Wednesday, September 18, 2024

 *🌹కలికాలంలో జరిగే యదార్థ సంఘటనలు*

                 *పంచ పాండవులలో ఒకరైన సహదేవుడు ఒకరోజు గుఱ్ఱముల సంతలోకి వెళ్లారు. ఆ సంతలో అతను ఒక అందమైన గుఱ్ఱమును  చూసారు. అరెరె ఇంత అందమైన గుఱ్ఱమును నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఎలాగైన సరే నేను ఈ గుఱ్ఱమును ఎంత ధరకైనా కొనాలి ఆనుకొని గుఱ్ఱం యజమాని గారిని గుఱ్ఱం ధర ఎంత అని అడిగారు.*

           *గుఱ్ఱమును నేను ఎవరికి అమ్మను కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారో వారికి నా గుఱ్ఱమును ఉచితంగా ఇస్తాను అని చెప్పారు. సహదేవుడు సరే నన్ను అడుగు ఎటువంటి ప్రశ్నలకైన నేను సమాధానం చెపుతాను అని చెప్పారు.*

            *దానికి గుఱ్ఱం యొక్క యజమాని, సరే నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుఱ్ఱమును ఉచితంగా తీసుకుని వెళ్లు అని ప్రశ్నలు అడుగుట మెదలుపెట్టారు.*

           *మెదటి ప్రశ్న:- ఒక పెద్ద బావి ఉంది. ఆ పెద్ద బావి లోని నీటిని తీసుకుని వెళ్లి ఏడు చిన్న బావులలో పెద్ద బావిలోని నీటితో నింపవచ్చు కానీ ఆ ఏడు చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము ఎందుకు అని అడిగారు. మరల గుఱ్ఱం యొక్క యజమాని, బాగా ఆలోచించి నాకు సమాధానం చెప్పండి అని అడిగారు.*

             *సహదేవుడు కొంచెం సమయం దాకా బాగా ఆలోచించిన కూడా సమాధానం చెప్పలేకపోయారు. చేసేది ఏమి లేక అక్కడే ఉండి పోయాడు. కొంచెం సమయం తరువాత నకులుడు సహదేవుడు ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ సహదేవుడు ఉన్న గుఱ్ఱముల సంతకు చేరుకున్నారు.*

             *సహదేవుని చూసిన నకులుడు ఎందుకు ఇక్కడ కూర్చుండి పోయావు అని అడిగారు. దానికి సహదేవుడు ఆ గుఱ్ఱం మరియు గుఱ్ఱం యొక్క యజమాని గురించి నకులునికి వివరంగా చెప్పారు. ఆ గుఱ్ఱమును చూసిన నకులుడు ఆశ్చర్యపోతూ , సహదేవ నీవు చెప్పినట్లు ఈ గుఱ్ఱం ఎంత అందంగా ఉంది. ఎలగైనా సరే దీనిని మనం మన రాజ్యానికి తీసుకుని వెళ్లాలి అని గుఱ్ఱం యొక్క యజమానిని నకులుడు కలిసి నన్ను అడుగు ఎటువంటి ప్రశ్నకైనా నేను నీకు సమాధానం చెప్పి ఆ గుఱ్ఱమును మా అన్నయ్య సహదేవునికి బహుమతి గా ఇస్తాను అని చెప్పారు.*

               *గుఱ్ఱం యొక్క యజమాని సరే నీవైనా జాగ్రత్త గా ఆలోచించి సమాధానం చెప్పు అని రెండవ ప్రశ్నను అడిగారు.*

           *రెండవ ప్రశ్న :- మనము బట్టలు కుట్టటం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా పెద్ద ఏనుగు ఇవతలి వైపు నుండి రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లింది కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రంద్వారా వెళ్ల లేకపోయింది . అది ఏమిటి అని అడిగారు.*

               *ఈ ప్రశ్నకు నకులుడు సమాధానం చెప్పలేకపోయారు. చేసేదేమీ లేక సహదేవుడు మరియు నకులుడు ఆ సంతలో ఉండి పోయారు. ఎంతసేపటికి తమ్ముళ్ళిద్దరూ రాజ్యానికి రాక పోయేసరికి కంగారుగా ధర్మరాజు భీముని పిలిచి తమ్ముళ్ళిద్దరిని వెతుక్కుని ఎక్కడ ఉన్నా రాజ్యానికి తొందరగా తీసుకుని రావాలి అని చెప్పారు.*

                 *అన్నగారు మాట ప్రకారం భీముడు తమ్ముళ్ళిద్దరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి తమ్ముళ్ళిద్దరిని ఒక సంతలో చూసి, వారితో ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు అని అడిగారు. అన్నయ్య ధర్మరాజు గారు చాలా కంగారు పడుతున్నారు. వెంటనే రాజ్యానికి బయలుదేరి వెళదాము అనగానే తమ్ముళ్ళిద్దరూ అక్కడ వారు ఎందుకు ఉన్నారో వివరంగా చెప్పారు.*

             *అంతా వినిన భీముడు గుఱ్ఱం యొక్క యజమాని గారిని కలిసి నేను మీ ప్రశ్నలకు సమాధానాలు చెపుతాను అన్నారు. గుఱ్ఱం యొక్క యజమాని చూడండి నేను వేసిన రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీ తమ్ముళ్ళిద్దరూ ఓడిపోయారు. కావున నీవు బాగా ఆలోచించి సమాధానం చెప్పాలని అన్నారు. దానికి సరే అన్నారు భీముడు.*

            *మూడవ ప్రశ్న :- ఒక పొలంలో ధాన్యం బాగా పండింది. ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్టులు ఉన్నాయి. ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది. అది ఎలా అని అడిగారు. భీముడు కూడా సమాధానం చెప్పలేకపోయారు. తమ్ముళ్ళిద్దరిని రాజ్యానికి తీసుకుని వెళ్లి జరిగింది జరిగినట్లు అన్ని అన్న ధర్మరాజు గారు కి వివరంగా చెప్పారు.*

            *అన్న ధర్మరాజు గారు ఆ ప్రశ్నలన్నీ వినిన తరువాత చెమటలు పట్టి భయపడ్డారు. అన్నగారిలోని భయాన్ని చూసిన తమ్ముళ్ళందరూ ఏమిటి అన్నయ్య మీరు సమాధానాలు చెప్పలేక భయపడుతున్నారా అనగానే, అన్నయ్య ధర్మరాజు గారు నేను భయపడుతుంది సమాధానాలు చెప్పలేక కాదు. మిమ్మల్ని ఆ ప్రశ్నలన్నీ అడిగింది కలిపురుషుడు. అతను కలికాలం లో జరిగే యధార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగారు.*

           *మెదటి ప్రశ్నకు సమాధానం. పెద్ద బావి అనేది తల్లి తండ్రులు. ఏడు చిన్న బావులనేవి వారి పిల్లలు. తల్లి తండ్రులు ఎంత మంది పిల్లల కైనా ప్రేమ ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు. కానీ అదే తల్లి తండ్రులు వృద్ధులు అయినా తరువాత ఆ ఏడుగురు పిల్లలు తల్లి తండ్రులను భారంగా చూస్తారు.*

              *రెండవ ప్రశ్నకి సమాధానం . ఏనుగు అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు. ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు.*
 
              *ఏనుగు రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరక్కుండా రంధ్రం ద్వారా వెళ్లిపోతారు. కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోక లాగా ఇరుక్కు పోతారు.*

              *మూడవ ప్రశ్నకు సమాధానం. ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గట్టులు అంటే అధికారులు. ఎంతమంది అధికారులు ఉన్న ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేస్తారు. ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియ చేసారు అని ధర్మరాజు గారు తమ్ముళ్ళందరకూ వివరంగా చెప్పారు.*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

No comments:

Post a Comment