*కర్ణుడిని ఏ అస్త్రంతో…*
*సంహరించారు?*
```
విలువిద్యలో అర్జునుడితో సమానుడు. మహా భారత భీకర యుద్ధంలో చివరికంటూ పోరాడినవాడు. ఒకానొక దశలో అర్జునుడిపై పైచేయి సాధించిన కుఱుసేనాధిపతి.. కర్ణుడు.
అన్ని అస్త్రాలు సంధించినా నేలకొరగని ఆ మహావీరుడు.. ఎలా నేలకొరిగాడు? అర్జునుడు ఇంతకీ
ఏ అస్త్రం ప్రయోగించాడు?
మహాభారత యుద్ధంలో ద్రోణుని మరణం అనంతరం కుఱుసేనాధిపతిగా కర్ణుడు బాధ్యతలు స్వీకరించాడు.
విలువిద్యలో అర్జునుడితో సరిసమానుడు కావడం..
కౌరవ చక్రవర్తి సుయోధనుడికి అనుంగుమిత్రుడు కావడంతో
కౌరవ శ్రేణుల్లో కర్ణుడంటే విపరీతమైన అభిమానం ఉండేది.
అస్త్ర విద్యల్లో అర్జునుడితో పోటీపడగలవాడు కావడంతో కౌరవ శిబిరంలో ఆనందం తాండవించింది.
మహాభారత యుద్ధంలో 17వ రోజు అర్జున, కర్ణుడి మధ్య భీకర యుద్ధం జరిగింది. సమవీరుల మధ్య జరిగిన పోరును యావత్ విశ్వం ఆసక్తిగా వీక్షించింది. అస్త్రశస్త్రాలను ఇరువురు సంధించుకుంటున్నారు. ఒక అస్త్రానికి మించిన అస్త్రాలు వేస్తున్నారు.
ఇంతలో కర్ణుడు హఠాత్తుగా నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. అశ్వసేనుడు అనే నాగకుమారుడు సర్పముఖ బాణాకారంలో ఉన్నాడు. ఖాండవ వన దహనంలో అశ్వసేనుడు బాధితుడు. అర్జునుడిపై పగ తీర్చుకునేందుకు అస్త్రంగా మారి కర్ణుడి వద్దకు చేరాడు. వెలుగులు చిమ్ముతూ వస్తున్న నాగాస్త్రాన్ని చూసిన శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని నేలలోకి కుంగేట్టు కాలితో తొక్కాడు. భీకర వేగంతో వచ్చిన నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని పడగొట్టింది. ప్రాణాపాయం నుంచి మాత్రం బయటపడ్డాడు.
కర్ణుడిపై సవ్యసాచి వరుసగా అస్త్రాలు వేస్తున్నాడు. గాయాలబారిన పడుతున్నప్పటికీ కర్ణుడు వాటిని ఎదుర్కొంటూ బాణాలతో జవాబు చెబుతున్నాడు. ఈ సమయంలోనే కర్ణుడి రథం నేలలోకి కుంగిపోయింది.
ఎడమ వైపు చక్రం నేలలోకి దిగడంతో ఎత్తేందుకు కిందకు దిగాడు.
రథం కుంగడం శాప ప్రభావమే. అప్పటికే పరశురాముడు గతంలో ఇచ్చిన భార్గవాస్త్రం అతడికి గుర్తురాలేదు.
‘రథాన్ని ఎత్తేంత వరకు బాణాలు ప్రయోగించొద్దు.. ఇది యుద్ధధర్మం కాదు’ అని అర్జునుడిని కోరాడు.
అంతలో అర్జున రథ సారథి శ్రీకృష్ణుడు బదులిస్తూ.. “పాండవులు బస చేసిన లక్క ఇంటిని కాల్పించి, మాయా జూదంతో వారి సంపదను అపహకరించి.. ద్రౌపదిని నిండు సభలో అవమానించి.. బాలుడైన అభిమన్యుడిని చంపారు కౌరవులు. అప్పుడేమైంది ఈ న్యాయం?”అని ప్రశ్నించాడు.
చివరగా అర్జునుడు ‘అంజలికం’ అనే మహా అస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణ సుదర్శనం, మహదేవుడి శూలంతో సరిసమానమైన అస్త్రమది.
‘నేనే గనుక తపస్విని, గురువులకు సేవలతో సంతృప్తి కలిగించేవాడిని, పుణ్య కర్మలను ఆచరించేవాడినయితే ఈ బాణం కర్ణుడి తలను సంహరిస్తుంది’ అని ప్రతిజ్ఞ చేసి అస్త్రం సంధించాడు.
వింటిని పూర్తిగా లాగి సంధించిన ‘అంజలికం’ వెలువరించిన కాంతులతో ఇరు పక్షాలు భీతిల్లాయి. అత్యంత వేగంగా వెళ్లిన అంజలికం కర్ణుని శిరస్సును ఖండించింది. అస్తమిస్తున్న సూర్యుడి వలె కర్ణుడి తల కిందపడగా అతని దేహం నుంచి అత్యంత ప్రకాశమైన కాంతిపుంజం వెలువడి సూర్యుడిని చేరింది.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment