Monday, January 23, 2023

శ్రీ రమణాయ అధ్యాయము 35 భగవాన్ ఉవాచ తరువాయి భాగం

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 
అధ్యాయము 35
భగవాన్ ఉవాచ తరువాయి భాగం 

          భగవాన్ ఉవాచ అంటేనే సాక్షాత్ భగవాన్ రమణ మహర్షి వారి నోటి నుండి వెలువడిన అమృత తుల్యములై నటువంటి ప్రవచనం అమృతము మరెక్కడో దొరకదు . మహా పురుషుల ప్రవచనాన్ని శ్రద్ధగా విని పాటించుట మన ధర్మము . ధర్మాన్ని పాటించిన వాళ్ళందరూ అమృతాన్ని త్రాగినట్లే అమరజీవులుగా ఉన్నట్లే .

       భగవాన్ సందేహాలు గురించి కొన్ని విషయాలు చెప్పారు . సందేహం ఎవరికైనా కలిగినప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేయటానికి ప్రయత్నించక ఆ సందేహం ఎవరికి కలిగిందో తెలుసుకోమనేవారు . దృఢ నిశ్చయ ఆత్మలోనికి చొచ్చుకొని పొమ్మనేవారు . ఆ విధముగా చేయగా చేయగా మనస్సనేది మాయమై ఆత్మ ఒక్కటే మిగులును . అనగా మనస్సే ఆత్మగా మారిపోయిందని దాని అర్థం . కావున *మనస్సుకు ఆలోచనలను కలిగించే శక్తి ఉన్నదని గ్రహించవలెను* . ఈ ఆలోచనలను కొనసాగించకుండా ఆత్మలో చొచ్చుకొనిపోయే కార్యము కొనసాగుతునే ఉండవలెను . ఒక ఆలోచన వచ్చిన వెంటనే దానిని ధ్వంసము చేయవలెను . అనగా దాని జనన స్థానములోనే ధ్వంసము చేయవలెను . ఆ ఆలోచన పెరగకుండానే తుదిలోనే నరకమని దాని భావన . ఇలా ఆత్మ సాక్షాత్కారమయ్యే వరకు ఈ విధముగా చింతిన చేస్తూనే నిత్యము ఆత్మ గురించి తప్ప మరి ఏ ఇతర విషయముల పై ధ్యాస నిలువకూడదు . *ఆలోచనలను జనన స్థానములో నశింప చేయుటయే వైరాగ్యమని* సూచించారు భగవాన్ . 

        భగవాన్ భగవంతునికి ఏ సంకల్పము ఉండదని ఏ కార్యము అతనికి సంబంధించినది కాదని ప్రపంచములో ఏది జరిగినను ఆయనను ప్రభావితము చేయదని భగవాన్ సూచించారు . కేవలం సాక్షీభూతునిగా ఉంటాడని చెప్పేవారు . భగవంతుడే సృష్టి స్థితి మరియు లయకారకుడైనను *ఏ కార్యాలైనా ఎటువంటి సంకల్పముతోను మరియు ఒక ప్రయోజనము కొరకు భగవంతుడు చేయడు* . కానీ సామాన్య జీవులకు మాత్రం వాటి ప్రభావము ఆ జీవులపై ఉంటుందని భగవంతుడు నిర్ణయించిన ప్రకారము అనగా కర్మలననుసరించి ఫలితాలు జీవులవేగాని భగవంతునివికావు . ఆ కార్యాలకు భగవంతుడు బాధ్యుడుకాడు మరియు వాటి ప్రభావం ఆ భగవంతునిపై పడదని భగవాన్ చెప్పారు . 

       భగవాన్ రమణ మహర్షి గారు సాక్షాత్కారము గురించి విపులముగా వివరించారు . సామాన్యముగా సాక్షాత్కారమంటే దేవుడు మనముందు ప్రత్యక్షమవటం అని అనుకుంటాము . అంటే భగవంతుని దర్శించటమే సాక్షాత్కారమనే భావన . సామాన్యమైన మనము ఒక్కొక్కసారి దేవుడు ప్రత్యక్షం కాకపోయినా పరోక్షంగా దేవుడు వ్యవహరిస్తాడని అనుకుంటూ ఉంటాము . అదీ తప్పేనని భగవాన్ చెప్పేవారు . *భగవాన్ చెప్పినది ఏమనగా జీవన జ్యోతి మనిషిలో అతని చేష్టల ద్వారా వ్యక్తమవుతుందని ఆ జ్యోతి వల్ల ప్రభావితమైనప్పుడు ఎన్నో రకములైన చేష్టలు బైటపడతాయని చెప్పేవారు* . ఉదాహరణకు ఒక దీపం ఎదుట రంగుల గాజు పెంకు పెట్టినచో తెరమీద రంగుల బొమ్మలు కనిపించునట్లు . దీనిని బట్టి భగవాన్ చెప్పినది మనస్సనేది తెరవంటిదని ఆ తెరపై కాంతి మార్పుచెంది అతనికి భగవంతునికి కాంతికి నడుమ ప్రాపంచిక విషయాలు అడ్డుపడడం వల్ల మనస్సనుతెరపై స్వచ్ఛమైన కాంతి మార్పుచెంది ఆ కాంతి తగ్గుతుందని సూచించారు . తెరపై అనేక రంగులు పడునట్లు మనస్సుపై ఫలితాలు పడతాయని కావున ధృశ్యమానమైన ప్రపంచాన్ని తొలగిస్తే కనిపించేది ఒక జ్యోతి ! అదే భగవంతుడని సూచించారు . కావున మనకు సందేహాలను కలిగించి మన మనస్సు ఊహించే ఆ ప్రపంచాన్ని తొలగిస్తే భగవంతుడనే జ్యోతే ప్రకాశిస్తుందని ఆ ప్రపంచాన్ని తీసివేయటానికి ఒక చిన్న చిట్కా కూడా భగవాన్ చెప్పారు . *మన కళ్ళ ఎదుట ఎవరైనా కనిపించినపుడు అతనిని మనిషి అని అనుకోకుండా దేహధారి అయిన భగవంతుడని అనుకోమన్నారు భగవాన్* . 

