శ్రీకృష్ణుడు చూపిన దారిలో..
‘నీకెవరు ఆదర్శం?’ ఈ ప్రశ్న తరచూ స్నేహితుల నుంచి ఎదురవుతూ ఉంటుంది. జవాబుగా తల్లిదండ్రులు, గురువు, ఇష్టదైవం పేరు చెబుతారని ఊహిస్తారు. స్నేహితుల ఊహ నిజమని భావించడంలో తప్పేమీ లేదు. జీవితంలో తల్లిదండ్రులు, గురువు, దేవుని కన్నా ఆదర్శం మరెవరుంటారు? అందుకే ‘మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషోవేద’ అని చెబుతుంది శతపథ బ్రాహ్మణం. తల్లిదండ్రులు, గురువు సముచిత రీతిలో జ్ఞాన, విజ్ఞానాలు అందించినప్పుడే మనుష్య నిర్మాణం చక్కగా జరుగుతుందని ఆ మాటలకు అర్థం.
గాయత్రీ మంత్రంలోని ‘భర్గో దేవస్య ధీమహి’ అనే వాక్యాన్ని గమనిస్తే భగవంతుని స్వరూపం వెల్లడవుతుంది. నిర్గుణుడు, నిర్వికారుడు, దోషరహితుడైన భగవంతుడే భర్గుడు. అతడు ధారణశక్తి కలిగిన మా బుద్ధిని ప్రేరేపించుగాక అని భావం. ఇక్కడ మనం దివ్య గుణాలు అనగా, సృష్టి రచనతో పాటు పోషించుట, రక్షించుట అనే సుగుణాలు కలిగిన దేవుణ్ని ఆదర్శంగా తీసుకుంటున్నామని గ్రహించాలి. ముఖ్యంగా భగవంతుడు సత్వం, రజస్సు, తమస్సు అనే ప్రకృతి గుణాలకు కట్టుబడనివాడు. అట్లే మనో వికారాలుగా భావించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు దూరంగా ఉన్నవాడు. రాగద్వేషాలకు అతీతుడు. అలాంటి భగవంతుడే మాకు ఆదర్శం కనుక ఆయనే మమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలని అనుకోవడం మానవుడి కర్తవ్యం.
లోకంలో అందరూ ఆదర్శ పురుషులు కాకపోవచ్చు. కానీ, ఎవరు ఆదర్శ పురుషులో వారే మనకు ప్రమాణంగా నిలుస్తారు. ఒక్కసారి భగవద్గీతను అవలోకిస్తే.. లోకం శ్రేష్ఠ పురుషుడినే ఆదర్శంగా తీసుకుంటుందని, శ్రేష్ఠుడు దేన్ని ఆచరిస్తాడో దాన్నే ఆచరిస్తుందని, దేన్ని ప్రమాణంగా తీసుకుంటాడో దాన్నే ప్రమాణంగా తీసుకుంటుందని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రకటించాడు. మనకు జగద్గురువైన శ్రీకృష్ణుని కంటే ఆదర్శ పురుషుడు మరొకడు లేడు. ఆయన యోగీశ్వరుడు, సమ దర్శనుడు, ద్వంద్వాతీతుడు. లాభనష్టాలను, మానవమానాలను సమానంగా లెక్కించినవాడు. నిరంతరం ఆసక్తి రహితుడై కర్తవ్య కర్మలను ఆచరించినవాడు, నిష్కామ కర్మయోగి, మహాజ్ఞాని. ‘కర్మేంద్రియైః కర్మయోగమ్ ఆసక్తః స విశిష్యతే’ (భగవద్గీత 3-7). ఫలాపేక్షలేనివాడై, ఇంద్రియాలను జయించి, నిష్కామ కర్మయోగాన్ని ఆచరించేవాడే శ్రేష్ఠుడని కృష్ణుడు చెప్పిన మాటలు గమనింపదగ్గవి.
శ్రీకృష్ణుడు ఎన్నడూ కర్మయోగం నుంచి వైదొలగలేదు. పాండవ పక్షపాతి అనే ముద్ర తలదాల్చినప్పటికీ ఆయన ఎప్పుడూ ధర్మపథం నుంచి తప్పుకోలేదు. యుద్ధం క్షత్రియ కర్మ కనుక, దాన్ని ధర్మంగా లెక్కించి యుద్ధం చేయమని అర్జునుడికి ఉపదేశించాడు. తనకు ముల్లోకాల్లో చేయదగిన కర్మలేవీ లేనప్పటికీ, పొందదగిన ఫలాలు కనిపించనప్పటికీ తాను మాత్రం కర్మ యందే ప్రవర్తిస్తున్నానని చెప్పడం కృష్ణ భగవానునికే సరిపడింది.
భగవంతుడు చెప్పినది చేయుట మన కర్తవ్యము. ఆయన చేసినది చేయుటకు మనకు అనుమతి లేదు. ఆయనను అనుకరించుట అసాధ్యము. సర్వమునకు అధికారి అత్యంత శక్తిశాలి. విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ. పద హారువేలమంది సతులతో ఏకకాలమున శయనించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవమును, లీలను అవగాహన చేసుకొను జ్ఞానము అల్పులైన మానవులకు లేదు. అనన్యమైన భక్తి ప్రపత్తులలో సర్వశ్య శరణాగతి చేసిన భక్తులకు మాత్రమే ఆ అదృష్టము కలదు. శ్రీకృష్ణుని లీలలు నిగూఢము మరియు మహిమాన్వితము.
పవిత్ర జీవనమునకు మార్గము చూపు శ్రీ మద్భాగవతము నందు లీలామానుష విగ్రహ రూపుడైన శ్రీకృష్ణుని దివ్య చరి తము ఒక అమృతవాహిని. ఎవరికివారు అనుభవించిన గాని ఆ రసామృతము యొక్క రుచి అవగతము కాదు.
సూర్యోదయమునకు ముందుగానే నిదుర నుండి లేచెడి వాడు. బ్రహ్మీముహూర్తమున పారిజాత పుష్పముల మధుర సౌరభమును ఆస్వాదించు నందనవనములోని తుమ్మెదల ఝంకారమును వినుచూ, సువాసనలను ఆఘ్రాణించుచూ మేల్కొనెడి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే తన ముఖము, చేతులు, పాదములు శుద్ధ జలములతో శుభ్రము చేసుకొనెడి వాడు. తదుపరి ఆత్మధ్యానములో మునిగెడివాడు. బ్రహ్మీ ముహూర్తము అత్యంత మంగళప్రదమైనది. కానీ శ్రీకృష్ణుని పట్టమహిషులకు అది అంత ప్రీతివంతమైనది కాదు. వారు శ్రీకృష్ణుని విడిచి నిముషమైననూ ఉండలేకపోవుటయే దానికి కారణము.
ధ్యానము ముగించుకొని స్వచ్ఛమైన, పవిత్రమైన జలము లతో స్నానమాచరించెడివాడు. సచ్ఛిదానంద స్వరూపుడైన ఆయన అత్యంత సుందరమైన దుస్తులను ధరించి సర్వాలంక రణ భూషితుడై నిత్య వైదిక విధులను ఆచరించుటకు బయలు దేరును. యజ్ఞకుండములో హోమము చేయుట, గాయత్రిని మనమునందే జపించుట, సూర్యోదయ సమయమున సూర్యోపాసన చేయుట, గృహస్థుగా పితృదేవతలకు తర్పణ ములు విడుచుట మొదలైన విహిత కర్మలను ఆచరించెడివాడు. తరువాత బ్రాహ్మణులకు గోదానము చేసెడివాడు. ఆ గోదాన ము అత్యంత శోభాయమానముగా నుండెడిది. గోవులన్నీ సువర్ణ, రజిత ఆభరణములతో అలంకృతమై యుండెడివి. గోబ్రాహ్మణ సంక్షేమమే ఆయన అభీష్టము. తదుపరి తన సమ స్త పరివారముతో సుగంధభరితుడై సర్వ దేవతాలయము లను సందర్శించెడివాడు. అప్పటికే ప్రజలు ఆయనకు మధుర ఫలములు, వివిధ పుష్పమాలలు, నానావిధ సుగంధ ద్రవ్య ములు మొదలైనవి రాశులుగా అర్పింపగా వాటిని తిరిగి అంద రికీ పంచెడివాడు.
ఈవిధముగా ఉదయమున కార్యక్రమము ముగించుసరికి రథసారధి దారుకుడు దివ్యరథమును సిద్ధముచేసి అంజలి ఘటించి నిలబడెడివాడు. సాత్యకి, ఉద్ధవుడు తోడు రాగా రథ మునధిరోహించి పురవీధులలో పయనించుటకు వెడలెడి వాడు. అంత:పుర హర్మ్యముల నుండి రాణులు తమ విలాస వంతమైన దృక్కులను సారించగా మందహాసముతో వాటిని ఆస్వాదించెడివాడు. పురవీధుల పర్యటించి తన కొలువు కూట మైన ‘సుధర్మ’మును చేరెడివాడు. శ్రీకృష్ణుని సుధర్మమున ప్రవేశించిన వారికి ఆకలి, దప్పిక, దు:ఖము, మాయ, వార్థక్య ము, మృత్యువు అను ఆరు యాతనల నుండి విముక్తి కలిగెడిది.
సుధర్మమున మహోన్నతమైన సింహాసనముపై ఆసీనుడై దశదిశల ప్రకాశించెడివాడు. నర్తకీమణులు, విదూషకులు, గాయకులు వారివారి ప్రతిభను ప్రదర్శించెడివారు. నిత్యమూ మృదంగము, వీణ, వేణువు, వివిధ తాళములలో శ్రావ్యమైన సంగీతము మంగళప్రదమై మ్రోగుచుండెడిది. వేదపఠనము సమాంతరముగా సాగుచుంచెడిది. నారదాది మహర్షులు సుధర్మమును సందర్శించెడివారు. ముల్లోకములలోని వివిధ విశేషములు, సమస్యలు నివేదించెడివారు.
ధర్మమునకు క్షయమును గూర్చు ప్రయత్నములను నిరో ధించుటకు తగిన కార్యాచరణను అమాత్యులతో గూడి రచిం చెడివాడు. ముఖ్య ఆంతరంగికునిగా ఉద్ధవుడు ఎల్లవేళలా సిద్ధ ముగా నుండెడివాడు. సాధారణ మానవునివలె ప్రవర్తించుచున్న మాధవుని గురించి ఉద్ధవునకు పూర్తిగా తెలుసును. భూత, భవిష్యత్, వర్త మానములకు అతీతుడని, సర్వమూ ఆయన కనుసన్నలయం దు నడయాడునని ఉద్ధవునకు తెలియుట ఒక రహస్యము. ద్వారక ఒక దివ్య ధామము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఒక సామాన్య గృహస్థుగా ఉండెడివాడు. నిత్య నైమిత్తిక కర్మ లను ఆచరించవలసిన అవసరము లేకున్ననూ తన ప్రజలకు ఆదర్శమైయుండుటకు అన్నియూ నిర్వర్తించెడివాడు.తన రాజ్య పరిపాలనకు తన శక్తి చాలునని తెలిసిననూ అం దరి సహాయమును, సలహాలను తీసుకొనెడివాడు. అనంత మైన కృష్ణలీలలను తెలుసుకొనుటకు మానవ మేధ సరిపోదు. ధర్మసంస్థాపనే ధ్యేయమైన ఆయన నిర్ణయాలు అమోఘమై నవి, సూక్ష్మమైనవి. ధర్మముననుసరించియే దుష్టశిక్షణ జరిగి నది. శ్రీకృష్ణుని కృపకు పాత్రులైన వారందరూ ఆత్మజ్ఞాన పరా యణులే! ధర్మానుసారులే!
సకల జీవ హృదయాంతర వాసి శ్రీకృష్ణభగవానుడు. పర మాత్మగా తన ఏకత్వమును విశ్వమంతయూ విస్తరించిన వాడు. పరిపూర్ణ ఆధ్యాత్మిక స్వరూపము. రాధాకృష్ణ తత్త్వము ను చైతన్యముగా చూసిన జగద్గురువు. రుక్మిణీమాతతో కలసి ఆదర్శ జీవన మార్గమును అందించిన పరాత్పరుడు. అట్టి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరితమున చైతన్యవంతమైన, అను సరణీయమైన జ్ఞానమును గ్రహించి ముక్తి ని పొందుట మన వివేకము.
కృష్ణుని నోట ఒక విచిత్రమైన మాట వినిపిస్తుంది. ఫలాపేక్షతో అజ్ఞానులు ఏ విధంగా కర్మలాచరిస్తారో, ఫలాపేక్ష లేకుండా అదేవిధంగా విద్వాంసులు కూడా కర్మలు చేయాలని చెప్పడం గొప్ప విషయం. చెడు కర్మలపై చెడ్డవారికెంత మక్కువ ఉంటుందో, మంచి పనులపై మంచివారికీ అంతే శ్రద్ధ ఉండాలని ఇక్కడ మనం గ్రహించవలసి ఉన్నది. అయితే, అజ్ఞానుల బుద్ధిని సన్మార్గంలో నడిపించడానికి, జ్ఞాని స్వయంగా ఆచరించి చూపాలిగాని, వారిబుద్ధిని భ్రమింపజేయరాదని చెప్పిన విషయం పండితులకు శిరోధార్యం. ‘న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినామ్’ ధర్మంగా చేపట్టిన పని శ్రేష్ఠమైంది అయినా, కాకపోయినా తప్పక చేయవలసిందేనని, ఒకవేళ మరణం సంభవించినా స్వధర్మంలోనే నిలవడం శ్రేయస్కరం అని కృష్ణుడు చాటిచెప్పాడు. పురుషోత్తముడు, యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు నడిచిన, చూపిన మార్గంలో నడిచేవారు అదృష్టవంతులు. ఫలాపేక్ష లేకుండా వేద విహిత కర్మలు చేసేవారు జీవన్ముక్తులు.
No comments:
Post a Comment