*ఆత్మ నిత్యమైనది.....*
*యమధర్మరాజు చెప్పిన కొలది సందేహనివృత్తి చేసుకుంటూ యున్న నచికేతున్ని చూసి ప్రసన్నుడైన యముడు ఇలా చెప్పతొడగెను. కర్మఫల రూపనిధి అనిత్యమైనది. ఆత్మనిత్యమైనది. అనిత్యసాధనముల ద్వారా ఆత్మ జ్ఞానము పొందలేము. కాని నా ద్వారా నీవు అనిత్య పదార్థముల ద్వారా అగ్నిని గ్రహించితివి. ఓ నచికేతా! కఠినముగా అగుపించేది, నిగూఢ స్థానములో ఉండునది, బుద్ధిలో లీనమై, లోతైన దట్టమైన స్థానములో ఉన్న అతి ప్రాచీనమైన దేవున్ని ఆధాత్మయోగమును ప్రాప్తించుకున్న ధీరపురుషులు సుఖదుఃఖాలను త్యాగము చేయుదురు. ఆత్మతత్వమును ఆకళింపు చేసుకున్న వారు ధార్మిక గుణములు కలిగిన ఆత్మను శరీరము నుండి విడదీసి సూక్ష్మ మైన ఆత్మను పొంది ఆనందాబ్దిలో ఓలలాడెదరు. ఓ నచికేతా! నీవే ఒక బ్రహ్మ భవనములా ఉన్నావు. నా ఆలోచన ప్రకారము నీ కొరకు మోక్ష ద్వార ములు స్వాగతిస్తున్నాయి.*
*యమధర్మరాజా! ఉపాసకులు అనేక రకాలుగా ఉంటారు. బ్రహ్మ గురించి అపర బ్రహ్మ గురించి తెలపండి. అలాగే ధర్మము నుండి వేరై, అధర్మము నుండి వేరై, కార్యకారణ రూప ప్రపంచము నుండి వేరై మీరేమి చూడగలుగుచున్నారు? నచికేతుని ప్రశ్నలకు సంతోషాంతరంగుడైన యముడు నచికేతున్ని ఉద్దేశించి ఇట్లనెను. ఉపాసనచే బ్రహ్మను తెలిసి కోవచ్చును. అపరబ్రహ్మను ప్రాప్తించుకో వచ్చును. అలాగే అన్నింటి నుండి విడివడి ఒక్కరిని (పదమును) మాత్రమే దర్శించుకోవచ్చును. ఆ ఒక్క పదమును సమస్త వేదములు ఉటంకిస్తూ గొప్పగా వర్ణిస్తున్నాయి. అదియే “ఓం” అను పదము. సమస్త సాధకులు తపములు దానిని సిద్ధింప చేసుకొనుటకు మాత్రమే యని తెలియుచున్నది. ఓంను సిద్ధింప చేసుకొనుటకు గురుకులములలో బ్రహ్మచర్యము పాటింపబడుచున్నది. ఈ ఓం అనునదియే బ్రహ్మ అయి ఉన్నది. ఇక ఆత్మ అనునది ఉత్పన్నమైనది కాదు. అది చావదు. ఏదో కారణము వలన ఉత్పన్నము కాలేదు. స్వయ ముగా రూపొందినది కాదు. దానికి పుట్టుక లేదు. నిత్యమైనది, శాశ్వతమైనది అతి ప్రాచీనమైనది. శరీరము సమసిపోయినా ఆత్మ పోదు. ఎందుకంటే అది ఆకాశము వలె నిర్లిప్తమైనది. ఆత్మ శరీరములో ఉండి కూడా శరీరములేనిది, తాత్కాలికమైన వాటిలో ఉండి కూడా నిత్యమైనది. అలాంటి మహాగొప్పదైన, సర్వవ్యాపకమైన ఆత్మను తెలిసికున్న బుద్ధిమంతుల, వివేకవంతుల దాపునకు కూడా శోకములు, క్లేశములు రావు. జ్ఞానవంతుడు “ఇది నేనేయై ఉన్నాను" అని అంటాడు. ఓ నచికేతా! ఈ ఆత్మవిద్య వేదాధ్య యనము వలన ఒనగూరేది కాదు. ధారణా శక్తి చేత, శ్రవణము చేత ప్రాప్తిం చునది కాదు.*
*సాధకుడు ఆత్మను వరించి గ్రహించాలి. అప్పుడే సాధకుని యెడల ఆత్మ తన స్వరూపాన్ని అభివ్యక్తం చేస్తుంది. పాపకర్మలు చేయు వారు, ఇంద్రియ దమనము చేయనివారు, అశాంతితో అలమటించువారు ఆత్మ జ్ఞానమును పొందలేరు. ఆత్మను రధికుడుగా, శరీరమును రథముగా, బుద్ధిని సారధిగా, ప్రాణము మనస్సును కళ్లెముగా భావించుము. వివేకుల కథనము ప్రకారం ఇంద్రియములను అశ్వములుగా, కోరికలను మార్గములుగా భావించ వలసి వస్తుంది. శరీరము, ఇంద్రియములు, మనస్సు యుక్త ఆత్మను భోక్తగా పరిగణించుచున్నాము. ఇంద్రియముల కంటె వాటి సంబంధిత విషయములు గొప్పవి, విషయముల కంటే మనస్సు ఉత్కృష్టమైనది. స్వయంభూ అనగా పరమాత్మ ఇంద్రియాలను బహిర్ముఖంగా రూపొందించి వాటిని హింసించుటకు కారకుడయ్యాడు. అందుకే జీవుడు బాహ్య విషయాలనే చూస్తున్నాడు తప్ప అంతరాత్మను వీక్షించటం లేదు. అమరత్వమును పొందుటకు ఇంద్రియ నిగ్రహం పాటించినవారే ఆత్మాను భూతిని పొందగలరు. ఆత్మతత్వమును గురించి నచికేతుడడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా... యముడిట్లనెను.*
*ఆత్మద్వారానే మానవుడు రూప, రస, గంధ, శబ్ద, స్పర్శలే కాకుండా సంభోగసుఖమును కూడా అనుభవించగలుగుచున్నాడు. ఆత్మగమనము చేయగలదైయున్నది. ఆకాశములో చరించు సూర్యుడై, వసువై, వాయువై, భూమియై, అగ్నియై, సోముడై అన్ని రకాలుగా స్థితమైయున్నది. అంతేకాకుండా మానవులలో సంచరించునదై, దేవతలలో, సత్యములో, యజ్ఞములో, ఆకాశములో, జలములో, పర్వతములలో ఉత్పన్న మగునదైయున్నది. అందరిని తన ఆధీనములో ఉంచుకొనినదియై సంపూర్ణ భూతముల అంతరాత్మయై తన ఒక్క రూపమునే అనేక రూపాలుగా విస్తరింపచేసియున్న ఆత్మదేవున్ని ధీరపురుషులు తమ బుద్ధిలోనే స్థితమై యుండుటను గమనించి సుఖప్రాప్తిని పొందెదరు. ఆత్మలోకములో సూర్యచంద్రులు ప్రకాశించరు. తారాగణము కూడా ప్రకాశించదు. అగ్ని తన ప్రచండత్వాన్ని చూపదు. కేవలం ఆత్మ ప్రకాశము చేతనే అవన్నియును వెలుగులు సంతరించుకొనుచున్నవి. కావున ఎల్లరు ఆత్మప్రకాశ సాధన చేయవలెను.*
*┅━❀꧁గురుభ్యోనమః ꧂❀━┅*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🧘♀️🌷🧘♂️ 🙏🕉️🙏 🧘♂️🌷🧘♀️
No comments:
Post a Comment