[4/15, 08:17] +91 73963 92086: 🪷 ఆధ్యాత్మిక శక్తి 🪷
లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా మనుషులకు కలిగే భ్రమను వేదాంతం ‘లోకమాయ’ అంటుంది.
అది తొలగిపోనంత కాలం, భౌతిక లోకంలో మనిషి అక్కడ సమస్యలనుకునే ఏ ఒక్కదానికీ పరిష్కారాలు ఉండవంటుంది. ఆ ప్రపంచంలో అతడు జీవితం అనుకుంటున్నది అశాశ్వతమని, శాశ్వతత్వం లేని దేనికోసమైనా శ్రమించడం నిష్ప్రయోజకమని తెలుసుకొమ్మంటుంది.
అది తెలియాలంటే ముందుగా తన పుట్టుక, మరణం, ఆ తరవాత జరిగేదేమిటన్న విషయాలమీద ఆసక్తిని అతడు పెంచుకోక తప్పదంటుంది. అప్పుడే తానెవరన్నది తెలుసుకోగలడంటుంది.
మనిషి ఆలోచనలన్నీ తానుండే ప్రపంచం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. కాలపరిమితులు లేని అనంత దివ్యత్వమైన బ్రహ్మమే భగవంతుడని, అదొక్కటే సత్యమనే వేదాంతుల మాటలు అతడికి బోధపడవు.
తాను చూస్తున్న ప్రకృతి పరిసరాలనే ‘సత్యం’గా భావిస్తాడు. లౌకికమైన అటువంటి ఆలోచనలతో, సత్యశోధనకు వేదాంతులు కావాలనే బుద్ధీ మనసులపై ఆధిపత్యం అతడికి రాదు. వేదాంతం చెప్పే ఏ విషయం ప్రయోజనకరమైనదిగా అనిపించదు.
వేదాంతులనేవన్నీ అర్థం కావాలంటే మనిషి ఆధ్యాత్మికుడు కాక తప్పదు. అతడిలో ఆధ్యాత్మికత చిగురించడం ఆరంభమైతే- మానసిక స్థిరత, సమభావన, శారీరక బుద్ధిబలాలతోపాటు ఆత్మబలమూ సమకూరుతుంటుంది.
అప్పటిదాకా జ్ఞానమని తాను అనుకుంటున్న దాన్ని మించిన జ్ఞానం ఉందని అతడు గ్రహిస్తాడు. అదీ తనకు అవసరమని తెలుసుకుంటాడు. ఆధ్యాత్మికత అతడి చేత తన అస్తిత్వపు లోతులు వెతికిస్తుంది. అహంకారానికి దూరమయ్యే ప్రయత్నాలు చేయిస్తుంది. దానికి దూరమవుతున్నకొద్దీ భగవంతుడికి దగ్గర అవుతుంటాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అన్నమాట అర్థం కావడం మొదలవుతుంది.
పాండురంగ భక్తుడైన నామదేవుడు ‘విఠలా! ఇన్నాళ్లూ నేనే నేను అనుకుంటున్నాను. గురువుల నుంచి పొందిన జ్ఞానంతో ఆ నేను నువ్వేనని తెలుసుకున్నాను’ అని తానే రచించి పాడిన ఒక పాటలో అంటాడు.
ప్రహ్లాదుడు జన్మతః ఆధ్యాత్మికుడు. అది నచ్చని తండ్రి చేతిలోనే హింసలెన్నో భరించాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడి అణువణువులో తొణికిసలాడిన ఆధ్యాత్మికతే అతణ్ని రక్షించింది. దృఢమైన ఆధ్యాత్మిక సాధనలు చేసేవారికి భగవంతుడెప్పుడూ తోడుగానే ఉంటాడు. ఐహిక ప్రపంచం కలిగించే దృక్పథాలను మార్చుకునేందుకే ఆధ్యాత్మిక సాధనలు అవసరమవుతాయి.
మహా వేదాంతి శంకరుడు చెప్పిన ‘తత్వమసి’ ఆ సాధనలన్నింటికీ పరాకాష్ఠ. అంతిమ సత్యమైన బ్రహ్మాన్ని చేరుకునేందుకు మనిషి చేయాలనుకునే ప్రయాణం ఆధ్యాత్మిక వాతావరణముంటేనే కాని ఆరంభమే కాదు. అది సృష్టించుకోవడం అతడి చేతిలోనే ఉన్న పని.
స్ఫూర్తిదాయకమైన విలువల్ని పాటించే వ్యక్తులు ఆధ్యాత్మికులయ్యేందుకు కష్టపడనక్కరలేదు.
సమయపాలన, వేళకు నిద్రాహారాలు, సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం, భగవద్ధ్యానాలు వారు ఆచరించే కర్మానుష్ఠానాల స్థాయిని పెంచుతాయి. ఆధ్యాత్మికశక్తి లభించే వనరులు ఎక్కడున్నా అన్వేషించి తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అర్హులకే లభించగల జ్ఞానం అనుకోవడం అపోహ.
ఉన్న సమయంలో అది ఏ కొద్దిపాటిదైనా, మనుషులంతా ఆధ్యాత్మికులై ఉండగలిగితే- మానవ పతనానికి కారణమవుతున్నవాటిని అడ్డుకునేందుకు మరోశక్తి అవసరం ఉండకపోవచ్చు.
