Thursday, June 10, 2021

జ్ఞానోదయం

💥జ్ఞానోదయం💥
🕉️🌞🌎🏵️🌼🚩

వేకువ కోసం చరాచర జగత్తూ ఎదురుచూస్తుంది. పొద్దు పొడుపుతో భళ్ళున తెల్లారి ప్రకృతి అంతా శోభాయమానమవుతుంది. కోవెలలో మోగే జేగంటలు విడుదల చేసే ఆధ్యాత్మిక తరంగాలు మనసును తాకి ఉత్సాహం నింపుతాయి. ఉల్లాసపరుస్తాయి. ఆత్మనూ తట్టి లేపుతాయి.

ఉషోదయ వేళల్లో మనుషులు తమకు తెలియకుండానే ఒక జీవనోత్సవం జరుపుకొంటారు. మరో మాటలో చెప్పాలంటే- ఆ వేళ వారు దివ్యత్వంతో ప్రకాశిస్తారు. అందువల్లే దేవాదిదేవుడి సుగుణాలైన ప్రేమాభిమానాలు పంచడానికి, దానధర్మాలు చెయ్యడానికి మనుషులు ఆ పూట సుముఖంగా ఉంటారు.

ప్రభాతవేళ సూర్యుడు మనిషికి ఆరోగ్యప్రదాత. ఉదయం పూట నడక వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతోపాటు లేత ఎండలో శరీరానికి కావాల్సిన ‘డి’ విటమిన్‌ అందుతుంది. ఆరోగ్యరీత్యా ఎక్కడో బాట వెంబడి సాగే సాధారణ నడకకన్నా గుడి చుట్టూ చేసే ప్రదక్షిణల వల్ల ఫలితాలు పెద్ద మొత్తంలో అందుతాయి. ఆలయ ప్రాంగణంలో భక్తి భావనతో కుదురైన మనసుతో, స్థిర చిత్తంతో చేసే నడక దేహాన్ని ఒక క్రమతలో ఉంచుతుంది. అప్పుడు శరీరం, మనసు ఒకే తాటిపై ఉంటాయి. వాటికి తోడుగా ఆత్మచైతన్యమూ జాగృతమై ‘త్రికరణశుద్ధి’ జరుగుతుంది.
ప్రభాకరుడి ఆగమనంతో సకల ప్రాణుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. విశాల జగత్తుకు వెలుగులు పంచే సూర్యుణ్ని భగవంతుడితో సమానంగా భావిస్తారు. తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి అత్యంత భక్తి ప్రపత్తులతో చేతులెత్తి సంధ్యావందనం చేస్తారు. ఆరోగ్యానికి మేలు జరగాలని ఆదిత్యహృదయం పఠిస్తారు. సూర్య నమస్కారం ప్రకృతి పట్ల మనిషికుండే సంస్కారం. లోక కల్యాణార్థమై యోగశాస్త్రంలోనూ ‘సూర్యనమస్కారాలు’ పొందుపరచారు.

తోమాల సేవతో భగవంతుడి సన్నిధి చేరేందుకు పూలు పూసి ఉదయానే సిద్ధంగా ఉంటాయి. ఆ సమయాల్లో సుప్రభాత సేవలతో భక్తుల మనసులు పులకించిపోతాయి. పండుగలు, పర్వదినాలు, శుభకార్యాలు దాదాపు ఉదయం వేళల్లోనే పురుడు పోసుకుంటాయి. జ్ఞానానికి భౌతికరూపం వెలుగు. ఉషస్సు చీకట్లను పారదోలి దారి చూపుతుంది. జ్ఞానమూ అంతే. అది అజ్ఞాన తిమిరాలను తరిమి బతుకు బాట పరుస్తుంది. ప్రాపంచిక జ్ఞానమైనా, పారమార్థిక జ్ఞానమైనా మానవ జీవితానికి గొప్ప వెలుగునిస్తాయి. ఒకటి అజ్ఞానాన్ని తొలగించి లౌకికవిజ్ఞానం అందిస్తుంది. మరొకటి అంతరంగాన్ని శుద్ధిచేసి ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేస్తుంది. అందుకే జ్ఞానోదయాన్ని సూర్యోదయంతో పోల్చి చెబుతారు.
విద్య- అంటే వెలికి తీయడం. విద్యార్జన చేసే వయసులో తెల్లవారు జామునే నిద్ర లేచి చదువుకొంటారు. వివిధ రంగాల్లోని అభ్యాసకులు అదే పద్ధతి కొనసాగిస్తుంటారు. ఎందుకంటే, ఉదయం పూట మనసు నిర్మలంగా ఉంటుంది. చదివే అంశం పూర్తిగా మనసుకు హత్తుకుంటుంది. బ్రాహ్మీ కాలంలో దేవతలు సంచరిస్తారంటారు. అందువల్ల ఆ వేళల్లో మనసుపెట్టి చేసే పనులన్నింటినీ ప్రార్థనతో సమానంగా భావిస్తారు. అలా చేసే కార్యాలకు మెరుగైన ఫలితాలు లభిస్తాయంటారు. ఆ కారణంగానే సాధకులు సూర్యోదయానికి ముందు సమయాల్లో ధ్యాన ప్రక్రియలు చేపడుతుంటారు.

మనిషి జీవితానికి అర్థం ‘అంతిమ సత్యం’ తెలియడం. అదే జరగకపోతే మానవ జన్మ వ్యర్థం. సత్యాన్వేషణలో ఏళ్లు గడిచినా మొక్కవోని ధైర్యంతో, అకుంఠిత దీక్షతో, అచంచల విశ్వాసంతో ధ్యాన సాధన సాగుతుంటే... ఒక రోజు భృకుటి మధ్య మిరుమిట్లు గొలిపే దీప కాంతులతో జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. అది అచ్చు వెలుగులు విరజిమ్ముతూ ఉదయించే సూర్యబింబం ప్రక్రియలా ఉంటుంది!

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment