Friday, August 1, 2025

 ఉపదేశ సారం-28
అద్వైతమే ఆనందం 
"ఆత్మా సంస్థితిః  స్వాత్మదర్శనం 
ఆత్మ నిర్ద్వయాత్ ఆత్మ నిష్టతా" 

తన స్వస్తితిలో తానుండడమే ఆత్మదర్శనం లేదా ఆత్మ సాక్షాత్కారం .  దర్శించడానికి ఆత్మలో రెండు లేవు గనుక..తాను తానుగా ఉండడమే ఆత్మ నిష్ఠ.  అందులో  జీవేశ్వర భేదానికి తావు లేదు .  భగవాన్ రమణ మహర్షి మానవాళికి అందించిన 30శ్లోకాల ఆత్మజ్ఞాన ప్రబోధ  గ్రంధం "ఉపదేశ సారం " లోని26 వ శ్లోకమిది .  ఈ శ్లోకంలో భగవాన్ రమణులు చెప్పిన ఆత్మ దర్శనం అంటే ..కుర్చీనో , బల్లనో చూసినట్లుగా ఆత్మను దర్శించడం కాదు.  అది ఒక వస్తువు కాదు .  దానికన్నా వేరుగా మరొకటి ఉండే వీలు లేదు .  "నేహానా నాస్తి కించన " అన్నారు .  కనుక ఆత్మను దర్శించే మరొక ఆత్మ లేదా జీవుడు ఉండే వీలు లేదు .  మరి ఏమిటీ ఆత్మ దర్శం ? అంటే, నేను సర్వవ్యాపకమై , ఏకమై , అద్వయమై ఉన్న ఆత్మను నాకన్నా వేరుగా" ఏమీ లేదు " అనే అనుభవంలో ఉండి పోవడమే . ఇదే అవరోక్షానుభవం అని శ్రుతులు చెప్పేది .

ఒక కోటీశ్వరుడు నిద్రపోతున్నాడు .  కల వచ్చింది .  కలలో తానొక బిచ్చగాడు .  ఆకలితో అలమటిస్తున్నాడు. ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నాడు .  ఎక్కడా ముద్ద దొరకట్లేదు .  పైగా తిట్లు .  ఇంతలో అతడికి మెలుకువ వచ్చింది .  కలలోవన్నీ అదృశ్యమై  పోయి , " ఇప్పుడు నేను బిచ్చగాణ్ణి కాదు , కోటీశ్వరుణ్ణి అని ఎవరూ చెప్పకుండానే , ఏమీ ఆలోచించకుండానే అతడికి తెలుస్తుంది . అదే కలలో ఉన్నంతసేపే తాను కోటీశ్వరుణ్ణి అనే విషయమే అతడికి గుర్తురాదు .  మేలుకొన్నపుడే అది సాధ్యం .  అదే స్వానుభవం .  అదే స్వస్థితిలో ఉండడం.  ఆధ్యాత్మిక కోణంలో మెలకువగా ఉండడం .  అంటే ..ఆత్మజ్ఞానం కలగడం .  జీవుడుగా ఉన్న వ్యక్తి శ్రవణ , మనన , నిదిద్వాసనల ద్వారా , సాధనాల ద్వారా సమాధి నిష్ఠలో "నేను జీవుణ్ణి కాదు , ఆత్మనే " అని గ్రహిస్తాడు .  స్వస్థితిలో ఆత్మగానే ఉండిపోతాడు .  మరచిపోవడం , గుర్తు తెచ్చుకోవడం ఉండదు .  అదే ఆత్మ సంస్థితి .  అలా ఆత్మ సంస్థితిలో ఉండడమే స్వాత్మ దర్శనం .  దాన్నే పరమాత్మ సాక్షాత్కారం అంటారు .ఆత్మా నిర్ద్వయాత్ .  అంటే రెండు లేవు .  ఆత్మ ఏకం ..అది అద్వయం .  ఎందుకంటే ..ఆత్మకన్నా నీవు వేరైతే ఆత్మ   నీ చేత చూడబడేది అవుతుంది .  చూడబడేది దృశ్యం .  అది పరిమితం . పరిమితమైనదేదైనా నశిస్తుంది ..  నశించేది ఆత్మ కావడానికి వీల్లేదు . కాబట్టి , ఆత్మ ఏకం .
ఒక బాటసారి కాలినడకన వెళ్తున్నాడు .  దారిలో తినడానికి చద్దిమూట నెత్తిన పెట్టుకుని వెళ్తున్నాడు .  చాలా సేపట్నుంచీ నడుస్తున్నాడేమో బాగా ఆకలి వేసింది .  పైగా నెత్తిన చద్ది మూట బరువు .  అడుగు పడడం కష్టంగా ఉంది .  ఇంతలో ఒక  సెలయేరు కనబడింది .  వెంటనే అతడు మూట కిందికి దింపి హాయిగా స్నానం చేసి , చద్ది తిన్నాడు .  ఇప్పుడతనికి ఆకలి తీరింది .  బలం వచ్చింది .  నెత్తి మీద మూటలో ఉన్నప్పుడు బరువుగా అనిపించిన అన్నం , కడుపులోకి పొతే బరువు లేకపోగా బలంగా ఉంది .  అంటే , వేరుగా ఉంటె భారంగా ఉన్నది .  ఒక్కటైపోతే బలంగా మారింది .  కాబట్టి అద్వైతమే ఆనందం.
- -by sri  దేవిశెట్టి చలపతిరావు,
Sekarana from andhrajyoti .27-10-20

No comments:

Post a Comment