Sunday, November 7, 2021

నేటి జీవిత సత్యం. జ్ఞానఫలం

నేటి జీవిత సత్యం. జ్ఞానఫలం

ఒక విషయం తెలిసి ఉండటమన్నది జ్ఞానం. అది ఎరిగి ఉండకపోవడం- అజ్ఞానం.

చీకటిలో పయనమైన బాటసారి దారీ తెన్నూ తెలియక ఉన్నచోటే ఉండిపోతాడు. ఆ చీకటి ప్రదేశంలో పలు ప్రమాదాలు జరగవచ్చు. ప్రాణాపాయమూ కలగవచ్చు. అదేరీతిన జ్ఞానాంధకారంలో మిగిలిపోయిన మనిషి జీవన పయనంలో ముందుకు వెళ్ళలేడు.

చెట్టుకు పట్టిన చీడ వృక్షాన్నంతా తొలచివేసినట్లు అరిషడ్వర్గాలూ మనిషి లోపలి శక్తిని పీల్చి నాశనం చేస్తాయి. ఫలితంగా చెడు తలంపులతో సమాజానికి కీడు తలపెట్టజూస్తాడు. శిక్షార్హుడవుతాడు. అంతిమంగా దుఃఖం బారిన పడతాడు.

పుట్టుకతో మనిషిలో చైతన్య శక్తి నిగూఢంగా దాగి ఉంటుంది. సూక్ష్మాతిసూక్ష్మంగా ఉన్న ఆ పరాశక్తి రహస్య నిధే ‘సత్యం, జ్ఞానం, అనంతాల’ మూట. దాని ముడి విప్పే సాధనమే విద్య. అంటే, నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం. ప్రాచీన కాలంనాటి గురుకులాల నుంచీ ఆధునిక విశ్వవిద్యాలయాల ద్వారా జరుగుతున్న ప్రక్రియే అది!

జ్ఞానం అనేది ఆలోచనా శక్తి కలిగిన మనిషికి మాత్రమే సంబంధించింది అని అనుకుంటారు. కాని, ఈ విశ్వమంతా ఓ పెద్ద జ్ఞాన భాండాగారం.

పశుపక్ష్యాదులు, చెట్టు, పుట్ట, రాయి రప్ప... ఇవన్నీ జ్ఞానంతో నిండి ఉన్నవే. మానవేతర జీవులకూ ఆలోచన ఉంటుంది. అయితే చాలా తక్కువ. కాని, గమనింపు ఎంతో ఎక్కువ. ఎటువైపు వెళితే ఆహారం దొరుకుతుందో వాటికి బాగా తెలుసు. నేరస్థుల్ని పట్టుకునేందుకు కొన్ని జంతువులకు శిక్షణ ఇస్తారు. అంటే, వాటికీ జ్ఞానం/జ్ఞాపకశక్తీ ఉంటాయనే కదా అర్థం.

మనిషి జ్ఞాన శిఖరాగ్ర భాగం చేరుకున్నప్పుడు ‘మనసు’ మాయ మవుతుంది. అప్పుడు ‘ప్రేమ’ పురి విప్పుకొంటుంది. ‘ఆనందం’ శివతాండవం చేస్తుంది.

ధ్యానానికి పరాకాష్ఠ- ‘సమాధి.’ ఈ స్థితిలో ఏ ఆలోచనా ఉండదు. కేవలం ప్రేమానందాలు విరాజిల్లుతుంటాయి. ప్రేమ అంటే…, ఇవ్వడం.
అందుకే ఏ ఆలోచనలూ లేని { లాభనష్టాల బేరీజు వేసుకోలేని } చెట్లు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటాయి.

కారణం, అవి ధ్యానంలో ఉండటమే. చెట్లు సేవించడం వల్లే భూమ్మీద సకల ప్రాణులు హాయిగా జీవిస్తూ మనగలుగుతున్నాయి.

‘అజ్ఞానం’- జడంగా, స్తబ్ధంగా ఉంటుంది. జ్ఞానం ఏ రూపంలో ఉన్నా { అంటే ప్రాపంచిక జ్ఞానమైనా పారమార్థిక జ్ఞానమైనా } అది విశ్వవ్యాపితం కావాలనే చూస్తుంది. దాని స్వభావం అంతటా చేరాలనుకోవడం. సహజ లక్షణం బాధ్యతయుతంగా ఉండాలనుకోవడం. అందుకే, నేర్చుకున్న ఒక పని ఎంత చిన్నదైనా సరే! ఆ పని చెయ్యకుండా మనిషి ఉండలేడు. ఎందుకంటే, జ్ఞానం మనిషిని నిలవనీయదు. అది సేవ చెయ్యాలని ముందుకు తరుముతుంది. అలా ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఇంకొకరికి సేవలందిస్తూ ఉన్నారు. జ్ఞానం పంచుతూ ఉన్నారు. సాంఘిక జీవనంలోని అసలు రహస్యమదే.

కష్టజీవులు, కళాకారులు, వైద్యులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు... ఇలా ఎందరో వారివారి రంగాల్లో సేవలందిస్తూ తరిస్తున్నారు. జీవితాన్ని సార్థకం చేసుకోజూస్తున్నారు.

జ్ఞానోదయమయ్యాక బుద్ధుడూ అంతిమ సత్యం బోధించడానికి ఊరూరా తిరిగాడు.
వివేకానందుడు అగ్రరాజ్యాల్లో పర్యటిస్తూ ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లుతాడు.

ఆధునిక తత్వవేత్తలు జిడ్డు కృష్ణమూర్తి, ఓషో రజనీష్‌లు వారు పొందిన జ్ఞానాన్ని ప్రపంచానికి పంచారే తప్ప వారి వద్దే ఉంచుకోలేదు.

చెట్టు చివరి లక్ష్యం- కాయలు కాయడం. ఆ ఫలాలు చిటారు కొమ్మన లభిస్తాయి. వాటిని అందుకున్నప్పుడే జీవుల ఆకలి తీరుతుంది.

ఏకాగ్ర చిత్తంతో, కర్మయోగతో, ధ్యానసాధనతో జీవన పయనమయ్యే మనిషి అంతిమ లక్ష్యం- అంతిమ సత్యం తెలుసుకోవడం.

అందుకు ‘జ్ఞానఫలం’ పొందడం ఒక్కటే
ఆఖరి మార్గం.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment