Tuesday, October 10, 2023

ఎవరినైనా కించపరిస్తే కల్గే నష్టాన్ని ఒక సంస్కృత కవి ఎంతచక్కగా వివరించాడో కదా!

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝*ఎవరినైనా కించపరిస్తే కల్గే నష్టాన్ని ఒక సంస్కృత కవి  ఎంతచక్కగా వివరించాడో కదా!*
💕 *ఒకరోజు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న  పార్వతి ఇంటికి వెళ్లింది. పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించింది.*
💞 *పార్వతికి లక్ష్మికున్నంత  ఐశ్వర్యం లేదు డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి.  లక్ష్మికి పార్వతిని ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది.*
💖 *”భిక్షార్థీ స క్వ యాత:?” అని చిన్న ప్రశ్న వేసింది. ‘మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా’అంటే బాగుండేది. కాని లక్ష్మి అలా అనలేదు. “ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా?” అంది.  శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి ఆ విషయాన్నలా ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది.*
💝 *చాలా బాధ కల్గించిందీ ప్రశ్న పార్వతికి. ఏ స్త్రీఐనా తనను ఎన్నన్నా సహిస్తుంది గాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం  సహించలేదు కదా! ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. సరిపెట్టుకుని  ఊరుకోనూలేదు. సమాధానం చెప్పాలి కదా. తప్పదాయే.*
💕 *”సుతను బలిమఖే "  అంది. ~బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా!’ అని సమాధానం.  ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు  తన భర్త శ్రీమహావిష్ణువు. వామన అవతారంలో బలిచక్రవర్తిని ఆయన మూడడుగుల నేల అడగడం లోకవిదితమే.  'మా ఆయనకన్నా మీ ఆయనే దారుణం' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది.*
♦️ *లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలనుకుని “తాండవం క్వాద్య భద్రే!”అని అడిగింది. ‘అమ్మా! మీ ఆయన ఈరోజు ఎక్కడ నాట్యం చేస్తాడు?’ అని దానర్థం. ‘మీ ఆయన ఏ పనీ,పాటలేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడు’ అని లక్ష్మి మాటల్లోని అంతరార్థం.* 
💓 *అప్పటికే ఆరితేరిన పార్వతి “మన్యే బృందావనాంతే” అంది. ~’బృందావనంలో కాబోలు’ అని ఆ మాటలకర్థం.బృందావనంలో నాట్యంచేసేవాడు కృష్ణుడు. శివుడు కాదు. 'మా ఆయనే కాదు, మీఆయన కూడా నాట్యం చేస్తాడు. ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు. మీ ఆయన లాగ ఆడవాళ్లనందర్నీ వెంటేసుకుని నాట్యం చెయ్యడు' అని సమాధానం.* 
💞 *పార్వతి సమాధానం ఇంత పదునుగా  ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంతపనయింది.* 
💕 *ఈ సారి తనకు ఇబ్బంది లేనివిధంగా మాట్లాడాలని అనుకుని “క్వను చ మృగ శిశు:”అని మరో ప్రశ్న వేసింది. ‘మీ ఏనుగు మొగంవాడెక్కడమ్మా?’ అని అర్థం. లక్ష్మి కొడుకు మన్మథుడు బహుఅందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరంలేదు. 'మా అబ్బాయి అందగాడు, మీ బాబే కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని  అభిప్రాయం. పార్వతి బాగా నొచ్చుకుంది. ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దు. పార్వతి వెంటనే “నైవ జానే వరాహం” అంది. ~’ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు’ అంది. “మా అబ్బాయిది ఏనుగు ముఖమే. కానీ, మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!” అని పార్వతి సమాధానంలోని చమత్కారం.*

💝 *ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించినా తేరుకుని జాగ్రత్తగా తనకు ఎదురుదెబ్బ తగలని విధంగా దెబ్బకొట్టాలనుకుంది.* 
💕*కాసేపు చూసి “బాలే! కచ్చిన్న దృష్టః జరఠ వృషపతిః”అని అడిగింది. ~మీ వాహనం అదే ఆ ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా! అని ప్రశ్న. 'మాది గరుడ వాహనం విమానాల్లో వలే ఆకాశంలో తిరుగుతాం.  మీరు నేలపైన తిరుగుతారు. మీ వాహనం  ముసలి ఎద్దు.  అది కదల్లేదు మెదల్లేదు'  అని ఆక్షేపం. “మేం పై స్థాయి వాళ్లం మీరు నేలబారు మనుషులని వెక్కిరింపు. ఆ వెక్కిరింపుకు ప్రతిస్పందనగా పార్వతి వెంటనే “గోప ఏవాస్య వేత్తా”అంది. ‘ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా?  వెళ్లి మీ ఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది. ‘మా ఆయన నడిపే వాహనాన్ని మీ ఆయన మేపుతాడు. మీకంటే మేమే ఎక్కువ’ అని పార్వతి మాటల్లోని ఆంతర్యం. లక్ష్మి పూర్తిగా అవాక్కై జారుకుంది.*

💖 *వేళాకోళంగా జరిగిన ఈ సంభాషణలో నిందా లేదు. వెక్కిరింపూ లేదు. ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఒక కవి  లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని కల్పనద్వారా నీతిని బోధించాడు. కాగా ‘వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన  సంభాషణ మనందరిని రక్షించుగాక’ అన్నాడు కూడా.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment