Thursday, February 20, 2020

రమణ మహర్షి ‘నేనెవరు?

🌷 రమణ మహర్షి ‘నేనెవరు?’ 🌷

ఆత్మ యొక్క శాశ్వతత్వం గురించి చెప్పి, దాని లక్షణాల్ని విశదీకరుస్తున్నారు. ఈ ఆత్మ తత్త్వం గురించి మన మన తండ్రి తండ్రి తాతల వయస్కులై వారి మధ్యన ఉండి మోక్షాన్ని బడసిన రమణ మహర్షి ‘నేనెవడను?’ అన్న చిన్న పుస్తకంలో ఇలా అంటారు. ఇందులో ఉన్న ఏడవ సూచిలోని విషయం కొంచెం పెద్దదని పించిన ఆయన ప్రముఖంగా బోధించి, ఎందరికో మార్గాన్ని చూపింది:

▪మనస్సు అణిగిపోయిన నిద్రలో ప్రతి రోజు అనుభవించే తనకు స్వాభావికమైన సుఖాన్ని పొందాలంటే తనను తాను తెలుసుకోవాలి. ఆ జ్ఞానం పొందాలంటే ‘నేనెవడను?’ అనే జ్ఞాన విచారణ ముఖ్య సాధనం.

▪‘నేనెవడను అన్నది తెలుసుకుంటే సత్‌-చిత్‌-ఆనందం ఏమిటో తెలుసుకునట్లే. . ‘తెలుసుకో’ డానికి పరికరం, అన్ని పనులకు ఆధారం అయిన మనస్సు అణగిపోతే చూడబడే ప్రపంచం అణగిపోతుంది. అనగా కనబడుతోందో అట్టి ఆత్మ యొక్క దర్శనం లభించదు.

▪మనస్సు ఆత్మలో నెలకొన్న ఒక అతిశయ శక్తి. అదే తలపులను కల్పించేది. ఆలోచనలు లేని మనసంటూ ప్రత్యేక వస్తువు లేదు. కాబట్టి ఆలోచనలే మనస్సు యొక్క స్వరూపం. ఆలోచనలకంటే వేరుగా ప్రపంచమనేదీ లేదు. నిద్రలో ఆలోచనలూ లేవు, ప్రపంచం లేదు. జాగ్రత్‌ (మెలకువ), స్వప్నము (కల)లలో తలపులూ ఉన్నాయి, ప్రపంచమూ ఉంది.

▪మనస్సు తనలోంచి ఇంత ప్రపంచాన్ని బయటకు నిర్మించి మరల తనలోనికి విలీనం చేసుకుంటుంది. మనస్సు ఆత్మను విడిచి బయటకు పోయినపుడల్లా ప్రపంచం కనబడుతుంది. అలా, ప్రపంచము తోచినపుడు ఆత్మ కానరాదు. ఆత్మ అనుభవమైనపుడు ప్రపంచము కనబడదు.

▪మనస్సు యొక్క స్వరూపాన్ని వదలక అన్వేషిస్తే మనస్సు అణగారి, ఆత్మగా మిగులుతుంది.

▪మనసెప్పుడూ ఒక స్థూల వస్తువు (శరీరం)ను ఆశ్రయించి ఉంటుంది. అది ఒంటరిగా మన లేదు. ”నేను-నేను” అని స్మరించినా అక్కడికి చేరుకోవచు

‘నేనెవడను’ అనే విచారణ చేతనే మనస్సు అణిగేది. ఈ విచారణ ఇతర ఆలోచనలను నాశనం చేసి చితి మంటకు వాడే కట్టె వలె తాను కూడా నశిస్తుంది. ఆత్మ సాక్షాత్కరిస్తుంది. ఇతర తలపులెన్ని తోచినా వాటిని పట్టించుకోక, ఒడుపుగా ”అవి కలిగినది ఎవరికి?” అని విచారించాలి. ఎన్ని తలపులు పుడితే మనకేం, ఒక్కొక్క తలపును పట్టుకొని, ”ఇది ఎవరికి కలిగింది?” అని విచారిస్తే, ”నాకు అని తోస్తుంది. అప్పుడు ”నేను ఎవరు” అని మరల మరల ప్రశ్నించగా మనస్సు తన పుట్టుక స్థానానికి మరలుతుంది. పుట్టిన ఆలోచన కూడా అణగిపోతుంది. ఇలా అభ్యాసం చేయగా, చేయగా మనస్సుకు తన జన్మ స్థానంలో నిలిచి ఉండగలిగే శక్తి పెరుగుతుంది. సూక్ష్మమైన మనస్సు మెదడు, ఇంద్రియాల ద్వారా బహిర్గతమై, బయటకు పోయేటపుడు స్థూలమైన నామ రూపాలు అనుభవమౌతాయి. మనస్సు స్వస్థానమైన హృదయంలో నిలకడ చెంది ఉన్నపుడు నామరూపాలు తోచట్లేదు. మనస్సునిలా బయటకు పోనీక డెందమందు నిలిపి ఉంచుటనే ‘అహం-ముఖము లేక ‘అంతర్ముఖము’ అంటారు. మనస్సును ఎదలోంచి బాహ్యానికి పోనిచ్చుటను ‘బహిర్ముఖము’ అంటారు. మనస్సు ఎడదలో కుదురుగా ఉంటే అన్ని తలపులకు మూలమైన ‘నేను’ పోయి, ఎప్పుడూ ఉన్నట్టుండే ‘తాను’ తోస్తుంది. ‘నేను’ అనే తోపకం సుంతైనా లేని స్థితి, అనుభూతియే స్వరూపము, ఆత్మ.

▪మనస్సును శాశ్వతంగా అణగార్చటానికి విచారణకంటె వేరు మార్గాలు లేవు. ఒకవేళ ఇతర ఉపాయాల చేత అణగినా, మనస్సు అణిగినట్లే అణిగి, తిరిగి లేచి కూర్చుంటుంది.

▪ప్రాణాయామం చేత మనస్సును శాంత పరచ వచ్చు. అయితే ఈ కుదురు ప్రాణం నిరోధమై ఉన్నంత సేపే. నిరోధం సడలి, ప్రాణం చలించగానే మనస్సు కూడా తిరుగాడటం మొదలెడుతుంది.

▪ప్రాణాయామంలాగే దేవతా మూర్తి (రూప) ధ్యానం, మంత్ర జపం, ఆహార నియమం మొదలైనవి మనస్సును తాత్కాలికంగా నియమిస్తాయి. వీటి వల్ల మనస్సుకు ఏకాగ్రత లభిస్తుంది. ఏకాగ్ర చిత్తానికి ఆత్మ విచారం సులభం.

▪నియమాలు అన్నిటిలోకి మితసాత్త్విక ఆహారనియతి శ్రేష్ఠమైనదై, మనస్సు యొక్క సాత్త్విక సత్తువను పెంపొందించి ఆత్మ విచారానికి తోడ్పడుతుంది.

▪ఒకడు ఎంత పాపి అయినా కానీ, స్వరూప ధ్యానంలో పట్టుదల కలవాడైతే అతడు నిశ్చయంగా కడతేరతాడు.

▪ఇతరులెంత దుర్మార్గులుగా కనబడినా, వారిని ద్వేషింపరాదు.

▪ ప్రాపంచిక విషయాలలోను, ముఖ్యంగా ఇతరుల వ్యవహారాలలోను మనస్సును వీలైనంతగా పోనీయరాదు.

▪ఇతరులకు ఇచ్చేవన్నీ నిజానికి ఇచ్చుకునేది తనకే, ఈ సత్యం తెలిస్తే ఇతరులకు ఈయని వారెవరు?

‘నేను’ లేస్తే సమస్తం లేస్తుంది. ‘నేను’ అణగారితే సకలం శాంతిస్తుంది. మనం ఎంతగా అణకువతో ప్రవర్తిస్తామో, అంతకంత శుభమే జరుగుతుంది. మనస్సు వశమైతే ఎక్కడైనా బతకచ్చు.

▪యథార్థంగా నిలిచి ఉండేది ఆత్మ ఒక్కటే. జగత్తు (ప్రపంచం), జీవుడు, ఈశ్వరుడు ముత్యపు చిప్పలో వెండి కనబడినట్లే, ఆత్మ స్వరూపంలో కల్పితాలు. ఈ మూడు ఒకేసారి ప్రకటమై, ఏక కాలంలో మరుగవుతున్నాయి. స్వరూపమే ప్రపంచం, స్వరూపమే నేను, స్వరూపమే దేవుడు – అంతా శివ స్వరూపమైన ఆత్మయే.

▪ఆత్మ చింతన తప్ప ఇతర చింతలు (తలపులు, ఆలోచనలు) పుట్టుటకు కొంచెమైనా తావీయక, ఆత్మ నిష్ఠా పరుడై ఉండటమే తనను తాను దేవునికి అర్పించుకోవడం. ఈశ్వరుని పై ఎంత భారం మోపినా ఆయన దానిని భరిస్తాడు. సర్వ కార్యాలను ఒక పరమేశ్వర శక్తి నడుపుతున్న కారణంగా దానికి మనం లోబడి వుండాలి. అంతే కానీ, ‘అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి’ అంటూ ప్రణాళికలు దేనికి? రైలు బండి సామానులన్నీ మోస్తుందని తెలిసి కూడా, ప్రయాణీకులమై ఉండి, మన చిన్న మూటను కూడా అందులో పడ వేసి హాయిగా ఉండక దానిని నెత్తికెత్తుకుని ఈసురోమనడం ఎందుకు?

No comments:

Post a Comment