Monday, August 24, 2020

లోపల ఏముంది

లోపల ఏముంది

మనం టైం పాస్ చేస్తున్నాం అంటే భగవంతుడు మనకు ఇచ్చిన సమయాన్ని వృధా చేస్తున్నాం. 24 గంటలు అని నేను అనుకోను 86,400 సెకన్లు గా భావిస్తాను. 24 గంటల సమయాన్ని ఏమి చేస్తారు, ఆ సమయాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి.ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి.
ఒక బిక్షగాడు 30 సంవత్సరాలుగా ఒక రోడ్ కూడలిలో ఒక బాక్స్ మీద కూర్చొని భిక్షం అడుక్కునే వాడు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి నువ్వు కూర్చున్న బాక్స్ ఎప్పుడైనా తెరిచి చూసావా అని ఆ బిక్షగాడిని అడుగుతాడు. అందుకు ఆ బిక్షగాడు నేను 30 సంవత్సరాలుగా ఈ పెట్టె మీద కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాను నాకు ఎప్పుడూ దీనిని తెరిచే అవసరం కలగలేదు అని చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఒకసారి ఆ బాక్స్ తెరిచి చూడు అప్పుడు నీకు భిక్ష వేస్తాను అంటే ఆ బిక్షగాడు ఆ బాక్స్ తెరిచి చూస్తాడు, అందులో వజ్రాలు వైడూర్యాలు బంగారం ఉంటుంది.ఇన్ని సంవత్సరాలు ఈ పెట్టె మీద కూర్చునా నేను భిక్షం అడుక్కున్నది అని అనుకుంటాడు.

అందుకే ఎప్పుడూ మనలోకి మనం తొంగి చూసుకుంటూ ఉండాలి మన లోపల కూడా బంగారం ఉంటుంది.

వివేకానందుల వారు చెప్పారు "మిమ్మల్ని బలహీనులుగా తల్చుకుంటే బలహీనులు గానే ఉండిపోతారు, మీరు బలవంతులు నేను సింహాన్ని అని అనుకుంటే బలవంతులుగా సింహాలు గా తయారవుతారు ".

మనలో ఉన్న బంగారాన్ని మనం చూసుకోకుండా బయట విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ మనలో ఉన్న శక్తిని కోల్పోతూ ఉన్నాం. చాలా శక్తులు మనల్ని పడివేయటనికి ప్రయత్నిస్తున్నే వుంటాయి. మనలో ఉన్న బలహీనతలను వ్యాపారంగా మార్చుకునే వారు పుట్టుకొస్తున్నే వుంటారు.
అలాటి వాటికి విద్యార్థులు యువత బలి పడకూడదు.నాకొక లక్ష్యం ఉంది దానిని నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం ఉండాలి.

మనదేశంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఎందరో మహానుభావులు అత్యంత నిరుపేద నేపథ్యం నుండి వచ్చినవారే! బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు,డాక్టర్ అబ్దుల్ కలాం గారు,లాల్ బహుదూర్ శాస్త్రి గారు ఇలా ఎందరో మహానుభావులు. వాళ్లలో ఉన్న ప్రచండమైన ఆత్మవిశ్వాసం, మేము ఎటువంటి పరిస్థితులు లో ఉన్నా కూడా మా మీద మాకు విశ్వాసం ఉంది మేము సాధించి చూపిస్తాం అనే కోరిక వలన వారు మహానుభావులు కాగలిగారు. మనమెందుకు కాకూడదు అని మనమంతా ఆలోచించాలి.


Source - Whatsapp Message

No comments:

Post a Comment