Tuesday, August 4, 2020

మనకు తెలియని, ఆదరణకు నోచుకోని మహాభారత కథలు.

ఓం శ్రీమాత్రే నమః

మనకు తెలియని, ఆదరణకు నోచుకోని మహాభారత కథలు.

"చిరకారి " అనే ముని కుమారుని కథ..
లోకంలో ప్రఖ్యాతిగాంచిన పరశురాముని కథ తో పోలికలు కలిగి ఉండడం గమనార్హం.

మేధాతిథి అనే మహర్షి పుత్రుడు చిరకారి. చక్కగా ఆలోచించి అప్పుడు ఏ పనైనా చేస్తాడు అని అతనికి ఆ పేరు వచ్చింది.
తల్లి ,తండ్రి ,అతను చక్కని కుటుంబం తో సంతోషంగా కాలం గడిపే వారు. ఆశ్రమ జీవితము ..ప్రశాంతమైన వాతావరణం..

మేధాతిథి ఏదో ఒక కారణం వలన భార్యపై కోపించి ఆమెను వధించమని మిత్రునికి ఆదేశించి ఇల్లు విడిచి వెళ్లిపోయాడు...

ఇది జమదగ్ని తన భార్య పై ఆగ్రహించి పుత్రులకు ఆమెను వధించమని చెప్పిన కధ ..అలాగే ఉంది కదా. అక్కడ పరశురాముడు తన తల్లిని వధించి.. తండ్రిని వరం కోరుకుని తిరిగి మాతృమూర్తిని పొందగలిగాడు..

ఇక్కడ ఈ చిరకారి తాను చేసే పనులన్నీ ఆలోచించి చేసే లక్షణం కలవాడు. కనుక ఈ విధంగా అనుకొన్నాడు మా తండ్రి ఆజ్ఞ పాటించకుండా ఉండటానికి వీలు కాదు. అలాగని మాతృమూర్తిని చంపడం మంచిది కాదు. తండ్రి మాట వినాలి.. పెద్ద వాళ్ళు అంటారు. ఎలాగైనా తల్లిని కాపాడాలి. ఈ పుత్రత్వం అనే బాధ్యత స్వేచ్ఛ లేనిది అని అనుకున్నాడు. రెండు విధాలుగా నాకు పాపం రాకుండా చేసే ఉపయోగం ఏమున్నది అని ఆలోచించారు. మాతృ హత్య మహా దోషం. తండ్రి ఆనతి ధీక్కరించడం కూడా దోషమే... వీరు వంశోద్ధారకుడు కోసం నాకు జన్మ ఇచ్చారు. ఇరువురికి నేను సమానంగానే చెందిన వాడిని.
అని తనలో తాను అనుకొని

తండ్రి కుమారుడు గా పుడతాడు .. (ఆత్మావై పుత్రనామాసి). అంటారు కనుక ధర్మం తపస్సు విద్య దైవము ఇవన్నీ తండ్రి తండ్రి ప్రీతి కలిగించే పని చేస్తే దేవతలు ప్రీతి పొందుతారు..

కానీ ఈ శరీరం అంతా తల్లి నుండే వస్తుంది.. తాను కష్టపడి, బిడ్డ కోసం పడే కష్టాలు తల్లికే ఎక్కువగా ఉంటాయి. ధర్మ శాస్త్రాలు కూడా తండ్రి కంటే తల్లి గౌరవంలో గొప్పది అని చెబుతాయి.
పది మంది ఉపాధ్యాయుల కన్నా ఒక ఆచార్యుడు,
నూరు మంది ఆచార్యుల కన్నా ఒక తండ్రి, వెయ్యి మంది తండ్రుల కన్నా ఒక తల్లి గౌరవం లో గొప్పవారు. అందుకే వేదం కూడా' మాతృదేవోభవ' అని తల్లిని మొదటి దైవంగా భావించండి అని బోధించింది.
పుత్రుడు ఏ వయసులో ఉన్నా.. తల్లి ప్రేమ ఒకే విధంగా ఉంటుంది. తల్లి లేని వాడు అన్ని విధాల అశక్తుడు అవుతాడు.. దుఃఖితుడు అవుతాడు..
ఇలా అతను ఆలోచిస్తూ ఉండటం లో చాలా సమయం గడిచిపోయింది..

ఇంటి నుంచి వెళ్లిపోయిన తండ్రి మేధాతిథి కోపం తగ్గిపోయి.. అయ్యో, నేను నా భార్యను చంపమని నా పుత్రుడిని ఆజ్ఞాపించి వచ్చాను .ఈ సమయానికి ఆ పని చేసి ఉంటాడు ..అని కన్నీరు కారుస్తూ ఇంటికి వచ్చాడు...
కానీ లోపల ఒక ఆశ.. నా పుత్రుడు ఏ రీతిగా అయిన ఆలోచించి పని చేసే సహజ స్వభావం కలవాడు .. నన్ను దుఃఖంలో ముంచి వేసే పని చేస్తాడా..
ఓ కుమారా నేను నిన్ను అవినీతికరమైన కార్యం చేయమని పురికొల్పాను.నీవు నీ తల్లి చేసిన సేవలను తలుచుకొని ఉంటే నీ పేరు సార్థకం అవుతుంది.. నీకు ఎటువంటి పాపము అంట కూడదు అనుకుంటూ.. ఇంటికి వచ్చాడు.

చిరకారి క్షమించమని అడిగి తన తండ్రి పాదాలు నమస్కరించాడు.
చిరకారి తల్లి కూడా అతనికి నమస్కరించి నిలిచింది. భార్యాబిడ్డలను ఆనందంతో కనులారా చూసుకొని కుమారుడిని గట్టిగా కౌగలించుకుని ఆశీర్వదించాడు.

ఒక కార్యం చేయవలసి వచ్చినప్పుడు చాలా కాలం ఆలోచించి ధీరత్వం తో మంచి చెడ్డలు నిర్ణయం తీసుకోవాలి అలా ఆలోచించి చేసేవాడిని ఆర్యుడు అని,. తొందరపడే వారిని అనార్యుడు అని పెద్దలు అంటారు.
తొందర పడకుండా, సమయాల్లో స్థిర నిర్ణయాలు తీసుకునే వాడు సార్థకత నాముడై, శాంతిని సమస్త సుఖములను పొందుతారు.. అని చిరకారి తండ్రి అన్నారు...
శాంతి పర్వము పంచమాశ్వాసము లో భీష్ముల వారు ధర్మరాజు కు చెప్పిన కథ ఇది.

ఈ కథ పిల్లలకు చెప్తే, సమాజ హితాన్ని పొందిన వాళ్ళం అవుతాం. పరశురాముని కథ కన్నా ఇది మిన్న.. తిరిగి వరముగా తన తల్లిని బతికించగలిగే సమర్థత తండ్రికి ఉంది అని నమ్మినవాడు పరశురాముడు ..
ముని కుమారుడు అయి కూడా క్షాత్ర ధర్మాన్ని ఆచరించాడు.. దురదృష్టవశాత్తు,
హింస తో నిండి ఉన్న ఆ కథ బహుళ ప్రాచుర్యం పొందింది.

అమిత శాంతితో ప్రేమతో కరుణతో నిండిన చిరకారి కథ మరుగున పడిపోవడం శోచనీయం.

చిరకారి ఇక్కడ తండ్రి సమర్థత గురించి ఆలోచించలేదు.. తల్లి యొక్క ప్రాముఖ్యతను, వేద ప్రమాణాల గురించి ఆలోచించాడు. కుటుంబ విలువలు చాటి చెప్పడానికి, ఆనందకరమైన జీవన విధానాన్ని కలిగి ఉన్న ఈ చిరకారి కథ చిరకాలం ఉండేలా మనం కూడా పిల్లలకు
చెప్పడం భావ్యం కదా..

శుభాభినందనలతో
మీ
రాజేశ్వరి తటవర్తి
14-07-2020

Source - Whatsapp Message

No comments:

Post a Comment