Monday, May 18, 2026

 కాలిన కట్టెలు :

భోజరాజు కవి పండితులను సత్కరిస్తూ ధారానగరంలో పరిపాలన సాగించే కాలంలో మాళవదేశంలో అతి పేద బ్రాహ్మణు-డొకడుండేవాడు. ఆ బ్రాహ్మణుడికి కవిత్వం రాదు, పాండిత్యంకూడా లేదు. అందుచేత భోజరాజు సన్మానించే అవకాశం లేదు. అయితే తనవంటివారికి సయితం కాళి దాసు తలుచుకుంటే, ఏదోవిధంగా సత్కరం  జరుగుతున్నదని విని ఆ బ్రాహ్మణుడు కాలినడకను ధారానగరం చేరి కాళిదాస దర్శనం చేసుకున్నాడు. కాళిదాసు ఆ బ్రాహ్మణుడి దుస్థితిగురించి విని, "అయ్యా నీవు మౌనవ్రతం ధరించి రేపు రాజసభకు రా. వట్టిచేతులతో కాకుండా ఏదో ఒక కానుక పట్టుకువచ్చి రాజుకియ్యి. నీ అదృష్టం బాగుంటే ఏదైనా ముట్టేటట్లు ప్రయత్నిస్తాను" అని సలహా ఇచ్చాడు.

ఆ బ్రాహ్మణుడు ఈ సలహా విని సంతోషించి, ఎక్కడో ఒక చెరుకుగడ సంపాదించి, దాన్ని తుండ్లుగా నరికి తన కొల్లాయి గుడ్డలో మూటగట్టుకున్నాడు. ఆ రాత్రి సత్రంలో భోజనంచేసి, మూట దగ్గిర పెట్టుకుని సత్రం ముందున్న చెట్టుకింద దుప్పటి పరుచుకు పడుకుని నిద్రపోయాడు.  

ఆ సత్రం ఊరికి ఒక పక్కగా వున్నది. ప్రతి రాత్రీ అక్కడ విశ్రమించేందుకూ, వీలైతే ఉచితంగా భోజనం సంపాయించేందుకూ అనేకులు వస్తూవుండేవాళ్ళు. ఆ సత్రాన్ని అంటిపెట్టుకుని వుంటూ, ఆదమరిచి నిద్రపోయేవాళ్ళ వస్తువుల్ని, డబ్బునూ సంగ్రహించే ఒక తుంటరి కుర్రవాడు వుండేవాడు.

బ్రాహ్మణుడి మూటలో చెరుకుతుండ్లు ఉన్నట్టు కనిపెట్టిన ఆ తుంటరికుర్రాడు, బ్రాహ్మణుడు నిద్రపోతున్న సమయంలో మూట విప్పి, చెరుకుముక్కలు తీసుకుని, వాటికి బదులుగా కాల్చి ఆర్పిన కపుల్లలు నాలుగు కొల్లాయిగుడ్డలో మూటగట్టి తన దారిన తాను పోయాడు.

ఈ మోసం తెలుసుకోకుండానే పేద బ్రాహ్మణుడు మర్నాడు ఉదయం లేచి, కాలకృత్యాలు తీర్చుకుని సరాసరి రాజ సభకు వెళ్ళాడు.
కాళిదాసాది కవిపండితులతోసహా నిండు శొలువులో కూర్చుని ఉన్న భోజరాజుతో ద్వారపాలకులు, "మహా ప్రభూ! తమ దర్శనార్థం మౌనవ్రతుడైన ఒక బ్రాహ్మ ణుడు వచ్చి ఉన్నాడు,” అని విన్నవించారు. రాజు ఆ బ్రాహ్మణ్ణి లోపల ప్రవేశ పెట్టమని ఉత్తరువు చేశాడు.

బ్రాహ్మణుడు సభలోకి వచ్చి, మూట విప్పి అందులోని కాలిన కట్టెపుల్లలను రాజుఎదుట పెట్టాడు. వాటిని చూడగానే బ్రాహ్మణుడికి పైప్రాణాలు పైనే పోయినంత పని జరిగింది. సభికులంతా ఆ వింతకు విరగబడి నవ్వారు.
రాజుకుమాత్రం పట్టరాని ఆగ్రహం వచ్చి, "దీని అర్థమేమిటి?” అని అడిగాడు.

అందరూ మౌనంగా ఉన్న ఆ తరుణంలో కాళిదాసు లేచి
"ప్రభూ! ఇందులో గొప్ప గూఢార్థం ఉన్నది. సెలవైతే చెప్పగలను,” అన్నాడు.
"ఏమిటది?” అన్నాడురాజు ఆశ్చర్యంతో.
కాళిదాను ఈవిధంగా చెప్పాడు

"దగ్ధం ఖాండవ మర్జునేన చ వృథా 
దివ్యద్రుమై ర్భూషితం, 
దగ్ధ వాయుసుతేన హేమరచితా 
లంకాపురీ స్వర్గభూః,
దగ్ధస్సర్వ సుఖాస్పదశ్చ మదనో హా ! హా !! 
వృథా శంభునా 
దారిద్య్రం ఘనతాపదం 
భువి నృణాం కేనాపి నో దహ్యతే.

"దివ్యమైన వృక్షాలు గల ఖాండవ వనాన్ని అర్జునుడు అకారణంగా దహిం చాడు, స్వర్గాన్ని మరిపించగల లంకాపట్ట ణాన్ని హనుమంతుడు నిష్కారణంగా దహించివేశాడు. అందరికీ సుఖం చేకూర్చే మన్మథుణ్ణి మహాశివుడు నిర్దయగా దహిం చాడు. కానీ  మానవులను పీడించే దరిద్రాన్ని ఏ మహానుభావుడూ దహించడే! ఆ పనికి మీరైనా పూనుకోరాదా" అని ఈ బ్రాహ్మణుడు మీకు హెచ్చరికచేస్తున్నాడు.
అది విని రాజు చాలా సంతోషించి, బ్రాహ్మణుణ్ణి ఘనంగా బహూకరించాడు.
తాను చేసిన పనికి దండన తప్పదని భయపడ్డాడు బ్రాహ్మణుడు. కాని గొప్ప సన్మానం జరిగింది. తన కళ్ళను తానే నమ్మలేక వెనక్కు తిరిగిచూసుకుంటూ సభనుంచి వెళ్ళిపోయాడు.
"ఆ బ్రాహ్మణుడలా వెనక వెనక చూస్తూ పోవటానికేమి కారణం?" అని భోజ రాజు కాళి దాసు నడిగాడు.
"మీరు దగ్ధంచేసిన దరిద్రదేవత మళ్ళీ తన వెంట రావటం లేదుగదా అని ఆ బ్రాహ్మణుడి భయం,” అని యుక్తిగా కాళి దాసు జవాబుచెప్పాడు.

చందమామ కోసం కె. కాంతారావు గారి రచన - వారికీ మా ధన్యవాదాలు.
 2️⃣8️⃣0️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

*10. విభూతి యోగము.*
(పదవ అధ్యాయము)
_________________________

*32. సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జునl*
 *అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ll*

ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతము నేనే. ఈ సృష్టి ఎప్పుడు ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాల ముందు మొదలయిందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు అంతం అవుతుందో ఎవరికీ తెలియదు. పోనీ ఈ సృష్టి ఎలా నడుస్తూ ఉందో, రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంటే భూత, భవిష్యత్, వర్తమానములు ఎవరికీ తెలియవు. ఎందుకంటే అది నేనే. నా నుండి వచ్చిన వాళ్లకు నా గురించి తెలుసుకునే అవకాశం లేదు. టార్చిలైట్ కాంతి సూటిగా ముందుకు ప్రసరిస్తుంది కానీ వెనక్కు తిరిగి తాను ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోలేదు. ఈ సృష్టి అంతా నేనే కాబట్టి నాకు ఆది, అంతము లేదు. ఈ సృష్టికి ముందు నేను ఉన్నాను. సృష్టి అంతా లయం అయిన తరువాత కూడా నేను ఉంటాను, కాబట్టి, ఈ సృష్టి గురించి నాకు మాత్రమే తెలుసు. నాచే సృష్టింపబడిన వాటికి నా గురించి తెలియదు.

అన్ని విద్యలలో ఆధ్యాత్మిక విద్య ఉత్తమమైనది. మిగిలిన విద్యలు అన్నీ కేవలం ఉదర పోషణార్ధమే. అవన్నీ బాహ్య ప్రపంచానికి సంబంధించినవి. కాని ఆధ్యాత్మిక విద్య నీ గురించి నీవు తెలుసుకోవడానికి ఉపకరించే విద్య. సాధారణంగా మనం ఎవరి దగ్గరకన్నా వెళ్లినపుడు, నేను ఫలానా అని మనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు, పుట్టిన ఊరు, చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగం గురించి, ఏ పని మీద వచ్చామో అవన్నీ చెప్పుకుంటాము. కానీ నేను ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఈ లోకం విడిచిన తరువాత ఎక్కడికి పోతాను. అంటే నీ గురించి నీవు తెలుసుకోవడం లాంటిది. మనం ఈ విషయాలను గురించి అస్సలు ఆలోచించము. వాటి గురించి చెప్పేదే ఆధ్యాత్మిక విద్య. ప్రాపంచిక విద్యలు మనకు సుఖాలను, వాటి వెంట దుఃఖాలను రెండింటినీ కలుగజేస్తాయి. కాని ఈ ఆధ్యాత్మిక విద్య మనకు పరమ శాంతి సుఖము ప్రసాదిస్తుంది. ప్రాపంచిక విద్యలు అన్నీ "నేనే ఈ దేహము" అనే ప్రాతిపదిక మీద పని చేస్తాయి. ఆధ్యాత్మిక విద్య "నీవు ఈ శరీరము కాదు నీవు వేరు ఈ శరీరము వేరు", అనే ప్రాతిపదిక మీద పని చేస్తాయి. ప్రాపంచిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. కాని ఆధ్యాత్మిక విద్యకు డిగ్రీలతో సంబంధం లేదు. ఆత్మజ్ఞానము ముఖ్యము. నీ గురించి నీవు తెలుసుకుంటే ఇంక తెలుసుకోవలసింది ఏమీ ఉండదు అని బోధిస్తుంది. ఇన్ని ఉత్తమ లక్షణాలు కలిగి ఉంది కాబట్టి ఈ అధ్యాత్మవిద్య నేనే అని అంటున్నాడు కృష్ణపరమాత్మ.

ప్రతి విషయానికి అవును, కాదు, అంటే వాదము ప్రతి వాదము అనేవి ఉంటాయి. అప్పుడే అసలు నిజం తేలుతుంది. అందుకే నేతి (న ఇతి... నేతి అంటే ఇది కాదు) సిద్ధాంతము వచ్చింది. పరమాత్మను తెలుసుకోవడానికి ఇది కాదు ఇది కాదు అని అన్నిటినీ పరిహరిస్తూ పోతే తుదకు మిగిలేది పరమాత్మ. అది నేను అంటున్నాడు. వాదమునే సంవాదము అని కూడా అంటారు. భగవద్గీత కూడా కృష్ణార్జున సంవాదము. అంటే తనకు తెలియని విషయాలను అర్జునుడు అడిగితే, ఆ విషయాలను లోతుగా చర్చించి, విశదపరిచి చెప్పడం. దీనిని వాదము, సంవాదము అని అంటారు. అంటే ఒక విషయాన్ని లోతుగా విశ్లేషించడం, దాని అంతం దాకా ఆలోచించడం. ఈ సంవాదము మనిషిలో జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేస్తుంది. ప్రతివాదము మనిషిలో వ్యతిరేక భావాన్ని కలుగజేస్తుంది. కాబట్టి వాదించేవారిలో వాదనా శక్తిని నేను అని అంటున్నాడు పరమాత్మ.

ఈ వాదాలు మూడు రకాలు అని చెబుతారు. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పడం, విశ్లేషించి, విశదపరిచి చెప్పడం, అర్ధం అయ్యేటట్టు చెప్పడం వాదము. ఆ వాదమును ఖండిస్తూ, తన వాదమును మాత్రమే వినిపించడం ప్రతివాదము. అంటే ఎల్లప్పుడూ ఎదుటి వాడు చెప్పింది తప్పు, తాను చెప్పింది మాత్రమే ఒప్పు అని వాదించడం ప్రతి వాదము. ఎదుటి వాడు, మంచి చెప్పినా, చెడు చెప్పినా, ఏం చెప్పినా, దానిని ఖండిస్తూ, ఇతరులు చెప్పింది తప్పు, ఇతరులు చెడ్డవాళ్లు, వాళ్లకు ఏమీ తెలియదు, తనకు మాత్రమే అంతా తెలుసు, తాను చెప్పిందే ఒప్పు అని ఏ విధమైన ఆధారాలు లేకుండా వాదించడం వితండ వాదము అని అంటారు. పరమాత్మ ఈ ప్రతివాద, వితండ వాదం జోలికిపోవడం లేదు. కేవలం సంవాదములో ఉన్న వాదనాశక్తిని నేను అంటున్నాడు.
(సశేషం)
👏🌺🧘🧘‍♀️🧘‍♂️🇮🇳🌍🧘🧘‍♀️🧘‍♂️🙏

https://youtu.be/yvHkEAa93WM?si=xWQqwS35iNFGlmay

👏🧘🧘‍♀️🧘‍♂️🧘🧘‍♀️🧘‍♂️🧘🧘‍♀️🧘‍♂️🙏🇮🇳🌍🙏🧘🧘‍♀️🧘‍♂️
 జటాయువు సోదరుడు సంపాతి నాకు సీతామాత లంక లో వనం లో చెట్టు కింద సీతామాత నాకు కనపడుతోంది అని చెప్పిన తరువాత కూడా హనుమంతుడు ముందు వనం లో వెదక కుండ లంకా నగరం లో ఎందుకు వెదికారు. సీత మాట కనపడ లేదని ఎందుకు బాధ పడ్డారు?


వనం అంటే ఏ వనం. ఒకటే వనం ఉంటుందా లంకలో. చాలా వనాలు కూడా చూసే ఉంటారు హనుమ. అశోకవనం కనిపించలేదు. ఇక్కడ ఏఏ వనాలు ఉన్నాయి అని ఎవరినీ అడిగే అవకాశం లేదు హనుమకు.

హనుమ లంకలో ప్రవేశించినది రాత్రి. మహర్షి అప్పుడు హనుమ చిన్న పిల్లి పిల్లలా ఉన్నారన్నారు.

చిన్నరూపంలో ( పిల్లి అంత వానరం ) హనుమ లంకలో ప్రవేశించి భవనాలని, రక్షణవ్యవస్థని, మనుషులనీ, అన్నివైపులా పరిస్థితులు ఎలా ఉన్నాయో అని నిశితంగా గమనిస్తున్నారు. ఆయుధాలు పట్టుకుని యోధులు తిరుగుతున్నారు.

కొందరు మంత్రవేత్తలు దర్భలు పట్టుకుని తిరుగుతున్నారుట. దేనికి?. ఎవరయినా శతృవులు కనబడకుండానో, సూక్ష్మరూపంలోనో లంకలో ప్రవేశిస్తే వీరి మంత్రశక్తికి దొరికిపోతారు.

అటువంటి రక్షణలో ఉన్న నగరంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. హనుమ కనుక అలా చేయగలిగారు.

రావణుడు సీతమ్మను అపహరించి తీసుకుని వచ్చాడు.‌ ఎక్కడో కట్టుదిట్టమైన భవనంలో బంధించి ఉంచుతాడు కాని ఉద్యానవనంలో ఎలా ఉంచుతాడు.‌ సంపాతికి ఆ సమయంలో అక్కడ కనిపించింది అంటే అన్ని వేళలా అక్కడే ఉంటారు సీతమ్మ అని కాదుగా. సంపాతి చెప్పిన విషయం సీతమ్మ లంకలోనే ఉందని గ్రహించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

అంతా వెతికి సీతమ్మ కనపడక పోయేసరికి హనుమ ఓ చక్కటి ఆలోచన చేస్తారు:

" ఉత్సాహంగా వెదుకుతాను. మళ్ళీ వెతుకుతాను. ఇక్కడే ఉండి మళ్ళీ మళ్ళీ వెదుకుతాను. అప్పటికీ కనబడకపోతే తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండి పోతాను. నేను ఎప్పటికయినా వస్తానని ఆశతోనయినా అక్కడ అందరూ ప్రాణాలతో ఉంటారు " అనుకుంటారు.

ఇక్కడ హనుమ చివరిగా " తపస్సు " చేసుకుంటానన్నారు. భగవధ్యానం. అదే శరణాగతి, భగవంతుడిపై భారం వేసేయడం. అటుపై అన్నీ భగవంతుడే చూసుకుంటారు.

అదే జరిగింది. ఇలా అనుకుని వెనక్కి తిరగ్గానే " అశోకవనం " కనబడింది. సీతమ్మ జాడ తెలిసింది.

మన శక్తికి మించిన పని అయినా, ఎన్ని సార్లు ప్రయత్నించినా పని అవకపోయినా భగవంతుడికి వదిలేయాలి అందుకే. నిరాశ చెందడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు.

హనుమ " బుద్ధిమతాం వరిష్ఠం " - ఆలోచించడంలో హనుమ తరువాతే ఎవరయినా.

శుభమస్తు
 **శ్రీరామ**

ముందుమాట:-
                 ఈ నా రచనకు ఏం   పేరు పెడదామని, ఎలాంటి శీర్షిక అయితే బాగుంటుందని ఎంతగా ఆలోచించినా కూడా
ఈ రచనకు సంబంధించి "అమ్మ" అన్న పదాన్ని మించి అందమైన, హాయిగల పదం దీనికి మించిన తీయనైన పదం నాకు మరొకటి కనబడలేదు, తోచలేదు. "అవతార మూర్తి అయినా అణువంతే పుడతాడు. అమ్మ ప్రేగు పంచుకునే అంతవాడు అవుతాడు" అని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు చెప్పినట్లుగా ఈ ప్రాపంచిక సృష్టిలో అమ్మ అనే పదాన్ని మించిన  గొప్ప పదం నాకింక వేరేదీ కనబడలేదు, తోచలేదు మరి అందుకే ఈ రచనకు...   

        ***❤️ *అమ్మ* ❤️***
అమ్మ గుర్తుకువస్తోంది. చిన్నప్పుడు నాకు స్నానం చేయించేముందు ఆ నీళ్ళలో చేయిపెట్టి ఆ నీళ్ళు నా ఒంటికి హాయిగా అనిపించేంత వేడిగా ఉన్నాయో లేదోనని చూసి, నాకు సరిపడా "తగుమాత్రం వేడి " ఉన్న నీళ్ళతో స్నానం చేయించి, స్నానం అయిపోయియాక శ్రీరామరక్ష అని ఆఖరున చెంబుడు నీళ్ళు తిప్పిపోసే అమ్మ గుర్తుకొస్తోంది. ఆ తర్వాత వెచ్చగా కాపు కాచేది . నేను తినగలిగేలా అంటే నా నోటికి ఎక్కువ కారం కాకుండా, నా పొట్టకి అంత భారం కాకుండా అంటే నా నోటికి రుచిగా, పొట్టకి హాయిగా ఉండేలా అంత ఎక్కువ వేడి, కారం లేకుండా ఉందోలేదోనని తాను ముందుగా రుచి చూసి నాకు తినిపించే అమ్మ ప్రేమ గుర్తుకొస్తోంది. పుట్టినరోజున నన్ను చక్కగా తయారుచేసి నన్ను తృప్తిగా చూసుకుని మళ్ళీ తన దృష్టే తగులుతుందేమోనని కలతచెంది మొదట తల్లి దిష్టి అనే మొదలెడుతూ నాకు దిష్టి తీసే అమ్మ గుర్తుకొస్తోంది. అది తలుచుకుంటే, అమ్మ ప్రేమను నా మనసు ఇప్పుడు కూడా అనుభూతి చెందుతోంది. నేనడిగిన, నాకు ఇష్టమైన ఆహార పదార్థాలు, నేను నాకు చేయమని, తింటానని అడిగిన వంటకాలను, నేను బడి నుండి వచ్చేటప్పటికి తయారుచేసి, నేను ఇంటికి వచ్చేవరకూ ఎదురు చూస్తూ, వచ్చాక తినిపించబోతే, నేను అప్పుడు వాటిని తినకుండా స్నేహితుల పుట్టినరోజు వేడుకకని స్నేహితుల ఇంటికి విందుకు  వెళ్ళబోతే, మొదట నొచ్చుకున్నా, తర్వాత వెంటనే తమాయించుకుని నన్ను ముద్దు పెట్టుకుని, చిరునవ్వుతో జాగ్రత్తగా వెళ్ళి, ఆనందంగా గడిపి రమ్మని దీవించి నా నుదుట విభూతి బొట్టు పెట్టి పంపించే అమ్మ గుర్తుకొస్తోంది. తలుచుకుంటే నా మనసు అమ్మప్రేమని ఇప్పుడు కూడాఅనుభూతి చెందుతోంది. నేనెక్కడికి వెళ్ళినా, ఇంటికి తిరిగి వచ్చేవరకు కళ్ళన్నీ గుమ్మంవైపే పెట్టి మనసంతా నా క్షేమాన్నే కోరుకుంటూ దేవున్ని తలచుకుంటూ ఎదురుచూసే అమ్మే గుర్తుకొస్తోంది. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ సరిగా తిన్నానో లేదోనని తిరిగి వచ్చాక మళ్ళీ కొసరి కొసరి తినిపించే అమ్మ గుర్తుకొస్తోంది. ఆఖరికి నేను ఎక్కడైనా ఒక ప్రత్యేకమైన విందుకి వెళ్ళినా కూడా అక్కడ సరిగా తిన్నానో లేదోనని, తిరిగివచ్చాక మళ్ళీ కనీసం పెరుగు అన్నమైనా తిను అని కొంచెం పెరుగన్నం కలిపి తానే తన చేత్తో తినిపించేది. మళ్ళీ నేను తిన్నాక ఆఖరిముద్ద దిష్టి తీసే అమ్మ గుర్తుకొస్తోంది. అది తలచుకుంటే ఈ క్షణం కూడా నా మనసు అమ్మప్రేమను అనుభూతి చెందుతోంది. అవునన్నట్లు, ఇంక తింటూ తింటూ నేను మధ్యలో తుమ్మితే చిరంజీవ చిరంజీవ అని మా గోత్రాన్ని, గోత్ర ఋషిని, మా ఇంటి ఇలవేల్పునీ తలచుకుని మా ఇంటిపేరుతో సహా నాపేరు చెప్పి ఆ దేవతను చల్లగా చూడమని నామీద నీళ్ళు చల్లేది. అది తలుచుకుంటే అమ్మ ప్రేమతో   ఈ క్షణం కూడా నా హృదయం తడిసిపోతోంది.  తను అలా నీళ్ళు చల్లి నప్పుడు, మరీ చిన్నప్పటి నా నవ్వుల కేరింతతో, కొంచెం పెద్దయ్యాక చిలిపిగా నవ్వే నా నవ్వుతో తన ముఖం ఎంత వికసించేదో..😍, ఎంత వెలిగిపోయేదో...🤩 అదంతా నాకిప్పుడు గుర్తుకొస్తోంది ఆ జ్ఞాపకంతో నా కన్ను చెమరిస్తోంది. నేను తిన్నాకనే తనకి తృప్తి. నేను తింటేనే తన ఆకలి తీరినట్లుగా భావించే అమ్మ., అప్పుడు ఏదో శాస్త్రానికి అన్నట్లుగా కొంచెం తిని, అన్ని సర్దుకుని, అప్పుడెప్పుడో తెల్లవారుఝామున లేచిన అమ్మ, ఇంటి పనులతో, నా పనులతో క్షణం తీరిక లేక అలసిపోయినా కూడా నా నవ్వులో, నా అల్లరిలో తన విశ్రాంతిని, ఆనందాన్ని పొంది, ఎంతో అలసటగా ఉన్నా కూడా మళ్ళీ పడుకునే ముందు నాకు ఎన్నో నీతి కథలు చెప్పి నన్ను నిద్రపుచ్చే అమ్మ గుర్తుకొస్తోంది. అమ్మప్రేమను తలచుకుంటే ఇప్పటికీ నా మనసు ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతోంది. ఇంక చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చిందంటే అమ్మని కదలనివ్వడమే!... ఊహూ🙅... అసలు చిన్నప్పుడు నాకు జ్వరం  వస్తే అమ్మకేమో ఆందోళన. నాకేమో ఆనందం, ఎందుకంటే... అమ్మ ప్రక్కకి వెళ్ళినా, దూరంగా వెళ్ళినా కూడా ఓ కంట నన్ను కనిపెట్టుకునే ఉంటుందన్న విషయం తెలీని పసి వయస్సులో, అమ్మ నా ప్రక్కనే ఉండి, నాతోనే ఎక్కువ సమయం గడుపుతుందనే ఆలోచనతో, ఆశతో వచ్చే ఆనందం నాది. నా వేడి నుదిటి మీద తన చల్లని చేయ వేసి చూసి అయ్యో ఇంకా తగ్గలేదే, ఇంకా వేడిగానే ఉందే అని కంగారు పడే అమ్మ గుర్తుకొస్తోంది. ఎప్పుడైనా నాకు ఒంట్లో బావులేకపోయినా, ఆ చేదు మాత్రల సంగతెలా ఉన్నా, నోటికి ఏమీ సయించక నోరంతా వెగటుగా ఉన్నమాట ఎలా ఉన్నా కూడా, నా వేడి నుదిటి మీద తన చల్లని చేయ వేసి చూసి అయ్యో ఇంకా తగ్గలేదే, ఇంకా వేడిగానే ఉంది అని కంగారుపడుతూ చెప్పే మాట నాకు ఆనందాన్ని కలిగించేది. ఆనాటి ఆ మాధుర్యం ఈ నాడు కూడా గుర్తుకొస్తోంది. మళ్ళీ ఆరోజులు తిరిగివస్తే ఎంత బాగుండును అనే వెర్రి ఆలోచనని కలిగిస్తోంది. నాకు ఒంట్లో బావులేనప్పుడు ఎన్నెన్ని నిద్ర లేని రాత్రులు గడిపిందో😒! ఒకటా, రెండా నాకు ఎన్ని, ఎన్నెన్ని సేవలు చేసిందో కదా😞! నాకోసం ఎన్నెన్ని త్యాగాలు చేసిందో కదా😔! అయినా కూడా ఆమెకు తిరిగి నేనేమి చేయగలను? కేవలం వాటిని గుర్తు చేసుకోవడం తప్ప😞. మీకో విషయం చెప్పనా? తను నాకు ఇంత చేసినా కూడా అమ్మ, కనీసం నేను వాటిని గుర్తుంచుకోవాలని కూడా కోరుకోదు. ఇంక తను నా నుండి ఏమి ఆశిస్తుంది🤷!? కానీ ఆలోచించగా🤔 ఆలోచించగా నాకైతే ఒక మార్గం దొరికింది. కర్తవ్యం బోధ పడింది. అన్నింటికన్నా ముందు నేరొక నిర్ణయాన్ని గట్టిగా తీసుకున్నాను. అదేమిటంటే.. వయసు పెరిగి, వృద్ధాప్యం మీద పడిన కారణంగా, కుచించుకుపోయి చిన్నదైన మెదడు వల్ల అమ్మ, ఇంతకుముందులా ఉత్సాహంగా, సమర్ధవంతంగా పనిచేయలేకపోతోంది. అందువల్ల అంత చురుకుగా తెలివిగా మాట్లాడలేకపోవడమే కాకుండా నాకు కోపం తెప్పించేవిధంగా మాట్లాడడం, ప్రవర్తించడం చేసే అమ్మపై ఏమాత్రం  నేను తిరిగి కోపగించుకుని, పరుషంగా మాట్లాడకూడదనీ, ఆమె మనసు నొచ్చుకునే - విధంగా ఎంతమాత్రం ప్రవర్తించకూడదని, ఆమెను నా మాటల ద్వారా, చర్యల ద్వారా ఏమాత్రమూ బాధపెట్టకూడదనే నిర్ణయాన్ని తీసుకుని, ఈ తీసుకున్న నిర్ణయంలో ఏమాత్రమూ ఏమరిపాటుగా ఉండకూడదని నా మనసుకు గట్టి హెచ్చరికగా పదే పదే చెప్పుకుని, నాకు నేనుగా ఒక పూనికగా తీసుకుని దానిని పాటించడానికి ప్రయత్నించి సత్ఫలితాన్ని సాధించాను. తద్వారా నామీద నాకు ఈమాత్రం నియంత్రణ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అమ్మ నాకు చేసినదానికి సరిసమానం కాకపోయినప్పటికీ, అమ్మప్రేమతో ఏదీ సరితూగకపోయినా కూడా, తన బిడ్డ తనకోసం ఏకొంచెం సంతోషపెట్టే, ఏ చిన్నపని చేసినాకూడా, అమ్మ అందులో అనంతమైన ఆనందాన్ని వెతుక్కుంటుంది. అందుకే రేపు అమ్మని చక్కగా తయారుచేసి, అంటే అదే చలికాలం కదా.., అందుకని స్వెట్టర్ అదీ వేసి మఫ్లర్ అదీ కట్టి అలా బయటికి షికారుకి తీసుకెళదామనుకుంటున్నాను.అచ్చం నా చిన్నప్పుడు అమ్మ నన్ను పార్కులకి, బీచ్ కీ అదీ తిప్పి నాకు చూపించినట్లే😍. సరే మొత్తానికి ఒకరోజు మంచినీళ్ళు, ఇంకా దారిలోకి అవసరమైనవన్నీ తీసుకుని అమ్మ, నేను షికారుకైతే బయల్దేరాము. ఇవాళ, నేను అమ్మకి సాధారణంగా ఈ మధ్య బయటకు వెళ్ళేటప్పుడు పెట్టే షరతులేమీ పెట్టలేదు. నిబంధనలేవీ విధించలేదు. ఏరకమైన హెచ్చరికలనూ జారిచేయలేదు. ఇంకేజాగ్రత్తలూ చెప్పలేదు. కేవలం నేను అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నానంతే. హాయిగా స్వేచ్ఛగా మాట్లాడమనీ, . స్వతంత్రంగా తను ఎలా కావాలనుకుంటే అలా ఉండమనీ చెప్పాను. చెప్పానుగా, ఇంతకుముందులా అమ్మ తెలివిగా మాట్లాడట్లేదనీ, చురుకుగా ఉండట్లేదనీ, అమ్మకు కూడా వయసు పెరిగిందనీ, వృద్ధాప్యంలో ఉందనే విషయాన్ని మొదట నేను జీర్ణించుకోలేకపోయాను. అమ్మ ఎప్పటికీ నా చిన్న ప్పుడు చూసినట్లుగానే ఉండాలని కోరుకోవడం తప్పే కదా🤷! అమ్మ వయసులో పెద్దదవుతోంది తిరిగి బాల్య దశకు చేరుకుంటోందన్న కఠిన నిజాన్ని నా మనసుకి తీసుకోలేకపోయాను. జీవితంలో ఈ దశ ఎవరికైనా సహజమే, ఆమె అలా ఉండడం సాధారణమే అన్న కోణంలో నేనెప్పుడూ ఆలోచించనే లేదు. అందుకని బయటకు వెళ్ళేప్పుడు ఇలా మాట్లాడకు, అలా ఉండకు, ఇది తినకు, అలా నడుచుకో అంటూ నీతి బోధలు చేయడం, అలా ఆమెను కట్టడి చేసి ఇదంతా ఆమె మంచికే, ప్రేమతోనే ఇలా చెబుతున్నాను అంటూ నేను భ్రమ పడుతూ ఒక చిన్నపాటి పైశాచిక ఆనందం పొందడం అనే చెడు అలవాటుకు నేను ఇన్నాళ్ళు బానిసనైనాను. ఇప్పుడు కళ్ళు తెరిచి, బుద్ధి తెచ్చుకున్నాను. ఈ రోజు కొంచెం నలతగా ఉందని అమ్మ అంటే చాలు ఇవి తిన్నావు, అది చేసావు అంటూ రకరకాల కారణాలు చెప్పి, ఇక ఆమె నాతో తన ఆరోగ్య సమస్య చెప్పి ఊరట పొందే, తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఇన్నాళ్ళూ హరించివేసాను. " *నిజానికి ఆమె వేసుకునే బలం మాత్రల వల్ల ఆమెకు బలం చేకూరడం కానీ, నొప్పి మాత్రల వలన నొప్పి తగ్గడం అంటూ కాని ఏమీ లేదు. తనకోసం కొంచెం నా సమయం వెచ్చించి తనతో నేను గడిపే కాలం, తను నాతో చెప్పే నాలుగు మాటలు ఓపికగా విని, నేను ఆమెతో చెప్పే నాలుగు ఓదార్పు మాటలే తనకు శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి తనకు నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయని* " ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆలస్యమైనా కూడా తెలుసుకున్నాను,తెలుసుకుని ఇప్పటికైనా మారాను. ఫరవాలేదు, అదేతృప్తి.  అందుకే అమ్మను పార్కుకు తీసికెళ్ళినప్పుడు, తను స్వేచ్ఛా జీవిలా ఎంతో హాయిగా, ఆనందంగా ఉయ్యాల ఊగుతుంటే, పడిపోతావని నేను వారించలేదు సరికదా పడిపోకుండా అచ్చం అమ్మలాగే జాగ్రత్తగా చూస్తూ ఊయల ఊపాను. ఆడించాను. తను అడగడమే తడువుగా ఐస్ క్రీం కొన్నాను.  షుగర్ అనీ,జలుబు చేస్తుందనీ అడ్డు పెట్టలేదు. తను పాపం ఆశగా తినాలనుకున్న మొక్క జొన్నపొత్తును నమల లేక రెండే గింజలు తిన్నా కూడా ఈ సారి నా కడుపు నిండిపోయింది. పడుకునేటప్పుడు అమ్మ ప్రక్కన పడుకుంటూ నాకు తనకు మాత్రమే తెలిసిన విషయాలూ, నా చిన్నప్పటి సంగతులూ, మధ్య మధ్యలో లోకాభిరామాయణం మొదలైనవన్నీ మాట్లాడుకుంటూ అమ్మను నిద్రపుచ్చాక నేను నిద్రపోవడం నా దినచర్యలో భాగంగా మారింది. ఆ విధంగా నా దినచర్య ముగియడం అమ్మ సంగతేమో కానీ నాకు మాత్రం అమితమైన ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తోంది. లేకపోతే,  అమ్మని నేను విసుక్కున్నా, తనని బాధపెట్టే విధంగా ఏమాట అన్నా కూడా అమ్మ కన్నా కూడా నాకే ఎక్కువ బాధగా ఉండేది. కానీ... ఇప్పుడు అచ్చం అమ్మలా కాకపోయినా, దాదాపుగా మా అమ్మని, నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చూసి, పెంచిన విధంగానే మంచిగా, ప్రేమగా మా అమ్మని చూసుకుంటున్నాను. ఇంతకన్నా నాకు ఆత్మ సంతృప్తిని కలిగించే విషయం ఇంకోటి ఉండదేమో. మరి మీ సంగతి? అమ్మని, అచ్చం అమ్మ మనలను చిన్నప్పుడు చూసినట్లుగా ఇప్పుడు మీరు ప్రతివిషయంలోనూ అంతే ప్రేమగా, అచ్చం అమ్మలానే చూసుకుంటున్నారా?👍😊
జ్యోతి సంపర
 కోపానికి,ఆవేశానికి గల తేడా?
నాకు కోపం చాలా ఎక్కువ అందుకని ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చే అర్హత నాకు ఉందని అనుకుంటున్నాను. కోపానికి, ఆవేశానికి తేడా తెలియటం కోసం రెండు ఉదాహరణలు చెప్తాను నా సొంత అనుభవాలు:

మొదటి అనుభవం: కోపం

నేను ఏ పని చేసినా పూర్తిగా కాన్సంట్రేషన్ దాని మీద ఉంచి చేస్తాను, అది చదువుకోవటం ఐనా, తినటమైన, గిన్నెలు కడగటమైనా. ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఎవరైనా అనవసరంగా కదిలిస్తే చిరాకు పడతాను (కానీ చూపించను). ఒకసారి మా అత్త, వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చారు. నేను చదువుకుంటున్నాను. పలకరించి వెళ్ళిపోయాను నా గదిలోకి. "ఊరి నుంచి వచ్చాము, నాతో టైం spend చేయి", అని వచ్చిన దగ్గర నుంచి ఒకటే నస మా బావ. చాలా సేపు చెప్పాను, "నాకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి చదువుకోవాలి" అని. మా బావ వినకుండా నా పుస్తకం లాక్కున్నాడు. సాచి చెంప మీద కొట్టాను. కొట్టడంతో పాటు, నా పుస్తకం వెనక్కి తీసుకుని గట్టిగా చేయి కొరికాను, రక్తం వచ్చే లాగా. (చిన్న పిల్లని అనుకుంటారేమో, అప్పుడు నా వయసు 21, డిగ్రీ ఫైనల్ year, మా బావ వయసు 29). ఇది కోపం, నా సమయం వృధా చేస్తున్నాడని.

రెండో అనుభవం: ఆవేశం

ఒకసారి నేను, మా చెల్లి కూరగాయలు తీసుకు రావటానికి మెహ్దిపట్నం రైతు బజార్ కి వెళ్ళాము. హైదరాబాద్లో దేనికైనా కొరత ఉందేమో కానీ, చిత్తకార్తె సన్నాసులకి మాత్రం ఏ కొరత లేదు. ఒక శుంఠ నాకు తగిలాడంట, మా చెల్లి వాడిని తిట్టింది (మా చెల్లి శాంత మూర్తి). అలాంటిది ఎందుకు తిడుతుంది అని అడిగాను, మా చెల్లి సగం మింగేసి "తగిలాడు" అని మాత్రం చెప్పింది. ఆ వెధవ మా చెల్లిని తగిలాడు అని అనుకుని, నాకు ఆవేశం పొంగి వాణ్ణి చెంప మీద రెండు సార్లు కొట్టి, చేతిలో ఉన్న హ్యాండ్ బాగ్ తో నాలుగు బాదాను. ఈ లోపల అందరూ పోగయ్యరు, వాళ్ళకి విషయం చెప్పి, ఆ రైతు బజార్ లో ఆఫీస్ లో కంప్లైంట్ చేసి వచ్చాను, కూరగాయలు తీసుకోవటం మర్చిపోయి.

ఇది ఆవేశం!

రెండూ గొప్ప సద్గుణాలు అయితే మాత్రం కాదు. BP త్వరగా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి శాంతంగా ఉండటం మేలు (మళ్ళీ నా స్వానుభవంతో ఉచిత సలహా).
 రైలుబడి 

(ప్రతి ఉపాధ్యాయుడు చదివితీరాల్సిన పుస్తకం)

పుస్తక సమీక్ష - అనురాధ నాదెళ్ల
రచన: టెట్సుకో కురొయనాగి
అనువాదం: ఈశ్వరి, ఎన్. వేణుగోపాల్

మనం మట్లాడుకోబోతున్న పుస్తకం చదువుతున్నంత సేపూ మన పెదవులమీద చిరునవ్వు చెరగనివ్వదు. చదువుతున్న అందరినీ బడికెళ్లే పిల్లలుగా మార్చేస్తుంది. మనల్ని మంత్రించి,బాల్యపు లోకాల్లోకి తీసుకెళ్ళి పోతుంది.ఇప్పటికే ఊహించేసి ఉంటారు కదా, అవును అది “రైలుబడి”. చదివిన ప్రతివారూ ఆ బడిలో తాము కూడా చదువుకుంటే ఎంత బావుణ్ణు అని అనుకోకమానరు.

1933లో జన్మించిన టెట్సుకో కురొయనాగి ఈ “రైలుబడి” పుస్తకం రచయిత్రి,జపాన్ దేశస్థురాలు. ఈమె రేడియో, టివి వ్యాఖ్యాతగా పనిచేసారు. పుస్తకం ప్రచురించిన మొదటి సంవత్సరమే నలభై ఐదు లక్షల కాపీలు అమ్ముడుపోయాయి.ఇది జపాన్ ప్రచురణా రంగంలో ఒక రికార్డ్.తన పుస్తకానికొచ్చిన పారితోషికాలతో బధిర నటులకు శిక్షణ ఇచ్చేందుకు రచయిత్రి “టొటొ ఫౌండేషన్” స్థాపించారు.తాను చదివిన “టోమో” అనే బడి స్థాపకుడైన “సొసాకు కొబాయాషి” గురించి రాసే ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు.1945లో టోక్యోపై జరిగిన బాంబు దాడిలో టోమో బడి ధ్వంసమైపోయింది.

“కొబయాషి” విద్యాబోధనా పధ్ధతులను “రైలుబడి” లో అందంగా వర్ణించారు రచయిత్రి.పిల్లలంతా సహజంగా ఉత్తమ స్వభావంతో జన్మిస్తారని,కానీ ఆ మంచితనం చుట్టూఉన్న వాతావరణం వల్లా, పెద్దల తప్పుడు ప్రభావాల వల్ల సులభంగా చెడిపోతుందని ఆయన అభిప్రాయం. 

అందుకే పిల్లల్లో ఉన్న మంచిని వెలికి తియ్యటమే తన లక్ష్యం అని చెప్పారాయన.తన కూతురు మియోచాన్ ను చిన్నప్పుడు షికారు కి తీసుకెళ్తూ, “ప్రకృతిలో మోగే శ్రుతిలయల్ని విందాం పద” అని చెప్పేవాడట. చెట్ల ఆకులు,రెమ్మలు గాలికి కదలటం, నదిలో నీళ్లు కదలటం తాను తండ్రితో కలిసి పరిశీలిస్తుండే దాననని చిన్నారి మియోచాన్ బడిలో తన స్నేహితురాలైన ఈ రచయిత్రికి చెప్పింది.

కొబయాషి అంత చక్కని బడిని నడుపుతూ కూడా ఎలాటి ప్రచారం చెయ్యనిచ్చేవాడు కాదట.అందు వల్లనే రెండో ప్రపంచ యుధ్ధ కాలంలో అధికారులెవ్వరికీ ఆ బడి గురించి తెలియలేదు. యుధ్ధ కాలంలో కూడా బడి కొనసాగింది.

“రైలుబడి” మనం చదివే ఎన్నో పుస్తకాలకంటే చాలా విభిన్నంగా ఉంటుంది.ఇది ఒక ఆరేడేళ్ల పాప కథ. అందరు చిన్నారుల్లాగే ఈ చిన్నారి టొటొచాన్ కూడా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తూ,తన పరిశీలనతో, ప్రశ్నలతో అందమైన అనుభవాలను స్వంతం చేసుకుంటుంది. 

ఏదైనా ఒక కొత్త సంగతి కనిపిస్తే కళ్లు విశాలం చేసుకుని చూస్తుంటుంది.టొటొచాన్ కి తనని అర్థం చేసుకునే అమ్మ, తన ఊహలకి, కలలకి రెక్కలిచ్చే అరుదైన అవకాశాన్నిచ్చిన బడి దొరికాయి.

ప్రతివారికీ జీవితంలో అత్యద్భుతమైన దశ బాల్యం. పెరిగి, పెద్దవుతూ ఎన్నేళ్లొచ్చినా చిన్నప్పటి విషయాల్ని తలుచు కుని మురిసిపోవటం సహజం. అలాటి సహజమైన అమాయకత్వంలోని అందం, ఆనందం ప్రతివారి జీవితంలోను వచ్చే అపురూప ఘట్టం. టొటొచాన్ కథని చదువుతుంటే మనం కూడా  బాల్యంలోకి వెళ్లిపోతాం.

అయితే టొటొ మొదటిసారి బడిలో చేరిన కొద్దిరోజుల్లోనే బడి నుంచి తల్లికి పిలుపొస్తుంది. తరగతి గదిలో డెస్క్ ని పదేపదే తెరవటం,మూయటం చేస్తూ అందరినీ చికాకు పరుస్తోందని టీచర్ ఫిర్యాదు చేస్తుంది. బడిలో చేరిన మొదటిరోజే ఇంటికొచ్చి ఆ డెస్క్ కొత్తరకంగా ఉందని టొటొ చెప్పిన మాట తల్లికి గుర్తొస్తుంది. 

అదొక్కటే టొటొని బడినుంచి పంపేందుకు కారణమా అని తల్లి విస్తుపోతే, టీచర్ ఇంకా చాలా ఫిర్యాదులున్నాయని వరసగా చెబుతుంది.

తరగతిలో టీచర్ పాఠం చెబుతుంటే టొటొ కిటికీ దగ్గరకు వెళ్లి వీధిలో వెళ్తున్న బాజాల వాళ్లని పిలిచి, వాళ్లని పాటలు వాయించమని అడగటం,తరగతిలో పిల్లలందరినీ కూడా పాఠం వైపు నుంచి దృష్టి మళ్లించటం వంటి ఎన్నో ఫిర్యాదులు టీచర్ చెబుతుంది. 

ఇంకా,కిటికీ దగ్గర నిలబడి చెట్టుమీద గూడు కట్టుకుంటున్న పిచ్చుకల జంటతో కూడా మాట్లాడు తుంటుందని, పాఠం మీద దృష్టి పెట్టదనీ,అందుచేత  టొటొని మరొక బడిలో చేర్చమని పంపేస్తుంది.

సొసాకు కొబయాషి  అనే హెడ్మాస్టారు పిల్లలపైన అమితమైన ప్రేమతో వారి ఆలోచనలకు, మనస్తత్త్వాలకు అనుగుణంగా ఒక అందమైన బడిని స్థాపిస్తారు. అది టోమో బడి.పిల్లలలో ఉండే సహజమైన కుతూహలం, ప్రేమ, మంచితనం పెంపొందిస్తూ, వారిని ప్రకృతితో సహజీవనం చేయిస్తూ పెంచాలని, వాళ్ల స్వంత ఆలోచనలు, అనుభవాలే వారిని తీర్చిదిద్దాలని ఆశిస్తారు.

దానికోసం విదేశాలలో రకరకాల శిక్షణ తీసుకుని టోమో బడిని మొదలుపెడతారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఉన్న ఆ బడిలో కేవలం యాభైమంది పిల్లలు ఉంటారు. ఆ బడి ప్రత్యేకత,ఎక్కడా చూడనిది ఇంకోటి ఉంది.అది రైలుపెట్టెల బడి. 

రైల్వే వారు నిరుపయోగంగా పడేసిన రైలు పెట్టెలని కొనుగోలు చేసి వాటిని తరగతి గదులుగా మార్చుతారు. బడి ముందు కాంక్రీటు గోడలతో కాకుండా పొడవాటి చెట్లను రెండువైపులా పెంచి, వాటినే గేటుగా అమర్చుతారు. ఆ బడికి ప్రహరీగోడ లేనే లేదు.

టొటొచాన్ తన తల్లితో కలిసి రైలెక్కి బడిలో చేరేందుకు బయలుదేరటంతో కథ మొదలవుతుంది. తన పాపని అర్థం చేసుకుని,విద్యాబుధ్ధులు నేర్పే బడికోసం వెతికి, అందులో చేర్పించేందుకు తల్లి టొటొని తీసుకెళ్లటమే రైలు ప్రయాణానికి కారణం.

రైలు ఎక్కటం టొటొకి మొదటిసారి కావటంతో ప్రయాణం అంతా ఉత్సాహంగా గమనిస్తుంటుంది. చేతిలోని టిక్కెట్టును అపురూపంగా పట్టుకుంటుంది, అయితే రైలు దిగి వెళ్లిపోయేప్పుడు టిక్కెట్టును స్టేషన్ మాస్టర్ కి ఇవ్వాల్సి రావటం టొటొ కి నచ్చదు. తాను “ఆ టిక్కెట్టును ఉంచేసుకోవచ్చా” అని ఆయనని అడుగుతుంది. అలా కుదరదు అని చెబితే, తను కూడా పెద్దయ్యాక స్టేషన్ మాస్టర్ అవుదామను కుంటున్నానని చెబుతుంది.

అయిష్టంగానే టిక్కెట్టుని ఆయనకి ఇచ్చేస్తుంది.
దారిలో తల్లి అడుగుతుంది, “ఇప్పటిదాకా డిటెక్టివ్ అవ్వాలని కదా అనుకుంటున్నావు” అని.కాస్త ఆలోచించి, “పైకి స్టేషన్ మాస్టర్ లా పని చేస్తూనే డిటెక్టివ్ గా ఉంటానని చెబుతుంది.ఇంకా రోడ్డుమీద బాజాలు వాయించేవాళ్ల లాగా కూడా అవుతానని చెబుతుంది. ఈ బాజాలవాళ్లు రోడ్ల మీద తిరుగుతూ వ్యాపారాలు చేసుకునే వారికోసం ప్రచారం చేస్తూంటారు.

కొత్తబడి మిగిలిన బడుల్లాగా కాకుండా మొక్కలు, చెట్లూ మధ్య ఉండటం,రైలు పెట్టెలే తరగతి గదులుగా ఉండటం చూసి టొటొ సంబరపడుతుంది. మొదటిసారిగా హెడ్ మాస్టర్ ని కలిసినప్పుడు “ఇన్ని రైలు పెట్టెలున్నాయి, మీరు హెడ్ మాస్టరా లేక స్టేషన్ మాస్టరా” అని అడిగేస్తుంది. 

టొటొ చురుకుదనం ఆయనకి నచ్చి, “కబుర్లు చెప్పు, వింటాను” అని ఆమెను ఎదురుగా కూర్చోబెట్టు కుంటారు. అప్పటివరకూ ఎవరూ తనని,తన మాటలని ఇంత శ్రధ్ధగా పట్టించుకోలేదన్న విషయం టొటొకి తెలుసు. అందుకే తనకి తోచిన కబుర్లు అలా ఒక నాలుగు గంటల పాటు చెబుతూనే ఉంటుంది. అంత ఓపిగ్గా సంతోషంగా తనని విన్నహెడ్ మాస్టర్ తెగ నచ్చేస్తారు టొటొచాన్ కి.

కొత్త బడి టోమో బడి.అక్కడ తరగతి గదులే కాకుండా మధ్యాహ్నం భోజనాల సమయం  కూడా టొటొ కి భలే నచ్చుతుంది.ప్రతి పిల్ల,పిల్లవాడి దగ్గరకు వెళ్లి హెడ్మాస్టార్ “సముద్రం నుంచి కాస్త, కొండలనుంచి కాస్త తెచ్చుకున్నావా?” అని అడుగుతారు. పిల్లలు తినే ఆహారం సమతులం గా ఉండాలని ఆలోచించి ఆయన అలా అలవాటుచేసారు. 

సముద్ర ఆహారం ఏమిటి, భూమి మీద ఆహారం ఏమిటీ అనేది ఆలోచించటం టొటొకి రోజూ ఉత్సాహంగా అనిపించేది.పిల్లలు తినేప్పుడు “రో,రో,రో యువర్ బోట్” బాణీలో “నములు, నములు, నములు” అంటూ ఒక పాట కూడా భోజనం ముందు పాడే అలవాటుని హెడ్మాస్టారు చేస్తారు.

తరగతిలో పిల్లలు పొద్దున్నే కష్టపడి చదువు పూర్తిచేసేస్తే మధ్యాహ్నం వారిని షికారుకి తీసుకెళ్తుంది టీచరు.ఆ షికారులో సెలయేటి గలగలల్ని,చుట్టూ ఉన్న మొక్కల్ని, చెట్లని,పూలని పరిశీలించటం పిల్లలందరికీ తెగ ఇష్టం. 

అక్కడ గుడి దగ్గర పాత బావిలో ఓసారి ఓ చుక్క తెగి పడిపోయిందని ఒక స్నేహితురాలు చెప్పినప్పుడు, టొటొ బావిలోకి చూసి “చుక్క ఎందుకు వెలగట్లేదో” అని ఆలోచించి “బహుశా నిద్దరోయిందేమో” అనుకుంటుంది. ఎంత కవితాత్మకంగా ఆలోచించిందో ఆ చిన్నారి!

”చుక్కలు నిద్దరపోతాయా?” అని స్నేహితురాలు అడిగినప్పుడు, “పొద్దంతా అవి పడుకుని రాత్రిపూట మేలుకుని వెలుగుతాయి” అని జవాబు చెబుతుంది.
ఎంత అందమైన భావన!

తన తరగతిలో ఉన్న యాసువాకి సరిగా నడవలేక పోవటానికి కారణం అతనికి పోలియో రావటం అని తెలుసుకుంటుంది.అతనితో స్నేహం కట్టేస్తుంది. యాసువాకి టి.వి. అనేదొకటి ఉంటుందని, ఇంట్లోనే కూర్చుని సుమో పోటీలు చూడవచ్చని టొటొకి చెబుతాడు. “అంత పెద్ద సుమోవీరులు అంత చిన్న పెట్టెలోకి ఎలా వెళ్తారు” అని టొటొ ఆశ్చర్యపోతుంది.

బడికి కొత్త రైలుపెట్టె వస్తుందని తెలిసినప్పుడు, అంత పెద్ద రైలుపెట్టె బడి వరకూ ఎలా వస్తుందో చూడాలను కుంటున్నామని పిల్లలంతా హెడ్మాస్టర్ ని అడుగుతారు.

“అది ఆ రాత్రి వస్తుందని,దానిని చూడాలనుకుంటే సాయంకాలం ఇంటికెళ్లి అమ్మతో చెప్పి, ఒక దుప్పటి, నైట్ డ్రెస్ తెచ్చుకొమ్మని” ఆయన పిల్లలకి చెబుతారు.
వాళ్లంతా అలా వచ్చి రైలుపెట్టె కోసం ఎదురు చూస్తూనే నిద్రలోకి జారుకోవటం,తెల్లవారు ఝామున రైలు పెట్టె వచ్చిందని తెలిసి చూస్తే, అది ఒక పెద్ద ట్రెయిలర్ మీద ట్రాక్టర్ సాయంతో రావటం గమనిస్తారు.ఆ రాత్రి పిల్లలంతా కబుర్లు చెప్పుకుంటూ పడుకోవటం వాళ్లకి ఒక మరపురాని అనుభవంగా మిగిలిపోతుంది.

ఒకరోజు హెడ్మాస్టర్ పిల్లలందరినీ బడిలోని ఈతకొలనులో ఈత కొట్టమని ఉత్సాహపరుస్తారు. ఎలాటి ఈత దుస్తులు అవసరం లేదని,బట్టలన్నీ విడిచి ఈత కొట్టమని చెబుతారు.అలా చెయ్యటం వల్ల శారీరక అవకరాలు, బలహీనతలు ఉన్నవాళ్లు ఎలాటి ఆత్మ న్యూనతకూ లోనవకుండా మిగిలిన వాళ్లతో కలిసిపోతారని, ఇంకా ఆడపిల్లలు, మగపిల్లలు తమతమ శరీరాలలోని భేదాల పట్ల అనారోగ్యకరమైన ఆసక్తి పెంచుకోకూడదని, అన్ని శరీరాలు అందమైనవే అని పిల్లలకి తెలియజేయాలని హెడ్మాస్టర్ ఆలోచిస్తారు.

పిల్లల్లో దెయ్యాలు అంటే భయం పోగొట్టేందుకు ఒకసారి హెడ్మాస్టర్ చిన్న ఆలోచన చేస్తారు.కొందర్ని దెయ్యలుగా నటించేందుకు ముందుకు రమ్మని ప్రోత్సహించి,వారిని శ్మశానంలో దాక్కోమంటారు.మిగిలిన పిల్లల్ని జట్లుజట్లుగా విభజించి రాత్రివేళలో పాత గుడిలోకి వెళ్లి, అక్కణ్ణుంచి శ్మశానం మీదుగా వెనక్కి రావాలని చెబుతారు. 

గుడి వరకు వెళ్లిన పిల్లలు చాలామంది ఏదో అర్థంకాని భయంతో శ్మశానం వరకు వెళ్లకుండానే వెనక్కి పరుగెత్తు కొస్తారు.శ్మశానంలో ఎదురుచూసి, ఎదురుచూసి అక్కడున్న పిల్లలు ఆ నిశ్శబ్దానికి భయపడి పరుగెత్తు కొస్తారు.ఈ ప్రయోగంతో పిల్లలందరూ అనుభవ పూర్వకంగా దెయ్యాలు లేవన్న విషయాన్ని తెలుసుకుంటారు.

యురిథమిక్స్ అనే వ్యాయామ సంగీతాన్ని హెడ్మాస్టర్ విదేశాల్లో పరిశీలించి టొమో బడిలో ప్రవేశపెడతారు. శరీరాన్ని అదుపులో పెట్టుకోవటం నేర్పే ఆట అది. సంగీతం చెవితోమాత్రమే వినేదికాదనీ, మనసుతో వినేదిగా, అనుభూతించేదిగా పిల్లలకి నేర్పే ప్రయత్నం చేస్తారు.

టోమో అంటే కామా ఆకారంలో ఉండే ఒక గుర్తు.తన పాఠశాలకు రెండు టోమోలు కలిపి ఒక చిహ్నాన్ని ఎన్నుకున్నారు హెడ్మాస్టర్.దానికి అర్థం శరీరము,బుధ్ధి సమానంగా అభివృధ్ధి చెంది సంపూర్ణ సమన్వయాన్ని సాధించాలని ఆయన భావం.

ఒకసారి గుడిలో జరిగే ఉత్సవానికి అమ్మానాన్నలతో వెళ్తుంది టొటొ.అక్కడ లాలిపాప్ లు,బూరు మిఠాయిలు, రకరకాల జంతువుల బొమ్మలు,వెదురు తుపాకులు ఉన్నాయి.అక్కడ ఒక దుకాణంలో పసుపుపచ్చని కోడిపిల్లల్ని చూసి తనకి కొనిపెట్టమని మారాం చేస్తుంది. 

అమ్మానాన్నలు ఎంతగానో చెబుతారు, “అవి ఎక్కువ కాలం బతకవు” అని. అయినా పట్టువదలదు. చివరికి రెండు కోడిపిల్లల్ని కొనిపించుకుంటుంది. అమ్మ వాటికోసం ఒక కటకటాల పెట్టెను కూడా తయారు చేయిస్తుంది.కానీ ఆ కోడిపిల్లలు నాలుగురోజుల్లోనే చనిపోతాయి.ఆ సంఘటనతో కోల్పోవటం, ఎడబాటు అనేవి టొటొకు మొదటిసారిగా అనుభవంలోకి వస్తాయి.

హెడ్మాస్టర్ పిల్లల్ని చిరిగిన,మాసిన బట్టలు వేసుకు బడికిరమ్మని ప్రోత్సహించేవారు.అప్పుడు అవి మాసిపోతాయన్న దిగులు,బెంగ ఉండవని,స్వేచ్ఛగా ఆడుకుంటారని ఆయన భావం.టొటొ అందరిపట్లా దయతో ఉండేది. ముఖ్యంగా శారీరక వైకల్యం ఉన్నవారిపట్ల మరింత శ్రధ్ధగా ఉండేది.

తనకి కుతూహలం కలిగించే విషయం ఏదైనా సరే, ఎంత ప్రమాదాన్నైనా పట్టించుకోకుండా దాని వెంట పడేది. ఒక్కోసారి చిక్కుల్లో పడేది.అయినా హెడ్మాస్టర్ టొటొని ఎప్పుడూ “నువ్వు నిజంగా మంచిపిల్లవు” అంటూ ప్రశంసిస్తుంటారు. 

ఆ మాటలు టొటొ ని నిజంగా మంచిపిల్లగా చేసాయని, ఆ స్ఫూర్తి లేకపోయినట్టైతే తాను అల్లరిపిల్లగా పేరు తెచ్చుకుని ఉండేదేమో అని రచయిత్రి చెబుతారు.

బడిలో ఆటల పోటీలు జరిపి,పిల్లలందరికీ బహుమతు లుగా బీట్ రూట్లు,ఆకుకూరలు,ముల్లంగి దుంప వంటివి ఇస్తారు.టొటొకి,ఆమె స్నేహితులకి వాటిని ఇంటికి తీసుకెళ్లటానికి అభ్యంతరం అనిపించింది. 

ఎక్కడో పారేద్దామని అనుకుంటుంటే హెడ్మాస్టర్ విని, “ ఈ కూరల్ని మీరు బహుమతిగా గెలుచుకున్నారు. ఇంటికెళ్లి అమ్మని వండి పెట్టమని చెప్పండి. మీరు స్వయంగా సంపాదించుకున్న దానితో ఈ పూట భోజనం తయారవు తుంది” అని ప్రోత్సహిస్తారు. 

టొటొ ఉత్సాహంతో తను గెలుచుకున్న కూరగాయలతో ఏమేం వండించుకోవాలనుకుంటోందో హెడ్మాస్టర్ కి చెప్పేస్తుంది.

ఒకసారి రోజూలాగే రైలెక్కి బడినుండి ఇంటికి వెళ్తుంటే ఒక ఐదు సెన్ల నాణెం దొరుకుతుంది టొటొకి. దానిని తాను రైలు దిగేప్పుడు తీసుకోవాలని జాగ్రత్తగా కాలికింద నొక్కిపెట్టి,చివరకి ఎవరికంటా పడకుండా తీసుకుంటుంది. ఇంటికి పట్టుకెళ్తే అమ్మ అడుగుతుందని ఆలోచించి, దారిలో ఒక చోట మట్టిలో కప్పెడుతుంది. 

కానీ మర్నాడు అది కనిపించదు.బడిలో స్నేహితులకి చూబించాలనుకున్న టొటొ నిరుత్సాహ పడుతుంది. ఇలా చెబుతూ పోతుంటే ఎన్ని సంఘటనలో! ప్రతి దానితోనూ మన అనుభవాల్ని జ్ఞాపకాల్లోంచి తవ్వుకుంటూ ఉంటాం.

ఒకసారి టోమో బడి గురించి బయట వేరే బడి పిల్లలు కాస్త వెక్కిరిస్తూ “టోమో పాఠశాల వెలిసిపోయింది, పాతబడింది లోపల కూడా అది వెలిసిపోయింది, పాతబడింది” అంటూ పాడుతుంటే విని అప్పటికప్పుడు టొటొ ఒక కొత్త పాటను కనిపెడుతుంది. తన స్నేహితురాళ్లతో కలిసి బడి బయట నాలుగు వీధులూ తిరిగి పాడుతుంది.

‘టోమో బడంటే మా బంగారుబడి,
లోపలైనా, బైటైనా బంగారు బడే” అంటూ.
తన గదిలో కూర్చున్న హెడ్మాస్టర్ ఆపాట విని అమితానందాన్ని పొందుతారు.ఆ పసివాళ్లకు బడి పట్ల ఉన్న మమకారం తలుచుకుని ఆరోజు సాయంత్రం బడిగంట ఆలస్యంగా కొడ్తారు.

ఆ బడిలో చదువు ముగించుకుని వెళ్లిపోయే తరగతి పిల్లలతో ఫోటో తియ్యటం టోమో బడిలో ఆనవాయితీ. అయితే ఫోటో సమయంలో ఒక్కరు కూడా నిలబడ వలసిన స్థానంలో నిలబడక ఇతర తరగతి పిల్లల్ని కూడా తమతో కలిసి ఫోటోలోకి రమ్మని పిలుస్తూండటంతో, పరుగులు పెడుతూ అందరూ  ఫోటోలోకి చేరిపోయేవారు. హెడ్మాస్టారు ఏమీ అనకుండా పిల్లల్ని స్వేచ్ఛగా అలా వదిలి ఆనందించేవారు.

పెద్దయ్యాక తాను టోమోలో పాఠాలు చెబుతానని టొటొ హెడ్మాస్టారుకి చెబుతుంది.ఆయన ఆనందంగా “మాట తప్పకూడదు” అని చెబుతారు.బడిలో పనిచేసేప్పుడు పాఠ్యాంశాలు ఎక్కువ చెప్పకుండా ఎక్కువ ఆటల దినాలని పెట్టాలని,ఎక్కువగా పిల్లల్ని షికార్లకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తుంది చిన్నారి టొటొ. కానీ యుధ్ధంలో బాంబు దాడికి గురైన టోమో బడి మంటలకి ఆహుతైపోయింది.టొటొ ఆశ నెరవేరనేలేదు.

