Tuesday, December 28, 2021

నేటి చక్కని కథ.

నేటి చక్కని కథ.

ఒకసారి ఒక గ్రామపంచాయతీలో బహిరంగన్యాయస్థానంలో ఒక సమస్యను పరిష్కరించడానికి పెద్దలు సమావేశమైయ్యారు. కొంత దూరంలో, ఒక సాధువు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పెద్దల న్యాయస్థానం ఏ నిర్ణయానికి రాలేకపోవడం వలన, తమ సమస్య పరిష్కారం కోసం సాధువును సంప్రదించమని ఎవరో సూచించారు.
వారంతా సాధువు దగ్గరకు వెళ్లారు. అంతమందిని చూసి సాధువు వాళ్ళని ఏం కావాలని అడిగాడు.
" మహాత్మా, గ్రామంలో ఒకే ఒక బావి ఉంది. మేము ఆ బావిలో నీరు త్రాగలేము." అని గ్రామస్థులు సమాధానమిచ్చారు.
సాధువు, " ఎందుకు, ఏమి జరిగింది? మీరు దాని నుండి నీరు ఎందుకు త్రాగలేరు?" అని అడిగాడు.
" మూడు కుక్కలు ఒకదానితో ఒకటి కొట్టుకుని బావిలో పడ్డాయి. అవి బయటకు రాలేక అందులో మునిగి చనిపోయాయి. ఇప్పుడు నీరు బాగా దుర్వాసన వస్తోంది, ఆ నీరు ఎలా తాగాలి?" అని గ్రామస్తులు అన్నారు.
సాధువు "ఒక పని చేయండి, పవిత్రమైన గంగానది జలాన్నిఆ బావిలో పోయండి" అని చెప్పాడు. అలా ఎనిమిది నుంచి పది బకెట్ల గంగాజలం బావిలో పోసినా సమస్య అలాగే ఉండిపోయింది.
ప్రజలు మళ్లీ సాధువు వద్దకు వెళ్లారు.
సాధువు, "సరే, మీరందరూ సమావేశమై భగవంతుని నామాన్ని జపిస్తూ, ప్రార్ధన చేయండి ," అన్నాడు.
ప్రజలు అలాగే అని, సాధువు సూచించినట్లు చేసారు, అయినప్పటికీ సమస్య అలాగే ఉంది.
ప్రజలు మళ్లీ సాధువు వద్దకు వెళ్లారు. ఈసారి సాధువు "బావిలో కొన్ని సువాసన వచ్చే పదార్ధాలు వేయండి" అన్నాడు. అది కూడా జరిగింది, కానీ సమస్య ఇంకా కొనసాగింది.
ఇప్పుడు ఇంక సాధువు స్వయంగా బావి వద్దకు వచ్చాడు.
ప్రజలు, "చూడండి స్వామీ, పరిస్థితి అలాగే ఉంది, మేం ప్రతిదీ ప్రయత్నించి చూసాం, పవిత్ర గంగాజలం పోశాం, ప్రార్థనలు, కీర్తనలు చేసాం, ప్రసాదం పంచాము, బావిలో సువాసనగల పువ్వులు, పదార్ధాలు వేసాం - ఇవన్నీ!"
సాధువు అయోమయంగా చూస్తూ అడిగాడు, "అన్నీ చేసారు, కానీ ఈ బావిలో పడి, చనిపోయిన మూడు కుక్కలను తొలగించారా?"
గ్రామస్తులు, "అదేంటి, మీరు అలా చేయమని మాకు చెప్పలేదు కదా, మేం వాటిని బయటకు తీయలేదు, మిగిలినవన్నీ చేసాం, కానీ కుక్కలు ఇప్పటికీ బావిలోనే ఉన్నాయి" అన్నారు.
సాధువు మొదట దిగ్భ్రాంతి చెందాడు, కాని ప్రశాంతంగా గ్రామస్తులకు ఇలా వివరించాడు, "నీటిలో పడి ఉన్న మూడు మృతదేహాలను బయటకు తీసే వరకు, ఎటువంటి బాహ్య చర్యలు ఎటువంటి ప్రభావం చూపవు, ముందుగా మీరు నీటి నుండి ఆ మురికిని బయటకు తీయాలి."
మన జీవిత కథ కూడా అలాంటిదే. పల్లెటూరి వంటి మన దేహంలో కామం, క్రోధం, లోభం, అసూయ అనే అనేక జంతువులు పోట్లాడుకుని, మనస్సాక్షి అనే బావిలో చెదపురుగుల్లా చిక్కుకుపోయాయి. అవి మెల్లగా మన మనస్సాక్షిని లోపలి నుండి తినేస్తున్నాయి.
ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే... ఈ తెగులు నుంచి బయటపడేందుకు మనం ఏం చేస్తున్నాం?
మన జీవితాలను మెరుగుపరచుకోవడానికి బయటి నుండి చాలా కొత్త విషయాలను లోపలికి తీసుకుంటున్నాం, అయితే లోపల ఇప్పటికే కుళ్ళిపోయిన లేదా పేరుకుపోయిన వాటిని తొలగించడానికి మనం ఏమి చేస్తున్నాం? దీని గురించి ఒకసారి ఆలోచించండి.

నీతి.
మనం మనస్సాక్షిని శుభ్రంగా ఉంచుకుంటే, బయట కూడా ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది, మన అంతరంగాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే, బయట ప్రతిదీ కూడా అందంగా అవుతుంది.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment