Sunday, August 7, 2022

శీలమంటే పారదర్శకత

శీలమంటే పారదర్శకత

నిద్రలో తానున్నానని తనకు తెలియకపోయినా తానున్నాడు.

యెందుకంటే మెలకువ రాగానే నేను హాయిగా నిద్రపోయాను అంటాడు.

'హాయి'ని అనుభవించేవాడు అక్కడ ఒకడు ఉండే ఉండాలి.

నిజానికి ఆ 'హాయే' తాను.
మెలకువలో ఉండి, హాయిని కోరేవాడు కాదు తాను.

ఆ 'హాయే' ఆత్మ, భగవంతుడు....ఇత్యాది పేర్లతో పిలువబడుతున్నాడు.

ఆ 'హాయి'గా ఉన్న తానే...
ఆ ఏకంగా ఉన్న తానే....
చెదరి... కదలి...మనసుగా మారి...
మెలకువలోకి...కలలోకి జారి...
ఈ ప్రత్యేకమైన తానుగా 
అనగా పరిమితమైన తానుగా...
జగత్తుగా విస్తరిల్లాడు.... 

ఏకంగా ఉన్న తానే అనేకం ఐన సంగతిని మరిచి...
ఆ అనేకంలో ఏదో ఒక నామరూపాలు కలిగిన దేహాన్ని మాత్రమే తానని అభిమానించి...
దానితో మమేకం అయ్యి... 
అది మాత్రమే తానని వ్యవహరిస్తూ...
జీవిస్తూ...
నానా అవస్థలు పడుతున్నాడు...
ఇదంతా మరపు వలన వచ్చిన అవస్థలే...

మరపుతో ఉన్న అవస్థలే - జాగ్రత్-స్వప్న-సుషుప్తులు.

ఎరుకతో ఉన్న అవస్థే - తురీయం.

* * *

నిద్రలో ఉన్న హాయిని,
మెలకువలో ఉన్న ఎరుకను
అనుసంధానం చేసే ప్రక్రియే - ధ్యానం.

* * *

స్వస్వరూపమైన ఆ 'హాయి'ని తిరిగి పొందటానికి 
జీవుడు గురువును ఆశ్రయిస్తాడు...

గురువు అంటే తనకు విడిగా ఉన్న ఓ వ్యక్తి అని కాదు...
తనలోనే, తనకు అభిన్నంగా  ఉన్న ఓ 'ప్రజ్ఞ' అది.

యెప్పటికీ అలా తాను మరపులో ఉండకుండా
మళ్లీ తానెవరో గుర్తుకు తెచ్చే ఆ ప్రజ్ఞయే 'గురువు'.

కొందరికి ఆ గురువు పైకి ఓ వ్యక్తిలాగే కనబడవచ్చు...

కొందరికి ఆ గురువు పైకి కనబడకపోవచ్చు...

ప్రజ్ఞయే సాకారంగా ఉంటే - గురువు.
ప్రజ్ఞయే నిరాకారంగా ఉంటే - ఈశ్వరుడు.

గుర్తుకు తెచ్చేవాడు గురువు.
వస్తువు ఇచ్చేవాడు కాదు.

నీదే, నీవే అయిన ఆత్మవస్తువును 
గురువూ ఇవ్వలేడు, దేవుడూ ఇవ్వలేడు.
నిన్ను నీలోలోపలికి(ధ్యానంలోకి) త్రోయడం తప్ప.

* * *
అనంతమైన వస్తువు - సద్వస్తువు.
అది 'నేను'గా ఉంటుందేగాని 'నేను' అని అనదు, అనుకోదు.

పరిమితమైన ప్రతి వస్తువూ జడమే.
జడవస్తువు 'నేను' అని అనదు, అనుకోదు.

* * *

సద్వస్తువు 'నేను' అనదు - అన్యము లేక.
జడశరీరము 'నేను' అనదు - ఉనికి లేక.

ఈ మధ్యలో, ఈ రెంటి స్పర్శతో, దేహపరిమాణంలో
'నేను' అని ఒకటి పుడుతోంది.

* * *

విమానం జడం - పైలట్ లేకుండా ఎగురదు.
పైలట్ చైతన్యం - విమానం లేకుండా ఎగురలేడు.
ఈ రెంటి కలయిక వలననే విమానం ఎగురుతుంది.

శివ-శక్తుల కలయికే ఈ సృష్టి చలనానికి మూలం.

* * *
కాబట్టి జీవుడు -
పూర్తిగా జడమూ కాదు,
పూర్తిగా చైతన్యమూ కాదు.

జడ-చైతన్యముల కలయికే జీవుడు...
అదే చిజ్జడగ్రంథి...
అదే బంధము...
అదే జీవుడు... 
అదే సూక్ష్మశరీరము...
అదే అహంకారము...
అదే సంసారము...
అదే మనస్సు...

* * *
మా మేనమామగారి అబ్బాయి ఆనంద్ అడిగాడు-

మహనీయులు భారతదేశంలోనే యెందుకు పుడుతుంటారు? విదేశాల్లో అటువంటి పుట్టుకలు యెందుకు జరగడం లేదు? అని.

* * *

ఓ పదహారేళ్ల కుర్రవాడు(రమణుడు) దేవునికోసమని ఇల్లు వదిలి
అరుణాచలం చేరి, ధనం, వస్త్రం పరిత్యజించి
కేవలం  "గోచీతో నిలబడడం" అనే అద్భుతమైన ఘట్టం
నాకు రోజులో ఒక్కసారైనా గుర్తుకువస్తుంటుంది.

ఆ పదహారేళ్ల కుర్రవాడే - భగవాన్ శ్రీరమణ మహర్షి.

చదివింది ఫిఫ్త్ ఫామ్. 
కానీ పండితులకు, పీఠాధిపతులకు సైతం అవగతం కాని తాత్త్విక విషయాలెన్నింటినో బోధించారు.

ఎలా వచ్చింది ఆ కుర్రాడికి ఆ శక్తి? ఆ జ్ఞానం?

ఓ పువ్వు పుట్టినట్టు, ఓ మెరుపు మెరిసినట్టు
జ్ఞాని అలా పుడతాడు సహజంగా.

జ్ఞానికావడానికి-
కోచింగ్ సెంటర్లు లేవు,
text books లేవు,
రిజర్వేషన్లు లేవు,
రెకమెండేషన్లూ లేవు.

ఈ పవిత్ర భారతభూమిలో అటువంటి జ్ఞానవృక్షాలు సహజంగా ఎదగడానికి అవసరమైన "సారం" ఏదో ఉంది.

ప్రతి దశాబ్దంలోనూ అటువంటి మహనీయులు అవతరించడం చూస్తూనే ఉన్నాం.

అది మన భారతీయ ధార్మిక జీవన విధానమే
 ఆ "సారం".

అలా మహనీయుడు పుట్టని దశాబ్ధం ఉన్నదంటే
ఈ భూమికి "చేవ" చచ్చినట్టు.

యుగాలపర్యంతం వస్తున్న ఆ చేవను
అలాగే మనం భవిష్యత్తరాలవారికి మనం అందివ్వాలంటే ఏకైక మార్గం - ధర్మాచరణం.

ధర్మాచరణ యొక్క దివ్యఫలమే భగవదనుగ్రహంగా,
అవతారమూర్తిగా ప్రకటనమౌతుంది ప్రపంచంలో.

ధర్మాచరణ అంటే శీలం.
శీలం అంటే పారదర్శకత (Transparency)

పారదర్శకత అంటే-
నీవు నీ లోపల ఏదో
బయట కూడా అదిగానే ఉండడం.

* * * 

No comments:

Post a Comment