్తే చెప్పొద్దూ చిన్న అసూయా,మా మడతమంచం గుడ్డ సంచీలని చూస్తుంటే బోల్డంత అసహ్యం కలిగేది.
    మా నాన్నని ఎన్నిసార్లు పుస్తకాల పెట్టెలు తెమ్మన్నా, రాజమండ్రీ వెళ్ళినప్పుడో,కాకినాడ వెళ్ళినప్పుడో తెస్తాను.అనకాపల్లి బెల్లం అమ్మడానికి వెళతానుకదా! అప్పుడు జ్ఞాపకం చేయండి ,అందరికీ తలోపెట్టీ తెచ్చేస్తాను అనేవారు. 
       రోజూ ఆలస్యంగా లేచే వాళ్ళం నాన్న అనకాపల్లో, రాజమండ్రియో,కాకినాడో వెళుతున్నారన్న విషయం తెలిసి, నాన్న ఐదుగంటలకే ఫస్టుబస్ కి బయలుదేరుతుంటే,కళ్ళునులుముకుంటూనిద్రమంచంనుంచి లేచివచ్చి,"నాన్నా!పుస్తకాలపెట్టెలు అని అడగడం,బలే గుర్తుచేశారమ్మా!తప్పకుండా తెస్తానని నాన్న భరోసాగా అనడం,పిల్లలందరూ కొండంత సంబరపడడం, రాత్రి ఆఖరి బస్సులో పదిగంటలకు వచ్చేటప్పుడు నాన్న పెట్లు తెచ్చేస్తారని ఆరాటంగా  నిద్రమానుకొని ఎదురుచూడడం,నాన్న సంగతి ముందే తెలుసుకనుక "వెళ్ళిపడుకోండి.పెట్లు తెస్తే ఎక్కడికి పోతాయి?.పొద్దున్న చూసుకొందురుగాని"అమ్మ అదిలించడం,నిద్రముంచుకొచ్చినవాళ్ళు నిరాశగా వెళ్ళి పడుకోవడం,ఆశాజీవులు నిద్రనాపుకొని కళ్ళుకాయలు కాసేలా నాన్నకోసం ఎదురుచూసి,నాన్న వచ్చినా పెట్టెలు రాలేదని బిక్కమొఖం వేయడం,"పనుల హడావాడిలో పడి మరచిపోయేనమ్మా! మళ్ళీ వేళ్ళినప్పుడు తప్పకుండా తెస్తానని నాన్న చెప్పినప్పుడు,ఆశా నిరాశల మధ్యన ఊగులాడుతూ,ఆరాత్రి నిద్రలో తళతళలాడుతూ మెరిసిపోతూ,బడబడమని చప్పుడుచేసే సిల్వర్ పెట్టిలో పుస్తకాలతో బడిలోకెళ్ళుతున్నట్లు కలలుగంటూ పడుకొని ఉదయం లేవగానే , బడి టైముకి మామూలుగా మడతమంచంగుడ్డలసంచీలని భుజానికి తగిలించుకొని హుషార్ గా బడికి పరుగో పరుగుతీయడం మరచపోలేని జ్ఞాపకాలవా..మేమూ ఏదోరోజు పుస్తకాల పెట్టెలతో బడికి వెళ్ళకపోతామా అన్న ఆశ మా వాళ్ళనందరినీ ఐదో తరగతి దాటించేసి,ఆపైన పుస్తకాల పెట్టెలతో పనిలేకుండా చేసింది. మాబడినీ, మాఊరినీ పైచదువులకు పట్నం చేర్చెసింది.

            సత్యవాణి కుంటముక్కుల
        8639660566
 సత్యవాణి కుంటముక్కల: వడ్లగింజలో బియ్యంగింజ 

               ------
   
     "'ఒరేయ్ అబ్బాయ్ !నేను రేపు ఉదయాన్నే మన ఊరికి వెళ్ళదలచుకొన్నాను "అన్నారు ఆనందరావుగారు.
                    ఉరమని పిడుగులాంటి తండ్రి మాటకు అదిరి పడ్డాడు శ్రీనివాస్ .
                  ఏంజరిగిందంటూ కళ్ళతోనే లతను ప్రశ్నించాడు అతడు.
          ఏమో! అన్నట్లు లత భుజాలు కదిపింది.
                      '"వినపడిందా !నేను ఉదయాన్నే బయలుదేరతాను.మీరు అప్పటికి లేవరని ఇప్పుడే చెపుతున్నాను." ఇంక చెప్పవలసినది లేనట్లు అక్కడనుండి లేచి గదిలోకెళ్ళిపోయిన తండ్రివంక
అయోమయంగా చూసేడు శ్రీనివాస్ .
         రాత్రి గదిలోకి రాగానే ప్రశ్నిచాడతడు భార్యను '"మనవల్ల ఏదైనా తప్పు జరిగిందంటావా?
నువ్వు పొరపాటుగా ఏమైనా అన్నావా ?"అని భార్యను ప్రశ్నించాడు శ్రీనివాస్ .
                 '"నేనేమంటానండీ!అయినా ఆయన అనిపించుకొనేలాంటి మనిషా! ఎవరికీ ఏమాత్రం బాధకలిగించకుండా చక్కగా ప్రవర్తిస్తారు.చేతనైన సాయం చేస్తారు. ఇయన వచ్చిన ఈ పదిరోజులనుండీ ప్రాణానికి సుఖంగా వుంది.తెల్లారి పాలుతేవడం,తెల్లారకుండా వచ్చే నీళ్ళుపట్టడం,బాబిగాడిని స్కూలుకి తీసికెళ్ళడం,తీసుకురావడం,ముఖ్యంగా నేను ఆఫీసునుండి వచ్చేలోపు ముందుగా వచ్చెే బాబిగాడు ఏం పెత్తనాలు చేస్తున్నాడో అనే బెంగలేకుండా హాయిగా వుంది."
మావగారిచ్చే కోపరేషన్ ఏకరువు పెట్టింది లత.మావగారు వెళ్ళిపోతే కలిగే బాధ తనకే అన్నట్లుంది,
ఆమె మాటల్లో.
"ఆయన గదికి వెళ్ళి
అసలు ఏంజరిగిందో కనుక్కోండి"  అంది లత.ఉండి పోవడానికే వచ్చేనన్నమనిషి వారంరోజుల్లో
తిరిగి వెళ్ళిపోతానంటున్నారంటే ఏదో జరిగింది.
            అమ్మపోయాకా రమ్మన్నా రానన్న మనిషి తనంత తానుగా ఉండిపోవడినికే వస్తున్నానంటే ,శ్రీనివాస్ లత చాలా సంతోషించారు.ఆపల్లెటూళ్ళో ,లంకంత ఇంట్లో,పెద్దవయసులో
ఒక్కరూ వుంటున్నారన్న దిగులుపడేవారా భార్యాభర్తలు.
                 '"వెళ్ళండి వెళ్ళి విషయం ఏమిటో కనుక్కోండి,
తెల్లారాయన బయలుదేరాకా ఆపటం బాగుండదు. ఆయన ఆగరు కూడా '"మావగారి గదిలోకి శ్రీనివాస్ ని తరిమింది లత.
       శ్రీనవాస్ తండ్రి మంచంపై కూర్చొని, '"ఏం నాన్నా! ఎందుకు కోపం వచ్చింది?నేనేనా ,లతేనా మీ మనసు బాధించేమా?
ఉండిపోయేలా వచ్చేరని, ఇంట్లో పెద్దదిక్కుగా వుంటున్నారని సంతోషపడుతుంటే, మీ ఈ నిర్ణయంతో నేనూ లతా చాలా బాధపడుతున్నాం.తప్పు జరిగితే చెప్పండి నాన్నా!దిద్దుకుంటాం ప్లీజ్ !'"తండ్రి చేతులు పట్టుకు అడిగాడతడు.
             " మీరు తప్పుచేయడమేమిటిరా! మీ మొఖం.నాకోడలు అసలు చెయ్యదు.ఇంక నేను వెళ్ళడానికి కారణం అంటావా,
అక్కడ అమ్మ పోయాకా ఒంటరినన్న దిగులు నన్ను వేధిస్తోంది .కానీ మీరు ఎన్ని సార్లు రమ్మన్నా రాకపోవడినికి కారణం మీకు అడ్డమౌతానేమో
అనితప్ప వేరే కారణం లేదు. నా ఒంటరితనం బాధను చూసిన స్నేహితులు 
బంధువులు 'ముత్యాల్లాంటి కొడుకు కోడలు, రత్నంల్లాంటి మనవడిని పెట్టుకొని ఇక్కడ ఒంటరినని బాధ పడడం ఎందుకు?కొడుకింటికి వెళ్ళి హాయిగా మనవడితో కాలక్షేపంచెయ్యి అని అడగకుండానే సలహాలిస్తుంటే,బయలుదేరొచ్చేను. కానీ ఇక్కడకి వచ్చినా నా ,ఉదయం రెండుగంటలు ,సాయంత్రం పదినిముషాలు తప్ప నేను చేసేదేమీ లేదు.మీకా ఆఫీసులు
హడావిడి,బాబిగాడికా సాయంత్రం వచ్చినప్పటినుండి
టీ .వీ తప్ప వేరే లోకంలేదు.వాడికి ఎన్నో కథలూ కబుర్లూ చెపుదామనుకొంటే,వాడితో మాటలే వుండటంలేదు.వాడికి
ఆ టీ.వీ,ఫోనూ తప్ప తాతయ్య అఖ్ఖర లేదు,మీకా పగలంతా ఆఫీసులు, ఆఫీసునుంచొచ్చేకా లాపుటాపులు."చిన్నపిల్లాడిలా ఉక్రోషంగా మాట్లాడుతున్న తండ్రిని చూస్తే ఆయన బాధ అర్థమైయ్యింది శ్రీనివాస్ కి .
                 '"నాన్నా! మీ బాధ అర్థమైయ్యింది .రేపటి నుండి మీ మనవడు మీతో కాలక్షేపం చేస్తే చాలుగా,మీరు ఊరికి వెళతానని ఇకపై అనరుగా?'అలాగే మేముకూడా వీలున్నంతవరకూ  లాపుటాపుల్ని పక్కనవుంచడానికి ప్రయత్నస్తాం. సరేనా?మీరు వెళతానని అనరుకదా!"అడిగాడు కొడుకు.
"అంతే అంతే "అన్నట్టు  తలవూపారు ఆనందరావుగారు.
                   తండ్రి గదిలోంచి బయటకు వస్తూనే టీ.వీ కనెక్షన్ తీసేసి ,రిమోటు అటకమీదకు విసిరేసి శ్రీనివాస్ ,హాయిగా నిద్రపోతున్న కొడుకు బుగ్గపై ముద్దు పెట్టుకుంటున్న భర్తను
 "ఏమన్నారు మావగారు?" అని అడుగు తున్న భార్యకి  ఏమీ లేదోయ్ 'వడ్లగింజలో బియ్యపుగింజ''అన్నభర్త మాటలకు
అయోమయంగా చూసింది లత."ఏమైతే నీకెందుకు" నాన్న ఇక వెళ్ళరులే "అన్న మాటలు
ఆమె చెవులకు విందు చేశాయి. "హమయ్య!" అని హాయిగా నిట్టూర్చి నిద్రలోకి జారుకొంది లత.కొడుకుకి ఫోను అందకుండా చేయడంగురించి ఆలోచనలోపడ్డాడు శ్రీనివాస్.

               సత్యవాణి
                కాకినాడ
 రామాయణానుభవం.....2

త్రేతాయుగం  నడుస్తోంది. వాల్మీకి మహర్షి ఆశ్రమం. ప్రశాంత మైన వాతావరణం.
తపో భూమి.
వేదాధ్యయన తత్పరుడు, తపసంపన్నుడు అగు నారదమహర్షి వాల్మీకి ఆశ్రమానికి విచ్చేశాడు. 

ఆ మహర్షిని పూజ చేసి వాల్మీకి ఈ లోకం లో  ఈ కాలం లో గుణవంతుడు ఎవడు.?
వీర్యవంతుడు ఎవడు?
ధర్మజ్ఞుడు,కృతజ్ఞుడు,సత్యవాక్యుడు,దృఢవ్రతుడును ఎవ్వడు?
చారిత్రము తో కూడుకొన్నవాడు ఎవడు?
సర్వభూతములయందు హితుడెవ్వడు?
విద్వాంసుడెవ్వడు?
సమర్థుడెవ్వడు.?
ఏకప్రియదర్శునుడుఎవడు?
ద్యుతిమంతుడు,అసూయలేనివాడు ఎవ్వడు?
కోపము వచ్చినచో దేవతలైనను భయపడుదురో అట్టి నరుడెవ్వడు?
అని 16 గుణాలను సంబందించిన ప్రశ్నలను గూర్చి తెలిపి సమాధానము వినగోరుతున్నాను అని వాల్మీకి తెలిపెను.

సమాధానము గా నారదుడు ఓ మహర్షి..!
నీవు ప్రశ్నించిన గుణముల పరంపర అంతా ఒకే చోట వుండటం దుర్లభం ......కానీ ఇప్పుడు ఇక్ష్వాకు కులమున జన్మించిన  వాడు రాముడు అను పేర జనుల చే పిలుచు కొనువాడు లో అన్ని గుణాలతో పాటు ఏ ఒక్క చెడు గుణము లేని వాడు గా ఉన్నాడు....
అనిచెబుతూ రామాయణ గాథను మొత్తం సంక్షిప్తం గా ,పొడి పొడి, గా  ఉపదేశాత్మకం గా, నారదుడు అందించాడు.

ఇదం పవిత్రం పాపఘ్నం
పుణ్యం వేదైశ్చ సమ్మితం ౹
 యః పఠే ద్రామచరితం
సర్వపాపై: ప్రముచ్యతే౹౹

పాపములను నశింపచేయునది, పుణ్యమైనది,వేదములతో సమానమైనది ఈ చరిత్ర,
ఎవడు చదువుతాడో,తెలుసుకుంటాడో, అతడు సర్వపాపములనుండి విముక్తి చెందుతాడు  

ఈ చరిత్ర ఆయుష్యకరమైనది,సత్యమైనది, నిత్యం చదువు మానవుడు పుత్రుడు పౌత్రులతోడ బంధు సమూహములతో కూడి జీవనం గడుపుతాడు, శరీరం పడిపోయినతరువాత పరమపదము చేరును. అని తెలిపి
నారదుడు  ప్రయాణమయ్యెను.

సంక్షిప్తం గా తెలిపిన ఈ రామచరిత్రను సంక్షిప్త రామాయణం గాను, బాల రామాయణం గానూ, మూల రామాయణం గాను, ప్రసిద్ధి.
నిత్యపారాయణ యోగ్యం.

      ......సశేషం......

చక్కెర తులసీకృష్ణ.
 ఆత్మస్నానమూ అవసరమే

శరీరం మీది దుమ్మూ ధూళిని నీటితో శుభ్రపర్చుకోవడమే 'స్నానం' అంటాం. ఉదయం 4-5 గంటల మధ్య చేసేది 'రుషి స్నానం'గానూ, 5-6 గంటల మధ్య చేసే దాన్ని 'దైవస్నానం'గాను విజ్ఞులు పేర్కొంటున్నారు. ఈ సమయాలు దాటి సూర్యభగ వానుడు నడినెత్తికొచ్చినపుడు చేసేది రాక్షసస్నానమే. స్నానానంతరం సూర్యభగవాను డికి నీటిని సమర్పిస్తూ అంజలి ఘటించడం ఆచారం. ఆ పరమేశ్వరుడు కూడా అభిషేక ప్రియుడు. జలంతోనే తృప్తిపడే సాదాసీదా తత్వం 'శివతత్వం'. ఆడంబరాలు తక్కువ. తెలిపే విషయం ఎక్కువ. ఏదీ స్థిరం కాదు, ఏదీ శాశ్వతం కాదు, లింగంపై పడిన జలధార కిందికి జారిపోతుంది. శివతత్వ సారమిదే.

చన్నీటి స్నానం బద్ధకాన్ని పోగొడుతుంది. వేడినీటి స్నానం శరీరానికి మర్దనగా ఉపయోగపడుతుంది. చన్నీటి స్నానాన్ని తలనుంచి, వేడినీటి స్నానాన్ని పాదాలనుంచి ప్రారంభించాలని పెద్దలు చెబుతారు. మంత్రా లను చదువుతూ స్నానం చేస్తే అది మంత్ర స్నానమై శరీరానికి 'శక్తి'నిస్తుంది. మనసులో దైవాన్ని స్మరిస్తూ చేసేది 'మానస స్నానం'. దీన్ని రుషులు- సంప్రదాయ వాదులు ఆచరిస్తారు. కొన్ని చెట్లు పెరిగేచోట నుంచి, పవిత్ర ప్రదేశాల నుంచి మట్టిని సేకరిస్తారు. దాంతో స్నానం చేస్తే అది 'మృత్తికా స్నానం' . చెట్ల ఔషధ గుణాలు, భూమిలోని ఖనిజాల శక్తి శరీరానికి పడుతుంది. తద్వారా అనేక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుంది. మునీశ్వరులు దీన్ని పాటించేవారు.
గోధూళిని దేహానికి పట్టించడాన్ని 'వాయువ్య స్నాన'మనీ, విభూది పూసు కోవడం ద్వారా శివుడికి చేరువవడాన్ని 'భస్మ స్నాన'మనీ చెబుతారు. స్నానం చేయగల స్థితిలో లేని వృద్ధులు, రోగులకు తడివస్త్రంతో దేహాన్ని శుభ్రం చేయడాన్ని 'ఆఘమర్షణ స్నానం' అంటారు. ఎండాకాలంలో కురిసే వర్షంలో చేసేది- దివ్యమైన స్నానం.

ఈ స్నానాలన్నీ శరీరానికి ఉద్దేశించినవి. శరీర స్నానం ఎవరికి వారు చేయవచ్చు. వేరొకరికి చేయించవచ్చు. తొలి- అంతిమ స్నానాలు మానవ ఎరుకలో లేనివి అన్న విజ్ఞుల మాటలు వాస్తవాలు.

కానీ మనసుకి పట్టిన మురికి ఎలా తొలగుతుంది? శారీరక స్నానంతో పాటు, అంతర్గత స్నానం కూడా అవసరమే. ఎవరికి వారే చేసుకోవాల్సిన ఆ స్నానాన్ని 'ఆత్మస్నానం' అన్నారు. ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది- 'బుర్ర'ని బుట్టగా భావించి మంచి ఆలోచనలనే పువ్వులనే అందులో వేసుకున్నప్పుడు. చెత్త ఆలోచనలతో, దిగజారుడు మాటలతో బుర్ర బుట్టను నింపుకొంటే, దుర్గంధమే తప్ప సువాసనలెలా వస్తాయి? మనసులోకి ఏ చెత్తా చేరకుండా జాగ్రత్తపడాలి. తాజా పరిమళాల పుష్పాలను అందులో నింపగలగాలి. ఇది కళ్లు మూసుకుని శ్వాసను గమనిస్తేనే సాధ్యపడుతుందని గ్రహించాలి. అప్పుడే మనం ఆలోచనారహిత స్థితి పొందగలం. అదే అద్భుతమైన 'ధ్యానం'. ఆత్మ స్నానమాడే సందర్భం. అప్పుడే బుద్ధి వికసించి, 'మనసు' సాధకుడి నియంత్రణలోకి వస్తుంది. ఇది పాటిస్తే జగతికి శుభమస్తు.
 అనుభవ జ్ఞానం

ఎన్నో రకాల ఆకర్షణలు చుట్టూ ఉండి మనిషిని తమవైపు లాక్కునే ప్రయత్నం చేస్తుంటాయి. లౌకికమైన ఆ కోరికలను సాధనాబలంతో తగ్గించుకోవాలి. అలాకా కుండా, మొండిగా ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఎలాగంటే... 'వలలో చిక్కుకున్న పక్షి బయటపడే ప్రయత్నంలో అటూ ఇటూ గింజుకుంటే, వల తాళ్లలో ఏదో ఒకటి దాని మెడకు బిగిసిపోతుంది. అప్పుడు విడుదల కావడం మాట అటుంచి, మరణం సంభవించినా ఆశ్చర్యపడక్కర్లేదు' అంటారు స్వామి రమణ మహర్షి.

జ్ఞానం వచ్చేదాకా కష్టాలు పడక తప్పదు. కానీ సాధన ఆపకుండా చేస్తే, కొన్ని సుళు వులు సాధకుడికి లభిస్తాయి. వాటినే పండితులు అనుభవజ్ఞానం అన్నారు. ఆధ్యాత్మిక సాధన పట్ల అనురక్తి అనుభవ జ్ఞానానికి దారిచూపుతుంది. కొలిమిలో ఇనుము ఎర్రగా కాలినా బయటికి తీయగానే అది సహజమైన నల్లరంగును గట్టితనాన్ని సంతరించుకుంటుంది. అలాగే తీర్థ యాత్రలు చేసినా, ప్రవచనాలు విన్నా కలిగే లాభం తాత్కాలికమే! అనురక్తి లేని మనసుతో చేసే ప్రయత్నాల వల్ల ప్రయో జనం అంతంత మాత్రమేనంటారు విజ్ఞులు. కాల్చిన ఇనుప కడ్డీ మీద ఆ ఎరుపు తగ్గక ముందే సమ్మెట పోటు వేస్తే, కావాల్సిన ఆకృతిని సంతరించుకుంటుంది. అలాగే తీర్థయాత్రలు, భగవత్ కథాశ్రవణం వంటి పవిత్ర సాధనలు చేస్తున్నప్పుడే ఇహలోక సంబంధాలను ఒక్కొక్కటిగా విడిచి పెట్టడానికి ప్రయత్నించాలి. అది ఎలా పనిచేస్తుందంటే... పుల్ల చిన్నదైనప్ప టికీ అగ్నిలో వేస్తే కాలిన కొద్దిక్షణాల్లోనైనా నెగడును మండే స్థితిలో నిలుపుతుంది. అలా ఒక్కో పుల్లకు మరో పుల్ల కలిస్తే మహా జ్వాల ఏర్పడుతుంది. అలాగే ఆధ్యాత్మిక అనురక్తికి జ్ఞానతృష్ణను జోడిస్తే సాధకుడు సిద్ధి పొందుతాడు. తీరుతెన్నులు, ప్రాబల్యం, వైశిష్ట్యంతో పాటు తానేమిటో, సృష్టి వైచిత్రి ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేస్తే దాన్ని ఆత్మవిచారణ అంటారు. అలా ఆత్మవిచారణ చేసి జ్ఞానాన్ని సంపాదిస్తే వైరాగ్యం కలిగి ముందుకు సాగుతారు. ఆ ప్రయత్నంలో 'నేను శరీరాన్ని కాదు, ఆత్మను' అని గ్రహించగలుగుతారు. అలాంటివా రికి పరమాత్మ తత్వం సులభంగా బోధపడుతుంది. అన్నింటా పరివ్యాప్తమై ఉండేది ఆత్మేనని, అందరిలో లాగానే తనలోనూ ఆత్మ ఉందని, అదే శాశ్వతమైన పరమాత్మ స్వరూపమని గ్రహించగలుగుతాడు సాధకుడు. తద్వారా తాను భగవంతుడికన్నా
భిన్నం కాదనే స్థితికి వస్తాడు. అదే 'అహం బ్రహ్మస్మి' అనే స్థితి. భగవద్దర్శనం, మహాత్ముల సూచనలు పాటించడం, అనవసర విషయాల జోలికి పోకపోవడం లాంటివి చేస్తే ఆధ్యాత్మిక పురోగతి, తద్వారా భగవదనుగ్రహం కలుగు తాయి. అలా అనుభవజ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానం సాధకుడికి ఒక్క క్షణంలో లభించే వస్తువు కాదు. ఒక్కొక్క రూపాయి పొదుపు చేసి లక్షలు కూడబెట్టినట్లు సాత్వికానుభవంతో జ్ఞానం ప్రతిక్షణం ప్రవర్ధమానమవుతుంది. అలా పొందిన అనుభవ జ్ఞానానికి మించింది లేదు. దాని బలంతో సాధించలేనిది లేదు.

గోపాలుని రఘుపతిరావు
 క్రమ సంఖ్య  11/2026
తేది 02/02/2026

*కళావతి వాటా (క‌థ‌)*

by -బి.హరి వెంకట రమణ
     
     ‘మా అక్క రమ్మందమ్మా రెండు మూడురోజులు వాళ్ళింటికి వెళ్ళొస్తాను అంది ‘ కళావతి చిన్నకోడలితో.

          దేనికి ? ఎందుకు ? అనలేదా పిల్ల. విన్నా విన్నట్టుగానే వుండి తలగడాలకున్న గలేబీలు మారుస్తూ వుంది.

          ఆ తరువాత ఆడుకుంటున్న చిన్నదాన్ని తీసుకెళ్లి స్నానం చేయించి, తాను తయారయ్యి బండి మీద ఆఫీసుకు వెళ్ళిపోయింది.

          ఇంట్లో చిన్నది, తను మిగిలిపోయారు. పెద్ద పిల్లాడి స్కూలు పొద్దున్నే కాబట్టి కొడుకు స్కూలు దగ్గర దిగబెట్టేస్తాడు.

          కొడుకు మధ్యాహ్నం వొచ్చి భోజనం చేసి చిన్నదానితో ఆడుకొని వెళ్ళిపోతాడు. అంతవరకూ టీవీ చూడటం, పిల్లతో కాలక్షేపం, దానికి ఆకలేస్తే అన్నం పెట్టడం, ఇవే తనకు మిగిలిన పనులు.

          కాసేపు ఆడుకుని  చిన్నది పడుకుండి పోయింది.

          టీవీ పెట్టింది కానీ కళావతి ఏమీ బాలేనట్లు అనిపించాయి, కట్టేసి కాసేపు బయటకు చూడటం మొదలుపెట్టింది.

          జనం రోడ్డంట వెళ్తా వున్నారు.  వాళ్ళు స్వేచ్చగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా ? సంతోషంగా ఉన్నారా ? చెప్పడం కష్టం అనుకుంది.

          స్వేచ్ఛ ముఖ్యమా ? సమయానికి భోజన సదుపాయం ముఖ్యమా ? అర్ధం కాలేదామెకి.

          పెద్ద కొడుక్కి ఫోన్ చేసింది, అతను డ్యూటీలో ఉంటే తీయడు, కానీ బయట డ్యూటీ పనిమీద తిరిగితే తీసి మాట్లాడతాడు. ఫోన్ తీయలేదు.

          కూతురికి చేస్తే తీసి మాట్లాడుతుంది గాని. కయ్యి.. మని ఎగురుతుంది, ఇద్దరు కొడుకులూ కోడళ్ళు చేసిన పని గుర్తొచ్చి.

          కళావతి భర్త మూడేళ్ళ క్రితం చనిపోయాడు, ఆయన బతికుండగా ఊపిరి తీసుకోలేనంత పని, వ్యవసాయం, అది సరిపోక ఇంటిదగ్గర చీపుర్లు తయారు చేయడం, కొబ్బరి తాళ్లు అల్లడం. వాటికి పనివాళ్ళు వాళ్ళకి రోజువారీ కూలీ, వొచ్చే పోయి జనాలకి భోజనాలు, టీలు.

          ఇవికాక సాయంత్రం అయ్యేసరికి భర్తకి నీసు కూరలు కావాలి, ఆ చేపలు, రొయ్యలు చేసేసరికి ఒక్కోసారి బానే ఉండేది గాని చాలా సార్లు చిరాకు వొచ్చేసేది. బంధువులొస్తే ఇక భోజనాలే భోజనాలు, భర్తకి అందరూ ఇంటికి వొచ్చి భోజనం చేయాలి, కలిసి మెలిసి వుండాలని కోరిక. ఆయన కోరిక బానే వున్నా, ఇంట్లో కళావతికి బండెడు పని అయ్యేది.

          అయితే బయట పనివాళ్ళతో, వ్యవసాయంతో, వొచ్చే పోయి బంధుజనంతో చాలా కళగా , గౌరవంగా ఉండేది ఆ  పెంకుటిల్లు.

          తన చేతులతో పని వాళ్లకు డబ్బులు ఇప్పించేవాడు భర్త, బంధు జనానికి తన చేతుల్తో అన్నం పెట్టేది, బట్టలు పెట్టేది.

          ఒక రోజు భర్తకి గుండెల్లో నొప్పి , ఆయాసం అంటే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

          స్టెంట్లు వేయాలన్నారు, ప్రభుత్వ ఆసుపత్రిలో నేను చేయించుకోను నాకు భయం అని అతను అంటే ఇంటిమీద అప్పుచేసి చేయించారు.

          ఆరునెలల తరువాత ఒక రోజు నిద్రలోనే అతను వెళ్ళిపోయాడు.

          కళావతి జీవితం ఒక్కసారి  తల్లకిందులయిపోయింది, ఇలా అయిపోతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు.

          పదకొండో రోజు తరువాత  ‘నేను హైదరాబాద్ లో వున్నాను కదా, అన్నయ్య దగ్గరే వుండు, కొన్ని రోజుల తరువాత తీసుకెళ్తాను అన్నాడు చిన్నోడు..

          ఆ వెళ్లడం, వెళ్లడం తీసుకెళ్లడం ఏడాది పొయింది, తీసుకెళ్లలేదు.

          మీ నాన్న ఇంటిమీద తెచ్చిన అప్పు తీర్చి ఇల్లు నిలబెట్టుకోండ్రా అంది ఇద్దరి కొడుకులతో.

          వాళ్ళు మాకెందుకీ పాత ఇంటి లంపటం అని ఇల్లు అమ్మేసి వొచ్చిన డబ్బులు  చెరో సగం వాటా తీసుకున్నారు. తన పేరు మీద ఒక రెండు లక్షలు డిపాజిట్ చేస్తారేమో అని చూసింది కళావతి, కానీ ఆ ఊసు.. వుత్తాపం లేకపోవడంతో ఒకరోజు నోరు తెరిచి అడిగింది, చిన్నోడికేమో ఫోన్ చేసింది. ‘ ఇంకెక్కడి డబ్బులు నాన్న లాగే నాకు కూడా అప్పులున్నాయి, అన్నీ తీర్చేసాను, పది పైసలు కూడా లేవు నా దగ్గర ‘ అన్నాడు.

          పెద్దోడిని అడిగితే ‘ నాదీ అదే పరిస్థితి, పైసా లేదు ‘ అన్నాడు.

          ఆ తరువాత ఆడపిల్ల ఎక్కడ వాటాకి వొస్తాదో అని పొలం కూడా ఆగమేఘాల మీద అమ్మేశారు. అప్పుడు కూడా అడిగింది ‘ ఒరే నా పేర కొద్దిగా డబ్బులు డిపాజిట్ చేయండ్రా ‘ అని.

          పోనీలే చేద్దామని అనుకున్నారు ఇద్దరూ,

          ‘ మీకేమైనా మతి పోయిందా మీ అమ్మ ఆ డబ్బులు తిన్నగా వుంచుద్దనుకుం టున్నారా ? కూతురికి పోస్తుంది, ఇప్పటికే ఆ పిల్లకి కట్నం, పొలం ఇచ్చారుగా ఇంకేమిస్తారు ? అలా చేయనీయకండి, అయినా మనం లేమా కడదాకా కళ్ళల్లో పెట్టి చూసుకోము ?’ అన్నారు కోడళ్ళు.

          ఆ డబ్బులు మళ్ళీ కూతురికి గానీ ఇచ్చేస్తాదేమో అని ఇద్దరూ ‘ ఎన్నాళ్ళు ఒకరి దగ్గర పనిచేస్తాము ? వ్యాపారం పెట్టుకుంటున్నాను, ఈ  డబ్బులు సరిపోవు, బ్యాంకు అప్పు కూడా చేస్తున్నాను అన్నారు. ఒకరి తరువాత ఒకరొచ్చి.

          కళావతికి వివరం బోధపడింది, అంటే ఇక డిపాజిట్ వేయడం కుదరదన్నమాట. ఇక మిగిలింది భర్త చేయించిన గాజులు, మూడుపేటల గొలుసు. ఇవ్వయినా జాగ్రత్తగా ఉంచుకోవాలి కడ వరకు అనుకుంది.

          కొన్నాళ్ళకి ఇద్దరి వ్యాపారాలు ఏమయ్యాయో తెలీదుగాని ఉద్యోగాలకి వెళ్లడం మొదలెట్టారు. చిన్నోడు కూడా హైద్రాబాదు నుంచి వొచ్చేసి ఊర్లోనే పనిచేయడం మొదలెట్టాడు, స్థలం కొని ఇల్లు కడ్తున్నాడని వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, కానీ తనకు చెప్పలేదు, పోనీలే శుభకార్యం కదా బోడి దానికి చెప్పడం ఎందుకు అనుకున్నాడేమో అని సరిపెట్టుకుంది.

          అన్నిటికన్నా సంతోషం బిడ్డలిద్దరూ ఒకే వూర్లో వుంటున్నారు, ఎప్పుడంటే అప్పుడు చూసుకోవొచ్చు అనుకుంది.

***

          చిన్నది నిద్రలేచి ఏడుస్తుంటే దానికి చారుబువ్వ పిసికి అన్నం పెట్టింది, ఆ తరువాత కాసేపటికి చిన్నకొడుకు వొచ్చాడు వాడికి భోజనం పెట్టాక. ‘రేపు నన్ను అన్నయ్య ఇంటికాడ దిగబెట్టే బాబా, రేపటితో మీ టయిము అయిపొయింది, వొచ్చే రెండు నెలలు అక్కడ ‘ అంది.

          చిన్నోడు ఫోన్ చూసుకుంటూ ‘ నాకవ్వదు .. పొద్దుట మీ కోడలు దిగబెడుతుంది, బట్టలు సర్దేసుకో ‘ అన్నాడు.

          ‘సర్లే గానీ ఆ గొలుసు ఒకసారి ఇయ్యి కొంచెం అర్జెంటు డబ్బు అవసరం పడింది, అన్నయ్యకు కూడా ఏమీ చెప్పకు, వారం లో తెచ్చేస్తాను’ అన్నాడు.

కళావతి ఏమీ మాట్లాడకుండా భర్త ఫోటో దగ్గరకు వెళ్లి చిన్నగా ఏడవటం మొదలు పెట్టింది. ‘ఎందుకయ్యా ఇలా చేసావు ? ఆఖరికి ఇంత బతుకు బతికి
ఇప్పుడు గవర్నమెంటు ఇచ్చే పింఛనుకి రాయించారు నీ కొడుకులు, కోడళ్ళు’ అని ఫొటోలో వున్న భర్తని అడిగింది.

అప్పటికే కొడుకు బయటకు వెళ్లిపోవడం వలన వాడికీ మాటలు వినపడలేదు. చిన్నది నానమ్మ ఏం మాటాడుతుందో అర్ధం కాక అలా చూస్తూ ఉండిపోయింది చేతిలో బొమ్మ పట్టుకుని.

***
.

          ఆరోజు పొద్దున్న నెల వాటాల ప్రకారం పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటుంది కళావతి. బయట ఆటో చప్పుడయింది.. అక్కడకు పాతిక కిలోమీటర్ల దూరాన ఉంటున్న కళావతి అక్క ప్రభావతి దిగింది ఆటో లోంచి.

రావడం రావడమే తుఫానులాగా ‘నీకంతా మంచేనే .. మనకు నాన్న గొడవల్లో ఉంచిన ఆస్తి వొచ్చింది’ అంది. అర్ధంకానట్లు అక్క వొంక చూస్తూ ఉండిపోయింది.

‘అదేనే నాన్న కొన్న స్థలం డాక్యుమెంట్లు లేక ఇన్నాళ్లు వేరే వాళ్ళ పరంలో ఉండిపోయాయి కదా ?ఇప్పుడు దాని లింకు డాక్యుమెంట్లు, అసలు పత్రాలు దొరికాయి..ఇంక మిగతా పనులు చూడాలి పద ఆటో ఎక్కు’ అని చిన్న కోడలు వైపు తిరిగి’ అలా చూస్తూ నుంచుండు పోకే.. వెళ్లి మీ అత్త లగేజీ ఆటోలో పెట్టు’ అంది.

‘నేను రానా పెద్దమ్మ’ అన్నాడు కళావతి చిన్న కొడుకు.

‘నీకెందుకు రా.. మీ డ్యూటీ లు మీరు చేసుకోండి.. మీ అమ్మ వాటా సరిగ్గా దాని పేరునరాసే పూచీ నాది , మీరు మీ పనులు చేసుకోండి.’ అని. లగేజీ ఆటోలో పెట్టి వొస్తున్న కోడలితో’ వొస్తాను ‘ అని చెప్పి కళావతిని తీసుకుపోయింది.

ఈ విషయం మధ్యాహ్నానికల్లా పెద్ద కొడుక్కి తెలిసిపోయి డ్యూటీ మానేసి వాడు పెద్దమ్మ దగ్గరకు వొచ్చేసాడు.

‘కొత్తగా ఈ భూమేమిటి పెద్దమ్మా’ అన్నాడు.

‘అదో గొడవరా.. ముప్పైఏళ్ళ కిందటి నుంచి నలుగుతోంది, మనకి ఆశలు లేక ఏనాడు మీకు చెప్పలేదు’ అంది.

ఒక నెలరోజుల తరువాత పిల్లలు లేకుండా పెద్ద కొడుకు, కోడలు, చిన్న కొడుకు కోడలు కారు కట్టించుకొని ప్రభావతి ఇంటికి వొచ్చేసారు.

‘ఏమిరా నాయనలారా ?’ అంది ప్రభావతి.

‘అమ్మని ఇంటికి తీసుకెళదామని’ అన్నాడు చిన్నోడు.

‘అవును పెద్ది’ అన్నాడు పెద్దోడు.

మధ్యాహ్నం భోజనాలయ్యాక, ‘ ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు ఇచ్చేయి పెద్ది.. మా
దగ్గర జాగర్త చేస్తాంలే’ అన్నాడు చిన్నోడు.

‘హా.. అరె చెప్పడం మర్చిపోయాను, కాగితాలు నా దగ్గరే ఉంటాయి, దానికి ఏమీ ఉంచకుండా ఆర్పేశారు కదా , మీకు ఇవ్వడం కుదరదు’ అంది ప్రభావతి.

ప్రభావతికి కూడా భర్త పోయాడు, స్వంత ఇల్లు లేదు గానీ భర్త పెన్షన్ దండిగా వొస్తుంది, అందుకని విడిగా ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుంది, కూతురు పక్క వీధిలో ఉంటుంది, రోజూ అన్నం, కూరలు, టిఫిన్ అక్కడనుంచే వొస్తాయి, పెన్షన్లో డబ్బు సగం దాచుకొని, మిగతాది కూతురికి ఇస్తాది.

‘ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చేస్తే మంచిది కదా’ అన్నాడు పెద్దోడు.

‘చూడండిరా మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు, రిజిస్ట్రేషన్ పేపర్లు నా దగ్గరే ఉంటాయి, మీ అమ్మ వాటా ఇప్పుడు అమ్మితే ముప్పై లక్షలు వొస్తాయి, అదమ్ముతానంటే నా కూతురు కొనుక్కోడానికి రెడీ గా వుంది’ అంది.

ఆమ్మో ముప్ఫైకే ఇప్పుడిక్కడ యాభై పలుకుతుంది కదా అని అనుకొనిపెద్దమ్మ సంగతి తెలిసిన మగ పిల్లలు, కోడళ్ళు మారు మాట్లాడకుండా కారు దగ్గర కెళ్ళిపోయారు.

అక్కడ వరకు వెళ్లిన ప్రభావతి ‘చూడండిరా అదెలాంటి బ్రతుకు బ్రతికింది, దాన్ని ఆఖరుకి రెండేసి నెలలు అన్నం పెట్టడానికి వాటాలేసేసారు, అందుకు బదులు దానికి ఎక్కడ ఎన్ని రోజులు వుండాలనిపిస్తే అక్కడ వుండే హక్కు ఇస్తే
బాగుండేది, ఏ నెల తక్కువ దానికి వొచ్చిందో ఈ దిక్కుమాలిన ఆలోచన ?లేక మీకే వొచ్చిందా?’ అంది.

కోడళ్ళు ముఖం మాడ్చుకొని వెళ్లి ఆ అద్దె కారు ఎక్కి కూర్చున్నారు. కాసేపటికి వీళ్ళు కూడా వెళ్లి అందులో కూర్చున్నారు.

‘పోనీవే.. నీ వాటా కోసం వాల్లే వొస్తారు , నేను చెప్పినట్టు వింటానంటే పంపుతాను, లేదంటే నేను తిన్న దాంట్లోనే వాటా పెడతాను నీకు’ అంది.
కారు వేగంగా అక్కడ నుంచి మాయమయిపోయింది.

ఆ దారమ్మట వెళ్తున్న కుర్రోడిని ఆపి ‘ బాబా కొద్దిగా మిరపకాయ బజ్జీలు తీ సుకురా నాయనా’ అని డబ్బులు చేతిలో పెట్టింది. బజ్జీలు వొచ్చాక చెల్లికి ఒక రెండు ఇచ్చి మిగిలిన వాటిని పర పరా కొరుకుతూ’ వాటాలేస్తారట వాటాలు మనశ్శాంతి లేకుండా చేశాను ఎదవలకి’ అంది.

‘మరి రిజిస్ట్రేషన్ ఆఫిసుకి వెళ్లి కనుక్కుంటేనో’ అంది కళావతి.

‘కనుక్కోనీయే అక్కడా మన మనుషులని ఇద్దరిని మాటాడి పెట్టాను , అబద్దాన్ని నిజం చేయమని’ అంది నవ్వుతూ బజ్జీ కారంగా ఉండటం వలన వొస్తుందో, మరెందుకు వొస్తున్నాయో ఆమె కళ్ళనిండా నీళ్లు వొస్తున్నాయి ఒక పక్క నవ్వుతున్నా సరే.

*****

🪻🍃💦🙏💦🍃🪻