Tuesday, February 1, 2022

కోపం మనోనిగ్రహం

🍁కోపం మనోనిగ్రహం🍁

📚✍️ మురళీ మోహన్

క్రోధాన్ని జయించటానికి సహనమొక్కటే మనకు తోడ్పడుతుంది. కోపాన్ని గనుక మనం నియంత్రిస్తే జీవితంలో ఉత్తమగతులను అధిరోహించవచ్చు. దీనికి ఉదాహరణగా ఒక సంఘటనను పరిశీలిద్దాం. పరమేష్ఠి గురువులైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వాముల వారి హయాంలో జరిగింది. స్వామివారు యాత్రలో ఒక చోట మకాం చేసియున్నప్పుడు ప్రభుత్వ అటవీ శాఖకు చెందిన అధికారి ఒకరు గురువుల దర్శనార్థం వచ్చాడు. క్షేమ సమాచారాలు అడిగి భక్తులను పంపించటం స్వామివారికి అలవాటు లేదు. ఆ అధికారికి సత్యాన్ని తెలుసుకోవాలనెే ఆలోచన ఉన్నదో లేదో అని గ్రహించటానికై గురువులు ఇలా ప్రశ్నించారు. "మికెప్పుడైనా కోపం వస్తుందా?"

అధికారి :- అప్పుడప్పుడు సహనాన్ని కోల్పోతానని చెప్పాడు.

గురువులు :- మీకు కోపం వస్తే ఏమి చేస్తారు.

అధికారి :- నా క్రింద పని చేసే వారిపై ఆ కోపాన్ని ప్రదర్శిస్తాను.

గురువులు :- అప్పుడు అతను ఏమి చేస్తాడు?

అధికారి :- అతను తన క్రింద పనిచేసే వారిపై తన కోపాన్ని ప్రదర్శిస్తాడు.

గురువులు :- ఒక మనిషి క్రోధం ఎందరిని ఇబ్బంది పెడ్తుందో చూసారా.

అధికారి తన తప్పును అంగీకరించి, తాను ఏమి చేస్తే బాగుంటుందో వివరించమని ప్రార్థించాడు. అప్పుడు గురువుగారు ఇలా బదులిచ్చారు. "మూడు రకాల మనుష్యలున్నారు. కొందరు తమకు కోపం రావచ్చని ముందే గ్రహిస్తారు. మరికొందరు వచ్చే కోపాన్ని ముందుగా పసిగట్టలేరు కాని కోపం వచ్చిన తరువాత తమకు కోపం వచ్చిందని గ్రహించగలరు. ఇంకొందరు తమ కోపాన్ని చాలా ఆలస్యంగా అంతా అయిపోయిన తర్వాత గుర్తిస్తారు. ఈ ముగ్గురిలో నీవు ఏ వర్గానికి చెందుతావు?

అధికారి :- తాను రెండవ వర్గానికి చెందుతానని చెప్పాడు.

గురువులు :- నీవు మొదటి వర్గంలో చేరటానికి ప్రయత్నించు, కోపం వస్తోందనుకున్నప్పుడు, కోపం తెచ్చుకోవడం ఎంత వరకు సమంజసం ? అని ఆలోచించి కోపాన్ని అదుపుచేసుకోవలని సూచించారు.

తరువాత ఆ అధికారి జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు చేసి సెలవు తీసుకొని తన మకాం వైపు బయలుదేరాడు. ఆయన తన వసతిని చేరుకునేటప్పటికి మధ్యాహ్నమయింది. అందువలన విపరీతంగా ఆకలివేయసాగింది. అయితే ఆయన వంటవాడు రెండు రొట్టెలను మాత్రమే చేసాడు. అది తెలియగానే ఆయనకు కోపం వచ్చి సహనం కోల్పోయి వంటవానిపై కేకలు వేయబోయాడు. వెంటనే గురువుల సలహా జ్ఞాపకానికి వచ్చింది. వెంటనే వంటవానిని పిలిచి రెండు రొట్టెలు మాత్రమే తయారుచేయటానికి కారణమడిగాడు. ఇంట్లో పిండి లేదని, పిండి తీసుకురావటానికి వెళ్లిన నౌకరు ఇంకా రాలేదని, కాని అధికారి ఆకలిని కొంచెమైనా తగ్గించవచ్చని తాను ఇంట్లో ఉన్న పిండిని ఉపయోగించి రెండు రొట్టెలు తయారుచేసానన్నాడు. వంటవాడు తానేమీ తినలేదు, వస్తువులు వచ్చిన తరువాత రొట్టెలు తయారుచేసుకొని తినాలి అని చెప్పాడు. అధికారి తన వంటవానిని మెచ్చుకోకుండ ఉండలేకపోయాడు. అమాయకుడైన తన వంటవానిపై అనవసరంగా కోపం తెచ్చుకోకుండ జగద్గురువుల సలహా తనను కాపాడిందని సంతోషించాడు.

కోపం వికృతంగా తలెత్తకుండ మనం జాగ్రత్తపడాలి. పరిస్థితులను విశ్లేషించి కారణం తెలుసుకుంటే కోపానికి అవకాశముండదు. అటువంటి విశ్లేషణ తరువాత ఎవరైనా దోషిగా మనం భావిస్తే, పరిమితంగా అతనిని మనం శిక్షించవచ్చు.

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

సేకరణ

No comments:

Post a Comment