Tuesday, March 17, 2020

విధి అంటే బ్రహ్మ, విధి అంటే కర్మ. విధి అంటే నిబంధన, విధి అంటే ఏర్పాటు.

విధి

విధి అంటే బ్రహ్మ, విధి అంటే కర్మ. విధి అంటే నిబంధన, విధి అంటే ఏర్పాటు. స్థితినిబట్టి జీవనగతి, గతినిబట్టి సుగతి ఏర్పడటం, లేక దుర్గతి పాలవటం జరుగుతూ ఉంటుంది. విధి విధానాన్ని అనుసరించి మనిషి జీవితం నడుస్తూ ఉంటుంది. అంతా విధి విధానమే అయితే మనిషి చేయవలసిందిగాని, చేయగలిగింది గాని అంటూ ఏదీ ఉండదు. అహం బ్రహ్మాస్మి అనుకుని కాలం గడిపేయడంతప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటారు కొందరు. విధి లిఖితం, విధి బలీయం అంటూ అన్నీ వదిలేసి చేతులు ముడుచుకుని కూర్చోవడమే పని అయితే మానవ ప్రయత్నానికి విలువేముంది? ఈ ప్రశ్నకు సమాధానం జీవితం ద్వారా రాబట్టుకోవాలి. విధికి తలవంచడమా, దాన్ని తలకెత్తుకోవడమా తేల్చుకోవాలి.

ప్రతి మనిషికి జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు తన అస్తిత్వం గురించి ఈ లోకంలో తాను సాధించవలసినదాని గురించి ఓ సంశయం ఎదురుకాక తప్పదు. తాను ఏం చేయాలో, చేయకూడదో, అర్థంకాని సందిగ్ధంలో పడకా తప్పదు. రెండు దారుల కూడలిలో ఎటుపోవాలో ఎరుకలేని బాటసారిలా అవుతాడు. విధికి ఎదురీదడమా లేక ప్రవాహంతోపాటు తేలిపోవడమా అన్న మీమాంస ఎదురుకాక తప్పదు.

మహాభారత సంగ్రామంలో అర్జునుడు ఇలాంటి పరిస్థితినే చవిచూడవలసి వచ్చింది. ఒక మనిషిగా తనవారిని, గురువులను, బంధువులను, స్నేహితులను సంహరించాలా? సంహారం సాగించి సాధించేదేమిటి? ఇంతకన్నా అస్త్ర సన్యాసం చేసి, కురుక్షేత్ర రణక్షేత్రం నుంచి తొలగడమే మెరుగనిపించింది సవ్యసాచికి. నేను, నాది అన్న భావన కర్తవ్యమూఢుణ్ని చేసింది. అర్జున విషాదయోగం కృష్ణ గీతామృతానికి మూల కారణమైంది. విధిని ఎదిరించమని గాని, లొంగిపొమ్మనిగాని కృష్ణుడు చెప్పలేదు. కర్తవ్యం గుర్తు చేశాడు. ‘ఒక యోధుడిగా పోరు సలపడమే నీ విధ్యుక్త ధర్మం. అదే నిన్ను కాపాడుతుంది. కర్మకు తగ్గ ఫలితం ఇస్తుంది’ అన్నాడు.

అలా చేయడం నిష్కామ కర్మ యోగం. కర్మతో యోగించమని, కర్మఫలాన్ని గురించి ఆలోచించకని పరమాత్మ ఆదేశించాడు.

విధి అంటే జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, లాభనష్టాలు, మంచి చెడ్డలు మాత్రమే కాదు. సుఖాలకు పొంగిపోవడం, దుఃఖాలకు కుంగిపోవడం అంతకన్నా కాదు. భౌతిక జీవితంలో తారసపడే అనుభవాలు, అనుభూతులు, విధి విధానానికి కొలమానాలు కావు. అవి కేవలం నీటి బుడగలు. జీవితంలో ఘటనలకు అతీతంగా శోధించి, సాధించవలసిన పరమార్థం ఒకటున్నది. అదే గమ్యం... అదే పరమార్థ సాధన.

యోగ దృష్టికి సకల చరాచరాల్లో ఏకత్వం కనిపిస్తుంది. భూత భవిష్యత్‌ వర్తమానాలు కరతలామలకం అవుతాయి. ఏకకాలంలో మూడు మండలాలతో మమేకం కాగలడు. బ్రహ్మాది దేవతలకు అంతుపట్టని పరతత్వం ఒక యోగ దృష్టికి సామంతం నెరపుతుందని, మోక్ష సాధనకు యోగ మార్గమే శరణ్యమని గీత చెబుతున్నది. భర్తృహరి సుభాషితంలో యతి నృపతి సంవాదం ఈ సత్యానికి తెరతీస్తున్నది. యోగాలకు రాజు రాజయోగం. రారాజు కరవాలం కన్నా యోగి రాజు యోగబలం చురుకైనది, కరుకైనది.

ఆచరణీయమైన ఆలోచనలకు సానపట్టడమే సాధన. ఒక గాజుపాత్రలో నీళ్లు పోసి నిదానంగా పరిశీలించినప్పుడు, అట్టడుగున నీటిలోని వ్యర్థాలు కనిపిస్తాయి. యోగి ఆలోచనలను వడగట్టి, బుద్ధిని ఏకాగ్రం చేయడం వల్ల మనసు నిలకడ పొందుతుంది. మబ్బు తొలగిన సూర్యుడిలా సత్యం అవగతమవుతుంది. చిత్త వృత్తులను నిరోధించడం యోగం అని, నిశ్చలబుద్ధితో పనిచేయడమే కర్మ కౌశలం అని... ఈ రెండింటి సంయోగమే విధి విధానం అని గ్రహించాలి. విధికి సరైన నిర్వచనాలుగా స్వీకరించాలి.

No comments:

Post a Comment