Monday, March 28, 2022

ఏదిచేస్తే అది పొందుతాం...!

🌺🌹💐🙏శుభోదయం🙏💐🌹🌺

🌸🌹✳️ఆచార్య సద్భోదన✳️🌹🌸

ఏదిచేస్తే అది పొందుతాం...!
➖➖➖✍️

స్వార్థంతో మనిషి ఉన్నప్పుడు కలిసి రాదు!

ఎప్పుడైతే ఇతరుల గురించి నీవు ఆలోచిస్తావో నీకు అప్పుడే మంచి జరుగుతుంది.

ఒకసారి శ్రీకృష్ణార్జునులు కలిసి వెళ్ళుచుండగా వారికి మార్గమధ్యమున పేద సజ్జనుడు యాచకుడుగా కని పించాడు . జాలి పడిన అర్జునుడు ఒక సంచెడు బంగారునాణెములుఇచ్చాడు. సంతోషముగా ఇంటికి వెళ్ళుచుండగా మార్గమధ్యములో ఒకదొంగ ఆసజ్జనుని కత్తితో బెదిరించి నాణెముల సంచిని లాక్కున్నాడు .

మరలా ఆపేద సజ్జనుడు యాచకుడి గా మారి భిక్షాటనచేయనారంభించాడు ఓరోజు అర్జునుడు అతన్ని చూసి ఆశ్చర్య పోయి, విషయము తెలిసికొని జాలిపడి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి సుఖంగా జీవింపుమని చెప్పాడు .

ఆసజ్జనుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసికొని వెళ్ళి గదిలో మూలన ఉన్న ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి ఆ రాత్రి నిద్రించాడు . తెల్లవారి చూస్తే ఇంట్లో భార్యలేదు . అంతేకాదు ఆ కుండ కూడా లేదు . పరుగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు . భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు . కుండలో చూస్తే వజ్రం లేదు .

నదిలో నీళ్ళకోసం ముంచినప్పుడు నదీ ప్రవాహములో కొట్టుకు పోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ సజ్జనుడు మళ్ళీ యాచకుడుగా వీధుల్లోకి వెళ్ళవలసి వచ్చింది .

కృష్ణార్జునులు ఆతనిని చూసి ఏమైందని విచారించారు . ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అని అర్జునుడు శ్రీకృష్ణునితో అన్నాడు. లేదు . ఈ సారి ఏం జరుగుతుందో చూద్దాం అని సజ్జనుని చేతిలో రెండు బంగారు నాణాలు పెట్టారు .

ఒకప్పుడు సంచెడు నాణేలు, ఎంతో విలువైన వజ్రం నా దగ్గర నిలువలేదు. ఈ రెండు నాణేలు నా తలరాతను మారుస్తాయా నాపిచ్చిగాని అనుకుంటూ ఇంటికి వెళుతున్నాడు ఆ సజ్జనుడు .

దారిలో ఒక జాలరి వలకు చిక్కి విలవిల లాడుతున్న చేపను చూశాడు . అతని హృదయము ద్రవించింది . నా దగ్గరున్న రెండునాణేలు నాతలరాతను మార్చలేవు కాబట్టి పాపం ఈ మూగజీవి ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలు ఇచ్చేసి ఆ చేపను తీసుకొని ఇంటికి వెళ్లి ఒక నీటి తొట్టిలో వేశాడు .

కొద్ది సేపటికి ఆతని భార్య ఆ చేపను చూసి అయ్యో ! దీని నోటిలో ఏదో ఇరుక్కుంది అందుకే ఇదిఇలా గిలగిలా కొట్టుకొను చున్నదని భర్తకు చెప్పింది. ఇద్దరూ కలసి ఆ చేప నోరు తెరవగా నదిలో పోగొట్టుకొన్న ఆ వజ్రం చేప నోట్లో కనిపించగానే 'దొరికింది దొరికింది చిక్కింది చిక్కింది నాచేతికి చిక్కింది ' అని గావుకేకలు పెట్టారు .

ఆ సయములో ఆతని ఇంటిలో దూరియున్న దొంగ ఆ సజ్జనుని చూసి భయంతో ఆసజ్జనుడు తననే కనిపెట్టా డని వణికిపోయాడు . ఆ సజ్జనుని దగ్గరకు వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు సంచి నీవు తీసుకో ; నన్ను మాత్రం రాజభటులకు పట్టివ్వ వద్దని బ్రతిమాలాడు. ఆ దంపతులు ఆశ్చర్యపోయారు . పోగొట్టుకొన్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయని ఆనందపడినారు .

వెంటనే వెళ్లి ఈ విషయాన్ని కృష్ణా ర్జునులకు చెప్పారు .

'కృష్ణా ! నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణేల సంచి , వజ్రం ఇచ్చినా అతని దశ తిరుగలేదు . నీ విచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పినాయి. ఇదెలా సాధ్యం?' అని ప్రశ్నించాడు అర్జునుడు .

శ్రీకృష్ణుడు ఇలా సెలవిచ్చారు ....
'అర్జునా! అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను తన అవసరాలు గూర్చి మాత్రమే ఆలోచించాడు . రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి - చెడు , కష్ట - సుఖములు గూర్చి ఆలో చించాడు . నిజానికి అది భగవంతుని పని . అతను దేవుని పనిని పంచు కున్నాడు కాబట్టి ఆతని కష్టములను అన్నిటిని నేను పంచుకున్నాను...' ✍️️

. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

సేకరణ

No comments:

Post a Comment