Monday, June 30, 2025

ఆతరం పిల్లలతో ఈతరం పిల్లల తీరును పోల్చుకుంటే ఎంత వత్యాసం ?

 మా తరంలో ఎక్కువ  శాతం వివాహాల్లో తల్లిదండ్రుల ప్రమేయం  ఎక్కువగా  ఉండేది. అమ్మాయిని చూడటం, కుటుంబ  సాంప్రదాయం , జాతకాలు సరి చూడటం , వివాహం మరియు వివాహమయ్యాక  కొత్త కోడలుకు  తమ ఇంటి  సాంప్రదాయలు నేర్పించడం  వంటి  విషయాల్లో  తండ్రి  ప్రమేయం కన్నా , తల్లి  ప్రమేయమే ఎక్కువగా  ఉండేది.

 చాలా విషయాల్లో  అలా చేసుకున్న మగపిల్లలందరికీ  మంచే జరిగేది.చివరికి  తన కొడుకుకు  కలిగిన సంతానం  పెంచే  విషయాలు కన్నతల్లే చూసుకునేది.

 ఆ రోజుల్లో మా పిల్లలకు  కాస్త జలుబు చేసినా , ఒళ్ళు వెచ్చబడ్డా  వెంటనే  రేపల్లె నుండి  బాపట్ల వెళ్ళి  పిల్లలను మా అమ్మ చేతిలో పెట్టే వాడిని. మా శ్రీమతి కూడా  ఆ నాలుగు రోజులు  అమ్మతోనే  ఉండేది.

మా అమ్మ నాతో " పిల్లలను పువ్వో  పువ్వో  అని అపురూపంగా  పెంచ కూడదురా !  సముద్రంలో  విసిరేసినా  ఈదుకుంటూ  బైటికి రావాలి. " అనేది. పిల్లలను జాగ్రత్తగా  చూసుకునేది.

అలాగే " పిల్లలను  ఒంటి కాయ  శొంఠి కొమ్ముల్లా  పెంచకూడదు. తోటి  పిల్లల్తో కలవనివ్వాలి. వాళ్ళని  తమ ఈడు వాళ్ళతో ఆడుకోవడానికి  సాయంత్రం పూట పంపుతూ  ఉండాలి . గదిలో  బంధించి  ఉంచకూడదు. "  అనేది.

పిల్లలకు  వేసవి శలవులు  రెండు నెలలూ  మా అన్నదమ్ముల పిల్లలను కోడళ్ళను  తన దగ్గరే ఉంచుకునేది. పిల్లలందరికీ బామ్మ తాత ఇంటిలో  వేసవి శలవులంతా  ఎండల్లో  పడి  ఆడటం అంటే ఎంతో సరదాగా  ఉండేది.  దాదాపుగా  20  సెంట్ల  స్థలంలో  12 గదుల  రెండస్తుల మేడ  మరో 8 గదుల  పెంకుటిల్లు కలది మా బాపట్లలో ఇల్లు. విశాలమైన  పెరడు కూడా ఉండేది.ఆ రెండు నెలలూ  ఆ ఇల్లంతా  పిల్లల ఇష్టా రాజ్యమే.

తరచుగా  కలిసే పిల్లల మధ్యన  , ఎప్పుడో పెళ్ళి పేరంటాల్లో కలిసే పిల్లల మధ్యన ఏర్పడే  అనుబంధంలోని  వత్యాసం  ఇప్పుడు  ఈ తరం  పిల్లలను చూస్తే స్పష్టంగా  మాకు తెలుస్తోంది.

తన ఎనిమిది  మంది  మనవరాళ్ళే కాక  ఇరుగు  పొరుగు తన మనవరాళ్ళ మనవళ్ళ  ఈడు  కల  పిల్లల్ని  మరో పదిహేను  మందిని  పోగు  చేసి  వేసవి కాలంలో  అందరికీ  పూల జడలు వేసేది. మా నాన్న కూడా  ఈ పిల్లలందరికీ  తలో  అర్ధ రూపాయి  సినిమాలకు  ఇచ్చి పంపేవాడు. పిల్లలందరికీ  ఆ కాలంలో    సుప్రీమ్  హీరో  మెగా స్టార్  చిరంజీవే. ఆయన సినిమా తర్వాతే  మిగిలిన హీరోల  సినిమాలు.

మా అమ్మ సాయంత్రం  వేళ  ఈ ఇరవై  మంది  పిల్లలను  తన చుట్టూ  కూర్చోపెట్టుకునేది. పెద్ద  Circle గా  కూర్చోపెట్టుకుని , మధ్యలో  ఆవకాయలు  కలిపే  పెద్ద బేసిన్  పెట్టుకునేది. పెద్ద ఇత్తడి గిన్నె నిండి  వేడి వేడి  అన్నం వండి  సిద్ధంగా  ఉండేది.  కొత్తావకాయన్నం , కూరన్నం , పులుసన్నం మరియు పెరుగన్నం ఇలా  నాలుగు  వెరైటీలు  కలిపి  పెద్ద పెద్ద ముద్దలు చేసి ,  నీ వాళ్ళు నా వాళ్ళు అనే తేడా ఏమీ  చూపకుండా  , వాళ్ళందరితో కబుర్లు చెబుతూ పిల్లలందరికీ ముద్దలు కలిపి పిల్లల చేతిలో  పెట్టేది. పిల్లలందరూ  బామ్మా నాకు , బామ్మా నాకు  అంటూ  ఒకరి కొకరు  పోటిలు  పడి ఆవురావురుమంటూ  ముద్దలు పెట్టించుకుని  తినేసేవారు. మనం  దిష్టి  పెట్టకూడదు  కాని  వండిన అన్నం గిన్నె  మొత్తం ఖాళీ అయిపోయేది. అలాగే బామ్మ   తాత  , అమ్మమ్మ  తాతలతో  పిల్లల మధ్యన అనుబంధం కూడా  అలాగే ఉండేది. పిల్లలకు కూడా  వాళ్ళ బామ్మ  అమ్మమ్మ  తాతయ్య లంటే కూడా అంత ప్రేమ  మరియు  అభిమానాలుండేవి.

ఈతరం పిల్లలు  చాలామంది  ఇలాంటి  అనుభూతులు  miss అవుతున్నారనే అనుకుంటాను. తల్లిదండ్రులు  పిల్లల మధ్యన effections  పూర్వంలా  ఉండటం లేదు. బామ్మలు అమ్మమ్మలు తాతయ్యలు  మనవలు  మనవరాళ్ళ  మధ్యన  లోగడంత ఆప్యాయతలు  లేవు. అసలు  అన్నదమ్ములు  అక్కచెల్లెళ్ళు  మరియు వారి  పిల్లల మధ్యనే  పూర్వమంత  ఆప్యాయతలు  కూడా  ఉండటం  లేదు. వారందరూ ఎప్పుడో  ఏ  పెళ్ళిళ్ళలోనో వాళ్ళు  కలుసుకోవడం  " హాయ్ " " హాయ్ " అని పరస్పరం  విష్ చేసుకోవడం  , మిగిలిన  సమయమంతా  వాళ్ళ సెల్ ఫోను , లాప్ టాప్  , I pod  , వీటిల్లో  వీడియో గేమ్స్  ఆడుకోవడం. దాదాపుగా నూటికి  90 శాతం పిల్లలందరికీ  అదే లోకం  అదే ప్రపంచం. పర్యావసానంగా పరస్పరం  బంధువుల  మధ్యన అనుబంధాలు  చాలావరకు  తగ్గిపోయాయి .  తాతలు  అమ్మమ్మలు  బామ్మలతో  కూడా పిల్లలు  హాయ్ పలకరింపు లే.   రాత్రిపూట  తాతగారు  మనవళ్ళను  మనవరాళ్ళను,పక్కన పడుకోపెట్టుకుని  పద్యాలు , రామాయణ , భారత , భాగవతాలు  నేర్పించడాలు ఇవ్వన్నీ  ఆ తరం  వారు  తమ మనవలకు  మనవరాళ్ళకు నేర్పేవారు. ఇవ్వన్నీ  నేటి తరం వారిలో  మచ్చుకైనా  కానరావు.  అది ఎవ్వరి తప్పు కాదు. కాలం మారింది. జీవన విధానము  కూడా  మారింది. అంతే. చెప్పే వారు లేరు. వినే వారు  కూడా  అంత కన్నా  లేరు.

ఆతరం  పిల్లలతో  ఈతరం పిల్లల  తీరును  పోల్చుకుంటే ఎంత వత్యాసం ?

ఆ రోజులు  మళ్ళీ  రావాలి. పిల్లలు  పెద్దలు  తాతలు  బామ్మలు  అమ్మమ్మలు  మధ్యన పూర్వపు అనుబంధాలు మళ్ళీ  పునరుద్దరింపబడాలి .

No comments:

Post a Comment