Wednesday, August 24, 2022

దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు అయ్యారు !

 "నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?" తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! 

ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! 

కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి 
టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు ! 

అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని !

సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు ! 

ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు ! 

చెన్నై లో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థత గా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు ! 

లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో " నాన్న గారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు సర్దుతారా.." అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటెంబట క్షణ కాలం మాట రాలేదు ! 

వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ! 

ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు !!

దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ? 

ముఖ్యమంత్రి పదవి అంటే  తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి  ముఖ్యమంత్రిని చూడగలమా ? 
చూడగలమా ? 

అంటే చూడలేమనే సమాధానం వస్తుంది ! 

ఆ తరం వేరు 
నేటి తరం వేరు !

ఆనాటి రాజకీయాలు వేరు 
ఈనాటి అరాచకీయాలు వేరు ! 

డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు  రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి !

దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు అయ్యారు !

ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మహానుభావుడికి నివాళులు !

No comments:

Post a Comment