*జీవితమే ఒక కాలాతీత ధ్యానం*’ అయినప్పుడు జీవితంలో మనకు మరో పని ఉండదు. ధ్యానం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు. ధ్యానం కోసం ప్రత్యేక సమయాన్ని వెదుక్కోవాల్సిన అగత్యం ఉండదు. ఎండాకాలం పగటిపూట ఎండ కోసం వెదుక్కోవాల్సిన పని ఉండదు. పౌర్ణమిరోజు వెన్నెల కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాదు.
అమావాస్య, చీకటి వేరు కాదు. జీవితమే ధ్యానం అయినప్పుడు, ధ్యానం మరో పని కాదు. ధ్యానం జీవిత పరమావధి అయినప్పుడు ధ్యానం ఒక సంబరం అవుతుంది. ఒక సంరంభం అవుతుంది. నిత్యజీవితంలో మరో పని ఉండదా, మరే అవసరం రాదా? ధ్యానమే క్షణక్షణం, ధ్యానమే కణకణం అయినప్పుడు మరో పనికోసం ప్రత్యేక క్షణం ఏదీ? నిజమే. కానీ ధ్యానంలోంచే మరో పని కోసం సమయాన్ని వెదుక్కోవాలి. కేటాయించుకోవాలి. త్వరగా ముగించుకోవాలి.
ఎందుకంటే ప్రాధాన్య క్రమంలో ప్రాపంచిక అవసరాలు ద్వితీయ శ్రేణివే అవుతాయి. మన ఆలోచనా పరిధిలోకి రానివే రాకూడనివే అవుతాయి. సర్వసంగ పరిత్యాగులకు తప్ప ప్రాపంచికావసరాలు తప్పనివే అవుతాయి. తనకోసం కాకపోయినా తనవాళ్ల కోసం తన సమాజం కోసం. కొండొకచో తనకోసం కూడా. అందువల్ల ధ్యానమయ జీవితంలోనూ ప్రపంచానికి కొంత చోటివ్వక తప్పదు. ఆలోచనల్లో, ఆచరణలో కొంతభాగం పెట్టక తప్పదు. ధర్మవ్యాధుడి లాంటివాళ్లు ఇందుకు ఉదాహరణ.
భావాతీత ధ్యానాన్ని కాలాతీత ధ్యానంగా మలచుకుంటే… నిజానికి భావాతీత ధ్యానం కాలానికి అతీతంగానే కాలాతీత ధ్యానంగానే నడుస్తుంది. గుర్తురాని, గుర్తుండని కాలం కోసం ధ్యాని ప్రయత్నపూర్వకంగా స్పృహలోకి రావలసి ఉంది. వచ్చినా ఆ ఎరుక ఉంటుంది.
[4/15, 08:17] +91 73963 92086: క్రీడలో ఒక వర్తులంలో ఆడుకుంటున్న పిల్లలు ఆటలో అవసరార్థం ఆ వర్తులపు పరిధి దాటి ఇవతలికి వచ్చినా వెంటనే ఆ పని చేసుకుని మళ్లీ వర్తులంలోకి హడావుడిగా పరిగెత్తిపోతారు. శ్రద్ధాళువైన ధ్యాని కూడా ధ్యాన జీవితమనే పరిధిలోంచి అవసరార్థం ఇవతలకు రావలసి వచ్చినా వెంటనే ధ్యాన వర్తులంలోకి వెళ్లిపోవలసి ఉంది. అంత నిష్ఠగా, అంత నిబద్ధతాపూర్వకంగా అనుసరిస్తే తప్ప- ధ్యానం ఒక శ్వాసగా, భగవంతుడికి సేవగా జీవిస్తే తప్ప అల్పాయుష్కులైన కలియుగ మానవులు గమ్యాన్ని చేరుకోలేరు.
ఈ అరిషడ్వర్గాల బంధనాలు, ఇంద్రియలాలసలు మన ఆధ్యాత్మిక ప్రయోగానికి, ప్రయత్నానికి శల్య సారథ్యంలాంటివి. లోపభూయిష్ఠ రహితంగా కాలాన్ని వినియోగించుకుంటే తప్ప జీవితాన్ని, కాలాన్ని ధ్యానావశిష్టం చేసుకోలేం. ముక్తి అంటే… ఒక చిట్టిచీమ మేరుపర్వతం ఎక్కేపని ఇది. ఒక అంగుళమంత పక్షిపిల్ల ఆకాశాన్ని అధిగమించి సప్తసముద్రాలు దాటేందుకు చేసే ప్రయత్నం ఇది. నిజానికి, పూనుకొన్న పనిపట్ల వాటికున్నంత నిబద్ధత మనకు లేదు. ఓపిక, సహనం మనకుండవు. మిగిలిన జీవజాలం అనుకుంటే మరుక్షణం, అదేక్షణం పనిలో పడిపోతుంది. ఒక పక్షి తన పిల్లలను రక్షించుకోవాలని సముద్రాన్నేతోడిపోసే పనిలో పడింది. విశ్వపరిమాణంలో మనిషి అత్యల్పుడే కావచ్చు. కానీ అతడికి పరిమాణ రహితమైన మనసుంది. మేధ ఉంది. ఆత్మను ధరించిన మరో పరమాత్మ అతడు… నిజంగా సంకల్పిస్తే చేయలేనిది ఏముంది..!!? ✍️...జొన్నలగడ్డ నారాయణమూర్తి.
No comments:
Post a Comment