🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
*🌼ఒక యోగి ఆత్మకథ-18*
*(🖌️రచన :- శ్రీ పరమహంస యోగానంద)*
*🌼4-అధ్యాయం*
*🌼హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం*
“లాహిరీ మహాశయులు, పవిత్ర గ్రంథాల్ని గురించి పుస్తక పాండిత్యంతో వ్యాఖ్యానించేవారు కారు. అప్రయత్నంగానే ఆయన, ‘దివ్య గ్రంథాలయం’లోకి మునిగేవారు. ఆయనలోని సర్వజ్ఞత్వమనే నీటి బుగ్గలోంచి మాటలనురుగూ ఆలోచనల తుంపరలూ పైకి చిమ్ముకొస్తూ ఉండేవి. అనేక యుగాలకు పూర్వం వేదాల్లో[7] మరుగుపడి ఉన్న గాఢమైన దార్శనిక శాస్త్రాన్ని బయల్పరిచే అద్భుతమైన కీలకం ఆయన దగ్గర ఉండేది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన వివిధ చేతన స్థాయిల్ని వివరించమని అడిగినప్పుడు, ఆయన చిరునవ్వు చిందిస్తూ అంగీకారం తెలిపేవారు. “నేను ఆ స్థితుల్లోకి ప్రవేశించి నాకు గోచరించింది. చెబుతాను మీకు,” అనే వారు. కేవలం గ్రంథాలు బట్టీపట్టేసి తమ అనుభవంలోకి తెచ్చుకోని భావాల్ని వెల్లడించే ఉపాధ్యాయులకూ ఆయనకూ చాలా తేడా ఉండేది.
“ ‘నీకు తోచిన అర్థాన్నిబట్టి శ్లోకాలు వ్యాఖ్యానించు’, అంటూ మితభాషులయిన గురువుగారు దగ్గురున్న ఒక శిష్యుడితో తరచుగా అంటూండేవారు. ‘నువ్వు సరయిన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచనల్ని నేను ప్రేరేపిస్తాను,’ అనేవారు. ఈ ప్రకారంగా లాహిరీ మహాశయుల అనుభూతులు అనేకం గ్రంథస్థం కావడం జరిగింది. వాటిమీద ఎందరో శిష్యులు పెద్దపెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు.
“గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువుగారు ఎన్నడూ చెప్పలేదు. ‘మాటలన్నవి కేవలం పైపై తొడుగులు,’ అనే వారాయన. ‘ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు.’ ”
“శిష్యుడికి ఏ సమస్య ఎదురయినా సరే, దానికి పరిష్కారంగా ఆయన, క్రియాయోగం సాధన చెయ్యమని సలహా ఇచ్చేవారు.”
“మీకు దారి చూపించడానికి నేను ఈ శరీరంతో లేనప్పుడు కూడా, ఈ యోగకీలకానికున్న సామర్థ్యం పోదు. సిద్ధాంతపరమైన ఆవేశాల సముదాయంగా తలచి, కట్టుదిట్టంగా కవిలెకట్టలో దాచిపెట్టి, తరవాత మరిచిపోవడానికి వీలయినది కాదు ఈ యోగపద్ధతి. క్రియాయోగం ద్వారా నిరంతరాయంగా ముక్తిమార్గంలో ముందుకు సాగు; నువ్వు చేసే సాధనలోనే దీని శక్తి ఇమిడి ఉంది.”
“నా మట్టుకు నేను, పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో, స్వయంకృషితో ముక్తి సాధించడానికి రూపొందిం చిన సాధనాల్లో, అన్నిటికంటె పటిష్ఠమైనది క్రియాయోగమేనని భావిస్తాను,” అంటూ గంభీరమైన ప్రమాణ వాక్యంతో ముగించారు కేవలానందగారు. “మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న దేవుడు, క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహిరీ మహాశయుల భౌతిక శరీరంలోనూ, ఆయన శిష్యుల్లో కొందరిలోనూ, మనకు కళ్ళకు కట్టే విధంగా రూపుదాల్చాడు.”
కేవలానందగారు గురువుగారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒకసారి లాహిరీ మహాశయులు చేసిన దివ్యమైన అద్భుతం ఒకటి ఉంది. ఋషితుల్యులైన మా మాస్టరుగారు ఒకనాడు నా కా కథ మళ్ళీ చెప్పారు. ఆయన కళ్ళు, మా కెదురుగా బల్లమీదున్న సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమయి ఉన్నాయి.
“గురువుగారి శిష్యుల్లో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది. అతనికోసం ఏమయినా చెయ్యాలనిపించింది. తమలోనే పరమాత్ముడు ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువుగారికి ఇతడు ఎంతో విశ్వాసపాత్రుడయి సేవ చేస్తున్నాడే, అటువంటి ఇతని కళ్ళలోనే వెలుగు లేకపోవాలా, అనిపించింది. ఒక రోజున రాముతో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. కాని అతడు, చేత్తో చేసిన ఒక తాటేకు విసనికర్రతో, గంటల తరబడి ఓపికగా, గురువుగారికి విసురుతూ కూర్చున్నాడు. చివరి కతడు గదిలోంచి బయటికి వెళ్ళిన తరవాత నేనూ వెనకాలే వెళ్ళాను.
“రామూ, నీకు కళ్ళుపోయి ఎంతకాలమయింది?”
“నేను పుట్టినప్పుడేనండి! ఒక్క క్షణమయినా సూర్యుణ్ణి చూసే అదృష్టం నా కళ్ళకి పట్టలేదండి,” అన్నాడు.
“సర్వశక్తి సంపన్నులయిన గురువుగారు నీకు సాయం చెయ్య గలరు. ఒకసారి ఆయనకి మనవి చెయ్యి,” అన్నాను. “మర్నాడు రాము, బిడియపడుతూ లాహిరీ మహాశయుల దగ్గరికి వెళ్ళాడు. తనకున్న ఆధ్యాత్మిక సర్వసమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోడం, దాదాపు అవమానకర మనిపించేటంతగా భావించాడతడు.
“ ‘స్వామీ, విశ్వాన్నంతనీ ప్రకాశింపజేసేవాడు మీలో ఉన్నాడు. అంతకంటె తక్కువ కాంతితో వెలిగే సూర్యుణ్ణి చూడగలిగేటట్టుగా ఆ భగవంతుడి వెలుగు నా కళ్ళలోకి వచ్చేటట్టు చెయ్యమని ప్రార్థిస్తున్నాను.’ అన్నాడు.”
“ ‘రామూ, నన్ను ఇరకాటంలో పెట్టడానికి, ఎవరో ఈ ఎత్తు వేశారు. నయం చేసే శక్తి నాకు లేదు,’ అన్నారాయన.”
“ ‘అయ్యా, మీలో ఉన్న పరమాత్ముడు తప్పకుండా నయం చెయ్యగలడండి.’
“ ‘అది వేరే సంగతి, రామూ! పరమాత్ముడి శక్తికి పరిమితి లేదు! అటు నక్షత్రాల్నీ, ఇటు శరీరంలో జీవకణాల్నీ నిగూఢమైన తన ప్రాణశక్తితో ప్రజ్వలింపజేసే పరమాత్ముడు నీ కళ్ళకి తప్పకుండా వెలుగు ఇవ్వగలడు,’ అంటూ గురువుగారు, రాము ముఖంలో కనుబొమల మధ్య ఉండే బిందువు[8]ను స్పృశించారు.
సశేషం:-
No comments:
Post a Comment