ముందుమాటలో రచయిత్రి ఇప్పుడు టోమోలాటి బడులుంటే ప్రపంచంలో ఇంత హింసా ప్రవృత్తి ఉండేదికాదని అంటారు.తనను మొదటి బడిలోంచి తొలగించేసేరన్న విషయాన్నితల్లి తన ఇరవైయ్యో పుట్టినరోజు వరకూ చెప్పనేలేదని,బడిలోంచి తీసివేసినందుకు ఎలాటి కోపం,విసుగూ లేకుండా తనకి తగిన బడిని వెదికిన తల్లి విశాల హృదయానికి ఆమె ఎంతగానో కృతజ్ఞత చెబుతారు.

ఈ పుస్తకం గురించి సమీక్ష రాయబూనుకోవటమే ఒక పెద్ద సాహసం అని తెలుసు.అయినా టోమో బడితోనూ, అందులోని టొటొ లాటి పిల్లలతోనూ ప్రేమలో పడి ఇలా మొదలెట్టేసేను మరి. పుస్తకం ఎంత అద్భుతమైనదో చెప్పేందుకు ఈ సమీక్ష చాలదు. పుస్తకం చదవాల్సిందే. ఒకసారి కాదు మళ్లీ మళ్లీ!
*****

పుస్తకం కోసం - 094900 98654 

-
 రామ లక్ష్మణులకు , విశ్వామిత్రులవారు బోధించిన బల, అతిబల మంత్రాల అవసరం ఎప్పుడైనా పడిందా?
రామాయణంలో బల, అతిబల మంత్రాల ప్రస్తావన బాలకాండలో చాలా ప్రముఖంగా వస్తుంది, కానీ ఆ తర్వాత వాటి వాడకం గురించి స్పష్టమైన ప్రస్తావన ఎక్కడా కనిపించదు.

అయితే, దీని వెనుక ఉన్న అంతరార్థాన్ని, పండితుల విశ్లేషణలను పరిశీలిస్తే, ఆ మంత్రాల అవసరం, ప్రభావం రామలక్ష్మణులపై పరోక్షంగా, నిరంతరం ఉందని అర్థమవుతుంది.

1. బల, అతిబల మంత్రాలు అంటే ఏమిటి?
విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఈ మంత్రాలను ఉపదేశించినప్పుడు, వాటి ప్రయోజనాలను స్పష్టంగా వివరిస్తాడు:

బల: ఈ మంత్రాన్ని జపిస్తే, ఎంత ప్రయాణం చేసినా, ఎంత యుద్ధం చేసినా శారీరక అలసట (Physical Fatigue) రాదు.
అతిబల: ఈ మంత్రాన్ని జపిస్తే, ఆకలి, దప్పిక (Hunger and Thirst) బాధించవు.
అంతేకాకుండా, ఈ మంత్రాలు తేజస్సును, ఏకాగ్రతను, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయని, నిద్రలో ఉన్నప్పుడు కూడా రాక్షసులు దాడి చేయకుండా కాపాడతాయని చెబుతాడు.

2. ఆ మంత్రాల అవసరం ఎప్పుడు పడింది?
వాల్మీకి రామాయణంలో "రాముడు ఇప్పుడు బల మంత్రాన్ని జపించాడు" లేదా "లక్ష్మణుడు అతిబల మంత్రాన్ని ఉచ్ఛరించాడు" అని నేరుగా ఎక్కడా రాయలేదు. కానీ, వారి ప్రయాణంలో జరిగిన సంఘటనలను గమనిస్తే, ఆ మంత్రాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

తాటక, సుబాహుల వధ:అప్పటివరకు రాజభవనాల్లో సుకుమారంగా పెరిగిన రామలక్ష్మణులు, అడవుల్లోకి వచ్చిన వెంటనే, ఎలాంటి విశ్రాంతి లేకుండా, భయంకరమైన రాక్షసులతో యుద్ధం చేసి, వారిని సంహరించగలిగారు. ఇది ఆ మంత్రాల వల్ల కలిగిన మానసిక, శారీరక స్థైర్యం వల్లే సాధ్యమైందని పండితులు విశ్లేషిస్తారు.
14 సంవత్సరాల అరణ్యవాసం:ఇది అత్యంత కీలకమైన నిదర్శనం. 14 సంవత్సరాల పాటు, రామలక్ష్మణులు కఠోరమైన అటవీ జీవితాన్ని గడిపారు. వారు సరైన ఆహారం, నిద్ర లేకుండా, నిరంతరం రాక్షసులతో పోరాడుతూ, సుదూర ప్రాంతాలకు నడుస్తూనే ఉన్నారు.ముఖ్యంగా, లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోలేదని, ఆహారం తీసుకోలేదని (లేదా చాలా తక్కువగా తీసుకున్నాడని) కొన్ని రామాయణ రూపకాలు చెబుతాయి. దీనిని "నిద్రను జయించడం" అంటారు. ఇది సాధారణ మానవులకు అసాధ్యం. బల, అతిబల మంత్రాల సిద్ధి వల్లే లక్ష్మణుడు ఆకలి, దప్పిక, నిద్ర, అలసటను జయించగలిగాడని బలమైన నమ్మకం ఉంది.
రావణుడితో యుద్ధం:రావణుడితో జరిగిన యుద్ధం చాలా రోజుల పాటు, ఏకధాటిగా సాగింది. ఈ యుద్ధంలో రాముడు, లక్ష్మణుడు అనేకసార్లు మూర్ఛపోయినా, గాయపడినా, వెంటనే తేరుకుని మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యేవారు. వారిలోని ఆ అపారమైన శక్తి, అలసటను తట్టుకునే సామర్థ్యం వెనుక ఈ మంత్రాల ప్రభావం ఉందని భావిస్తారు.ఇంద్రుడు పంపిన రథం, అగస్త్యుడు ఇచ్చిన ఆదిత్య హృదయం వంటివి బాహ్య సహాయాలైతే, బల, అతిబల మంత్రాలు వారికి అంతర్గత శక్తిని నిరంతరం అందిస్తూనే ఉన్నాయి.
3. మంత్రాలను మళ్ళీ ఎందుకు ప్రస్తావించలేదు?
దీనికి కొన్ని తాత్విక కారణాలు ఉన్నాయి:

ఆత్మసాక్షాత్కారం: ఒకసారి మంత్రాన్ని సిద్ధింపజేసుకున్న తర్వాత, దానిని ప్రతిసారీ ఉచ్ఛరించాల్సిన అవసరం లేదు. ఆ మంత్ర శక్తి వారిలో అంతర్భాగమై, వారి శరీరంలో, ఆత్మలో కలిసిపోతుంది. అది వారి సహజ గుణంగా మారిపోతుంది.
కథన శైలి: వాల్మీకి మహర్షి కథనంలో, ఒకసారి చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేయరు. మంత్రాల ఉపదేశం జరిగిపోయింది, వాటి ప్రభావం కథాగమనంలో కనిపిస్తూనే ఉంటుంది, కాబట్టి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం రాలేదు.
దైవాంశ సంభూతులు: రాముడు విష్ణువు అవతారం, లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం. వారికి ఈ మంత్రాలు కేవలం ఒక నిమిత్తమాత్రమే. వారిలోని దైవిక శక్తిని మేల్కొలపడానికి విశ్వామిత్రుడు ఈ మంత్రాలను ఒక సాధనంగా ఉపయోగించాడు.
చివరగా: బల, అతిబల మంత్రాలను రామలక్ష్మణులు ప్రత్యేకంగా ఫలానా సమయంలో వాడినట్లు ప్రత్యక్ష ప్రస్తావన లేకపోయినా, వారి 14 ఏళ్ల అరణ్యవాసంలో, రాక్షసులతో జరిగిన భీకర యుద్ధాలలో వారు చూపిన అద్వితీయమైన శారీరక, మానసిక స్థైర్యానికి, అలసటను, ఆకలిదప్పులను జయించిన సామర్థ్యానికి మూలం ఆ మంత్ర శక్తే. ఆ మంత్రాలు వారిలో అంతర్లీనంగా ఉంటూ, వారి ప్రయాణం అంతటా ఒక అదృశ్య కవచంలా కాపాడాయి.
 రాముడు పరశురాముడు ఇద్దరూ విష్ణువు అవతారాలే కదా

మరి పరశురాముడు ఓడిపోవడం ఏమిటి ?

శ్రీరామచంద్రుడు పరిపూర్ణావతారం

పరశురాముడు అనబడే భార్గవరాముడు అంశావతారం

వారికి యుద్ధం జరగలేదు

విష్ణుచాపం అందించడంలోనే ఆయన ఎవరో గ్రహించాడు భార్గవుడు

ఇద్దరూ ఎదురు పడడం ఓ అంతుబట్టని దైవలీల

పరమాత్మ ఒక ఉపాధికి పరిమిత మౌతాడు అని నాలాంటి పరిమితమైన ఉపాధి కల వాడి ఆలోచన పరిభ్రమిస్తూ ఉంటుంది

ఆమాటకొస్తే శివుడికి కేశవుడికీ అభేదం మరి విడివిడిగా చూడటం లేదా వారి వేరువేరుగా చూడవద్దు అని సంధ్యావందనంలో చెప్పుకుంటూనే మళ్ళీ మాయలో పడిపోవడం నాలాంటి అల్పులు చేసే పని

రమణులు ఓ కోతితో సంభాషించారు ఓ ఆవుతో సంభాషించారు ఎలా

ఆయనేమన్నా ముప్పైరోజుల్లో కోతిభాష లాంటి పుస్తకాలు చదివారా లేక శిక్షణ తీసుకున్నారా (అలా ఎవరైనా ఇవ్వగలరా )

మరి ఎలా సాధ్యం

విశ్వవ్యాప్తమైన పరమాత్మ తో అనుసంధానమైన వారు అన్ని జీవులలోని ఆత్మ తోనూ అనుసంధానం కాగలరు

భార్గవుడూ శ్రీరాముడు ఎదురుపడడం గురించి తికమకపడే నేను

వరాహస్వామి వేంకటేశ్వరుడూ ఎదురుపడడం ఒప్పందం చేసుకోవడం ఎలా అర్థం చేసుకోగలను

ఇంతే కాదు నా దృష్టి సంకుచితమైనపుడు వాల్మీకి రామాయణంలో గూఢంగా ధ్వని రూపంలో నిండి నిబిడీకృతమైన శ్రీరామతత్వాన్ని ఎలా అర్థం చేసుకోగలను

ఒకే పరబ్రహ్మ యొక్క రెండు రూపాలైన రాముడు హనుమలను వేరు వేరుగా ఎందుకు చూస్తున్నాను

ఇక్కడ బాబాగారన్న మాటలు గుర్తుకొస్తాయి

ఆయనని ఎవరో అడిగారు

మీరు దేవుడా

అవును బంగారూ అన్నారాయన

ఎలా

ఆయన నవ్వి నువ్వూ దేవుడివే ...నువ్వు గుర్తించలేదు నేను గుర్తించాను అంతే బంగారూ అన్నారు

గంగాయమునా ప్రవాహంలా శ్రీరాముడు హనుమ రామాయణంలో కనబడితే

వారిరువురూ ఒకరే అన్న స్ఫురణ అంతర్లీనమైన కనపడని సరస్వతీ ప్రవాహం

అది త్రివేణీ సంగమం

అందులో మునక వేయడం ఆఎరుక తెచ్చుకోవడం

లేకపోతే నాలాగ మాయలో కొట్టుమిట్టాడుతూ

అఙ్ఞానం లో మళ్ళీ మళ్ళీ పుట్టి చావడమే

అంతవరకూ రాముడు తప్పితే ఇంకేమీ లేదు అన్న విషయం అర్ధం కాదు రాముడు దేవుడా మానవుడా ఆర్యుడా ద్రావిడుడా అనే పిచ్చి సందేహాలలో శ్లేష్మంలో పడిన ఈగలాగ జన్మ పరంపరలో కొట్టుకోవడమే

రామా నాకు అర్థం కావా దయయుంచి

డా .సూర్యనారాయణ వెన్నేటి
 దేవుడు లేడు అన్న దానికి సాక్ష్యం ఏమిటి?
వాడు లేడు— అని ఎపుడంటాం?.

వాడు* అని ఒకడుండి , ఇపుడు ఆ అడ్రస్ లో కనబడనపుడు గదా—వాడు లేడు. ఎక్కడికో వెళ్లాడు అనో , ఒకప్పుడు ఉండి, ఇపుడు ఇక్కడి నుంచి వెళ్లి పోయాడు అనే సందర్భంలో గానీ అంటాం.
హిరణ్యకశిపుడు ఎక్కడ ఎక్కడ? అని మొండిగా కొడుకును చంపాడు.

అతడేమన్నాడు? ఎందెందు *వెదకి చూచిన* అందందే కలడు… అన్నాడు. * వెదకి చూచిన * అన్నాడు.

వెదకాలి — అంటే ముందు ఆ వస్తువు ఎట్లా ఉంటుందో తెలియాలి.

హరి అనే వాడు ఈ సమయంలో ఈ విధంగా ఉంటాడు. ఇక్కడ ఉంటాడు . అని ముందు తెలిస్తే ఆ చోట ఆ సమయంలో వెదకడం సాధ్యం.

సంపాతి సీతమ్మను లంకలో ఉన్నట్లు దర్శించాడు.

ఆయన ఎప్పటి నుంచో రెక్కలువిరిగి పడిఉన్నాడు . ఏ అయోధ్యకో , మిథిలకో వెళ్లి ఆమెను చూచి ఉండలేదు. ఎట్లా చూడడం సాధ్యమో అతడికి తెలుసు . రెక్కలు విరిగి పడడం ఒక అదృష్టం. తదేక చింత (విచారణ ) చేసే సదవకాశం భగవంతుడు కలిగించాడు . వినతా కశ్యపుల వంశంలో పుట్టిన పూర్వసంస్కారం ఇలా కలిసి వచ్చింది. అందుకే* బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే * అన్నారు. జ్ఞానికే చాలా జన్మల కాలం పడుతుంది భగవంతుణ్ణి చేరుకోడానికి.

న వేద యజ్ఞాధ్యయనైః | న దానైః న చ క్రియాభిః తపోభిరుగ్రైః

ఏవం రూపః శక్య అహం నృ లోకే| ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర!

అంటూ ఒక రూపం అర్జునుడికి చూపాడు .

ఈ రూపం ఎట్లా చూచాడతడు? " భక్త్యా తు అనన్యయా" చూచాడు. మైత్రితో చూచాడు. ఆ ఇద్దరికీ అంతటి మైత్రి ఎట్ల కుదిరింది?

వాళ్లు అనేక జన్మలుగా మిత్రులు నరనారాయణులు.

జీవో బ్రహ్మైవ నాపరః— అన్నట్లు ఒకే శరీరంతోనూ ఉండిన వారు.

దివ్యం దదామి తే చక్షుః — అని ఒక వేరే చూపును ఇచ్చాడు ఆయన .. జీవుడు ఈ ఉపాధిలో చూడగలగడానికి.

ధృతరాష్ట్రుడికీ పుట్టుగుడ్డికి కళ్ళతో( ప్రత్యక్షంగా ) చూడడానికి ఒక చూపు ఇచ్చాడు . కానీ అపుడు భీష్మద్రోణాదులకూ , నారదాది ఋషులకూ ఏ చూపూ ఇవ్వలేదే . వాళ్లూ చూచారు ధృతరాష్ట్రుడు చూచినట్టే.

వాళ్లకు చూడడం ముందే అభ్యస్తమై ఉంది అనుకోవాలి.

ఇక్కడ కావలసింది చూడాలనే తపన . తీవ్ర ఇచ్ఛ.

చూపించేవాడు — రామకృష్ణ పరమహంస మాదిరిగా ఒకరు కావాలి.

ఉద్దామ ధ్యాన గరిష్ఠులైనన్ హరిన్ పొందన్వచ్చు.*. అంటారు మరో చోట. తీవ్రమైన ధ్యానం . తపన —
*ఈ జన్మలోనే చూడాలి . కైవల్యం పొందాలి *—అనే బలీయమైన ఆలోచన.
భగవంతుణ్ణి వాడుకోవడం కాదు . భగవంతుడికి నీవూ, నీ తనుమనః ప్రాణాలూ ..అన్న స్థాయి కలగాలి .

నాకు మోక్షమే వద్దు. జన్మ జన్మకూ నీ స్మరణ కలిగితే అదే చాలు… అన్నంత తీవ్రంగా భగవద్భావన ఏర్పడాలి.

అపుడు నీలోనే ఎపుడూ ఆ భగవంతుడు ఉండిపోతాడు. అపుడు భక్తుడూ , భగవంతుడూ వేరువేరు కాదు.

ధృతరాష్ట్రుడు దర్శనం చేసుకొన్నాడు గదా!

ఆ దుర్యోధనాదులూ అక్కడే ఉన్నారే. వాళ్లు భయభ్రాంతులయ్యారు. చూడలేక పోయారు.— అదేదో ఇంద్రజాలం . అదేముంది గొప్ప? ప్రాక్టీస్ చేస్తే ఎవడైనా చేయగలడు— అని చులకన చేశారు.

ప్రహ్లాదుడో! ఉపదేశ బలంతో ఏ సందేహమూ లేకుండా *ఇందుగలడందులేడని సందేహము వలదు * అని అందరికీ చెప్పేస్తున్నాడు. ఎందువల్ల ? రామకృష్ణ పరమహంస మాదిరిగా ఆయన గూడా ఎపుడూ చూస్తూ భాషిస్తూ ఉన్నాడాయె !

విష్ణుడింతియ కాని , వేరొండు లేడని ఒత్తిలి నగుచుండు నొక్కచోట..

ఓస్ ! ఇంతేనా దేముడంటే. ఏమో అనుకొన్నానే—అని ఆ దర్శనం అత్యంత సులభం అంటూన్నాడు. అలవాటైపోయిన వాడికి అందులో కష్టమేముంటుంది ? ఏదైనా బుద్ధి కుదిరే వరకే..

ఈయన పెదతండ్రి హిరణ్యాక్షుడు అంతటా వెతికాడు . కానీ , తనలో వెతకలేదే !

తనను వెదుకుతున్నాడే అని, బాగా దగ్గరగా — అంతకంటే దగ్గర ఏముంటుంది? వచ్చి, ఎక్కడికో పోకుండా ఉన్నాడు. ఆ పూర్వదేవుడి హృదయంలోనే చేరాడు పరమాత్మ.

ఆయనను బయట చూడవలె …అని ఆతడి ప్రయత్నం —. పట్టుకొని చంపేయాలని.

*ఆత్మ రక్షా కర్తవ్యా* అని చెప్పినవాడు దానిప్రకారం తనను కాపాడుకోవాలి గదా! అందుచేత విష్ణువు భద్రప్రదేశం చూచుకొన్నాడు.

ఇతగాడు * వాడు భయపడి ఎక్కడో దాక్కున్నాడు పోనీలే ! భయపడ్డ వాళ్లను ఏమీ చేయగూడదు* అని అప్పటికి బుద్ధి మంతుడయ్యాడు.

లోపల ఆయన చేరి , తిష్ఠ వేసుకొన్నాడు గదా ! అందువల్ల…. వాడి నైసర్గిక బుద్ధి అణగి పోయి , సుబుద్ధి కలిగింది.

కానీ దాన్ని చిరస్థాయిగా నిలుపుకోలేక పోయాడు.

భగవంతుడు ఎపుడూ లోపలే ఉన్నాడు .అతన్ని చూడడానికి మనకు తీరిక లేదు.

అసలు ఎవరి దగ్గరకైనా ఎపుడు పోతాం? వాళ్లవల్ల ఈ పని ఔతుంది—అనుకొన్నపుడు . అంటే అది మన ప్రయోజనాపేక్ష.!. ఆతని మంచి కోరి కాదు.

అలాగే మన పనులలో మనం బిజీ . మనకు కావలసిన పని మనవల్ల కాక , అల్లాడుతూన్నపుడు ఎవరో మన శ్రేయోభిలాషులు చెప్తారు. ఆ డాక్టర్ దగ్గరకు పో— నయం ఔతుంది . ఇంకొకరు తమ అనుభవంతో ఆ కొండకు పో—నీ కష్టాలు తీరుతాయి..అని ..

ఆ *గురు* వాక్యం నిన్ను ఆలోచనలోకి తోస్తుంది..

అక్కడా మళ్ళీ సందేహం . నిజమో కాదో అని. దీనికి కొంత ప్రారబ్ధం అడ్డు వస్తున్నది. కొంత కాలం పడి లేచి, అపుడు నిజంగా గురుత్వం కుదిరి , ఆర్తితో ఆ వైద్యో నారాయణో హరిః దగ్గరకు పోయి కుదుట బడతాం..

ఇక్కడ విశ్వాసం కుదిరింది ఎక్కడ? బయట గాదు. నీ లోనే . అది జరిగినపుడు రోగం— భవ రోగం—నయమౌతున్నది. చూచేది నీవే— ఇతరమైనవి అన్నీ సహకారులే !

మనలో మనం చూచుకొనే శక్తి అభ్యస్తమయ్యే వరకూ బయట చూచి, ఇదే గదా లోపల చూడవలసినది —అని అనుకోవాలి.

తన విధి తాను చక్కగా పూర్తిగా చేసినపుడు —బంధాలు అవరోధాలు తొలగిపోతాయి. అపుడు ఆత్మలోనే రమిస్తూ, ఏ పని చేస్తూన్నా ఆ తత్వంలో స్థిరపడగలం.

