Friday, April 23, 2021

ఈ కథలో నీతి ఏమిటంటే - చక్కగా,నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితం పొందలేము అని భావం.

మంచి కథ ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు.

ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు.
‘‘గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి’’ అని అభ్యర్థించాడు వ్యాపారి.

‘‘దేవుడు నీ వ్యాపారంలో వృద్ధివికాసాలు ప్రసాదించుగాక. కానీ, నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయతీగా వ్యవహరించు’’ అని సూచించాడు గురువు గారు.

ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు.

న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు.

అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనిక రాళ్లను చేయించాడు.

దీంతో ఎక్కడెక్కడివారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు.

ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్లాడు. ‘‘గురువు గారూ! మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను’’ అన్నాడు వ్యాపారి.

‘‘ఆ బంగారపు తూనికరాళ్లను తీసుకెళ్లి ఏటిలో పడవేయ్‌’’ అని గురువు ఆజ్ఞాపించాడు .

గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు.

ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టణానికి వస్తున్నారు.

రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్లు వారికి దొరికాయి. వాటిని చూడగానే.. ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలిసిన రైతులు.. అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవడం భావ్యం కాదనుకున్నారు.

తూకంరాళ్లను తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చేశారు.

మళ్లీ తన దగ్గరికి చేరిన తూకంరాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్లాడు వ్యాపారి. ‘‘నేను వీటిని ఏరులో పారేశాను. మళ్లీ నా దగ్గరికి వచ్చాయి గురువు గారూ’’ అని విన్నవించుకున్నాడు.

‘‘నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానేశావో.. దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు.
నిజాయతీగా

సంపాదించావు కనుకనే.. నీ సొమ్ము మళ్లీ నీ దగ్గరికి చేరింద’’న్నాడు గురువుగారు.
అపరిశుభ్రమైన ఇల్లు రోగాలకు నిలయమై నట్లు మోసపూరితమైన వ్యవహారాలు
కష్టాలకు ప్రధాన ద్వారాల వంటివి.

ధర్మబద్ధంగా చేసే వ్యాపారం కర్మ బద్ధంగా చేసే ఉద్యోగం
ఆత్మ శుద్ధి తో చేసే పూజలు
మనో నిబ్బరంతో వ్యవహరించి
తీరు ఎల్లప్పుడూ మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.

సమాజానికి మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది
ఇంటి ముందర తుమ్మ చెట్టు పెంచుకొని దానికి మామిడి కాయలు కాయ లేదు అని బాధపడినట్లు మన వ్యవహారం ఉండకూడదు.

మంచి మామిడి చెట్టు ను పెంచుకుంటే తీయని మామిడి పండ్లును, చల్లని నీడ ను
ఇస్తుంది. అలాగే మన ప్రవర్తన మారుతూ ఉండే కొద్ది సత్ఫలితాలు వాటంతట అవే రావడం మొదలు పెడతాయి. అది ఎలాగో అంటే చెట్టు మొదలు దగ్గర నీళ్లు పోస్తే అవి కొమ్మలకు ఆకుల కు చేరి పూలు పూసి, కాయలు కాసినట్లు, మనం చేసుకునే మంచి పనులే మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. ధర్మో రక్షతి రక్షితః
ఈ కథలో నీతి ఏమిటంటే
చక్కగా,నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితం పొందలేము అని భావం.*

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment