Tuesday, April 27, 2021

చక్కటి నీతికథ.

చక్కటి నీతికథ.
నారాయణపురంలోవున్న ధనవంతుల్లో నరసింహం ఒకడు. అందరితో మంచిగా వుంటూ, అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తాడని, ఆయనకు పేరున్నది.

ఒక రోజు ఉదయం ఆయన స్నానం చేసి, పూజకోసం ఇంటి ముందున్న నందివర్థనం పూలు కోస్తూండగా, అయ్యగారూ, నమస్కారం! నరసింహంగారంటే తమరేగదండీ? అంటూ ఒక పన్నెండేళ్ళ కుర్రాడు వచ్చాడు.
"అవును, నువ్వెవరివి?" ఏంకావాలి నీకు? అని అడిగాడు నరసింహం.

నా పేరు కృష్ణుడు. మీ ఇంట్లో పనికావాలి అయ్యగారూ! అన్నాడు కుర్రాడు వినయంగా చేతులు జోడించి.
నరసింహం నవ్వి, నువ్వేం పనిచేయగలవు, కృష్ణా? అని అడిగాడు. "‘ఏ పని చెప్పినా చేస్తాను. చిన్నప్పుడే అమ్మా నాన్నా పోయారు. మామయ్య ఇంట్లో పెరిగాను. మా అత్తయ్య ఇంటి పనంతా నాతోనే చేయించేది. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళవడంతో ఖర్చు పెరిగిందని, నాదారి నన్ను చూసుకోమన్నారు. మా ఊళ్ళో మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను, అన్నాడు కృష్ణుడు.

నరసింహం కాస్సేపు ఆలోచించి, నీకివ్వడానికి మా ఇంట్లో పనేంలేదు. నువ్వు చదువుకుంటానంటే చదువు చెప్పిస్తాను, అన్నాడు.

కృష్ణుడు చప్పున నరసింహం కాళ్ళ మీద పడి, ""నాకు చదువంటే ప్రాణం! ఈ సంవత్సరమే మా అత్తయ్య, నా బడిమానిపించేసింది,"" అన్నాడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూండగా.

నరసింహం, లోపలి గదిలోవున్న అదే ఈడువాడయిన తన కొడుకు రాముడిని పిలిచి, "ఈ అబ్బాయి పేరు కృష్ణ. నీతోపాటు నీగదిలోనే వుంటాడు. నీతో బడికి తీసుకెళ్ళు. నేను పంతులుగారితో మాట్లాడతాను." అన్నాడు. "అలాగే, నాన్నా!" అంటూ కృష్ణుడిని తనగదిలోకి తీసుకుపోయాడు రాముడు.

నరసింహం భార్య భాగేశ్వరికి ఇది ఏ మాత్రం నచ్చలేదు. "ఎంతమంది అనాధలను, ఇలా చేరదీసి పోషించగలం?" అన్నది కోపంగా.

‘‘చూద్దాం!'' అంటూ నవ్వేశాడు నరసింహం. కృష్ణుడు ఇంటి పనిలో భాగేశ్వరికి సహాయపడుతూనే, రాముడితో బడికి వెళ్ళి చదువుకునేవాడు. కృష్ణుడు తన తరగతిలో చేరనంత కాలం, రాముడు ఏ పరీక్ష పెట్టినా ప్రథముడుగా వచ్చేవాడు.

ఇప్పుడు రాముడికి ఏ పరీక్షలో అయినా ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోవలసివచ్చింది. అన్ని పరీక్షలలోనూ, కృష్ణుడిదే ప్రథమ స్థానం. ఇది గమనించిన నరసింహం, ‘‘కృష్ణుడు నీకన్నా తెలివైనవాడు. నీకు తెలియనివి వాడిని అడిగి చెప్పించుకో,'' అన్నాడు రాముడితో. తండ్రి అలా అనడం ఎంతో అవమానంగా తోచింది, రాముడికి. వాడొక రోజు తల్లితో, ‘‘అమ్మా, ఆ కృష్ణుడిని ఇంట్లోంచే కాదు, బడిలోంచి కూడా పంపించేయండి. నేనే తరగతిలో ప్రథముడిగా వుండాలి,''అన్నాడు.

భాగేశ్వరి ఆ మాటలకు నెత్తిబాదుకుని, ‘‘నేను ముందు నుంచే, ఈ తద్దినాన్ని ఇంట్లోకి తీసుకురావద్దన్నాను. మీ నాన్నకు నా మాట అంటే లక్ష్యం లేదు!'' అన్నది.

తర్వాత ఆమె పెరట్లో బాదం చెట్టుకింద కూర్చుని చదువుకుంటున్న కృష్ణుడి దగ్గరకు వెళ్ళి, ‘‘ఒరే, కృష్ణా! తరగతిలో ఏ పరీక్ష పెట్టినా నువ్వు ఒక ప్రశ్నకు జవాబు రాయకుండా వదిలేయి, తెలిసిందా?'' అన్నది.

‘‘నాకు అన్ని ప్రశ్నలకూ జవాబులు తెలుసు, అమ్మగారూ!'' అన్నాడు కృష్ణుడు, ఆశ్చర్యంగా భువనేశ్వరి ముఖంలోకి చూస్తూ.

‘‘అయినా సరే! ఇకపై ప్రతి పరీక్షలోనూ ఒక ప్రశ్నకు సమాధానం రాయకూడదు. అంతే,'' అన్నది భాగేశ్వరి కరకుగా.

ఆ తర్వాత అన్ని పరీక్షలలోనూ రాముడికి ప్రథమ స్థానం, కృష్ణుడికి ద్వితీయ స్థానం రాసాగింది. ఈ మార్పు పంతులుగారికి ఆశ్చర్యం కలిగించింది. తరచి తరచి అడిగి, కృష్ణుడి ద్వారా సంగతంతా తెలుసుకున్న ఆయన, కృష్ణుడికి ప్రత్యేక పరీక్ష పెట్టి, వాణ్ణి పైతరగతికి పంపించేశాడు. తరగతిలోంచి కృష్ణుడు వెళ్ళి పోవడంతో ఎంతో ఆనందం కలిగింది, రాముడికి.

పంతులుగారి ద్వారా జరిగిందేమిటో తెలుసుకున్న నరసింహం, ఆయనతో, ‘‘మీరు చేసిన పనివల్ల కృష్ణుడికి న్యాయం జరిగింది, అయితే రాముడు నష్టపోయాడు.

పక్కవారిని చూసి ఈర్ష్యపడకూడదని, రాముడు గ్రహించాలి. తెలియనివి ఎవరినైనా అడిగి తెలుసుకోవడంలో తప్పులేదనీ, మనిషి మానసికంగా ఎదగడానికి పోటీ అనేది తప్పని సరిగావుండాలనీ, రాముడికి తెలియాలి. రాముడు మంచి బాలుడుగా ఎదిగే ప్రయత్నం మీరే చేయాలి, పంతులుగారూ!" అన్నాడు.

ఇందుకు పంతులుగారు కాసేపు ఆలోచించి, ‘‘సరే, రాముడికి కూడా నష్టం జరక్కుండా చూస్తాను,'' అన్నాడు. ఆ రోజు తరగతిలో పంతులుగారు, ఒక కథ చెప్పాడు: అనగనగా ఒక రాజు. ఆయనకు ఒక్కడే కొడుకు. ఈ యువరాజు గురప్రు స్వారీలో దిట్ట.

తరచుగా గుర్రాన్ని అడవిలో దౌడు తీయించేవాడు. అతణ్ణి, తమ గుర్రాలతో అందుకోవడం, పరివారంలో ఎవరికీ సాధ్య పడేదికాదు. అందరూ గురప్రుస్వారీలో యువరాజును మించిన వాళ్ళు లేరని పొగడుతూండేవాళ్ళు.