'మంత్రం' ఆ కోశం తెరిచే తాళపు చెవి . నారదుడు ప్రహ్లాదుడికి మాతృగర్భంలోనే ఇచ్చాడు. కొందరు వెనకటి (జన్మలోని) అన్వేషణ, దర్శనానుభూతి తమ వెంట తెచ్చుకొని చూడగలరు.

కొందరికి ఆ విభూతి (సంపద ) ముందే ఉంది . కొందరు ఇపుడు సంపాదించుకౌవాలి.

భగవంతుణ్ణి ఏమన్నారు? *వేద వేద్యుడు * అని గదా!

వేదం అంటే జ్ఞానం (వాసుదేవః సర్వం— ఇతి జ్ఞానం ) సంపాదిస్తే ఆ దేవుణ్ణి చూడడం సాధ్యం.

సుజనులందు తరచు(గా ) చొచ్చియుందు ..అని మరోచోట అంటాడాయన.

కాబట్టి అక్కడా చూడవచ్చు .. సుజనులు దుర్జనులను దరి జేరనీరే ! కాబట్టి ముందు సౌజన్యం సంపాదించుకోవాలి. అంతకు ముందే దౌర్జన్యం (హిరణ్యకశిపుత్వం ) తొలగించుకోవాలి .

హరి సర్వాత్మకుడే . కానీ, నీవు ఏ విధంగా చూడదలచావో నిర్ధారణ చేసుకొని, ఆ రూపంలో మొదట చూచే తీవ్ర ప్రయత్నం చేసి , ఆ తర్వాత అన్నీ నీవే అని *అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః*— అని తెలుసుకో గలవు..

ఒక భక్తుడు — భగవంతుడు వచ్చి రాముడుగా కనిపిస్తే — "అయ్యా ! నాకు ఆ కృష్ణుడు గానే కనిపించు. ఆ రూపమే నాకు ప్రియము " అని ప్రాధేయపడ్తాడు.

సత్సహవాసంతో సచ్చిదానందస్వరూప దర్శనం ఔతుంది.
 హిందూ దేవాలయాలు ఎక్కువగా కొండల మీదనే ఎందుకు ఉన్నాయి ?
తెలుగు రాష్ట్రాలలో ప్రముఖమైన తిరుమల, అన్నవరం, బెజవాడ, భద్రాద్రి, యాదగిరిగుట్ట, … ఇలా కొండలపై ఉన్న దేవాలయాలను చూసి మీరు ఈ ప్రశ్న అడిగివుందవచ్చు. తమిళనాడులో 6 ప్రముఖమైన సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలు కూడా కొండలమీదే వున్నాయి. ఇంకా చాలా ఆంజనేయస్వామి, నరసింహస్వామి దేవాలయాలు కూడా కొండల మీద కనిపిస్తూ వుంటాయి.

పూర్వం జనావాసాలు ఎక్కువగా నదులు, సరస్సుల ఒడ్డున ఏర్పడేవి - నీటి వసతికోసం. కాని, వర్షాకాలంలో ఆ నదులు, సరస్సులు పొంగిపోర్లడం జరిగితే చుట్టుపట్ల గ్రామాలవారికి ఇబ్బందులు ఏర్పడేవి. ఆ ఇబ్బందుల నుండి రక్షణ కోసం దగ్గరలోని గొండ, గుట్టల మీద శాశ్వత నిర్మాణాలు చేశేవారు. అయితే, సంవత్సరంలో రెండు మూడు నెలలు మాత్రమే వాటి అవసరం వుంటుంది; మిగిలిన కాలంలో అవి నిరుపయోగమే కదా? వాడకుండా వాటిని వదలి పెడితే అవి పాడయ్యే అవకాశం వుంది. ఇంకా, ఎప్పుడూ అలవాటు లేనివారు కేవలం విపత్కర పరిస్టితులలో మాత్రం ఆ కొండలు ఎక్కాలంటే ఆయాస పడిపోతారు. అందుచేత కొండలపై, గుట్టలపై నిర్మించిన ఆ శాశ్వత నిర్మాణాలను దేవాలయాలుగా మారిస్తే, వాటి ఆలనా పాలనా చూసే బాధ్యత ఏర్పడుతుంది; ప్రజలు తరచూ దర్శనానికి కొండలు ఎక్కే అలవాటులోనూ వుంటారు. ఈ విధంగా కొండలపై దేవాలయాలు ఒక రకమైన disaster shelters (సామూహిక ఆపత్కాలీన శరనాశ్రాయాలు) అనుకోవచ్చు.

అయితే, దేశంలోని అన్ని దేవాలయాలూ కొండలమీదే ఉన్నాయా అని చూస్తే, లేవు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ఇలా ఎన్నో ప్రముఖమైన దేవాలయాను పరిశీలిస్తే, వాటిలో కొన్ని మాత్రమే కొండలమీద వున్నాయి - ఎక్కువ కొండలమీద లేవు. ఎందుకంటే అపాయాలు ఎప్పుడూ నీటివలననే రావాలని లేదు; అన్ని గ్రామాలలోనూ కొండలు, గుట్టలు ఉండాలనీ లేదు. తమిళనాడులో శ్రీరంగం, బృహదీశ్వరాలయం, మధుర మీనాక్షి ఆలయం, తిరువన్నామలై, చిదంబరం ఇలా పెద్దపెద్ద దేవాలయాలెన్నో నేలపైనే కదా వున్నాయి? కొండలపై కాదు కదా. తమిళనాడులో పూర్వకాలంలో మహాప్రళయం (సునామీ వంటిది) వచ్చినప్పుడు ఇలాంటి నేలపై వున్న దేవాలయాలే అక్కడి ప్రజలకు ఆశ్రయమయ్యాయని చెబుతారు.

ఏది ఏమైనా, దేవాలయాల నిర్మాణం మన సాధారణ గృహనిర్మాణం కంటే పటిష్టంగా జరిపి, సామూహిక జనరక్షక పటిమను కలిగివుండేవనేది స్పష్టం. ప్రస్తుత కాలంలో సదుపాయాలు పెరగడం వలన దేవాలయాని వెళ్ళే ఆశ్రయం తీసుకోవాలనిలేదు అనే భావన పెరగడం వలన దేవాలయాను నాసిరకంగా నిర్మించడం పరిపాటి అయిపొయింది. దేవాలయం మాట అటువుంచి, కనీసం దేవాలయానికి వెళ్ళే మార్గం కూడా వర్షాలకు తట్టుకొనేలా నిర్మించబడడం లేదు ఈ కాలంలో.
 అర్జునుడికి అవసరమైనప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అతనికి ఎందుకు ఇవ్వలేదు?


" శంఖభృన్నందకీ చక్రీ శార్​ఙ్గధన్వా గదాధరః " విష్ణుసహస్రనామాలలోని అద్భుత నామాలు.

చక్రం అనేది బహుమతిగా ఇచ్చే ఒక జడ వస్తువు కాదు. అది విష్ణు అంశ. అది చైతన్యం. చక్రం ఒక షడ్భుజి మధ్యలో ఉంటుంది, దానికి పదహారు చేతులు ఉంటాయి. అది ఒక తేజోవంతమైన పురుష దైవ స్వరూపం.

విష్ణు పురాణం ప్రకారం, " దాని మూల స్వభావం అగ్ని తత్వం ". నిజానికి, విష్ణువు యొక్క ఇతర ఆయుధాలైన శంఖం, ఖడ్గం, ధనుస్సు మరియు గద కూడా జడ వస్తువులు కావు. మనం వాటిని చిత్రాలలో వస్తువులుగా చూసినప్పటికీ, అవి చైతన్యవంతమైన ఆయుధాలు. అవి భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు గాలి అనే పంచభూతాలకు ప్రతీకలు. విష్ణువు సర్వవ్యాపి, ఆయన చేతిలో పంచభూతాలు ఉంటాయి.

శంఖం, చక్రం, గద, నందకం పురుషదేవతలు. ఒక్క శాంగము/ధనుస్సు మాత్రం స్త్రీ దేవత పద్మంలా ఎర్రగా ఉంటుంది. ప్రకాశిస్తూ ఉంటుంది.
ఇది కాలరూపం ధనుశ్శాంతం.

విష్ణువు వాటిని చేతులలో పట్టుకుని ఉండరు అస్తమానూ, మనం చిత్రాలలో చూస్తూన్నట్లుగా, మోయవలసిన అవసరం కూడా లేదు. కేవలం తలచుకుంటే చాలు, అవి ఆయన చేతిలో ప్రత్యక్షమవుతాయి. అవసరాన్ని బట్టి అవి విష్ణువును అనుసరిస్తాయి.

ఇది మనం గజేంద్రమోక్షంలో చదివాము. అంబరీషోపాఖ్యానంలో చక్రం దూర్వాసుని వెంటబడి ముల్లోకాలూ పరిగెత్తించడం చదివాం.

శుభమస్తు
 *మేనమామ*

"ఏవండీ మా మేనమామ పోయాడుట. ఫోన్ చేసి చెప్పారు అంటూ చెప్పింది సుమతి భర్త మోహన్ ఆఫీస్ నుండి రాగానే. అలాగా! అయ్యో పాపం అన్నాడు. అంతే ఆ తర్వాత ఏ మాట లేదు. ఆ తర్వాత భర్త చెప్పబోయే మాట గురించి ఎదురు చూసింది సుమతి. భర్త నుంచి ఎటువంటి సమాధానం రాక పోవడంతో చివరికి ధైర్యం చేసి "ఏవండీ మాకు ఉన్న ఒక్క మేనమామ వాళ్ల కుటుంబాన్ని అత్తయ్యని చూసి రావాలండి అని అడిగింది భర్తని సుమతి. 

నాకు ఆఫీసులో బోలెడు పనులు ఉన్నాయి. సెలవు దొరకడం కష్టం. అయినా ముంబై నుంచి ఆ పల్లెటూరు వెళ్లాలంటే ఎంత కష్టం. రిజర్వేషన్లు దొరకవు. ఫ్లైట్ కి వెళ్లాలంటే చాలా ఖర్చు. పైగా చలికాలం. మరి అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు భార్యవైపు. అయినా మనం వెళ్లేసరికి ఆయన శవాన్ని ఇంకెవరిని చూస్తాం. ఏదో వెళ్లేవని పేరు కానీ ! ఇద్దరు పిల్లల్ని తీసుకుని నువ్వు ఒకదానివి వెళ్లడం చాలా కష్టం అని చెప్పి వేరే గదిలోకి వెళ్ళిపోయాడు. 

సుమతికి ఒక్కసారి దుఃఖం పొంగుకు వచ్చింది. ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చి తలుచుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది. 
సుమతి అమ్మమ్మగారి ఊరు తూర్పుగోదావరి జిల్లాలో పల్లిపాలెం గ్రామం. సుమతి అమ్మమ్మ పేరు సీతమ్మ తాతయ్య పేరు చలపతిరావు. చలపతిరావు గారికి  నలుగురు ఆడపిల్లలు ఒక మగ పిల్లవాడు. మగ పిల్లవాడు అచ్యుత రామయ్య  అందరికంటే పెద్దవాడు.

నలుగురు ఆడపిల్లలకి ఒక్కొక్కరికి ఇద్దరు  ఆడపిల్లలు. అందరూ ఆడపిల్లలే కావడంవల్ల మేనకోడళ్ళకి ఒక అన్నగారిగా కూడా ఉండేవాడు అచ్యుతరామయ్య. 

అందరికంటే పెద్దవాడు కావడం వల్ల అక్కచెల్లళ్ళు అందర్నీ గారాబంగా చూసుకునేవాడు  అచ్యుతరామయ్య. అక్కల పిల్లలందరినీ చిన్నప్పటినుంచి ఎత్తుకుని పాడించి ఆట నేర్పి పాట నేర్పి వాళ్ల అక్కలు పుట్టింటికి వచ్చినప్పుడు ఏ లోటు లేకుండా చూసుకునేవాడు సుమతి మేనమామ అచ్యుతరామయ్య.   చిన్న పనికి పెద్ద పనికి వాళ్ళ అక్కచెల్లెళ్లకి సహాయపడుతుండేవాడు. చాలా అభిమానం అచ్యుతరామయ్యకి

అక్కాచెల్లెళ్ల పిల్లలతో పాటు అందరూ కలిసి భోజనాలు చేయడం పిల్లలకు కథలు చెప్పడం, కబుర్లు చెప్పడం, సైకిల్  నేర్పడం పల్లెటూరు కావడం వాళ్ళకి చెరువుల్లో ఈత కొట్టడం, నేర్పడం పొలం గట్లమీద తిప్పడం పక్క ఊరికి సినిమాకి తీసుకెళ్లడం ఇలా పిల్లలందరూ సెలవులకు వచ్చినప్పుడు వాళ్లతో పాటే ఎంత పెద్దవాడైనప్పటికీ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు.

 పిల్లలు అంటే చాలా సరదా అందుకే మేనకోడళ్ళతో చాలా సరదాగా ఉండేవాడు. తన ఇద్దరు పిల్లలతో పాటు ప్రతి పండక్కి పిల్లలందరికీ సమానంగా బట్టలు కొనేవాడు. మేనకోడలు పెళ్లిళ్లు సంబంధాలు తనే చూసి దగ్గరుండి అన్ని పనులు యధావిధిగా చేసి పెళ్లి వారిని సంతృప్తిపరిచి వెళ్లేవాడు. మేనకోడళ్ళని బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి మండపం దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు అచ్యుతరామయ్య కళ్ళల్లో కన్నీళ్లు కనిపించేవి అందరికి. అప్పగింతల సమయంలో అసలు పెళ్లి మండపంలో  కనిపించేవాడు కాదు. అంత ప్రేమ మేనకోడళ్ళు అంటే . 

మేనకోడళ్ళ ఇంటిలో తోరణం కడితే చాలు వెంటనే వచ్చి అన్ని పనులు చక్కపెట్టి వెళ్లేవాడు. అలాంటి మేనమామ తల్లి తర్వాత తండ్రి అంతటివాడు. 

టీచర్ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిపోయి ఆ ఊర్లోనే ఉంటూ అప్పచెల్లెళ్లని, బావ గార్లని, మేనకోడళ్ళని వాళ్ల భర్తల్ని పిల్లల్ని తన పిల్లల్ని అందర్నీ సంక్రాంతి పండక్కి మొన్నటి మొన్నటి వరకు ఆ ఊరికి పిలుస్తూనే ఉండేవాడు. తాతయ్య అమ్మమ్మ వారసత్వం నిలబెట్టింది మా మేనమామ ఒక్కడే. ఆ ఊరుతో అనుబంధం మాకు ఈనాటి వరకు కొనసాగింది అంటే మా మేనమామ ఆ ఊర్లో ఉండడం వల్ల. మేనకోడళ్ల వరకు సరే వాళ్ల భర్తలను కూడా సొంత పిల్లల్లా చూసే మా మేనమామ ఏమిటో లేరని సరికి మనసంతా అదోలా ఉంది. 

ఒక్కసారిగా భర్త మోహన్ మీద కోపం వచ్చింది. ఇలాంటి సమయంలో కూడా డబ్బు ఖర్చు గురించి చూసుకున్నాడు. సెలవు లేదని ఏవేవో సాకులు చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మారుతారు. బంధుత్వాలకు విలువ ఎప్పుడు ఇస్తారు. అందులో రక్తసంబంధీకులు. మనం ఎవరింటికైనా వెళ్లకపోతే వాళ్లు కూడా మన ఇంటికి ఎందుకు వస్తారు. కష్టంలోనూ సుఖoలోను  అయినవాళ్లను పలకరించకపోతే బంధుత్వం ఎలా  కొనసాగుతుంది.అన్నింటినీ డబ్బుతో ముడి పెట్టలేం. డబ్బున్న లేకపోయినా  కొంతమంది      ఇటువంటి సమయంలో వెంటనే వస్తారు
అది వాళ్ళ సంస్కారం. 

అందులో పెళ్ళాం తరుపు బంధువులు అంటే ఎందుకో అంతగా ఇష్టం చూపరు. ఆడపిల్లను కదా ఏం చేయగలను. ఒకపక్క మనసులో పీకుతున్న  మౌనంగా ఉండి పోవడం తప్పితే భర్తను ఎదిరించి ఏం చేయగలను అని బాధపడుతూ నిద్రలోకి జారిపోయింది సుమతి. 

తెల్లవారి లేచేటప్పటికీ  మోహన్ తల్లితో  కాబోలు మాట్లాడుతున్నాడు. లేదమ్మా నాకు సెలవు లేదు అయినా బోల్డంత దూరం బోళ్లంత ఖర్చు అంటు ఏవేవో చెప్పుకుంటూ వస్తున్నాడు మోహన్. 

లేదమ్మా ఇద్దరి పిల్లల తోటి సుమతిని ఒంటరిగా పంపించలేను అనేసరికి అవతల నుంచి అత్తగారి మాటలు స్పీకర్లో వినపడ్డాయి. తప్పురా! మన కోడలి బంధువులు మనకి బంధువులే. అయినా సొంత మేనమామ మనం సుమతిని పంపించకపోతే మన గౌరవం ఏమి నిలబడుతుంది ? అయినా అమ్మాయి కూడా బాధపడుతుంది. కాబట్టి నువ్వు వెంటనే సిక్ లీవ్ పెట్టి తీసుకుని వెళ్ళు ఇంకేమి ఆలోచించకు అని ఫోన్ పెట్టేసింది అవతల నుంచి సుమతి అత్తగారు.

కాసేపటికి మోహన్ బయటికి వచ్చి బట్టలు సర్దు. మనం పల్లిపాలెం వెడదాం అనేసరికి మేనమామ పోయిన మాట మర్చిపోయి ఒక్కసారి ఆనందం వచ్చింది సుమతికి. 
ఒక తరానికి ఒక తరానికి ఆలోచన విధానంలో ఎంత మార్పు. ఆ తరం బంధువులకి బంధుత్వాలకి అనుబంధాలకి ఆప్యాయతలకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ తరం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది పరిస్థితి. ఆ తరం దాటిపోతే ఈ బంధుత్వాలు ఇలాగే ఉంటాయేమో అనుకుంది సుమతి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
 పాము వెళ్ళిపోయింది కానీ. . .

అర్ధరాత్రిలో మఠం ఏనుగు భయంతో ఘీంకరిస్తొంది. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ అరుపులకు కూడా ఎవవరికి మెలుకువ కలగలేదు. అంత పెద్ద ఏనుగులు ఎలుక, కప్ప, పిచుక వంటి చిన్న చిన్న జంతువులకు ఎక్కువ భయపడతాయి. ఈ రాత్రిలో ఏ కప్పో, ఎలకో ఆ ఏనుగు దగ్గరకు వెళ్ళుంటుందని పరమాచార్య స్వామివారే లేచి వెళ్ళారు.

ఏనుగుకు ఎదుగురుగా ఒక పెద్ద తాచుపాము పూర్తిగా పడగ విప్పి చూస్తోంది. వెంటనే స్వామివారు శిష్యులను నిద్రలేపారు. పామును కొట్టడానికి వాళ్ళు కర్రలు తోసుకుని వచ్చారు. “ఆ పామును కొట్టకండి. నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. అదే వెళ్ళీపోతుంది” అని ఆదేశించారు.

స్వామివారు చెప్పినట్టుగా నువ్వులనూనె దీపం వెలిగించి అక్కడ పెట్టగానే, అప్పటి దాకా పడగ విప్పి నిలబడ్డ ఆ పాము మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంత పెద్ద ఏనుగు ఘీంకారాన్ని అక్కడే దగ్గర్లో పడుకున్న శిష్యులు వినలేదు కాని, అప్పటికే చెవి సమస్య ఉన్న పరమాచార్య స్వామికి వినపడింది.

అవును గజేంద్రుడు ‘కుయ్యో మొర్రో’ అని మొత్తుకుంటే అది విన్నది విష్ణువొక్కడే కదా! ఆ ఏనుగుని మరో చోటికి మార్చమని చెప్పారు మహాస్వామివారు.

”కాని పాము వెళ్ళిపోయింది కదా!”

“అవును పాము వెళ్ళిపోయింది. కాని ఏనుగుకి ఆ భయం పోయుండదు కదా!” స్వామివారి ఆదేశానుసారం దాన్ని మరో చోట కట్టారు శిష్యులు. పరమాచార్య స్వామివారు నిద్రకు వెళ్ళిపోయారు.

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 1

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust
 మనుచరిత్రలో అటఁజని కాంచె-- పద్యంలో అటుచని అనేది సరియైన పాఠమా?
“అటఁజని” — సరియైన పాఠ విచారణ

పెద్దన రచించిన మనుచరిత్ర లో కనిపించే “అటఁజని కాంచె” అనే పాఠంపై కొంతకాలంగా పాఠాంతర చర్చ ఉంది. కొందరు “అటుచని” అనే రూపాన్ని చదివినా, వ్యాకరణం, సంధి, ఛందస్సు, ప్రాచీన ప్రతులు, సందర్భార్థం — ఈ అన్నింటినీ పరిశీలిస్తే “అటఁజని” అనేదే సరియైన మరియు ప్రామాణిక పాఠమని స్పష్టమవుతుంది.

పద్యము ఇలా ఉంది:

“అటఁజని కాంచె భూమిసురుఁ డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్”

ఇక్కడ “అటఁజని” అనే రూపం వ్యాకరణపరంగా “అటన్ + చని” అనే సంధి రూపం. “అటన్” అంటే “అక్కడికి” అనే అర్థం గల క్రియావిశేషణం; “చని” అనేది “చనుట” (వెళ్ళుట) అనే క్రియ యొక్క పూర్వకాలిక రూపం. ఈ రెండు కలిసినప్పుడు సంధి నియమం ప్రకారం “అటన్ + చని → అటఁజని” అవుతుంది. ఇందులో “న్” అనుస్వారరూపం (ఁ) పొంది, తరువాతి “చ” ప్రభావంతో “జ” ధ్వని ఏర్పడుతుంది. ఇది తెలుగు సంధి విధానంలో సహజమైన రూపాంతరం.

అర్థపరంగా కూడా “అటఁజని కాంచె” అంటే “అక్కడికి వెళ్ళి చూచెను” అనే స్పష్టమైన భావం వస్తుంది. ఈ పద్యం ప్రవరుని హిమాలయ యాత్ర సందర్భంలో ఉంది. కాబట్టి “అక్కడికి చేరి చూచెను” అనే భావమే సందర్భానికి తగినది. కానీ “అటుచని” అని చదివితే అది “అటు + చని” అనే రూపమై, “ఆ వైపు వెళ్ళి” అనే అస్పష్టమైన లేదా బలహీనమైన అర్థం మాత్రమే ఇస్తుంది. అంతేకాదు, “అటు” అనే పదానికి ద్రుతప్రకృతి లేకపోవడంతో “అటఁజని” వంటి సంధి ఏర్పడదు.

ఛందస్సు దృష్ట్యా కూడా “అటఁజని” అనేదే సరిపోతుంది. “అటుచని” అని మార్చితే పద్యంలోని గణవిభజన చెడిపోతుంది. కాబట్టి కవి ఉద్దేశించిన శబ్దసౌందర్యం, లయ, గతి అన్నీ దెబ్బతింటాయి.

పాత తాళపత్ర ప్రతులు, విమర్శనాత్మక సంచికలు, సంప్రదాయ వ్యాఖ్యానాలు అన్నీ కూడా “అటఁజని” అనే పాఠాన్నే సమర్థిస్తున్నాయి. కొన్నిచోట్ల “అటజని” అని బిందువు లేకుండా కనిపించినా, అది సాధారణంగా ముద్రారాక్షసం లేదా లిప్యంతరణ సౌలభ్యం వల్ల వచ్చిన రూపంగా భావిస్తారు. వ్యాకరణరీత్యా సరియైన రూపం మాత్రం “అటఁజని” యే.

అందువల్ల సంక్షిప్త నిర్ణయం:

సరియైన పాఠం: “అటఁజని కాంచె” ✅
తప్పు / అర్వాచీన రూపం: “అటుచని కాంచె” ❌
ఈ కారణాలన్నింటి వల్ల “అటఁజని” అనేదే ప్రామాణికమైన, శాస్త్రీయమైన, సందర్భోచితమైన పాఠమని నిర్ధారించవచ్చు.
 "వరవీణా మృదుపాణి" సరస్వతిని ఉద్దేశించినదా? లక్ష్మిని ఉద్దేశించినదా?
ఇది కొంత వివాదాస్పదమైన అంశమే. ఈ పాటను సరస్వతి దేవి పరంగా, లక్ష్మీదేవి పరంగా కూడా అన్వయం చెప్పవచ్చు. దీన్ని రాసింది అప్పయ్య దీక్షితులు (అప్పయ్య దీక్షితార్) అని చెబుతారు.

ముందుగా ఈ పాట సాహిత్యాన్ని చూద్దాం:

వరవీణా మృదుపాణీ
వనరుహ లోచన† రాణీ

సురుచిర బంభరవేణీ
సురనుత కల్యాణీ

నిరుపమ శుభగుణలోలా
నిరత జయప్రదశీలా

వరద ప్రియ రంగనాయకి
వాంఛిత ఫలదాయకి

సరసీజాసన†† జననీ‡
జయ జయ జయ జయ‡‡

వీణాపాణి అనగానే మనకు సరస్వతీ దేవి మాత్రమే గుర్తుకు వస్తుంది కదా? అందుకే అందరూ ఈ పాట సరస్వతి గురించే అనుకొంటారు. అయితే మిగిలిన పంక్తుల్లోని ప్రతిపదార్థం చూద్దాం:

ప్రతి పదార్థము:

వరవీణా = శ్రేష్ఠమైన వీణ
మృదు = సున్నితమైన
పాణీ = చేతులు (శ్రేష్ఠమైన వీణను సున్నితంగా చేతులందు కలదానా)
వనరుహ = పద్మం
లోచన = కళ్ళు (కలవాడు)
రాణీ = రాణి (పద్మలోచనుని రాణి)
సురుచిర = అందమైన
బంభర = తుమ్మెదల వంటి
వేణీ = కురులు (కలదానా!)
సుర = దేవతలచే
నుత = స్తుతించబడ్డ
కల్యాణీ = శుభం కూర్చే దానా!
నిరుపమ = (ఉపమ = సామ్యం
నిరుపమ = సామ్యం లేని)
శుభ = మంచి
గుణ = లక్షణాలు
లోలా = కదులునది (శుభ గుణాలతో కదులునది)
నిరత = ఎల్లప్పుడూ
జయ = విజయమును
ప్రద = ప్రసాదించే
శీలా = గుణం కలదానా!
వరద = వరములిచ్చు వాని
ప్రియ = ఇష్టసఖియైన
రంగనాయకి = రంగనాయకుని సతి
వాంఛిత = కోరిన
ఫల = ఫలములు
దాయకీ = ఇచ్చునది
సరసిజాసన = సరసిజ + ఆసన = పద్మం ఆసనంగా కలదానా/కలవాడు
జనని = తల్లి
జయ = విజయము

ఇప్పుడు సరస్వతి పరంగా అర్థం చెప్పుకోవాలంటే:
శ్రేష్ఠమైన వీణ చేతులందు సున్నితంగా కలదానా! పద్మం వంటి కళ్ళు ఉన్న బ్రహ్మ(?)కు రాణి! అందమైన తుమ్మెదల వంటి కురులు గలదానా! దేవతలచే స్తుతింపబడి లోక కల్యాణం చేసేదానా! అనుపమ శుభ గుణాలతో కదిలేదానా! ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించే గుణంకలదానా! వరములిచ్చు వాని ఇష్టసఖి! రంగనాయకుని సతి! కోరిన ఫలములు ఇచ్చుదానా! పద్మం ఆసనంగా కలదానా! తల్లీ! నీకు విజయము!

ఇప్పుడు లక్ష్మి పరంగా అర్థం చెప్పుకోవాలంటే:
శ్రేష్ఠమైన వీణ చేతులందు సున్నితంగా కలదానా! పద్మం వంటి కళ్ళు ఉన్న విష్ణువుకు రాణి! అందమైన తుమ్మెదల వంటి కురులు గలదానా! దేవతలచే స్తుతింపబడి లోక కల్యాణం చేసేదానా! అనుపమ శుభ గుణాలతో కదిలేదానా! ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించే గుణంకలదానా! వరములిచ్చు విష్ణువుకు ఇష్టసఖి! రంగనాయకుని సతి! కోరిన ఫలములు ఇచ్చుదానా! పద్మం ఆసనంగా కలవాడైన బ్రహ్మకు తల్లీ! నీకు విజయము!

అయితే, రంగనాయక అన్నది ముఖ్యంగా విష్ణువు గురించి, రంగనాయకి అన్నది విష్ణువు పత్ని అయిన లక్ష్మిదేవి గురించి ప్రయోగించడం ఆనవాయితీ. శ్రీరంగంలో ఉన్న విష్ణువాలయం శ్రీవైష్ణవ దేవాలయాలలో ప్రముఖమైనది కాబట్టి దక్షిణ భారతీయుడైన అప్పయ్య దీక్షితార్ బ్రహ్మ గురించి రాసి ఉంటాడని అనుకోను. రంగనాయకుడు విష్ణువు అయితే రంగనాయకి లక్ష్మీ దేవి అవుతుంది, తప్ప సరస్వతి కాలేదు.

అలాగే, వరద అన్న విశేషణం కూడా బహుళంగా విష్ణువుకు మాత్రమే మనకు కనిపిస్తుంది. వరద అంటే విష్ణువు అయితే, వరదప్రియ అన్నది లక్ష్మి తప్ప సరస్వతి కావడానికి వీల్లేదు.

అదే విధంగా వనరుహలోచన అన్న విశేషణం కూడా ఎక్కువగా విష్ణువుకే వాడడం మనకు కన్పిస్తుంది. కాబట్టి వనరుహలోచన రాణి అన్నది లక్ష్మికే అన్వయం కూర్చడం సులభం.

ఇక సరసిజాసన జననీ అన్నది ఇక్కడ ప్రధానమైనది. సరసిజాసన అన్నది బ్రహ్మకే ప్రాయికంగా ఆపాదిస్తారు. కాబట్టి బ్రహ్మ కమలభవుడు అయితే, సరసిజాసన జననీ లక్ష్మి మాత్రమే అవుతుంది.

అలాగే జయప్రద (విజయాలను కూర్చేదానా), కల్యాణి (శుభం కూర్చేదానా) అన్న విశేషణాలు సామాన్యంగా లక్ష్మీదేవికే ఆపాదిస్తారు. సరస్వతిని జయప్రద అని గానీ, కల్యాణి అనిగానీ సంబోధించే స్తుతులు సంస్కృతంలో నాకు తెలిసి లేవు.

స్థూలంగా చెప్పాలంటే, ఇది నిజంగా అయ్యప్ప దీక్షితులు రాసిందే అయితే, అద్వైత సిద్ధాంత ప్రచారానికి జీవితం అంకితం చేసిన ఆయన శివుణ్ని, విష్ణువును స్తుతిస్తూ కావ్యాలు, కృతులు రాసాడు కాబట్టి ఇది రంగనాయకి అయిన విష్ణుపత్నిని సంబోధిస్తూ రాసాడని నా అభిప్రాయం!

† కొంతమంది దీన్ని తెలుగు వాక్యంగా చేసి వనరుహ లోచను రాణి అని పాడుతారు. కానీ తమిళం మాతృభాషగా గల అప్పయ్య దీక్షితులు తెలుగులో రాయలేదు. చివరి పంక్తిలో ఉన్న సరసీజాసన అన్నదాన్ని కూడా కొంతమంది తెలుగు వాళ్ళు సరసీజాసను (సరసీజాసనుని అన్న అర్థంలో) పాడుతారు.

‡ సరసీజాసన జననీ అన్నది కొంతమంది సరసీజాసన రాణీ అని పాడుతారు.

‡‡ కొంతమంది చివర జయ జయ జయ జయ అని కాకుండా జయ జయ జయ జయ వాణీ అని పాడుతారు.

[[తా.క. వీణాపాణి అనగానే మనకు సరస్వతీ దేవి మాత్రమే గుర్తుకు రావడానికి ముఖ్యమైన కారణం రవివర్మ: మనం ఇప్పుడు ఊహించుకొనే దేవతల రూపాలన్ని ఒక రకంగా రవివర్మ చిత్రాల్లోని ఊహలే.
సరస్వతి అంటే వీణాపాణిగా, పుస్తకధారిగా ఈ కింది రూపంలో ఉంటుందని మన ఊహల్లో ప్రతిష్టింపజేసిన ఘనత రవివర్మకే దక్కుతుంది:
లక్ష్మి అంటే ఇలా ఉండాలని ఈ రూపం మనలో ముద్రింపజేసింది కూడా రవివర్మ చిత్రపటమే:
 జ్ఞాననిధి హనుమ

కార్యసాధకుడికి పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి ఓర్పు, నేర్పు సమపాళ్లలో జతకలవాలి. సహనం ఎంత ముఖ్యమో సమయస్ఫూర్తి కూడా అంతే అవసరమన్నది గ్రహించాలి. హనుమంతుడిలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. సీతాన్వేషణకు ముందు రాముడు ఆంజనేయుడిలో గమనించిన విషయం కూడా ఇదే.

శాస్త్రరీత్యా హనుమ శబ్దానికి వాక్యకోవిదుడు, జ్ఞాని అనే విశేషార్థాలు ఉన్నాయి. హనుమ ఓ జ్ఞాననిధి. ఆయన వ్యక్తిత్వం సామాన్యమైనది కాదు. వివేకం, ప్రతిభ, సమ యస్ఫూర్తి, సంయమనం మొదలైనవి హనుమలో పరిపూర్ణంగా ఉన్నాయి. అయితే జ్ఞానం కలిగి ఉంటే సరిపోదు. దాన్ని తగినవిధంగా సమయానికి వినియోగించడమన్నది ముఖ్యం. బుద్ధిబలాన్ని ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ పరాక్రమం ప్రదర్శించాలో, ఆలోచించి ఎక్కడ అడుగు ముందుకు వేయాలో హనుమకు బాగా తెలుసు. ఆయన మాటతీరు సుస్పష్టం. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు వీనుల విందుగా మాట్లాడేవాడు. ఇంకా ఇంకా వినాలనిపించేలా ఉండేదట ఆ మాట. అతిగానో, మరీ క్లుప్తం గానో చెప్పకుండా విషయం అర్థమయ్యేలా వివ రించడం ఆయనలోని ప్రత్యేకత. వినయశీలురే విజయానికి చిరునామాగా నిలుస్తారు. హను మలో ఈ గుణం పరిపూర్ణంగా ఉంది.

అడవిలో కాషాయాంబరధారులై వస్తున్న రామలక్ష్మణులను చూసి శత్రువులుగా భావిం చాడు సుగ్రీవుడు. హనుమంతుడు ధైర్యంగా వారికి ఎదురెళ్లి కలిసి మాట్లాడి వెంట పెట్టుకు నివచ్చి సుగ్రీవుడితో స్నేహం కలిపించాడు. ఎదు టివారికి ఒక విషయం చెప్పేటప్పుడు ఎంతవ రకు అవసరమో అంతవరకే చెబుతాడు హనుమ. మాటలు అసందర్భంగా దొర్లనివ్వడు. ప్రధానంగా ఇది గమనించే శ్రీరామచంద్రుడు ఆయనను దూతగా నిర్ణయించుకున్నాడు. రాజహృదయం, ధర్మనీతి, కార్యసిద్ధి మెదలైనవి దృష్టిలో పెట్టుకోగలిగిన మేధావి మాత్రమే దూత కాగలడు. అశోకవనంలో సీతమ్మను గుర్తించి, ఆమెకు రాముడి ప్రేమను ప్రకటించి ఓదార్చాడు. రావణుడి సమక్షంలో శ్రీరాముడి వీరత్వాన్ని విడమరిచి చెప్పి అతడి గుండెల్లో ప్రకంపనలు సృష్టించి అధైర్య పరచాడు. పాలకుడు అధర్మపరుడైతే అతడికి, అతడి రాజ్యానికి అరిష్టం. స్త్రీని శోకింపచేస్తే మహాజ్వాలగా లేచి భస్మం చేస్తుంది. పర స్త్రీని చెరపట్టినవాడు ఎంతటి పరాక్రమవంతు డైనా పతనం తప్పదు. ఎంతటి భక్తిపరుడైనా దైవం సహకరించదు- అంటూ నర్మగర్భంగా హెచ్చరించాడు. సీతమ్మ తల్లితో 'అమ్మా! వానరసేనలో నాకంటే అధికులు, నాతో సమా నమైనవారు చాలామంది ఉన్నారు. నాకంటే అల్పుడు ఒక్కడు కూడా లేడు' అంటూ తనను తాను తగ్గించుకుని సీతమ్మకు ధైర్యం చెప్పాడు. ఏ కార్యమైనా సాధించగలననే ధైర్యం హనుమలో అణువణువునా నిండి ఉంది. నిజంగానే అంతటి సమర్థుడు కూడా.

'హనుమంతుడు ఉంటే అందరూ బతికి ఉన్నట్టే. ఆయనలేకుంటే ఎవరూ లేనట్టే నని' ఓ సందర్భంగా జాంబవంతుడన్న మాటల్లో ఎంతో పరమార్థం ఉంది. శ్రీరామ కార్యాన్ని అంకిత భావంతో సాధించి శ్రీమద్రామాయణ కావ్యంలోని సుందరకాండలో దేదీప్యంగా వెలుగుతున్నాడు హనుమంతుడు. జ్ఞాననిధి హనుమ నిత్యపూజనీయుడు.

యం.సి.శివశంకరశాస్త్రి
 చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సమయం ఉదయం మూడు గంటలు. అక్కడ ప్రయాణీకులంతా నిద్రలో ఉన్నారు. డెబ్భై ఎనిమిదేళ్ళ వృద్ధుడు. తెల్లటి ధోవతి, చొక్కాతో కూర్చున్నాడు. చేతిలో ఒక వెదురు బుట్ట. అందులో వేడి వేడి ఇడ్లీ ఉన్నాయి. ఆయన, 

“ఇడ్లీ… వేడి ఇడ్లీ… ఒక రూపాయి… ఒక్క రూపాయి మాత్రమే…” అని పిలుస్తున్నాడు. కానీ, ఎవరూ కొనలేదు. ఇది 2026 సంవత్సరం. ఒక రూపాయికి చాక్లెట్ కూడా రాదు… ఇడ్లీలా? చాలామంది నవ్వుతూ అతన్ని పిచ్చివాడని అనుకున్నారు.  నా పేరు అరవింద్. నేను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాను. ఆకలిగా ఉంది. కానీ స్టేషన్ స్టాళ్లలో ఇడ్లీ ప్లేట్ ₹50.  ఆ వృద్ధుడిని గమనించాను. బుట్టలో దాదాపు 100 ఇడ్లీలు ఉన్నాయి. ఒక్క కస్టమర్ కూడా లేడు. ఆయన కళ్లలో తేమ కనిపించింది.  నేను దగ్గరకు వెళ్లి అడిగాను: “తాతయ్య… ఒక రూపాయికి ఇడ్లీ అమ్మితే నష్టమవదా?”  ఆయన చిరునవ్వు నవ్వాడు. “బాబూ… ఇది నష్టం కాదు. లాభం.”  “ఎలా తాతయ్య? బియ్యం ధర, గ్యాస్ ధర… ఒక్క ఇడ్లీకి కనీసం ₹5 ఖర్చవుతుంది కదా!”  ఆయన బుట్ట మూసి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు…  “1975 సంవత్సరం. అప్పటికి నాకు 25 ఏళ్లు. రైల్వే పోర్టర్‌గా పనిచేసేవాడిని. నెల జీతం ₹100. ఒక రోజు భారీ వర్షం. పని లేదు. డబ్బు లేదు. మూడు రోజులు ఆకలితో ఉన్నాను. స్టేషన్ బెంచ్ మీదే మూర్చపోయాను.”  “అప్పుడు ఒక అమ్మ వచ్చింది. ఆమె ప్లాట్‌ఫాంపై ఇడ్లీలు అమ్మేది. ఒక్క రూపాయికి. నన్ను లేపి నీళ్లు చల్లి 4 ఇడ్లీలు పెట్టింది. డబ్బు అడగలేదు.”  “నేను ఏడుస్తూ… ‘నా దగ్గర డబ్బు లేదు’ అన్నాను. అప్పుడు ఆమె చెప్పింది — ‘బాబూ… నేను కూడా ఒకప్పుడు ఆకలితో ఉన్నాను. అప్పుడు ఎవరో నాకు భోజనం పెట్టారు. అప్పుడే నేను ఒక మాట ఇచ్చుకున్నాను — నేను బ్రతికినంతకాలం ఆకలితో ఉన్నవారికి ఒక రూపాయికి ఇడ్లీ ఇస్తాను. నువ్వూ పెద్దవాడైన తర్వాత ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలి.’”  వృద్ధుడి కళ్లలో నీళ్లు మెరిశాయి.  “ఆమె 1995లో చనిపోయింది. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని అడిగింది — ‘నా మాట నిలబెడతావా?’ నేను ‘అవును’ అన్నాను.”  “ఆ తర్వాత నేను రైల్వే కాంట్రాక్టులు తీసుకున్నాను. బాగా సంపాదించాను. మూడు ఇళ్లు. ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. కానీ 1995 నుంచి ఈరోజు వరకు… ప్రతి ఉదయం 3 గంటలకు… 100 ఇడ్లీలు… ఒక రూపాయి… ఈ స్టేషన్‌లోనే.”  నా శరీరమంతా గగుర్పొడిచింది.  “తాతయ్య… రోజుకి ₹400 నష్టం. నెలకి ₹12,000. సంవత్సరానికి ₹1.5 లక్షలు. 30 సంవత్సరాలకు ₹45 లక్షలు!”  ఆయన చిరునవ్వుతో అన్నాడు: “డబ్బు ప్రకారం చూస్తే నష్టం. కానీ మనసు ప్రకారం చూస్తే లాభం. ఈ 30 ఏళ్లలో ఎంతమందికి తినిపించానో తెలుసా? 10 లక్షల ఇడ్లీలు… 10 లక్షల కడుపులు… 10 లక్షల ఆశీర్వాదాలు… వాటి విలువ ఎన్ని కోట్లుంటుంది బాబూ?”  అంతలో ఒక చిన్న బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. చిరిగిన చొక్కా. వయస్సు 12 సంవత్సరాలు.  “తాతయ్య… ఇడ్లీ… మూడు రోజులుగా తినలేదు. అమ్మ ఆసుపత్రిలో ఉంది. డబ్బు లేదు.”  వృద్ధుడు ఒక ఆకు మీద 4 ఇడ్లీలు పెట్టి చట్నీ వేశాడు. “నెమ్మదిగా తిను బాబూ.”  ఆ బాలుడు తింటూ ఏడ్చాడు. “రేపు డబ్బు ఇస్తాను…”  “అవసరం లేదు. నువ్వు పెద్దవాడైన తర్వాత ఇంకొక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టు. అదే చెల్లింపు.”  ఆ బాలుడు ఆయన కాళ్లకు పడిపోయాడు. “నేను కూడా మాట ఇస్తున్నాను తాతయ్య. నేను కూడా ఒక రూపాయికి ఇడ్లీ అమ్ముతాను.”  నేను వెంటనే ₹1000 తీసి ఇచ్చాను. “తాతయ్య… దయచేసి ఈ ఇడ్లీల్లన్నీ నాకు ఇవ్వండి.”  ఆయన నవ్వి అన్నాడు: “ఇవి ఒకరికే అమ్మడానికి కాదు బాబూ… ఆకలితో ఉన్నవారికోసం. నీకు ఆకలి అయితే ఒక ఇడ్లీ తీసుకో. ఒక రూపాయి వేయి. చాలు.”  నేను ₹1 పెట్టి ఒక ఇడ్లీ తీసుకున్నాను. నా జీవితంలో అంత రుచిగా అనిపించిన భోజనం మరొకటి లేదు. కన్నీళ్లతో తిన్నాను.  “తాతయ్య… ఒకటి అడగనా?”  “అడుగు బాబూ.”  “మీ పిల్లలు ఇది డబ్బు వృథా అంటారా?”  ఆయన ఫోన్ తీసి వీడియో కాల్ చేశాడు. అమెరికాలో ఉన్న తన కొడుకు ఫోన్ ఎత్తాడు.  “అప్పా, ఇడ్లీలు అమ్మేశారా? ఆరోగ్యం ఎలా ఉంది?”  “బాగున్నాను. ఈరోజు ఒక యువకుడు నా కథ విన్నాడు.”  ఆయన కొడుకు నన్ను చూసి నవ్వాడు. “సర్, మా నాన్నను చూసుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతి నెలా మేము ₹50,000 పంపిస్తాం — ఇడ్లీల కోసం. అది ఆయన కోరిక. అదే మా ఆశీర్వాదం. ఆయన ఇచ్చిన మాట… ఇప్పుడు మా మాట.”  వృద్ధుడు కాల్ ముగించి అన్నాడు: “చూశావా బాబూ? నా పిల్లలు కూడా ఈ వ్రతాన్ని కొనసాగిస్తున్నారు. నేను చనిపోయినా ఈ బుట్ట ఆగదు. ఒక రూపాయి ఇడ్లీ ఆగదు.”  ఈరోజు 2026. ఆ వృద్ధుడు ఇక లేరు. గత సంవత్సరం 79 ఏళ్ల వయసులో చనిపోయారు. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని చెప్పారు:  “బాబూ… ఈ బుట్టను చూసుకో. మాట నిలబెట్టు.”  ఇప్పుడు ప్రతి ఉదయం 3 గంటలకు… అదే చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో… అదే బెంచ్ దగ్గర… నేను ఉంటాను. బుట్ట నిండా ఇడ్లీలు. ఒక్క రూపాయి.  నేను నా ఐటీ ఉద్యోగం వదల్లేదు. కానీ ప్రతి ఉదయం 2 గంటలు… ఇడ్లీల కోసం కేటాయిస్తున్నాను.  మా కంపెనీలో 200 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ నెలకు ₹100 ఇస్తున్నారు. “వన్ రూపీ ఇడ్లీ ట్రస్ట్.”  ఆ 12 ఏళ్ల బాలుడు — గణేష్ — ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. సాయంత్రం వచ్చి సహాయం చేస్తాడు.  “అన్నా… నేనూ మాట ఇచ్చాను. పెద్దవాడైన తర్వాత నేనూ ఇదే చేస్తాను.”  ---  స్నేహితులారా…  డబ్బు సంపాదించడం గొప్ప కాదు. ఆ డబ్బుతో పుణ్యం సంపాదించడం గొప్ప.  మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒక చిన్న పొదుపు డబ్బా పెట్టండి. “₹1 డబ్బా.”  ప్రతి రోజు ₹1 వేయమని చెప్పండి. నెలకి ₹30 అవుతుంది. ఆ డబ్బుతో ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి.  ఎందుకంటే… మీకు ₹30 ఒక చిన్న ఖర్చు మాత్రమే కావచ్చు… కానీ ఇంకొకరికి అది 30 రోజుల ఆశ కావచ్చు.  ---  ఒక మాట ఇచ్చుకుందాం: కనీసం ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి.  డబ్బు పోతుంది… పుణ్యం మిగులుతుంది…  బుట్ట ఖాళీ కావచ్చు… కానీ మనసు మాత్రం నిండిపోతుంది… 🙏

సేకరణ :శ్రీనివాస రెడ్డి గోదల
 కాఫీ కబుర్లు సంఖ్య 1193 (మే 17-2026) -- ఈరోజు  ప్రపంచ రక్తపోటు దినోత్సవం (world hypertension day)  -- జంట పక్షుల్లాగా  బిపి షుగర్ జంట వ్యాధులుగా వాసికెక్కాయి గత రెండు దశాబ్దాలుగా.  ఒకప్పుడు అంతగాలేని ఈ రెండు ఇప్పుడు సర్వ సాధారణమైపోయాయి.  యాభై వయసు దాటిన వారెవరిని కదిపినా ఈ రెండూ లేదా ఈ రెండింటిలో ఒకటో ఉందంటారు.  నియంత్రణ రేఖ దాటితే ఈ రెండు వ్యాధులు ప్రమాదకరమైనవే ‌.. ప్రాణాంతక వ్యాధులే.  ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం  గనుక బిపి గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం.  శరీరంలో రక్తప్రసరణ సజావుగా లేకపోతే హెచ్చుతగ్గుల వలన బిపి వస్తుంది.  షుగర్ కంటే డేంజరస్ బిపి అని వైద్యులు చెపుతున్నారు.  ఎందుకంటే సడెన్ గా బిపి హై కావొచ్చు లేదా లో కావొచ్చు.  రెండూ ఇబ్బందికరమే.  గనుక 30-35 దాటిన ప్రతి ఒక్కరూ బ్లడ్ ప్రషర్ గురించి తెలుసుకుని తగు నియంత్రణలో ఉంచుకోవాలి.  ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న జీవనసరళి కారణంగా బిపి రోగుల సంఖ్య పెరిగిపోతోంది.  ఇది దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ..  వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ ని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా బిపి ని కంట్రోల్ చెయ్యడానికి‌‌..  ఏటా మే 17న world hypertension day గా నిర్ధారించి..  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్నో చర్యలు చేపడుతోంది‌. ఏటా సుమారుగా 75 లక్షల మరణాలు బిపి కారణంగా సంభవిస్తున్నాయని తేల్చింది.  బిపి ఉండవలసిన స్థాయిలో ఉండాలి.  తగ్గినా పెరిగినా ప్రమాదమే.  బిపి మనకి రాకుండా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి.  మనకి  కోపం రోషం ద్వేషం ఆవేశం గాభరా వంటివి ఉండకూడదు, ప్రతీ చిన్న విషయానికి ఇతరులతో వాదించే ప్రోగ్రాం పెట్టుకో కూడదు, ఆలోచనలో స్పష్టత ఉండాలి,  ఒంట్లో మంచినీరు ఎప్పుడూ ఉండే విధంగా మంచి నీళ్ళు తాగుతుండాలి,  ఉప్పు పూర్తిగా మానేయకుండా అతికొద్ది పరిమాణంలో శరీరంలోకి వెళ్లాలి.. సోడియం తగ్గిపోయినా ప్రమాదమే అని తెలుసుకోవాలి, ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి,  శరీరానికి శ్రమ వ్యాయామం ఉండాలి, రోజూ లేదా రోజు విడిచి రోజైనా ఒళ్ళంతా మంచి ఆయిల్ తో మాసేజ్ చేసుకోవాలి, కడుపునిండా తినకుండా ఓ 15-20 శాతం ఖాళీ ఉండేలా ఆహారం తీసుకోవాలి.  ఈ జాగ్రత్తలు తీసుకో గలిగితే..  బొట్టుపెట్టి పిలిచినా బిపి మన జోలికి రాదు.  ఐనా ఇంట్లో, ఉద్యోగ రీత్యా, వ్యాపార లావాదేవీల వలన ఈ టెన్షన్ల వలన బిపి రావడం సహజమే.  వెంటనే వైద్యులను సంప్రదించి తగువిధంగా మెడిసిన్స్ వాడాలి. రెగ్యులర్ గా నిర్ణీత సమయాల్లో చెకప్స్ కి వెళుతుండాలి.  తల తిరగడం, కళ్ళు మసకబారడం, నీరసం, వంటివి లో బిపి లక్షణాలు.  విపరీతమైన తలనొప్పి, జ్వరం, అలసట వంటివి హై బిపి లక్షణాలు.  ఇప్పుడు బిపి కంట్రోల్ లో తేవడానికి ఎన్నో మంచి మెడిసిన్స్ వచ్చాయి.  డాక్టర్ సలహా ప్రకారం రెగ్యులర్ గా వేసుకోవాలి.  ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం.. బిపి మాత్ర ప్రభావం 12'లేక 24 గంటల కంటే ఎక్కువ ఉండదు.  గనుక బిపి ఉన్నవారు ఒక్కరోజు కూడా మానకుండా ఖచ్చితంగా నిర్ణీత సమయాల్లో వేసుకోవాలి.  ప్రయాణాల్లో ఉన్నాసరే మానకుండా వేసుకోవాలి.  బిపి ఉన్నవారు స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటుంటే మానేయాలి.  ట్యాబ్లెట్లు రోజూ అవసరం కనుక ఎప్పుడూ sufficient గా‌ ఇంట్లో ఉంచుకోవాలి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా బిపి గురించి మనకి తెలిసిన విషయాలు నలుగురికీ చెప్పి నియంత్రణకు మనవంతు కృషి మనం చేద్దాం.. తగు జాగ్రత్తలు తీసుకుంటే బిపి ని జయించవచ్చును.  మన బిపి  మన కంట్రోల్లోనే..  ఇదే ఈరోజు మన స్లోగన్..  ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....
 *భగవద్గీత 6.1*  
_"ఫలాపేక్ష లేని కర్మయే నిజమైన యోగం" - షార్ట్ కట్_ 🎯

_మాట:_  
ఫలితం ఆశించకుండా కర్తవ్యం చేసేవాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి.

_అర్థం 3 ముక్కల్లో:_  
1. _కర్మ_ = చేయవలసిన పని చేయడం  
2. _ఫలాపేక్ష_ = ఫలితం మీద ఆశ వదిలేయడం  
3. _యోగం_ = ప్రశాంతమైన మనసుతో పని చేయడం

_లైఫ్ కి లింక్:_  
పరీక్ష రాసేటప్పుడు రిజల్ట్ గురించి ఆలోచిస్తే టెన్షన్ వస్తుంది. కానీ ప్రిపరేషన్ మీద ఫోకస్ పెడితే రిజల్ట్ తానే వస్తుంది. ఆఫీస్ పనిలోనూ, బంధాల్లోనూ ఇదే నిజం. ఫలితం మీ చేతిలో లేదు, కర్తవ్యం మాత్రమే నీ చేతిలో ఉంది.

_ఒక్క లైన్:_  
_"పనిని వదలడం సన్యాసం కాదు, ఫలితాన్ని వదలడమే నిజమైన సన్యాసం."_ 🙏

*శుభ ఆదివారం జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర* 🌼
 *🚩విష్ణుమూర్తికి రాగి పాత్రలోనే నైవేద్యం పెట్టాలా? ఎందుకలా?🚩*
 
*ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడిఅర్చకులు స్వాములు రాగి పాత్రలోనే శ్రీ మహావిష్ణువుకు నైవేద్యమంటే పెడుతుంటారు. కారణం ఏంటి?*

*అంతెందుకు కొన్ని గుళ్ళలో రాగి తీర్థం ఇచ్చే పాత్రలు కూడా రాగితోనే తయారు చేయబడి ఉంటాయి. ఎందుకు అలా చేస్తారు. పురాణాలు ఏం చెబుతున్నాయి. శాస్త్రం ఏం చెబుతోంది అనే అంశాలను పరిశీలిద్దాం.*

పురాణాల ప్రకారం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు. పుట్టుక రాక్షస పుట్టుకే అయినా పరమ విష్ణుభక్తుడు. ఆయన ధ్యాసలోనే ఉండేవాడు.

ఆ రాక్షసుడు పదహారువేల సవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు.

కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు.

తన మరణం విష్ణు చక్రం వల్ల సంభవించాలని, తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.

తరువాత కూడా గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ద ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిశ్చయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు.

విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించిది. వెంటనే అతడి మాంసమంతా రాగిగా మారిపోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి.

మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారైంది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణువుకు ఎంతో ఇష్టం.

రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని పురాణాలు చెబుతుంటాయి.

శాస్త్రపరంగా చూస్తే, రాగికి రోగ నిరోధక శక్తి ఎక్కువ. తీర్థం రాగి పాత్ర ద్వారానే వేయడం వలన రోగాలు సోకకుండా ఉంటాయని అర్థం. అందుకే గడాకేశుడి శరీరం ద్వారా లోహాల లక్షణాలను తెలియజేశారు.         
 *కోటివరాల దేవుడు శ్రీ మన్నారాయణుడు*                       🙏
🌷*అనంతస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్నవారికి కోరినన్ని వరాలను ఇచ్చే  దయామయుడు. అందుకే ఆ స్వామిని 'కోటివరాలదేవుడు' అని పిలుస్తున్నారు. ఆ స్వామి నామస్మరణ సకల శుభకరం. అందుకే పోతనామాత్యుడు ఆ స్వామిని ఇలా కీర్తించాడు.*

🌷*కమలాక్షు నర్చించు కరములు కరములు* 
*శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ* 
*సుర రక్షకుని జూచు చూపులు చూపులు* 
*శేషశాయికి మ్రొక్కు శిరము శిరము* 
*విష్ణు నాకర్ణించు వీనులు వీనులు*
*మధువైరి దవిలిన మనము మనము*
*భగవంతులగొను పదములు పదములు* 
*పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి* 
*దేవదేవుని జితించు దినము దినము* 
*చక్రహస్తుని బ్రకటించు* *చదువు చదువు*
*కుంభినీధవు జెప్పెడి* *గురుడు గురుడు* 
*తండ్రి హరిం* *జేరుమనియెడి తండ్రి తండ్రి*

🌷ఆ స్వామి 'నారాయణ' నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అన్ని  దుఃఖాలను దూరం చేసి, సకల ఐశ్వర్యాలను ప్రసాదించి, పరమపదానికి చేరుస్తుంది. ఇందుకు ఓ చక్కని ఉదాహరణ అజామిళుని ఉదంతమే.

🌷పూర్వం కన్యాకుబ్జనగరంలో అజామిళుడనే పండితుడు ఉండేవాడు. అతను కులాచారాన్ని, ధర్మాన్ని వీడి జూదము, దొంగతనము, వ్యభిచారం, దుష్కార్యాలు వంటి పనులతో భ్రష్టు పట్టాడు. కాస్తంత మంచివాళ్ళు అతని కంటబడితే చాలు, వారిని పీడించేవాడు. అతనికి పదిమంది సంతానం. వారిలో చివరివాడు నారాయణుడు. చిన్నకొడుకు నారాయణుడంటే అజామిళునికి చాలా ఇష్టం. కాలగమనంలో వృద్ధుడైన అజామిళుడు మంచాన పడ్డాడు.అతనిని కొడుకులంతా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ, అజామిళుడు ప్రతి విషయానికి చిన్న కొడుకు నారాయణునినే పిలుస్తుండేవాడు. చివరకు అజామిళుడు తుదిశ్వాసనువిడిచే సమయం ఆసన్నమవడంతో, అతడిని నరకానికి తీసుకెళ్ళడానికి యమభటులు వచ్చి నిలబడ్డారు. యమభటులను చూడగానే గజగజ వణికిపోయిన అజామిళుడు భయకంపితుడై తన చిన్న కుమారుని ''నారాయణా!" అని బిగ్గరగా పిలిచి ప్రాణాలను వదిలాడు. అజామిళుడు ఎంతో పాపాత్ముడైనపట్టికీ అంత్యకాలంలో "నారాయణా!" అంటూ విష్ణునామాన్ని స్మరించినందున అక్కడకు విష్ణుభటులు కూడ వచ్చి చేరారు. ఆ మరుక్షణమే యమభటులకు, విష్ణుభటులకు మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. అజామిళుని ఎవరు తీసుకెళ్ళాలన్న విషయమై కీచులాట మొదలైంది. యమభటులు, విష్ణుభక్తులతో, "అయ్యలారా! ఈ పండితుడు మహాపాపి. చెప్పలేనన్ని నీచపు పనులను చేసాడు. ఒక్కరోజైనా ఓ చిన్నపుణ్యకార్యమైనా చేసి ఎరుగడు. కనీసం పూజలు, పునస్కారాలు కూడ చేసి ఎరుగడు. అటు వంటివానికి ఎలా వైకుంఠప్రాప్తి కలుగుతుంది? అతన్ని వైకుంఠానికి తీసుకెళ్ళేందుకు మీరు రావడం విచిత్రంగా ఉంది" అని అన్నారు.యమభటుల వాదనలను విన్న విష్ణుభటులు, "యమదూతలారా! ఎంతటి పాపాత్ములైనప్పటికీ, అంత్యకాలంలో నోరారా హరినామస్మరణం చేసినట్లైతే, అప్పటివరకు అతడు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ అజామిళుడు మిమ్ములను చూడగానే, తన కొడుకును పిలిచే క్రమంలో హరినామస్మరణం చేసాడు. ఆ సంఘటన పట్ల ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు, అజామిళునికి పరమపదాన్ని అనుగ్రహించదలచి మమ్ములను పంపాడు. కనుక, మీరు అతనిని తీసుకెళ్ళడానికి కుదరదు. మీకా అధికారం లేదు. మా మాటల పట్ల నమ్మకం లేకపోతే, ఈ విషయమై మీ ప్రభువు యమధర్మరాజునే అడిగి తెలుసుకోండి" అని బదులు చెప్పారు. ఈ విషయాన్ని యమభటులు, యమధర్మ రాజుకు వినిపించడంతో సావధానంగా విన్న యముడు, విష్ణుతత్త్వాన్ని గురించి, విష్ణుభక్తిని తన భటులకు వివరించడమే కాక, ఇకపై విష్ణుభక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు. ఆవిధంగా ఒక్కసారి 'నారాయణా!' అంటూ విష్ణు నామమును ఉచ్చరించినందుకే అజామిళునికి పరమపద ప్రాప్తి కలిగింది. ఆ నామం అంతటి మహిమాన్వితమైనది.
మానవులే కాదు, దేవతలు సైతం తమకు సమస్యలు ఎదురైనప్పుడు స్వామి నామాన్ని ధ్యానించి ఆయా సమస్యల నుండి బయట పడిన సందర్భాలు ఉన్నాయి.

🌷భక్తజనవత్సలుడైన ఆ సర్వేశ్వరుడు, తన భక్తుల కోసం అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటాడు. 

🌷అటువంటిదే వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల కథ. ఒకానొక్కపుడు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు శ్రీమన్నారాయణుని దర్శనానికై వైకుంఠానికి వచ్చారు. అప్పుడు విష్ణువు, లక్ష్మీదేవిలు అంతఃపురంలో ఉండటంతో ద్వారపాలకులైన జయవిజయులు మునీశ్వరులను అడ్డుకుని, లోనికి పోనివ్వలేదు. అప్పుడా మునీశ్వరులు కోపోద్రిక్తులై జయవిజయులను, "పాపాలకు నిలయమైన భూలోకంలో జన్మించ"మని శపించారు. మునుల శాపాన్ని విని భయకంపితులైన జయవిజయులు, వారి పాదాలపై పడి క్షమించి, రక్షించమని వేడుకున్నారు. వారి ప్రార్థనలను మన్నించిన మునీశ్వరులు, తామిచ్చిన శాపానికి విమోచనం లేదని, అయితే మూడు జన్మలపాటు రాక్షసులై పుట్టి, శ్రీహరిని ద్వేషించి, ఆయన ద్వారానే తిరిగి వైకుంఠానికి చేరుకుంటారని చెప్పారు. ఆ మునుల శాపాన్ని అనుసరించి మొదటి జన్మలో హిరణ్యాక, హిరణ్యకశిపులుగా, రెండవజన్మలో రావణ, కుంభకర్ణులుగా, మూడవజన్మలో శిశుపాల దంతవక్తృలుగా జన్మించి, శ్రీహరిని ద్వేషిస్తూ తద్వారా నిరంతరం హరినామస్మరణం చేస్తూ, తిరిగి వైకుంఠాన్ని చేరుకున్నారు.

❤️❤️❤️❤️❤️❤️❤️.  
 *“మనలోని స్వార్థం, సంకుచితత్వమే కారణం.

*ప్రతి చిన్న కష్టానికి దేవుడి దయ లేదంటూ మన అజ్ఞానాన్ని చాటుకుంటాం.

*మన వేలుకో, కాలుకో వచ్చిన చిన్న బాధను గుర్తిస్తున్నామే గానీ మిగిలిన శరీరమంతా బాగుందన్న సత్యం గ్రహించలేకపోతున్నాం.

*దైవానుగ్రహం నిరంతరంగా, మనపైన ఈసృష్టి అంతట వ్యాపించి ఉన్నా గుర్తించలేకపోతున్నాం.

*శరీరధర్మాలకు, మనసు పోకడలకు భిన్నంగా ఉండటం ఎంతో కష్టం.

*సుఖదుఃఖాలు, కష్టనష్టాలు అర్థం చేసుకుని జీవించడం ద్వారా సమదృష్టి ఏర్పడుతుంది.

*మనలో స్థిరాస్తిగా ఉన్న దైవం, ఈ మనోదేహాలచే  చరాస్తులుగా మారటం, ప్రకృతిలోని అంతర్భాగమే !

*సైన్స్ మాటల్లో చెప్పాలంటే స్థితిశక్తిగా ఉన్న ఆత్మ, ఈశరీరం, మనసుచేసే పనుల కోసం గతిశక్తిగా మారుతోంది!”
 అమ్మవారి అనుగ్రహాన్ని పొందే అత్యంత ప్రీతికరమైన నామాలు............!!
ఇతి శ్రీ లలితోపాఖ్యానమ్ అంతర్గత, శ్రీ హయగ్రీవ ఉవాచ!

అమ్మవారి అతి శక్తివంతం ఐన దివ్య నామాలు..!!

శ్రీ వారాహి ద్వాదశనామాలు..!!
1. పంచమీ 
2. దండనాథా 
3. సంకేతా 
4. సమయేశ్వరీ 
5. సమయసంకేతా 
6. వారాహి 
7. పోత్రిణీ 
8. శివా 
9. వార్తాళీ 
10. మహాసేనా 
11. ఆజ్ఞాచక్రేశ్వరీ 
12. అరిఘ్నీ 
ఈ నామాలు వజ్రపంజరంలా ఒక కవచంలా ఏర్పడి రక్షిస్తుంది.  

శ్రీ శ్యామలా షోడశనామాలు..!!
1. సంగీతయోగినీ 
2. శ్యామా 
3. శ్యామలా 
4. మంత్రి నాయికా 
5. మంత్రిణీ 
6. సచివేశానీ 
7. ప్రధానేశీ  
8. శుకప్రియా 
9. వీణావతీ 
10. వైణికీ   
11. ముద్రిణీ 
12. ప్రియకప్రియా 
13. నీపప్రియా 
14. కదమ్భేశీ 
15. కదంబవనవాసినీ 
16. సదామదా 
ఈ నామాలు బుద్ధిశక్తిని సరిగ్గా పనిచేసేటట్టు చేస్తాయి. 

శ్రీ లలితా పంచవింశతి నామాలు..!!
1. సింహాసనేశ్వరీ 
2. లలితా 
3. మహారాజ్ఞీ 
4. వరాంకుశా 
5. చాపినీ 
6. త్రిపురా 
7. మహాత్రిపురసుందరీ 
8. సుందరీ 
9. చక్రనాథ 
10. సామ్రాజ్ఞీ 
11. చక్రిణీ 
12. చక్రేశ్వరీ 
13. మహాదేవీ 
14. కామేశీ 
15. పరమేశ్వరీ 
16. కామరాజప్రియా 
17. కామకోటికా 
18. చక్రవర్తినీ 
19. మహావిద్యా 
20. శివానంగవల్లభా  
21. సర్వపాటలా 
22. కులానాథా 
23. ఆమ్నాయనాథ 
24. సర్వామ్నాయనివాసినీ 
25. శృంగారనాయికా


*🙏🕉️🛕సర్వజన శ్రేయస్సును కోరేదే "సనాతన ధర్మం"!!!*

 *🙏🕉️🛕సర్వజన శ్రేయస్సును కోరేదే "సనాతన ధర్మం"!!!* 


ఈ మధ్యకాలంలో చాలామంది సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ మాట్లాడే సందర్భాల్లో వేదాలలోని శ్లోకాలపై అనవసర రాద్దాంతం చేయడం చూస్తున్నాం, అసంపూర్ణ జ్ఞానంతో, అరకొర విజ్ఞానంతో విమర్శలు చేస్తూ, చాతుర్వర్ణ వ్యవస్థను ప్రస్తుత కాలానికి అపాదిస్తూ మనువాదం అంటూ రకరకాలుగా విమర్శిస్తూ నేటి సమాజంలోని కొన్ని వర్గాలను కించపరుస్తుండటం ఈ మధ్య తరచుగా చూస్తున్నాం, ఇలాంటి సందర్భాల్లో సనాతన ధర్మాచారులు విమర్శకులకు సరైన సమాధానం ఇచ్చి వారి అపోహలను తొలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

మనకు వేదాలలో "గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు" అన్న ప్రార్థన ఒకటి ఉంది. ఈ మధ్యనే ఆ శ్లోకాన్ని ఉటంకిస్తూ గోవులకు, బ్రాహ్మణులకు మాత్రం శుభం జరిగితే సరిపోతుందా మిగితా సమాజమంతా ఏమైపోయినా పరవాలేదా అంటూ ప్రశ్నించటాన్ని ఒకచోట చూశాను, అలాంటి వారితో బాటు తెలియని వారు కూడా తెలుసుకునేలా చేయటం మన బాధ్యత.

ముందుగా కులానికి సంభందించిన రంగు కళ్లద్దాలు తీసి ఈ శ్లోకాన్ని చదివితే, పెద్దలు ఈ శ్లోకం చెప్పిన సందర్భాన్ని, దాని అర్థాన్ని పూర్తిగా తెలుసుకుంటే ఇలాంటి అపార్థాలు రాకుండా ఉంటాయి.

“ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ || ”
                                     ----- భగవద్గీత 4-13

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది నేటి కులవ్యవస్థకు పెద్దలు చెప్పిన వర్ణవ్యవస్థకు అసలు పోలికే లేదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే పదాలు అప్పుడు, ఇప్పుడు ఓకేలాగా ధ్వనించినంత మాత్రాన ఒకటి కాబోవు...

ఇప్పుడు సమాజంలో వ్యక్తిగతంగా ఎంత ఎదిగినా ఎంత విజ్ఞానాన్ని సాధించినా పుట్టుకతో వచ్చిన కులాలు మారవు, కానీ వర్ణ వ్యవస్థ విషయానికొస్తే పుట్టుకతో మానవులు అందరూ శూద్రులే. వారి గుణ, కర్మలను బట్టి వారు విభజించ పడ్డారు అని గీత లో చెప్ప బడింది.

ఇక  'గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు' అనడంలోని ఔచిత్యం చూసినప్పుడు జననం రీత్యా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు అని కాదు,  జీవనం రీత్యా, లేదా జ్ఞానం రీత్యా బ్రాహ్మణ ధర్మం లేదా వర్ణానికి చెందిన వారని గ్రహించాలి, బ్రాహ్మణ జీవనం అంటే సాత్విక జీవనం, సాత్విక భోజనం, కేవలం వైదిక ధర్మాలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, ఇవే వారు అనుసరించే కర్మ, ధర్మ, కర్తవ్యాలు నిర్వహించటం. ఈ కర్మలు ఆచరించే వీరికి శారీరక భుజబలo మిగిలిన వర్ణాలతో పోలిస్తే తక్కువ. వీరు బలహీనుల లెక్కలోకి వస్తారు.

ఏ కులంలో పుట్టినా సాత్వికంగా జీవించడానికి నిర్ణయించుకున్న వారందరూ బ్రాహ్మణులు కిందే వస్తారు. మనo పూజించి, గౌరవించే, మహర్షులు మునులు, వారి భార్యలు అందరూ కూడా పుట్టుకతో బ్రాహ్మణులు కారు. వారు వారి కర్మ చేత బ్రాహ్మణులుగా జీవించిన వారే. దానిని అర్థం చేసుకోకుండా బ్రాహ్మణులను గొప్పగా చూపారు, ఇతరులను తక్కువ చేశారు అంటూ వాదించడం, అది సరికాదనే సనాతన ధర్మాచారులను బాధించడం ఎంతమాత్రం మంచిది కాదు...

హిందూ సంస్కృతి గొప్పదనం తెలియాలంటే... 
ఈ శ్లోకాలు తీసుకోండి, వాటి అర్థాలు తెలుసుకోండి,
వీటి అర్థం సరిగ్గా తెలుసుకోగలిగితే చాలు మన సంస్కృతి గొప్పదనం తెలుస్తుంది, ఎప్పుడో సమసిపోయినట్టి, ఇప్పటి సామాజిక స్థితులకు సంబంధం లేనట్టి మనుధర్మ శాస్త్రాన్ని విమర్శిస్తూ కొన్ని కులాల వారిని దూషించడం విజ్ఞత కాబోదు.

శాంతి మంత్రములు మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని ప్రస్తుత కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు. వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ద్వారా పూర్వం రోజుల్లో పండితులకు, గోవులకు భారతీయ సమాజంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది.

1. ఓం సహనావవతు, సహనౌ భునక్తు,
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:-
సర్వ జీవులు రక్షింపబడుగాక... సర్వ జీవులు పోషింపబడుగాక... అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పని చేయాలి ( సమాజ ఉద్ధరణ కోసం )... మన మేధస్సు వృద్ది చెందుగాక... మన మధ్య విద్వేషాలు రాకుండు గాక... ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక...

2. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..
ఓం సర్వేషాం శాంతిర్భవతు..
ఓం సర్వేషాం పూర్ణం భవతు..
ఓం సర్వేషాం మంగళం భవతు..

తాత్పర్యం:-
సర్వులకు సుఖము, సంతోషము కలుగుగాక..
సర్వులకు శాంతి కలుగు గాక..
సర్వులకు పూర్ణ స్థితి కలుగుగాక.. సర్వులకు శుభము కలుగుగాక..

3. ఓం సర్వేత్ర సుఖిన: సంతు, సర్వే సంతు నిరామయా,
సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...

తాత్పర్యం:-
సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..
సర్వులు ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..
అందరికీ ఉన్నతి కలుగు గాక..
ఎవరికీ బాధలు లేకుండు గాక.
సేకరణ:- ఆనంద్ అర్వపెల్లి.

*మనం దైవాన్ని కోరిక ఏమని కోరాలి ???*

 *మనం దైవాన్ని కోరిక ఏమని కోరాలి ???*

1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.

2. నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.

3. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..

4. నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.

5. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..

6. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి  అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...

7. కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..

8. చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా  కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..
మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.

            *_☘️శుభమస్తు☘️
 *ఈ ఆర్టికల్ అస్సలు మిస్ అవకండి.. చిరాకు, కోపం, ఇరిటేషన్ ఎక్కువగా ఉండే వాళ్లకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్* 
(ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)
(ట్రెడిషినల్ చైనీస్ మెడిసిన్ (TCM) మీద నేను చాలా కాలంగా స్టడీ చేస్తున్నాను, నా వ్యక్తిగత అవసరాలకు వాడుతూ ఉంటాను. దాని ప్రకారం వీలు వెంబడి వివిధ లక్షణాలను డిస్కస్ చేస్తాను.)

కొంతమందికి టివిలో సౌండ్ అన్నా చిరాకు వస్తుంది, ఎవరైనా పెద్దగా మాట్లాడినా కోపం వస్తుంది. అన్ని సందర్భాల్లో ఉండదు కానీ కొన్నిసార్లు ప్రతీ ఒక్కరూ ఇది ఫేస్ చేస్తూ ఉంటారు.

 మిరపకాయ, ఆనియన్, గార్లిక్, పచ్చళ్లు, వేపుళ్లు, ఇతర బాగా వేడిగా, స్పైసీగా ఉండే ఆహార పదార్థాలను తిన్నప్పుడు శరీరం లోపల వేడి ఉత్పత్తి అయి, Yinని ఆవిరి చేస్తుంది. అలాగే ప్రాణ శక్తి తల వైపు నెట్టబడుతుంది. దీంతో మైండ్ చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది. కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, విపరీతంగా టీ తాగడం వల్ల TCM ప్రకారం Heart Fire ఓవర్ యాక్టివ్‌గా తయారై  అది కాస్తా అడ్రెనల్ గ్రాండ్‌ని స్టిములేట్ చేసి, నాడీ వ్యవస్థ అశాంతిగా తయారవడానికి కారణం అవుతుంది. పేస్ట్రీలు, స్వీట్స్, వైట్ బ్రెడ్ వల్ల శరీరంలో గ్లూకోజ్ త్వరగా విడుదలై లివర్ - స్పీన్ యాక్సెస్ మీద వత్తిడి పెంచి మూడ్ స్వింగ్స్‌కి కారణం అవుతుంది. అలాగే ఆల్కహాల్ తీసుకునే వారికి నేరుగా లివర్ హీట్ పెరిగి, మరుసటి రోజు ఉదయం లివర్ ఫైర్ రీబౌండ్ అవుతుంది.

జీర్ణ శక్తి తక్కువగా ఉన్న వారు మటన్ తీసుకుంటే Yang హీట్ అయి, దాని వల్ల శరీరంలోని నీరు వేడిగా ఉండే బాత్రూమ్‌లో ఎలాగైతే అద్దంపై నీరు ఆవిరిగా పేరుకుంటుందో అలా damp heat తయారై ఈ ఇరిటేషన్ సమస్యలు వస్తాయ.

అలాగే రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల లివర్ డీటాక్స్ అయ్యే ప్రక్రియను అడ్డుకున్న వాళ్లం అవుతాం. దాంతో shen సెటిల్ అవలేక సమస్య వస్తుంది. 

మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. దోసకాయ, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, బ్రౌన్ రైస్, బార్లీ, మిల్లెట్స్, చల్లటి నీళ్లు కాకుండా గోరు వెచ్చని నీళ్లు తీసుకోవడం వల్ల మెల్లగా ఈ సమస్య తగ్గుతుంది.

లైఫ్ స్టైల్ విషయానికి వస్తే చాలామంది అర్థరాత్రి వరకూ ఫోన్లు వాడుతున్నారు. నైట్ 10 తర్వాత ఫోన్ వాడితే, TCM ప్రకారం లివర్ బ్లడ్, Yin బర్న్ అవుతాయి. దీంతో Heart Fire రిలాక్స్ అవలేదు. ఎలాంటి ఎక్సర్‌సైజ్ లేకుండా గంటల తరబడి కూర్చున్నా కూడా Qi స్టాగ్నేషన్ ఏ్పడి, ఎమోషన్స్ బ్లాక్ అవుతాయి, దీంతో ఇరిటబులిటీ పెరుగుతుంది.  కొంతమంది బరువు తగ్గాలని భోజనం మానేస్తూ ఉంటారు. మరికొంత మంది ఇష్టమొచ్చిన టైమ్స్ లో ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇలా టైమింగ్స్ లేకపోవడం వల్ల Spleen మెరీడియన్ బలహీనపడి, ఆహారం సరిగా శక్తిగా మార్పిడి జరగక, శరీరంలో అరగని ఆహారం వల్ల dampness పెరిగి ఇరిటబులిటీ పెరుగుతుంది, సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్లకూడా గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి చిరాకు పెరుగుతుంది.

ప్రాణాయామం వంటి శ్వాస క్రియలు ఏమీ చెయ్యకపోవడం వల్ల, కనీసం ధ్యానం వంటి వాటితో నిశ్శబ్ధంగా కూర్చోవడం చేయకపోవడం వల్ల నిరంతరం.. ఏదో ఒకటి చూస్తూ వింటూ నెర్వస్ సిస్టమ్ ని ఓవర్ స్టిములేట్ చెయ్యడం వల్ల Shen విపరీతంగా బయటకు వెదజల్లబడి, మొహం పాలిపోతుంది, ప్రాణశక్తి లోపిస్తుంది, గ్రౌండింగ్ మిస్ అవుతుంది. దీంతో ఇరిటబులిటీవస్తుంది. 

ఇన్ స్టా రీల్స్ వంటివి ఎక్కువగా చూడడం వల్ల వెంట వెంటనే డోపమిన్ విడుదల అవుతూ అది TCM ప్రకారం Liver Wind, Heart Fire అనే సమస్యలు పెంచుతుంది. అలాగే కొంతమంది తరచూ పొలిటికల్ డిబేట్స్ లో కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటూ సంఘర్షణలో ఉంటుంటారు. ఇది Liver Qiని స్టిములేట్ చేసి, మెంటల్ హీట్‌ని పెంచుతుంది. 

కొంతమంది అదే పనిగా ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, వీడియోలు చూస్తుంటారు. ఒకళ్లు చెప్పేది ఒకలా, మరొకళ్లు చెప్పేలా ఒకలా ఉండేసరికి, ఈ కాన్సెప్టులలో ఏది నిజం అనే ఆలోచనలు నిరంతరం మైండ్‌లో ఓవర్ స్టిమునేషన్ సృష్టిస్తాయి. దీనివల్ల తలలో సూడో Yang పరిస్థితి ఏర్పడి, చివరకు చిరాకు ఫ్రస్టేషన్ వస్తాయి.

అందుకే సాయంత్రం 6 తర్వాత అనవసరమైన డిస్కషన్స్, ఓవర్ థింకింగ్, రీల్స్ వంటివి చూడడం, స్క్రీన్ టైమ్ తగ్గించాలి. అలాగే నేను చెప్పినట్లు ఆహార పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.       -నల్లమోతు శ్రీధర్                            
 🌹. *ఏకాక్షరి  బోధ* (జ్యోతిర్మయం) 🌹
✍🏾 -- నారంశెట్టి  ఉమామహేశ్వరరావు             
         మానవులు నిత్యజీవితంలో ప్రవర్తించాల్సిన  విధానం తెలిపే  కథ ఉపనిషత్తులలో ఉంది. 

      ఒకసారి దేవ,  రాక్షస,  మానవులు  బ్రహ్మదేవుణ్ణి దర్శించుకుని, అనేక విధాలుగా స్తుతించి ప్రసన్నం చేసుకున్నారు.  వారి రాకకు  కారణం అడిగిన విధాతతో  తమ బాధలు విన్నవించుకున్నారు.   

  రాక్షసుల వలన కలుగుతున్న  ఇక్కట్లను  దేవతలు వివరించగా,  దేవతల మీద అసూయతో రాక్షసులు వ్యాఖ్యలు చేసారు. భూలోక జీవనంలో ఎదురౌతున్న కష్టాలను వివరించి  మోక్షమార్గం ఉపదేశించమని వేడుకున్నారు మానవులు.  

  బ్రహ్మదేవుడు “విడివిడిగా బోధ చేసే తీరిక లేదు. ఏకాక్షరి బోధిస్తా.  ”ద” అని పలికాడు. 

🌻.   ఏకాక్షరి అందించిన సందేశం  అవగతం కాక అయోమయ స్థితిలో ఉన్న  దేవ రాక్షస మానవులకు   త్రిలోక సంచారి నారదుడు ఎదురయ్యాడు. వారి సమస్యను తెలుసుకుని వివరణ ఇచ్చాడు. 

🌻. ముందుగా దేవతలతో  “ ద  అనగా ‘దమము’ నేర్చుకుని ప్రవర్తించమని. దేవతలు ఎక్కువగా భోగలాలసులు. భోగాలకు అధికంగా అలవాటు పడినవారు దమము నేర్చుకోవాలి. అనగా మనస్సు నిగ్రహించుకోవాలి. 

భోగజీవితం వినాశనానికి హేతువు. చెడు మార్గానికి చేరువ చేస్తుంది.  భోగ జీవితం వలన మోక్షం లభించదు.  త్యాగ జీవితం, యోగ జీవితాల వలన మాత్రమే అది సాధ్యం”  అని బోధించగా సంతోషంతో  కృతజ్ఞతలు తెలిపారు దేవతలు. 

🌻. రాక్షసులతో  “ ద అంటే దయ చూపమని. మీకు క్రూరత్వం ఎక్కువ.  దయాదాక్షిణ్యాలు మరచి  ప్రవర్తిస్తారు. రాక్షస స్వభావం ఉన్న మానవులైనా దయ లేకుండానే  ప్రవర్తిస్తారు.  ఇతరులను బాధించడంలో ఆనందం వెతుక్కుంటూ, లోక వినాశనానికి   పాల్పడక దయగా ప్రవర్తించమని బ్రహ్మ గారి ఉపదేశం” అన్నాడు నారదుడు.     

🌻. మానవులతో “ద అనగా దానం చేయమని. మీలో ఎక్కువ మందికి  లోభిత్వం ఉంటుంది.  అది విడిచిపెట్టి   దానం  నేర్చుకోండి.  ఇంట్లో ధనరాసులు, విలువైన వస్తువులు ఉన్నాయని గర్వపడకుండా సాటివారికి  వీలైనంత  సహాయపడడం,    ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ఉత్తమం. దానధర్మాలు చేయడం వలన పుణ్యం దక్కుతుంది.  

🌻. దానం చేసే అవకాశం కలిగినందుకు  సంతోషించండి. గర్వపడవద్దు” అని తెలిపిన నారదుడికి కృతజ్ఞతలు తెలుపుకుని బయల్దేరారు మానవులు. 

🌻. “ ఈ దేహం సొంతం కాదని, కొన్నాళ్ళ పాటు ఆత్మకు ఆశ్రయం కల్పించందని “ గౌతమ బుద్ధుడు ప్రవచించినట్టు ప్రపంచంలో ఏదీ సొంతం  కాదని గ్రహించ గలిగితే దాన గుణం అలవడుతుంది. 

🌻. సులువుగా త్యాగం చేసే బుద్ధి కలిగితే  దేహవాసన , వ్యామోహం నశించి  ఉత్తమ గతులు పొందుతారు. 🌻.