ఒక సాధువు సంసారం మీద విరక్తి తో ఊరి బయట ఒక పాక వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఊరి ప్రజలు తనకు సమర్పించే పళ్ళు,తిని పలు మాత్రం తాగి జీవిస్తూ వుండే వాడు. అతనికి రెండు కౌపీనాలు(గోచీలు) మాత్రమె ఉండేవి స్నానం చేసి ఒకటి ఆరేసుకునే వాడు,ఒకటి కట్టుకునే వాడు.
కొన్నాళ్ళకు ఒక ఎలుక ఆ కౌపీనాన్ని రోజూ కోరికి వెయ సాగింది. ఎన్ని కౌపీనాలు మార్చినా అలాగే కోరికేస్తూండేది. గ్రామస్తుడొకడు ఆ సాధువు కు ఒక పిల్లిని యిచ్చి దీనివలన మీకు ఎలుక బాధ వుండదు స్వామీ అని చెప్పాడు. మరి ఆ పిల్లికి పాలు పొయ్యాలి కదా!గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవును కొనిచ్చారు. ఆ ఆవు పాలు పితికేందుకు,దాని అడవి కి తీసుకొని పోయి మేపు కొని వచ్చేందుకు మనిషి కావాలి కదా!ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతమివ్వాలి. అందుకని గ్రామస్తులు అతన్ని పెళ్లి చేసుకోమని సలహా యిచ్చారు. అమ్మాయిని కూడా చూపించారు. అతను పెళ్లి చేసుకున్నాడు. భార్య గోచీ బాగా లేదు పంచె కట్టుకోండి అని అన్నది. సరే పంచెలు కొన్నాడు. బిడ్డలు పుట్టారు వాళ్ళను పోషించేందుకు డబ్బు కావలిసి వచ్చింది. గ్రామస్తులతో మాట్లాడి ఒకరి పొలాన్ని కౌలు కు తీసుకొని సేద్యం చేయ సాగాడు. తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. సొంతంగా పొలం కొనుక్కున్నాడు. ఎద్దులు కొన్నాడు. సంసారం పెరిగి పోయింది.. ధ్యానం,తపస్సు వెనక బడి పోయాయి. డబ్బు యావ పెరిగి పోయింది. ధ్యానం బదులు ధాన్యమే ముఖ్య మైంది. శాంతి కరువైంది.
యిది యిలా వుండగా ఒకసారి అతని గురువు అతన్ని చూడ టానికి వచ్చాడు. ఆయన యిదంతా చూసి ఆశ్చర్య పోయి యిదేమిటి రా నేను చెప్పిందేమిటి? నీవు చేసిందేమిటి? అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు గురుదేవా!"కౌపీన సంరక్షణార్థమ్ అయం పటాటోపః"అన్నాడు. గురుదేవా! నా గోచిని కాపాడుకోవడానికి ఇంత పటాటోపం పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి నాకు బుద్ధి వచ్చింది అని లెంపలు వేసుకొని, ఆ సంపదనంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్లి పోయి హాయిగా కంద మూలాదులు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతి గా గడిపాడట.
అప్పటినుండి లోకం లో "కౌపీన సంరక్షణార్థమ్ అయం పటాటోపః"అనే సామెత వచ్చింది. ఈ కాలం లో ఒకదాని కోసం ఒకటి ఏర్పరుచుకొనే వాళ్ళను చూసి ఈ సామెత చెప్తూ వుంటారు పెద్దవాళ్ళు. ఈ సామెత వెనక యింత కథ ఉంది.
సేకరణ. మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment