Sunday, June 30, 2024

 *శ్రీరమణీయభాగవత కథలు- 15*
( బాపు-రమణ )

జరిగిన కథ:

అదితికి దేవతలు.. దితికి దైత్యులు పుడతారు.
దుర్వాస మహర్షి శాపం వలన దేవతలు స్వర్గం కోల్పోయి మహావిష్ణువును శరణు కోరుతారు. ఆ దైవం, దానవుల సహాయంతో సముద్ర మథనం చేసి అమృతం సాధించమంటాడు.

ఇక చదవండి
******

అన్నా తమ్ముడూ అంటూ దేవతలు దానవులతో వరసలు కలిపి సాగర మధనం గురించి! చెప్పి కలిసి రమ్మన్నారు. బలిని ఇంద్రుడు కౌగిలించుకున్నాడు.. కొండని పెకలించారు. దానిని మోయలేక పోయారు. గరుత్మంతుడిని పిలిచారు. తమ్ముడా నువ్వే మొయ్యగలవు నీకు వాటా యిస్తాం అమృతం అన్నారు మహేంద్రుడు. గరుత్మంతుడు కొండని సునాయాసంగా మోసుకుని వెళ్లి పాల సముద్రంలో దింపాడు. 

దేవతలు వాసుకిని ప్రార్ధించాడు. అతనికీ వాటా ఆశపెట్టారు. వాసుకి కదలలేనని తనను మోసుకుని తీసుకు వెళ్లమని అంది. వాసుకిని తీసుకుని రావడానికి నీవే సమర్ధుడవు. నీ అంతటి బలశాలి లేదు అని దేవతలు గరుడుని ఉబ్బేశారు. 

గరుడునికి గర్వం తలకెక్కింది వాసుకిని నిర్లక్ష్యంగా పైకెత్త బోయాడు ఎంత పైకి తీసినా ఇంకా పాము చుట్టలుగా కింద మిగులుతూనే వుంది. గరుడుడు భంగ పడ్డాడు.

దేవతలు, గరుడుడు శివుని ప్రార్ధించారు.

శివుడు కరుణించాడు. చెయ్యి చాపి వాసుకిని వాన పాములా ముని వేలితో పైకిత్తి కొండకి చుట్టాడు.

శ్రీహరి అభినందించాడు. గరుడుని వినయం నేర్చుకోమన్నాడు.

ఇంద్రాది దేవతలు తోక వైపు కదిలారు. విష్ణువు వారించి తలవైపు నడవమన్నాడు. 'మంటలూ పొగలూ వస్తాయి తలలోంచి, భరించలేము, మనకి తోకే మంచిది' అన్నాడు ఇంద్రాదులు.

'తల పట్టుకుంటేనే తోక దక్కేది' అన్నాడు విష్ణువు. దేవతలు పాము తల పట్టుకో బోయారు. దానవులు మండి పడ్డారు. 'ఛీఛి తోక పట్టే ఖర్మ మాకేల తుచ్చమయిన ప్రుష్టం తలయితేనే వస్తాం' అన్నారు. దేవతలు ఆనందంగా సరేనన్నారు.

సాగర మధనం ప్రారంభమయింది. పర్వతం నీటిలోకి దిగబడి పోయింది. దేవతలు విష్ణువును ప్రార్ధించాడు. శ్రీహరి కూర్మావతారం ధరించి సముద్రంలో ప్రవేశించి కొండని వీపు మీద భరించి పైకెత్తాడు.

ఇదే *కూర్మావతారం*

మధనం సాగింది. వాసుకి తల నుంచి పొగలూ నుంటలూ రాసాగాయి రాక్షసులు గిలగిలలాడి పోయారు. ఆహంకారంతో తామే కోరుతున్నది కనక బాధలు అనుభవించక తప్పలేదు.

మధనం సాగింది.

ఇంతలో పొగలు సెగలూ విజృంభించాయి. హాలాహలమనే విషం నాలుగు వైపులా లేచింది. అందరూ కకావికలై అటూఇటూ పరిగెట్టారు. శివుని వేడుకున్నారు.

అయన భవాని అనుమతి తీసుకున్నాడు. *మింగెడిది గరళము* అయినా ఇతరుల మేలు కోసం కదా. అందువల్ల మంగళసూత్రం మదిలో నమ్మిన ఆ సర్వమంగళ సరేనంది. 

పరమ శివుడు - తన కడుపులోని ముజ్జగాలకు హాని జరగకుండా ఆ గరళాన్ని కంఠంలోనే నిలిపి నీలకంఠుడయ్యాడు.

మధనం సాగింది. కామధేనువు ఉద్భవించింది. యజ్ఞాలకు అవసరమని మహర్షులు తీసుకున్నారు.

ఐరావతం అనే నాలుగు దంతాల తెల్లఏనుగు వచ్చింది. ఇంద్రుడు తీసుకున్నాడు. ఉచ్చైశ్రవం అనే తెల్ల గుర్రాన్ని కూడా తీసుకోబోతే విష్ణువు ఆ గుర్రాన్ని రాక్షసరాజు బలికిప్పించాడు.

కల్పవృక్షాన్ని పారిజాతాన్ని అతిధ్యం పేరిట ఇంద్రుని రాణి శచీదేవి తీసుకుంది. 

చల్లని చంద్రుడు ఉదయించాడు. 

విషం మింగిన శివునికి అలంకారంగా ఇచ్చారు. 

మత్తుకలిగించే వారుణి పుట్టింది. దాన్ని రాక్షసులు వశం చేసుకున్నారు. 

ఆ తరువాత పద్మాసనం మీద శ్రీ మహాలక్ష్మి ఉదయించింది. ఆవిడ వైజయంతి మాలను శ్రీహరి మెడలో వేసి ఆయనను వరించింది.

దివ్య తేజంతో సువర్ణ పాత్రలో అమృతంతో ధన్వంతరి ఉద్భవించాడు. 

వెంటనే దానవులు అతని మీదకురికి అమృత పాత్రను బలవంతంగా లాక్కుని పారిపోయారు. దేవతలు గోలపెడుతూ తరుమబోయారు. విష్ణువు వారించాడు.

*పాతాళగుహ*

పొడుగ్గా వున్న దానవుడు ఒకడు, రెండు చేతులతో అమృత భాండాన్ని పైకిత్తి పట్టుకున్నాడు. చుట్టూ మూగి వున్న మిగతా రాక్షసులు ఒకరినొకరు తోసుకుంటూ నాకివ్వు నాకు ముందు ఇలాతే- చంపుతా అంటూ కేకలు.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)

No comments:

Post a Comment