ఒకనాడు అనుకోకుండా యువరాజుకు, కోమలనాయకుడి కొడుకుతో పరిచయమైంది. ఆ కోమలనాయకుడు, యువరాజు కన్నా వేగంగా, గురప్రుస్వారీ చేసేవాడు. ఇప్పుడు పరివారంలోని వాళ్ళు అతణ్ణి మరింతగా పొగడసాగారు. అది యువరాజుకు నచ్చలేదు. ఈర్ష్యతో అతడి మనసు రగిలిపోసాగింది. ఒకసారి కోమలనాయకుడు, యువరాజుతో, ‘‘గుర్రాన్ని వేగంగా పరిగెత్తించడమే కాదు, నీకు మరికొన్ని ఒడుపులు కూడా నేర్పుతాను,'' అన్నాడు.

నీ దగ్గర నేర్చుకునే ఖర్మ నాకు పట్టలేదు. నాకు పోటీదార్లంటేగిట్టదు. ఇకపై నా కంటపడకు!'' అన్నాడు యువరాజు కోపంగా.

ఆ తర్వాత ఒక రోజున యువరాజు, తన పరివారం నుంచి వేరుపడి, అడవిలో చాలా దూరం వెళ్ళాడు. కోమలయువకుడు కొండ దేవతకు మొక్కుకుని, గుర్రం మీద వస్తూ యువరాజును పలకరించబోయాడు. కానీ, యువరాజు అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నాడు. అంతలో పొదలచాటు నుంచి, ఒక చిరుతపులి గాండ్రిస్తూ వాళ్ళకేసిదూకింది.

యువరాజు వెంటనే ఒరలోంచి కత్తిదూయ బోయాడు గాని, గుర్రంబెదిరి, అతడి స్వాధీనంతప్పి చెట్ల మధ్య అటూ ఇటూ పరిగెత్తసాగింది. చిరుతపులి దాన్ని వెంబడించింది. ఐతే, ఈ లోపల బెదిరిన తన గుర్రాన్ని, కోమలయువకుడు కళ్ళాలను బిగించి పట్టుకుని అదుపు చేసి, జీను నుంచి వేళ్ళాడుతున్న బళ్ళాన్నిలాగి గురిగా చిరుతపులి కేసివిసిరాడు. బళ్ళెం దానివెన్నులో దిగింది. చిరుతపులి పెద్దగా ఒకసారి గాండ్రించి కింద పడిగిలగిలా తన్నుకోసాగింది. యువరాజు వెను తిరిగి చూసి, జరిగిందే మిటో గ్రహించి, గుర్రాన్ని కోమలయువకుడి దగ్గరకు నడిపి, ‘‘నువ్వు గురప్రుస్వారీలో గొప్ప ఒడుపులు నేర్చినవాడివేకాదు, సమయస్ఫూర్తిని కూడా ఎరిగినవాడివి. నా ప్రాణంకాపాడావు, కృతజ్ఞుణ్ణి!'' అన్నాడు.

ఈ కథ చెప్పి పంతులుగారు, ‘‘చూశారా! యువరాజు, కోమలయువకుడి దగ్గర గురప్రుస్వారీలో మెళకువలు తెలుసుకుని వుంటే, చిరుతపులిని ఎదిరించడంలో విఫలుడయ్యేవాడు కాదు గదా! మనిషి ఆ జన్మాంతం విద్యార్థే. తెలియని విషయాలు, తెలిసినవాళ్ళను అడిగి తెలుసుకోవడం చిన్నతనంగా భావించకూడదు. మన ఈర్ష్య మనకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మనం ఎదగాలంటే, మన పక్కన మనకంటే అన్ని విషయాల్లో ఉన్నతుడైనవాడుండాలి. పోటీతత్వం వున్నప్పుడే మనం పైకిరాగలం!'' అన్నాడు రాముడి ముఖకవళికలు గమనిస్తూ.

మర్నాడు రాముడు, పంతులుగారితో, ‘‘నాక్కూడా ప్రత్యేక పరీక్ష పెట్టి, పై తరగతికి పంపించండి. నేను కృష్ణుడితో పోటీపడి చదవాలనుకుంటున్నాను,'' అన్నాడు. రాముడిలో వచ్చిన మార్పుకు, పంతులుగారు ఎంతో సంతోషించాడు.

🕉️🌞🌎🏵️🌼🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment