Tuesday, March 21, 2023

కర్మ మరియు విధి

 *కర్మ మరియు విధి* 

“కర్మ మరియు విధి” ఎలా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయో ఒక కథ ద్వారా తెలుసుకుందాం.

దేవఋషి నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ శ్రీ మహా విష్ణువును కలవడానికి వైకుంఠం చేరాడు. శ్రీ మహా విష్ణువును చూసి ప్రణామం చేసి, “నారాయణ, మనుష్యుల్లో నీ యందు భక్తి తగ్గినది, భూలోకంలో ధర్మమూ పాటించువారు కష్టాలు ఎదుర్కొంటున్నారు, పాపమూ చేసిన వారు సుఖమైనా జీవితం గడుపుతున్నారు” అని అన్నాడు.

మహా విష్ణువు, “నారద, ధర్మమూ ఎపుడైనా గెలుస్తుంది నాయనా, ఏది జరిగినా విధి అనుసారంగా జరుగుతుంది”.

అప్పుడు నారదుడు, ” దేవా, నేను నా కనులార చూచితిని, పాపము చేయువాడు అన్ని రకాల సుఖములు పొందుతున్నాడు, ధర్మబద్ధంగా జీవించువాడు మరింత కష్టాలపాలు అవుతున్నాడు” అని అన్నాడు.

అసలు నీవు చూసిన సంఘటన ఏమిటో చెప్పు అని మహా విష్ణువు అడిగెను.

అప్పుడు నారదుడు, ” ఒకానొక అరణ్యములో నేను వెళ్తూ ఉండగా ఒక ఆవు ఊబి లో చిక్కుకొని కనపడింది, నిస్సహాయ స్థితిలో అది సహాయము కొరకు అరుస్తోంది. కొద్ది సమయానికి అటువైపుగా ఒక దొంగ వచ్చాడు వాడు ఆవును చూసి ఏమీ పట్టనట్టు దాని మీద కాలు పెట్టి ఊబి దాటి వెళ్ళాడు, కొద్దీ దూరం వెళ్ళాక ఆ దొంగకు ఒక చిన్నమూట దొరికినది దాని కొన్ని బంగారు నాణాలు ఉన్నవి”.

మరి కొద్దీ సమయానికి అటుగా ఒక ముని వచ్చాడు, ఆవును చూసి జాలిపడి తన శక్తిని కూడా గట్టుకొని ఎంతో కష్టపడి ఆవును బయటకు తీసాడు, ఆ సాధువు తన మార్గమున ముందుకు వెళ్లి ఒక గోతిలో పడ్డాడు”.

ఓ కరుణాకరా  ఇప్పుడు చెప్పండి “ఆవుకు సహాయము చేసి ప్రాణం కాపాడిన సాధువు గోతిలో పడ్డాడు, ఏ సహాయము చేయని దొంగకు బంగారము దొరికింది. ఇదెక్కడి న్యాయం?”

శ్రీ మహా విష్ణువు అన్నాడు, “ఈ సంఘటనలో దొంగకు సాధువుకు జరిగినది సరియైనదే. ఆ దొంగకు నిజానికి అదృష్టం వలన ఒక పెద్ద నిధి దొరకవలసినది కానీ అతను చేసిన పాపం వలన కేవలం ఒక చిన్న మూట బంగారం దొరికినది. ఆవును కాపాడిన సాధువు నిజానికి ఆ రోజు మరణించవలసింది కానీ ఆవును కాపాడిన పుణ్యము వలన చావును తప్పించుకొని కొన్ని దెబ్బలతో ప్రాణాలతో బయటపడ్డాడు”.

మనిషి చేసే ప్రతి కర్మ అతని విధిని నిర్ణయిస్తుంది, కర్మల చేత విధిని కూడా మార్చవచ్చు.

No comments:

Post a Comment