Friday, December 1, 2023

శ్రీమదాంధ్ర మహాభారత కావ్యం మూడు విషయాలపై వ్యక్తుల ప్రామాణికతను నిర్ణయిస్తున్నది.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *శ్రీమదాంధ్ర మహాభారత కావ్యం మూడు విషయాలపై వ్యక్తుల ప్రామాణికతను నిర్ణయిస్తున్నది.*
💕*1. అభిజాత్యం*
💕*2. సంస్కారం*
💕*3. దైవీసంపత్తి*
💖*కర్ణుని విషయాన్ని చూస్తే కర్మసాక్షియైన సూర్యభగవానుడే తండ్రి ఐనా సంస్కారవంతుడు కాలేకపోయాడు. దుష్టచతుష్టయంలో ప్రముఖ పాత్రవహించాడు. దైవీసంపదకు దూరమయ్యాడు. విధి వక్రించడం చేత “అయ్యో…!పాపం…!!” అనిపించేలా మరణాన్ని పొందాడు.*
💕*కర్ణుని మరణానికి కారణాలు ఎన్నని, ఎందరని లెక్కపెట్టగలం? శాంతిపర్వంలో నారదుడు ధర్మరాజుతో వినుము నరేంద్ర అంటూ చెప్పిన కారణాలు:~*
💓*1. విప్రుడలిగెన్*
💓*2. జమదగ్నిసుతుండు శాపమిచ్చె*
💓*3. అమరభర్త వంచనము సేసె*
💓*4. వరంబని కోరి కుంతిమాన్చె నలుక*
💓*5. భీష్ముడర్ధరథుజేసి యడంచె*
💓*6. కలంచె మద్రరాజు నుచితమాడి (శల్యుడు)*
💓*7. శౌరి  విధియయ్యె*
💓*8. నరుండటు జంపె కర్ణునిన్*
💖 *~కర్ణుడు పుట్టుక నుంచే దురదృష్టవంతుడు. కన్న తల్లి గంగపాలు చేసింది. అఖండ భూమండలాధీశ్వరుడు కాదగిన యోగ్యతలుండి కూడా సూత పుత్రుడుగా పెరగవలసివచ్చింది. పరశురామ శుశ్రూష శాపాన్ని ప్రాప్తింపజేసింది. అస్త్రవిద్యా సాధన బ్రాహ్మణ శాపాన్ని సంక్రమింపజేసింది. దానవ్రతం కవచకుండలాల్ని తొలగించింది. యుద్ధంలో కూడా దురదృష్టమే కర్ణుణ్ణి వెంటాడింది. నరునిపై వేసిన నాగాస్త్రం శల్యసారథ్యం వల్ల గురితప్పినది. భార్గవాస్త్రము బుద్ధికి స్ఫురింపలేదు. రథచక్రం భూమిలో క్రుంగిపోయింది. చివరకు అయ్యోపాపమనిపించే మరణం పొందాడు కర్ణుడు.*
❤️ *విషాదాంత నాయకులు అవివేకులు కారు. అసమర్థులు అంతకంటే కారు. కర్ణుడెంత సమర్థుడో అంత వివేకి. పైగా స్వశక్తితో సూతపుత్రస్థితి నుండి రారాజు అర్ధాసనమలంకరించే స్థితికి వచ్చినవాడు. పరిస్థితుల ప్రాబల్యం కౌరవపక్షాన కట్టిపడేసినా ధర్మజుని ధార్మికతను, శ్రీకృష్ణుని ప్రాపున పాండవ విజయాన్ని తెలియనివాడూ కాడు.*
💞 *రాయబారం విఫలమైన తర్వాత శ్రీకృష్ణుడు వెనుదిరిగి వెళ్తూ రాధేయుణ్ణి తన రథం ఎక్కించుకున్నాడు. ఏకాంతంలో అతని జన్మరహస్యం చెప్పాడు. సార్వభౌమ యోగం, పాంచాలి పొందూ దొరుకుతాయని ఆశపెట్టాడు. పాండవ పక్షానికి రమ్మని పిలిచాడు. దానికి కర్ణుడు శ్రీకృష్ణునితో "ధర్మరాజు నాకు తమ్ముడని తాను తెలుసుకుంటే భూమండల ఆధిపత్యం వహించడు. కానీ అట్టి ధర్మాత్ముడుశాశ్వతంగా ఈ పుడమికంతటికి చక్రవర్తిగా పాలించడం న్యాయం కదా? కృష్ణా, ధర్మజుడు తన తమ్ముళ్లు నలుగురూ యజ్ఞం చేయించే యాజకులు కాగా, ఈ పని ఇట్లా చేయండి అని యజ్ఞకర్మల్లోని గుణదోషాలను కనిపెట్టే ఉపద్రష్టవు నీవు కాగా, కౌరవులనే యజ్ఞపశువులను చంపుట ద్వారా యుద్ధమనే యాగాన్ని సంప్రీతితో చేస్తాడు. ఈ సమర యుద్ధాన్ని ఈదుకుంటూ వెళ్లి, మీ విజయాన్ని స్వర్గం నుంచి చూసి ఆనందిస్తాను. నా మాట మన్నించు" అని వేడుకున్నాడు.*

💖 *ఫలం కర్మాధీనం:~*
❤️ *~పెంచి పెద్ద చేసిన రాధ, అతిరథులపట్లగల పుత్రధర్మం, అంగరాజ్యమిచ్చి ఆదరించి తననింతవాడిని జేసిన సుయోధనుని మీద స్వామి భక్తి. చివరికి సార్వభౌమ యోగాన్ని కాలదన్నాడు. సోదర ప్రేమను జయించాడు. ఇంత వివేక ఉదాత్త గుణసంపన్నుడైన కర్ణుడు జీవితాన్ని ఎందుకు విషాదాంతం చేసుకున్నాడని సందేహం కలుగకమానదు.*
💞 *~కారణాలు అతని వైయక్తిక లోపాలే. అర్జునుడంటే మాత్సర్యం, స్వాతిశయం, దురదృష్టజాతకం వెన్నంటాయి.*
💓 *”ఎట్టివిశిష్ఠ కులంబున బుట్టియు సదసద్వివేకంబులు గల్గియున్ మును గట్టిన కర్మఫలంబుల నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్"*
💕 *~మానవులు ఎంతటి ఉత్తమవంశంలో పుట్టినా, మంచి చెడ్డలను గురించిన పరిజ్ఞానం కలిగివున్నా, పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించక తప్పదన్నమాట అక్షర సత్యమే కదా.*
💖 *”ఫలం కర్మాధీనం, దేవతలతో దైవంతో మాకేం పని? దేవతలకు కూడా తప్పించుకునే వీలులేని కర్మకే నమస్కారం" అంటాడు భర్తృహరి. కర్ణుడి జీవితం అందుకు సాక్ష్యం.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment