Wednesday, October 2, 2024

 మూల శక్తుల ఆరాధన.............!!
మన మూలాలను మనకు గుర్తుచేసే మంచి సమయం పితృపక్షం. మొన్నటి పున్నమి తెల్లవారి పాడ్యమి నుంచి వచ్చే అమావాస్య వరకు పదిహేను రోజులూ మన వంశవృక్షాన్ని పెంచి పెద్ద చేసిన మాతృ-పితృ దేవతలంతా కొలువుదీరే విలువైన కాలం. ఆఖరి రోజు పెత్రమాసైతే సమస్త మూల శక్తుల ఆరాధనకు అద్భుత సందర్భం. ఈ సత్యం తెలిసిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ సత్సమ యాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

Base-energy

భారతీయ ధార్మికత అందరికంటే పెద్దపీట తల్లిదండ్రులకే వేసింది. ఎందుకంటే, వారు ప్రత్యక్ష దేవుళ్లు. మాతృదేవోభవ, పితృదేవోభవ.. ఆ తర్వాతే ఆచార్యుడైనా, అతిథి అయినా, ఆఖరకు మరే దేవతలైనా సరే. అందుకే, దేవతలకు పూజలు చేయకపోయినా ఫరవాలేదు కానీ, పితృదేవతలకు మాత్రం కోపం రానివ్వకూడదని, వారి శాపాలు మన పాలిట పాపాలై చుట్టుకుంటాయని పెద్దలు అంటారు. ఇందులోని నిజానిజాలు అనుభవజ్ఞులకే అర్థమవుతై.

ప్రతి దానికీ ఒక నిర్దిష్ట సమయం వున్నట్టే మరణించిన మన వంశోద్ధారకుల కోసమూ ఏడాదిలో భాద్రపద మాసం బహుళపక్షంలోని పదిహేను రోజులూ మహాలయ పక్షంగా వారికోసం కేటాయించారు. అసలు, పితృదేవతల పేర ఎందుకు శ్రాద్ధాలు, తర్పణాలు వంటివి చేయడం? మనిషి చనిపోయిన తర్వాత మరణకాండలు చేస్తే ఏమొస్తుంది? చేయకపోతే ఏమవుతుంది?? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు గరుడ పురాణంలో చాలా విశదంగా లభిస్తుంది.

మనిషి చనిపోయాక సదరు వ్యక్తి ఆత్మ ఇంకా బతికే ఉంటుందా? అంటే, దీనికి సమాధానం భగవద్గీతలోనే ఉంది. ఆత్మకు మరణం లేదని, అది దేహం నుంచి వేరు పడుతుందే తప్ప దానిని పూర్తిగా నాశనం చేసే శక్తి మృత్యువుకూ లేదని ఆత్మ సంయమన యోగం పేర్కొంది. కాబట్టి, ఎవరైనా (జీవులు) మరణించారు అంటే వారి భౌతిక శరీరం నిర్జీవమైందని మాత్రమే అర్థం. మరి, చనిపోయాక ఆత్మ ఏమవుతుంది? ఊర్ధలోకాలలో దాని ప్రయాణం ఎలా సాగుతుంది? అన్నవి నిజంగానే ఆసక్తికరం. మనం (జీవులు) చేసుకున్న పాపపుణ్యాలను బట్టి స్వర్గ నరకలోకాల యాత్ర ఉంటుంది. పునర్జన్మ లేకుండా చేసుకోగలిగినపుడే ఆత్మ పరమాత్మలో లీనమైనట్టు లెక్క. అదే మోక్షం.

మనిషి తన జన్మ పరమార్థాన్ని తెలుసుకోవడానికే కాక తమ వంశోద్ధారకుల ఆత్మశాంతికి, ఋణ విముక్తికీ పితృకర్మలను ఆచరించాలని ప్రాచీన ధర్మశాస్ర్తాలు చెబుతున్నాయి. జన్మనిచ్చిన వారి ఋణం జన్మజన్మలకూ తీరనిదని పెద్దలు చెప్తారు. అందుకే, ఋణానుబంధం అన్ని బంధాలకంటే ప్రబలమైందనీ అంటారు. కనుకే, మనిషి (పురుషుడు) బతికి ఉన్నన్నాళ్లూ పితృదేవతలకు శ్రాద్ధాలు పెడుతూ తర్పణాలు వదులుతూనే ఉండాలని అన్నారు. మరణతిథి తెలియని వారు ఈ పితృపక్షం పదిహేను రోజుల్లో ఏదో ఒకరోజు, ఇంకా ఈ పద్నాలుగు రోజులూ చేయలేని వారు కనీసం ఆఖరి రోజైన అమావాస్య నాడైనా తప్పనిసరిగా పెద్దల కర్మలను ఆచరించాలని వేద పండితులు నిర్ధారించారు.

అసలు, ఈ ఋణం ఎక్కడిది? అనుకుంటారు సాధారణ ప్రజానీకం. భౌతికంగా లేని వారి ఆకలిని తీర్చే పేరిట పితృకర్మలు ఆచరించడం మూర్ఖత్వం కాదా? పిండాలు చేసి నీళ్లలో వదిలినంత మాత్రాన, లేదా వాటిని ఆవులు, కాకులకు పెట్టినంత మాత్రాన, నువ్వులతో వాళ్ల పేర్లు చెప్పుకొని తర్పణాలు విడిచినంత మాత్రాన తీరని ఋణం ఎలా తీరుతుంది? అని ప్రశ్నించేవారూ ఉంటారు. నిజానికి పితృఋణం ఎప్పటికీ తీరనిదే. అయినా సరే, పితృకర్మలు వారి ఆత్మశాంతికి చేయాల్సిందేనని ధర్మశాస్ర్తాలు చెబుతున్నాయి.

పితృదేవతలు అంటే ఒక్క గతించిన వారు మాత్రమే కాదు, మొత్తం పితృదేవతా వ్యవస్థలోని వసువులు, రుద్రులు, ఆదిత్యులు వంటి దేవతలంతా పితృదేవతల స్వరూపాలేనని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడు అనడంలోనూ ఇదే తత్వం దాగి ఉంది. మగప్లిలలు లేనివారికి ఆడబిడ్డ కొడుక్కు అంతటి విలువ, అర్హతను ధర్మశాస్ర్తాలు కల్పించాయని అంటారు. అసలు మగ- ఆడ సంతానమే లేని వారు మరెవరినైనా దత్తత తీసుకొనే వీలు కూడా ఉంది. ఇదీ సాధ్యం కాని వారికి వంశంలోని ఎవరో ఒకరు ఇలాంటి ఏదో ఒక సందర్భంలో తర్పణాలు విడవడం ఖాయం. కాబట్టి, ఎటూ తద్దినాలు తప్పవు. తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నానమ్మ మొదలైన వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలన్నీ నేరుగా మళ్లీ పుట్టడమో లేక ఊర్ధలోక యానం చేయడమో చేస్తాయని పెద్దలు అంటారు. భూమ్మీద బతికి ఉన్నప్పుడు వారు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి ఇది నిర్ణయమవుతుందన్నది పురాణ కథనం.

ఆత్మ, పునర్జన్మ, స్వర్గం, నరకం, పాపం, పుణ్యం వంటివన్నీ నిజంగా ఉన్నాయా? అన్నది వారి వారి విశ్వాసాలను బట్టి నిర్ధారణవుతుంది. తాము మరణించిన తిథినాడు లేదా ఈ పితృపక్షం వేళ పితృవ్యవస్థలోని ఆత్మలన్నీ తమ వారసుల కర్మకాండల కోసం ఎదురు చూస్తాయని, ఇంకా వాయురూపంలో కానీ, మరే జీవుల రూపంలో కానీ వచ్చి తమ ఆకలి తీర్చుకొని వెళతాయన్నది ప్రగాఢ నమ్మకం. కర్ణుడంతటి మహాదానశీలికీ మూలశక్తుల ఆరాధన తప్పలేదంటే దీని విలువను అర్థం చేసుకోవచ్చు. అసలు, మొత్తంగా ఇవన్నీ ఆయా మనుషులను సక్రమమార్గంలో నడిపించడానికి ఉద్దేశించినవిగా అర్థం చేసుకోవచ్చు. గతించిన తమ వంశస్థులను గుర్తు చేసుకోవడానికి పితృపక్షాన్ని ఓ సరైన సమయంగా కూడా భావించవచ్చు. వారి జ్ఞాపకంగా మరే దానధర్మాలైనా చేయవచ్చు. నమ్మకం ఉన్నవాళ్లు తమ కోసమో లేదా తమ వాళ్ల కోసమో పాటిస్తే పోయేదేమీ లేదు. సదరు పిండాలలోని పదార్థాలు ఏవో జీవులకు ఉపయోగపడేవే.

పునర్జన్మల సారం

సాధారణంగా గరుడ పురాణమంటేనే ఎవరైనా చనిపోయినప్పుడు పనికట్టుకొని చెప్పించేదే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చదివేది, వినేది కాదని అనుకుంటారు. కానీ, ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయమేనని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఎలాగైతే, భగవద్గీత మానవుల వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే అద్భుత గ్రంథమని గుర్తించామో అలాగే, గరుడ పురాణాన్ని కూడా మన జన్మకు సార్థకత సిద్ధించే మార్గంగా పరిగణించాలి. అష్టాదశ (18) పురాణాలలో ఒకటైన గరుడ పురాణానికి ప్రాతిపదికే పునర్జన్మ సిద్ధాంతం. మన పెద్దల ఆత్మలు సూక్ష్మశరీరంతో కష్టాలు పడకుండా ఉండాలంటే ఏ చేయాలో, ఏఏ పాపకార్యాలు మనల్ని నరకం వైపు నడిపిస్తాయో వంటి అనేక జీవన సంబంధ విషయాల్ని చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. మొత్తంగా మరణించిన మన తల్లిదండ్రులు, పితృదేవతలకు మనమెలా ఋణపడతామో కూడా అవగతమవుతుంది.

No comments:

Post a Comment