Monday, October 13, 2025

 6️⃣5️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.* 

  *14. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవ:l*
 *యజ్ఞాద్భవతి పర్జన్యోయజ్ఞ: కర్మ పముద్భవ:ll*

*15. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్l*
 *తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ll*

ప్రాణులన్నీ అన్నము నుండి జన్మిస్తున్నాయి. అన్నము వర్షము వలన ఉత్పత్తి అవుతూ ఉంది. వర్షములు యజ్ఞములు చేయడం వలన కురుస్తున్నాయి. చేయవలసిన పనులు అంటే హోమములు మొదలగు కర్మలు యజ్ఞములకు మూలము. ఆ చేయవలసిన పనులు అన్నీ వేదములలో చెప్పబడ్డాయి. వేదములకు మూలము పరమాత్మ. ఆ పరమాత్మ సర్వవ్యాపి, అందరిలోనూ ఉన్నాడు. మానవుడు చేసే అన్ని కర్మలలోనూ స్థిరంగా ఉన్నాడు. ఇది ఒక చక్రము. నిరంతరము తిరుగుతూ ఉంటుంది.

ప్రాణులన్నీ అన్నము వలన జన్మిస్తున్నాయి అంటే అన్ని ప్రాణులు అన్నము అంటే వివిధములైన ఆహారములను తింటాయి. ఆ అన్నము జీర్ణమై, రక్తముగా, శక్తిగా మారుతుంది. ఆ రక్తము వీర్యముగా మారుతుంది. ఆ వీర్యములో జీవకణములు ఉంటాయి. మగవాడి వీర్యములో ఉత్పత్తి అయిన జీవకణములు స్త్రీనుండి విడుదలఅయిన అండముతో కలిసి పిండముగా మారుతుంది తొమ్మిది నెలలు శిశువుగా తయారవుతుంది. అంటే అన్నము నుండి ప్రాణులు జన్మిస్తాయి. ఈ అన్నము (ఆహారము) ఎలా వచ్చింది? మనకు పంటలు పండటం వలన వస్తుంది. పంటలు ఎలా పండుతాయి? వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. వర్షములు ఎలా కురుస్తాయి? వర్షములు యజ్ఞములు వలన కురుస్తున్నాయి. దీని గురించి మనుస్మృతిలో ఇలా చెప్పబడింది. “మనం హోమంలో వేసే ఓషధులు ధూమంగా మారి పైకి లేచి ఆకాశంలో ఉన్న మేఘములను తాకి వర్షం కురిపిస్తాయి. ఆ వర్షం వలన అన్నం లభ్యం అవుతుంది. అన్నం వలన జీవులు పుడుతున్నాయి." ఇక్కడ యజ్ఞము అంటే హోమము, నిత్య అగ్నిహోత్రము. ఎక్కడో ఒక చోట యజ్ఞ చేయడం కాదు. ప్రతి ఇంట్లో ఆ రోజుల్లో హోమాగ్ని వెలిగేది. ప్రతి ఇంట్లో ఉన్న అగ్నిలో వేసే ఓషధుల వలన రేగిన ధూమము ఆకాశంలోకి చేరి మనకు వర్షాలు కురిపించేవి. (ఇప్పుడు ఫాక్టరీల పొగ చేరి కాలుష్యం పెరుగుతూ ఉంది. వర్షాలను అడ్డుకుంటూ ఉంది.) ఈ ప్రక్రియ యజుర్వేదంలో కూడా చెప్పబడింది. కాబట్టి వేదాలలో చెప్పబడినట్టు ప్రతిరోజూ దేవతలను ఆహ్వానించడానికి హెమం చేస్తూ, ఓషధులను అగ్నిలో వేస్తే అవి ధూమంగా మారి మేఘాలను చేరి వర్షాలను కురిపిస్తే, వాటి వలన ఆహారం లభిస్తే, అది తిని సృష్టి అభివృద్ధి చెందితే, ఆ పుట్టినవాళ్లు మరలా హెూమాలు చేస్తారు. ఇదీ ఆహార సైకిల్. ఈ హెూమములలో పరమాత్మ ఉన్నాడు. ఈ సైకిల్ మొత్తం సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. అందుకే విష్ణువును యజ్ఞస్వరూపుడు అన్నారు. హోమం చేయడం, ఆ హోమంలో ఓషధులు వేయడం కూడా పరమాత్మను పూజించడమే. అగ్నిని హవ్యవాహనుడు అన్నారు. మనం అగ్నిలో వేసే ఓషధులు ధూమ రూపంలో పర్జన్యుడికి అందుతాయి. దానికి ప్రతిగా ఆయన వర్షాలు కురిపిస్తాడు. అంటే మనం వరుణ దేవుడిని పూజిస్తే మనకు సకాలంలో వర్షాలు కురుస్తాయి కానీ మేఘమధనం వలన కాదు. సూర్యుడిని సూర్యనారాయణుడు అన్నారు అంటే సూర్యుడు కూడా నారాయణ స్వరూపము. ఇక్కడ అగ్నితో చేసే హెూమం అంటే యజ్ఞం కూడా నారాయణ స్వరూపము. ఇప్పుడు హెూమాలు లేవు. యజ్ఞాలు లేవు. అందుకే అతి వృష్టి అనావృష్టి. మేఘాలను అదుపులో ఉంచే హెూమాలను మనం చేయడంలేదు. అక్కడక్కడా చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం వర్షపాతం ఉంది.

దీనినే ప్రకృతి ధర్మము, ఆహార చక్రం అని అంటారు. ధర్మము అంటే సమతుల్యము పాటించడం. అన్నిటినీ ధరించి ఉన్నది ధర్మము. ఏది ఎలా ఉండాలో నిర్దేశించేది ధర్మము. ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. అది ప్రకృతి ధర్మము. మనం చేసే కర్మలు కూడా ప్రకృతి ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి. కానీ ప్రకృతి ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేవిగా ఉండకూడదు. ఉదాహరణకు జీవకోటి జీవించాలి అంటే ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ కావాలి. ప్రాణవాయువు పీల్చుకుంటేనే మనం జీవించగలుగుతాము. ఆ పీల్చుకున్న ప్రాణవాయువు మరలా కార్టన్డయాక్సైడ్ గా మారి బయటకు వస్తుంది. అది ఏమవుతుంది. ఎవరు పీల్చుకోవాలి. చెట్లు, చెట్లకు ఉన్న పచ్చటి ఆకులు పీల్చుకుంటాయి. ఆ చెట్లు, చెట్ల ఆకులు మరలా మనకు ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఆ ఆక్సిజన్ మనం పీల్చుకుంటాము. ఇది ఒక సైకిల్. ప్రకృతి ధర్మము. ఈ ధర్మాన్ని మనం కూడా కాపాడాలి. కాని మనం ఏం చేస్తున్నాము చెట్లు అడవులు అన్నీ నరికేసి ప్రకృతి ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము. అందుకే ప్రకృతిని మనం కాపాడితే. ప్రకృతి మనలను కాపాడుతుంది అనే నినాదం వచ్చింది.

కాబట్టి మనం సుఖంగా క్షేమంగా ఆరోగ్యంగా బతకాలంటే మనకు ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే చెట్లు ఉండాలి. ఇదీ ప్రకృతి ధర్మము. అలాగే మనకు ఆహారం కావాలంటే వర్షము, వర్షానికి మేఘాలు, మేఘాలు కావాలంటే యజ్ఞములు, ఆ యజ్ఞములు వేదాలలో చెప్పబడ్డాయి. ఆ వేదములే పరమాత్మ స్వరూపాలు. కాబట్టి మనం ప్రకృతి సమతుల్యం పాటించాలి. అదే యజ్ఞము. ఆ యజ్ఞం ఈశ్వర స్వరూపము. యజ్ఞం చేయడం ఈశ్వరుని ఆరాదించడమే. యజ్ఞము అంటే ప్రకృతిని పరిరక్షించడం, ప్రకృతి సమతుల్యం పాటించడం. కాబట్టి ఈ ప్రకృతిలో అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి దెబ్బతిన్నా సమతుల్యం దెబ్బతింటుంది అని గ్రహించాలి.

మనం చేసే కర్మలు వేదవిహితంగా ఉండాలి. వేదము అంటే ఏమిటి? తెలుసుకోతగినది. తెలుసుకోవలసినది. వేదము ఏదో ఒక ఋషి తాను అనుకున్నది చెప్పినది కాదు. ఋషులు ప్రకృతిని పరిశీలించి, వాటికి తమ అనుభవాలను జోడించి, ధర్మాలను అంటే మానవులు ఆచరించవలసిన కర్మలను నిర్దేశించారు. వాటినే వేదములు అని అన్నారు. ఆ వేదములలో చెప్పబడిన విషయములను ఆచరించడమే ప్రతి వాడి కర్తవ్యము. వేదవిహితములైన కర్మలు చేస్తే పరమాత్మను ఆరాధించినట్టే. " తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్" అంటే ఈ చరాచర జగత్తు అంతటా తానే అయి ఉన్న బ్రహ్మ, మనం చేసే యజ్ఞములలో అంటే వేదవిహితమైన కర్మలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అంటే మనం చేసే ప్రతి మంచి కర్మా ఒక యజ్ఞమే. ఆ కర్మలో దైవం ఉన్నాడు. పనియే దైవము. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. కాబట్టి మనం వేద విహిత కర్మలే చేయాలి. ప్రకృతికి కానీ, సాటి ప్రాణికోటికి హాని కలిగించే కర్మలు చేయకూడదు. ప్రకృతి సమతుల్యాన్ని మనం పాటిస్తే ప్రకృతి మనలను రక్షిస్తుంది.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P166

No comments:

Post a Comment