Thursday, November 20, 2025

 1️⃣0️⃣1️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

       *4. జ్ఞాన యోగము.* 
     (నాలుగవ అధ్యాయము)

కాబట్టి ఈ మానవులను ఒక క్రమపద్ధతిలో పెట్టవలసిన అవసరం కలిగింది పరమాత్మకు. ఎవరి పని వాళ్లు చేయాలని నియమ నిబంధనలు అవసరము అయ్యాయి. దానికి ఒక ప్రణాళిక అవసరము అయింది. ఆ ప్రణాళిక పేరు వర్ణవ్యవస్థ.

(కాని మానవుడు ఈ వర్ణవ్యవస్థను కూడా తన స్వార్థానికి వినియోగించుకుంటూ మనిషి మనిషికీ అడ్డుగోడలు కట్టాడు. అగ్రవర్ణాలనీ, దళిత కులాలనీ విభజించి విద్వేషాలు రెచ్చగొట్టాడు. విద్య, ఉద్యోగం, వివాహం ఈ వ్యవస్థలలో ఈ కులవివక్ష రాజ్యమేలుతూ ఉంది. కులఘర్షణలు, పరువు హత్యలు దీని వలననే జరుగుతున్నాయి.)

ఈ వర్ణవ్యవస్థ మనిషి మనిషికి మధ్య విభేదాలు కలిగించడానికి ఏర్పరచబడలేదు. మానవుడు ఆధ్యాత్మికంగానూ ఆర్థికంగానూ, సామాజికంగానూ అభివృద్ధిచెందడానికి ఏర్పరచబడ్డాయి.

(కాని కాలానుగుణంగా ఆ వర్ణవ్యవస్థ మనదేశంలో వికృతరూపం దాల్చింది. ఇతర దేశాలలో కూడా ఈ వర్ణవ్యవస్థ ఉంది. మనం ఇక్కడ బ్రాహ్మణులు అంటే విదేశాలలో ప్రీస్ట్ క్లాస్ అంటారు. క్షత్రియులను, వారియర్ క్లాస్ అంటారు. వైశ్యులను బిజినెస్ క్లాస్ అంటారు. శూద్రులను వర్కింగ్ క్లాస్ అంటారు. వ్యవస్థ ఒకటే. పేర్లుమార్పు)

కాబట్టి వర్ణవ్యవస్థ అంటే సమాజము సక్రమంగా నడవడానికి అభివృద్ధిచెందడానికి ఏర్పరచబడిన వ్యవస్థ అని అర్ధం చేసుకోవాలి. సమాజంలో ఏ వర్ణము ఎక్కువ కాదు. ఏ వర్ణము తక్కువ కాదు. అన్ని వర్ణముల వారు తమ పని తాము సక్రమంగా నిర్వర్తిస్తేనే సమాజం సజావుగా నడుస్తుంది. లేకపోతే అస్తవ్యస్తము అవుతుంది. ఉదాహరణకు వీధులు ఊడ్చే కర్మ చేసేవాడు ఒక రోజు రాకపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి అన్ని కర్మలు గొప్పవే. అన్ని కర్మలు పుణ్యకర్మలే. ఎవడూ తక్కువ కాదు. ఎవరూ ఎక్కువకాదు. కర్మలను బట్టి మానవులలో ఎక్కువతక్కువలు కల్పించడం అమానుషం.

ఈ వర్ణవ్యవస్థ గురించి పురుష సూక్తంలో ఉంది. పురుషసూక్తం ఋగ్వేదంలోది. ఋగ్వేదము అతి ప్రాచీనమైనది. అందులో ఈ వర్ణవ్యవస్థను అత్యంత నైపుణ్యంతో వర్ణించారు. బ్రాహ్మజోస్య ముఖమాసీత్ అంటే బ్రాహ్మణులు ముఖం నుండి ఆవిర్భవించారు. ముఖము ప్రదానంగా వాక్కు అంటే విద్యకు ప్రతీక. వేదవిద్య శాస్త్రవిద్య వీటిని అందరికీ బోధించి ఆచరింపజేసే పని బ్రాహ్మణులది. అందుకని బాహ్మనోస్య ముఖమాసీత్ అని అన్నారు. తరువాత బాహూరాజన్యకృతః అంటే రాజులు బాహుబలం కలిగి ఉండాలి. అప్పుడు రాజ్యరక్షణ, దేశరక్షణ, ప్రజల రక్షణ చక్కగా చూడగలరు. శరీరంలో శక్తి కలిగి ఉండేవి బాహువులు. అందుకే బాహు బలము అని అన్నారు. అందుకే బాహువులను క్షత్రియులకు ప్రతీకగా చెప్పారు. ఊరూ తదస్యయద్వైశ్యః అంటే వైశ్యులు మన శరీరంలో ఊరువులతో అంటే తొడల భాగంతో సమానము, శరీరాన్ని మోసేది తొడల బాగం. అది బలంగా లేకపోతే నిలబడలేడు. సమాజానికి ధనము, ధాన్యము, ఐశ్వర్యము సమకూర్చేది వైశ్యులు. ఈ సమాజానికి తొడలవంటి వారు తరువాత పద్భ్యాగ్o శూద్రో అజాయత. శూద్రులు పాదముల వంటి వారు. ఎక్కడికిపోవాలన్నా, ఏపని చేయాలన్నా గతిమంతములైన పాదములే శరణ్యము. అందుకని శరీరంలో పాదముల ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. తల్లి, తండ్రి, గురువు, దైవము వీరి పాదములకు నమస్కరిస్తాము. సమాజం సక్రమంగా నడవాలంటే విరాట్ పురుషుని పాదములలో నుండి ఉద్భవించిన శూద్రులే ముఖ్యము.

కాబట్టి అన్ని వర్ణములు సమానమైనవే. ఒకటి ఎక్కు మరొకటి తక్కువ కాదు. దేని ప్రాధాన్యత దానిదే అని తెలుసుకోవాలి. అందుకనే విరాట్పురుషుని శరీరంలోని ముఖ్యమైన నాలుగు భాగాలు(తల, చేతులు, తొడలు, కాళ్లు) నాలుగు వర్ణాలకు ప్రతీకలుగా వర్ణించారు. వీటిలో భేదాలు కల్పించడం మన అజ్ఞానానికి పరాకాష్ఠ. కాలిలో ముల్లుగుచ్చుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. చెయ్యి ఆ ముల్లు తీయడానికి ప్రయత్నిస్తుంది. తొడలు మోకాళ్లు వంగి చేతులకు కాళ్లు అందేటట్టు చేస్తుంది. అవయవాలు అన్నీ ఒకదానితో ఒకటి ఇలా సహకరించుకుంటాయి. మనమే తిన్నది అరక్క కులాల పేరుతో దెబ్బలాడుకుంటున్నాము.

ఇంతెందుకు ప్రతి మనిషిలోనూ నాలుగు వర్ణాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. ఎలాగంటే, పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు, నీతి వాక్యాలు చెప్పేటప్పుడు, సాటి వారికి నాలుగు మంచి మాటలు చెప్పేటప్పుడు అతడు బ్రాహ్మణుడు. ఎవరైనా తన మీదికి కానీ, తన కుటుంబం జోలికి గానీ వస్తే, ధైర్యంగా ముందుకు దూకినపుడు, అతడు క్షత్రీయుడు. తన కుటుంబానికి ధనం సంపాదించేటప్పుడు, వ్యవసాయం, వ్యాపారం చేసేటప్పుడు వైశ్యుడు. ఉద్యోగం చేసేటప్పుడు సమాజ సేవ చేసేటప్పుడు శూద్రుడు. అంటే ప్రతి మనిషిలో నాలుగు వర్ణాలు ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు

సందర్భానుసారంగా మరొక విషయం కూడా చెప్పుకుందాము. మానవులను, వారి వారి గుణములు, చేసే కర్మలతోపాటు జాతి ప్రకారంగా కూడా విభజించవచ్చు. కాని పరమాత్మ ఆ విషయం చెప్పలేదు. కేవలం వారి గుణములను బట్టి, కర్మలను బట్టి మాత్రమే వర్ధ వ్యవస్థను ఏర్పాడు చేసాడు. కాని ఈ నాడు కేవలం పుట్టుకతో మాత్రమే కులమును నిర్ణయిస్తున్నాము. జాతి అంటూ పుట్టుకతో వచ్చేది. జ అంటే పుట్టుక. ఒక వ్యక్తి తన గుణము ప్రకారము గురువుగా ఉన్నాడు. పురోహితుడుగా ఉన్నాడు. ఆయన గుణబ్రాహ్మణుడు. ఆయనకు పుట్టిన కుమారుడు కూడా బ్రాహ్మణజాతికి చెందినవాడు కావాలి. కాని ఆయన క్షత్రియ గుణములు అలవరచుకుంటాడు. అటువంటప్పుడు ఆయన జాతిరీత్యా బ్రాహ్మణ జాతి అయినా గుణములో క్షత్రియుడు.(పరశురాముడు, ద్రోణుడు, అశ్వత్థామ.) అలాగే జాతి రీత్యా క్షత్రియుడు అయినా గుణముల రీత్యా బ్రాహ్మణత్వము స్వీకరించి బ్రహ్మర్షి అయ్యాడు. ఆయనే విశ్వామిత్రుడు. కృష్ణుడు కూడా జన్మతః క్షత్రియుడు. కానీ శూద్రవృత్తి అయిన సారధ్యం చేసాడు. బ్రాహ్మణ వృత్తి అయిన వేదాంతం బోధించాడు. వైశ్యవృత్తి అయిన పశుపాలన, గోవులను కాయడం చేసాడు. కాబట్టి ఒకే వ్యక్తిలో అన్ని గుణాలు ఉండవచ్చు. ఈ నాడు మనలో కూడా పుట్టుక రీత్యా బ్రాహ్మణుడు అయి ఉండి, వ్యాపారం చేస్తుంటే అతడు గుణ,కర్మ వైశ్యుడు. రక్షణ, పరిపాలనా రంగంలో ఉంటే గుణ,కర్మ క్షత్రియుడు. ఈ ప్రకారంగా గుణముల ప్రకారము వర్ణములు మారిన వారు ఈనాడు కూడా చాలామంది కనిపిస్తారు.

అంతా చెప్పిన తరువాత ఆఖరున పరమాత్మ ఒక మాట అన్నాడు. ఇది అంతా నేనే చేసాను. ఈ వర్ణవ్యవస్థకు నేనే కారకుడిని, ఇది నా సృష్టి కాని నేను ఏమీ చేయలేదు. నన్ను ఏమీచేయని వాడిగా, దీనితో ఏమీ సంబంధం లేనివాడిగా భావించు అని అన్నాడు. ఈ విరుద్ధ భావాల అంతరార్థాన్ని తరువాతి శ్లోకంలో వివరించాడు పరమాత్మ.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P238

No comments:

Post a Comment