Thursday, February 17, 2022

పూజాఫలం

పూజాఫలం
మనం చాలా మంది దగ్గర వింటుంటాం నేను ఎన్నో పూజలు చేశాను ఎంతో సాధన చేశాను ఏమీ ఫలితం లేదు అని బాధపడుతుంటారు. అలా ఎప్పుడు ఎవరు బాధపడొద్దు.  మనం చేసే పూజలు చేసే సాధన అంత వరకు ఎందుకు అసలు ఒకటి చెప్పనా మనం మనస్ఫూర్తిగా పెట్టే నమస్కారం కూడా చివరకు వట్టిగాపోదు.  ఏదో ఒక రోజు కచ్చితంగా మనకు మంచి చేస్తుంది.  మనం ఇప్పుడు పడే బాధలు కష్టాలు కన్నీళ్లు అన్ని గత జన్మలో మనం తెలిసీ తెలీక చేసిన పాప కర్మల ఫలితాలు.    ఇప్పుడు మనం చేస్తున్న ఈ పూజలు సాధన ఇవన్నీ కూడా వాటిని తట్టుకునే శక్తిని ఇస్తాయి.   కాకపోతే మనం తెలుసుకోలేం ఏ రకంగా మనలను అవి కాపాడాయో ఎలా ఉపశమనం కలిగించాయి అని.   అది మనం నమ్మకంతో ఆలోచిస్తే తెలుస్తుంది.
ఎన్ని ధార్మిక ప్రయత్నాలు చేసినా, కొన్ని ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు.   అప్పుడు ప్రయత్నం కంటే ప్రారబ్ధం బలీయంగా ఉందని తెలుసుకోవాలి...చిత్తం శుద్ధి అయితేనే పరిపూర్ణత.   మనలోని అంతఃకరణ చైతన్యమే చిత్తం.   ఏ కర్మచేత మనం పవిత్రమవుతామో ఆ కర్మను 'పుణ్యం' అంటారు.   దోషాచరణ పాపం.  దుఃఖాలు తటస్థించినప్పుడు వాటి పరిష్కారానికై పలు ప్రయత్నాలు చేస్తాం.   కొన్ని భౌతికమైనవి- ఇంకొన్ని ధార్మికమైనవి.   ధార్మిక ప్రయత్నాలు జపతపాలు పూజలు దానాలు మొదలైనవి.   ఇవి చేయడంవల్ల నిజంగా ఫలితం ఉంటుందా అని కొందరికి సందేహం కలగడం సహజం.   రోగాలకు వైద్యపరమైన చికిత్సలు చేసినప్పుడు- అవే చికిత్సలకు కొందరు బాగుపడుతున్నారు, కొందరికి వైఫల్యం ఎదురవుతోంది.   అయినా మనం ఆ చికిత్సను 'మూఢ విశ్వాసం' అనలేం కదా! అలాగే ఎన్ని ధార్మిక ప్రయత్నాలు చేసినా ఒకోసారి ఫలితాలు వెంటనే కనిపించక పోవచ్చు. 
ఇక్కడ మరో ధర్మసూక్ష్మం కూడా ఉంది.   దైవీయమైన జపతపాది ధార్మిక ప్రయత్నాలు ఎప్పటికీ వృథాకావు.   అవి ఈ జీవితంలోనే కాలాంతరంలో ఏనాటికైనా ఫలించే అవకాశముంది.
ఈ విషయమై మన శాస్త్రాలు చక్కని వివరణలనిచ్చాయి.   విత్తనం, వేరు (మూలం) కనబడకపోయినా వృక్షం, ఫలం కనిపిస్తాయి.   అలాగే కారణమైన కర్మలు గోచరించకున్నా, వాటి ఫలాలు అనుభవాలుగా వస్తాయి.   ఈ 'కర్మ-ఫల' సంధానకర్త ఈశ్వరుడు.
ఈ జన్మకు ఆధారమైన ప్రారబ్ధకర్మలలో ప్రతి కర్మకు- 1.   బీజాంశ, 2.   వృద్ధ్యంశ, 3.   భోగాంశ...   అని మూడు భాగాలుంటాయి.   జపతపాది సాధనాల ద్వారా 'వృద్ధ్యంశ'ను నివారించవచ్చు.   అంటే- దుఃఖాది అనుభవాల తీవ్రతను పెరగకుండా చేయవచ్చు.
తప్పించుకోలేనిది 'భోగాంశ'.   ఇది అనుభవంతోనే క్షయమవుతుంది.   కానీ దేవతారాధనచేత, తపోదానాదుల చేత సాధకుడికి ఈ అనుభవాన్ని తట్టుకోగలిగే శక్తి కలగడమేకాక, కాలపరిణామ క్రమంలో ఆ అనుభవం విజ్ఞాన హేతువవుతుంది.   వ్యక్తిత్వ వికాసానికి కారణమవుతుంది.

ఇక మిగిలినది 'బీజాంశ'.   ధార్మిక సాధనవలన, ఆత్మవిచారణవలన చిత్తశుద్ధి, జ్ఞాన వైరాగ్యాలు కలిగి- ఈ బీజాంశ నశిస్తుంది.   అప్పుడతడు పూర్తిగా కర్మమాలిన్యం నుండి బయటపడతాడు.   కనుక పాపనాశనం కోసం ఈ ధార్మిక సాధనలను అవశ్యం అవలంబించాలి.   పాపమనేది మనస్సుతో, మాటతో, శరీరంతో, ధనంతో (సంపాదించిన సామగ్రితో) చేస్తాం.   జప, స్తోత్రాదుల చేత వాచిక(మాట) పాపం పోతుంది.   అసలు గట్టి పాపం మానసికం.   అది ధ్యానంవలన నశిస్తుంది.   పూజ, క్షేత్ర తీర్థయాత్ర, శౌచం- శారీరక పాపాలను తొలగిస్తాయి.   దానం ద్వారా- సంపాదనగత పాపాలు నశిస్తాయి.   అందుకే త్రికరణాలతో, ధానాలతో సత్కర్మలను ఆచరించాలి.

శివార్పణం🙏

సేకరణ

No comments:

Post a Comment