Tuesday, August 3, 2021

నీ మనసే నీకు అద్దం!

నీ మనసే నీకు అద్దం!

ఒక బౌద్ధ భిక్షువు తానెక్కడికి వెళ్ళినా తనవెంట ఒక అద్దాన్ని తీసుకుపోతూండేవాడు. అది అందరికీ విచిత్రంగా ఉండేది. అతను సర్వసంగ పరిత్యాగి. ప్రపంచంలోని మోహాలన్నింటికీ అతీతుడు. తన రూపురేఖలకు ప్రాధాన్యమివ్వడు. అటువంటివాడికి రోజంతా తనవెంట అద్దాన్ని తీసుకువెళ్ళాల్సిన అగత్యమేమిటి?
అదే ప్రస్తావనను ఆ వూరివారు పూజారి దగ్గర తెచ్చారు. తనకే చిత్రమనిపిస్తూంటే ఇక వూరివారి సందేహాలను ఆయనేమి తీర్చగలడు? ఎవరికీ ఆ భిక్షువును అడిగే ధైర్యం లేక ఆ పూజారినే అడిగి తెలుసుకొమ్మని ఒత్తిడి చేశారు. ఆయన కూడా తన కుతూహలాన్ని ఆపుకోలేక ఒకరోజున 'స్వామీ! మీరు మరోలా తలంచకపోతే నాకో సందేహం ఉంది, అడగాలనుకుంటున్నాను' అన్నాడు. 'మనసులో సందేహాలకు మనిషి తావివ్వకూడదు... సందేహం నిజాన్ని తెలుసుకోనివ్వదు సరికదా, మరొక అబద్ధాన్ని నిజమని భ్రమింపజేస్తుంది. నీ సందేహమేమిటో అడుగు నాయనా!' అన్నాడు భిక్షువు. 'ఈ లోకంలోని మోహాలన్నింటినీ జయించిన మీరు రోజంతా మీ జోలెలో అద్దాన్ని పెట్టుకుని తిరుగుతున్నారెందుకు? మీకు అద్దంతో పనేమిటి?' అని పూజారి అడిగాడు.

భిక్షువు కొన్ని క్షణాలపాటు నిశ్చలంగా అతనివైపు చూసి తన జోలెలోని అద్దాన్ని బయటకు తీసి 'నేను రోజూ భిక్షకు వెడుతుంటాను. కొందరు ఆదరణతో భిక్ష వేస్తారు. కొందరు మళ్ళీ రమ్మని చెబుతారు. మరికొందరు తలతిప్పుకొని వెళ్ళిపోతారు. ఇంకొందరు ఛీ కొడతారు. నేను ఏ చెట్టు కిందనో కాసేపు ధ్యానంలో కూర్చుంటాను. కొందరికది అభ్యంతరం ఉండదు. ఇంకొందరు ఏం పని లేదా అని హేళన చేస్తుంటారు. మరికొందరు పోపొమ్మంటారు. ఎవరు నిరాదరించినా, చీదరించుకున్నా, తూలనాడినా తప్పకుండా నా ముఖాన్ని అప్పుడీ అద్దంలో చూసుకుంటాను. అద్దంలోని నా ప్రతిబింబం- 'వీటన్నింటికీ మూలం నువ్వే! లోకంలో ఆదరించినవారున్నట్టే నిందించేవారూ ఉంటారు... ఎవరు ఆదరించినా పొంగిపోకు. ఎవరు చీదరించుకున్నా కుంగిపోకు అని నాకు సాంత్వననిస్తుంది. నన్ను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండేది నా అంతరాత్మ. దాన్ని నా అంతః చక్షువులతో దర్శించగలిగేవరకూ నాకు మార్గదర్శిగా నిలిచేది నా ప్రతిబింబమొక్కటే! నా సమస్యకు మూలాన్ని మాత్రమే కాదు- దానికి పరిష్కారాన్నీ చెబుతుంది నా ప్రతిబింబం. అందుకే ఈ అద్దాన్ని నా వెంట తీసుకువెడుతుంటాను' అన్నాడు.

'నీకు మనసులో దేనికైనా బాధగా ఉన్నప్పుడు, ఎవరిమీదనో కోపంగా ఉన్నప్పుడు, పరిస్థితులపై చిరాగ్గా ఉన్నప్పుడు... ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి నీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకో! దానివల్ల నీకెంతో సాంత్వన కలుగుతుంది' అని తత్వజ్ఞానులు బోధించేది ఈ ధర్మసూక్ష్మంతోనే. మనమెక్కడికి వెళ్ళినా మనవెంట ఉండేది మనసొక్కటే! ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి మనం మన మనసులోకి చూసుకోగలిగితే ఎంతో ప్రయోజనముంటుంది. అది అనుభూతి చెందినవారికే అర్థమవుతుంది!

Source - Whatsapp Message

No comments:

Post a Comment