ఈరోజు ప్రశాంతత అంటే ఏమిటో తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ తమ జీవితకాలంలో ఎన్నో కోరికలుంటాయి. కాలానుగుణంగా మరికొన్ని కలుగుతూంటాయి. ఎవరి వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు వారికి, వేర్వేరు దశల్లో వేర్వేరుగా ఉంటాయవి.
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు. అది ధనంతో కొనగలిగేది కాదు. ఎవరో దయతలచి ఇస్తే ప్రశాంతత రాదు. ఎవరికి వారు ప్రయత్న పూర్వకంగా సంపాదించుకోవాల్సిందే. రాజైనా, పేదైనా ఎలాంటి వారి విషయంలో నైనా దీనికి మినహాయింపు లేదు. అప్పట్లో మునివాటికలు, రుష్యాశ్రమాలు లాంటివి ఏర్పాటు కావడంలోని ఆంతర్యం అదే.
ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా ప్రశాంతత ఉంటే చాలని, జీవితానికి అంత కంటే కావాల్సింది మరేమీ ఉండదని చాలామంది భావిస్తారు.
ఎన్ని సంపదలు, -సౌఖ్యాలు, బంధుమిత్రులు ఉన్నా ప్రశాంతత లేకపోతే ఆ జీవితం నిరర్ధకం. అందుకే. ప్రశాంతత కోసం ఎంత ఖర్చు చేయటానికైనా వెనకాడరు. దేన్ని విడిచి పెట్టడానికైనా సిద్ధపడతారు. ప్రశాంతత కావాలనే కోరిక సైతం ప్రశాంతంగానే కోరుకోవాలి. అంతేతప్ప దానికోసం ఆతృతపడితే ప్రశాంతత.. బదులు అశాంతి నెలకొంటుంది. ప్రశాంతత కోసం ఎంత దూరమైనా (తీర్ధయాత్రల పేరుతో పుణ్యక్షేత్రాల దర్శనానికి, వివిధ రకాల విహారాల పేరుతో...) ప్రయాణించడానికి కొంతమంది వెనకాడరు.
ప్రశాంతతల్లో అనేక రకాలు న్నాయి. వాటిలో శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ప్రశాంతతలు ముఖ్యమైనవి. కాయకష్టం చేసిన తరువాత కాసేపు సేదతీ రడం శారీరక ప్రశాంతత, దీన్ని విశ్రాంతి అంటారు. తీసుకోవలసిన దానికన్నా ఎక్కువైతే మాత్రం దాన్ని బద్దకం అంటారు. అది దరిద్రకారకం .దరిద్రం అలముకుంటే మిగిలేది అశాంతే.
అలసి సొలసి వచ్చాక కొద్ది క్షణాలపాటు ఏ ఆలోచనా లేకుండా స్థిరంగా కూర్చుంటే (దీన్నే ధ్యానమని పిలుస్తారు) అప్పుడు కలిగేది మానసిక ప్రశాంతత. దీనికి నియ మిత సమయమే కేటాయించాలి. అంతేకాని చుట్టూ ఏం జరుగుతున్నా తనకు పట్టనట్లు ప్రవర్తించడమో, ధ్యానమే ధ్యేయంగా, కొండ గుహల్లో సంవత్సరాల తరబడి అదే జీవిత సర్వస్వం అన్నట్టుగా ఉండకూడదు. అవసరమైన పనులు సైతం చేయకుండా తప్పించుకోవడం చెయ్యగలిగి ఉండీ అవసరమైన వారికి చేతనైన సహాయసహకారాలు అందించకుండా ప్రేక్షక పాత్ర వహించడం... బాధ్యతారాహిత్యం. అది పలాయనవాదానికి పరాకాష్ట
ఆలజడులు, ఆల్లర్లు వంటివి లేకుండా ప్రజలంతా ఒక్కటిగా, సుఖశాంతులతో గడపడమే సామాజిక ప్రశాంతత. సామరస్యం, సమత దాని లక్షణాలు .ఇలా ఉండటాన్ని సమసమాజం అంటారు. సమాజం ఈ స్థితిలో ఉండాలంటే ఎవరికి వారు తమ వ్యక్తిగత సంతోషాలు, స్వార్ధపూరిత ఆలోచనలు కొంతవరకైనా విడిచిపెట్టగలగాలి. ప్రతి ఒక్కరూ ఉమ్మడి ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వాలి. ఆశలు, కోరికలన్నీ విడిచి నిర్మలహృదయంతో కాలం గడపడాన్ని ఆధ్యాత్మిక
ప్రశాంతత అని పిలుస్తారు. వానప్రస్థాశ్రమ స్వీకరణ, భగవంతుడి ధ్యానం, విషయ వాంఛల విసర్జన, తీర్ధయాత్రాచరణ, సద్దంథ పఠనం, సత్కర్మాచరణల పైనే దృష్టి పెట్టడం ఆధ్యాత్మిక ప్రశాంతతకు దోహదపడతాయి. "ఎంత చేసినా మానసిక స్థితి సరిగ్గా లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ. పద్ధతులు అవలంబించినా వ్యర్థమే. కాబట్టి ప్రశాంతత కోరుకునేవారు ప్రధానంగా గమనించవలసింది మానసికంగా స్థిరంగా ఉండాలని.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment