Tuesday, March 29, 2022

చితిలో శవం తలపండు పగిలితే ఏమవుతుంది..?

చితిలో శవం తలపండు పగిలితే ఏమవుతుంది..?
ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ మనిషి ఏదో సందర్భంలో కాటికి వెళ్లేవాడే! మరణించిన తర్వాత దహన సంస్కారాలు సర్వసాధారణం. చితిమంటల్లో శవం తల పగలడం ఇంకా కామన్‌. కానీ భద్రాచలంలో మాత్రం అలా జరగదు. ఎందుకు?
కర్మణ్యే వాధికరస్తే మాఫలేషు కదాచన! కర్మలు చేయడంలో నీకు అధికారం ఉన్నది! కర్మఫలాలపై మాత్రం లేదు! కర్మఫలానికి కారకుడివీ కాదు! అలాగని కర్మలు చేయడమూ మానొద్దు! భగద్గీతలో ఈ శ్లోకం హిందుల జీవన ధర్మాన్ని బోధిస్తుంది!
పాపం పుణ్యం కష్టం సుఖం! ఈ నాలుగు మనిషి నడవడికను.. తప్పొప్పులను నిర్ణయిస్తాయి. పాపం చేసినవాడు నరకానికి వెళ్తే.. పుణ్యాత్ములు శివుడిలోనూ విష్ణువులోనూ ఐక్యం అయిపోతారట! ఇది కర్మసిద్ధాంతం! ఇదంతా నమ్మడం, నమ్మకపోవడం వాళ్ల వాళ్ల భావజాలాన్ని బట్టి ఉంటుంది! ఇది కాసేపు పక్కన పెడితే, చితి మంటల్లో కపాల మోక్షం జరిగిన వాడు పాపి. అలా కాకుండా మంటల్లో తల కొవ్వత్తిలా కరిగిపోతే పుణ్యాత్ముడు.. అని బ్రహ్మపురాణం చెప్తుంది. అంటే దానిప్రకారం తలపండు పగిలితే నరకానికి వెళ్తాడట. అలాకాకుండా మంటల్లోనే మాడిపోతే సుషుమ్నా నాడిగుండా వైకుంఠానికి పోతారట!!
ఇలా అన్నిచోట్లా జరగదు. కేవలం మోక్ష పట్టణాల్లో దహన సంస్కారాలు జరిపితేనే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. మోక్ష పట్టణాలంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పూరీ ద్వారవతీ. ఈ ఏడింటిని బ్రహ్మ పురాణంలో పేర్కొన్నారు. అయితే దక్షిణ అయోధ్య భద్రాచలం కూడా మోక్ష పట్టణమేనని వేదవ్యాస మహర్శి గుర్తించాడు. అంటే ఈ ఎనిమిది చోట్ల కాకుండా వేరే ఎక్కడైనా దహన సంస్కారాలు చేస్తే ఆ వ్యక్తి తల కచ్చితంగా శబ్దం చేసుకుంటూ పగిలిపోతుందట! ఆ శబ్ద తీవ్రతను బట్టి పాపాలను అంచనా వేస్తారట.
భద్రాచలం దివ్య పుణ్యక్షేత్రం. దీన్ని దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తారు. మరి రాముడు తిరగాడిన నేల మోక్ష పట్టణంగా ఎందుకైంది? అంటే దీనివెనుక పెద్దకథే ఉంది. అరణ్యవాసంలో భాగంగా రాముడు ఈ గోదావరి తీరాన సంచరించాడు. ఇక్కడే తన తండ్రి దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేశాడు. రాముడు విష్ణువు అవతారం కాబట్టి.. దశరథుడు విష్ణువులో ఐక్యమైపోతాడు. రాములవారు తర్పణం చేసిన నేల కాబట్టి ఇది కూడా మోక్ష పట్టణంగా పురాణాలకెక్కింది. అందుకే శ్రీరాముణ్ని మోక్షరాముడు అని కూడా పిలుస్తారు. భద్రాచలంలో చుట్టూ మూడు కిలోమీటర్ల మేర ఎక్కడ దహన సంస్కారాలు చేసినా మంటల్లో శిరస్సు పగిలిపోదు. మెల్లగా కొవ్వత్తిలా కరిగిపోతుందట. కేవలం భద్రగిరి రుద్రభూమిలో మాత్రమే ఇలా జరుగుతుంది.
ఇప్పటిదాకా భద్రాచలం వైకుంఠ ఘాట్‌లో కొన్ని లక్షల శవాలకు దహన సంస్కారాలు జరిగాయి. అందులో ఏ ఒక్క మనిషి తల పగల్లేదంటే ఆశ్చర్యం కలగకపోదు. ఇప్పటిదాకా శిరస్సు పగిలినట్టు దాఖలాలే లేవని హకీం, శ్రీను అనే కాటికాపర్లు అంటున్నారు.
కర్మ సిద్ధాంతాలేవైనా కానీయండి. వాటిని నమ్మండి.. నమ్మకపోండి. అది మీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం నిజం. భూమి మీద పుట్టిన ప్రతీ ప్రాణీ మళ్లీ ఎప్పటికైనా ఆ భూమిలో కలిసిపోవాలి. పుట్టుక-చావు. ఈరెండు మాత్రమే నిజం. నడుమ అంతా నాటకం. కష్ట సుఖాలను లైట్ తీసుకోగలిగిన వాడే అసలైన స్థితప్రజ్ఞుడు. ఏమంటారు!
టెలిగ్రామ్’ ద్వారా (గురుగీత) పొందాలనుకునేవారు:
HTTPS://T.ME/GURUGEETA

సేకరణ

No comments:

Post a Comment