Wednesday, February 23, 2022

మౌనంగానే ఎదగాలి

మౌనంగానే ఎదగాలి

వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.

అయిదు శాంతులలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు. ‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద. 

మౌనం మూడు రకాలు. ఒకటి, వాక్‌మౌనం. వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి. రెండోది అక్షమౌనం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం. మూడోది కాష్ఠమౌనం. దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.

మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో  పరివర్తన  తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ వంటి వారెందరో ఉన్నారు.

ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.

రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.

ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.

ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే ‘మౌనం’.

ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం!

సేకరణ

No comments:

Post a Comment