        భగవాన్ ఆరాధనను గురించి ఉత్తమమైన మార్గము చెప్పారు . సర్వస్వాన్ని భగవంతునికి అంకితం చేయటం వల్ల బుద్ధిపూర్వకంగా కాని మరి ఏ ఇతరమైనటువంటి విగా కాని చేసే పత్రి కార్యము ఆలోచన భగవంతుని ప్రేరణ వలననే అని భావించమన్నారు . *అసలైన ఆరాధనంటే ఇదే తప్ప ప్రత్యేకమైన ప్రార్ధనలు అవసరం లేదని భగవాన్ సూచించారు* .

    కావున భగవాన్ నీవు స్వయం ప్రకాశమౌ ఆత్మవని నీవే సత్యమని , తేజమని , హృదయ కేంద్రమని , శక్తివని ఆ శక్తిని వేరుగా ఏమీ లేదని అదే మనస్సుని కల్పిస్తుందని ప్రారబ్దాన్ననుసరించి వృత్తులు ఉదయిస్తాయని అదే మనస్సుపై నీకాంతి పడగానే వృత్తులన్ని మహా ప్రపంచముగా సాక్షాత్కరిస్తాయని అవి తెరపై బొమ్మలవలె కన్పిస్తాయని చెప్పారు . మొదట పుట్టిన భావం నేను , తరువాత నీవు , వాడు , అది మొదలగునవి వస్తాయి . ఇవన్ని ఎవరికి వస్తున్నాయని ప్రశ్నిస్తే ' నాకు ' అనే జవాబు వస్తుంది . వెంటనే ఎవరు నేను ? ఎక్కడీ నేను ? అని అన్వేషించాలి . అలా అన్వేషణ చేయగా మూలస్థానమైన హృదయాన్ని చేరుకుంటామని ఆ మూలాన్ని చేరుకున్నవారికి ముక్తి సిద్ధించినట్లని అక్కడ ద్వంద్వాలైన సుఖదుఃఖాలు , పాప పుణ్యాలు అన్ని పోయి నీ దివ్య తేజస్సుముందు ఉన్న అన్ని భ్రమలు కూడా నశిస్తాయని భగవాన్ సూచించారు . 

      కావున మనకు కలిగే సందేహాలను నివృత్తి చేయుటకు , భగవంతుడు సాక్షీభూతుడనే విషయాన్ని గమనించి మనము కర్మలను భగవత్ అర్పితము చేసి కార్యఫలితాలను ఆశించకుండా ఉంటూ ఆ ధైర్యాన్ని ప్రసాదించుటకు , సందేహాల వల్ల ఊహించే మన మనస్సు కల్పించే ప్రపంచాన్ని మన నుండి తొలగించటానికి మన జీవన జ్యోతియే భగవంతుడని ఆ జ్యోతియే సాక్షాత్కారమని తెలుసుకొనుటకు , ప్రతి కార్యము భగవంతుని ప్రేరణవల్ల జరుగుతుందని నిశ్చయము కలుగుటకు మరియు ఆరాధన అంటే ఏమిటో తెలుసుకొనుటకు మనమే స్వయంప్రకాశకులము , ఆత్మ , తేజము , శక్తి , సత్యము మొదలగునవి అని గ్రహించుటకు కావలసిన దృఢ సంకల్పము , ధైర్యము , శక్తి , స్థిరత్వము కలుగుటకు భగవాన్ చరణాలకు నమస్కరిస్తూ సర్వశ్యశరణాగతి వేడుతూ వారి సంపూర్ణ ఆశీర్వచనములను తీసుకొనుటకు జ్ఞానులుగా మారుటకు శరణు వేడుదాం .

 భగవాన్ నీవే మాకు శరణాగతి . 

🙇‍♂️అరుణాచల శివ 🌹

No comments:

Post a Comment