Thursday, August 7, 2025

 ☘️**☘️**☘️**☘️**☘️

*అరుంధతి నక్షత్ర* 
      *జన్మ వృత్తాంతం.*

*********⭐*********

అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది.

*అరుంధత్యననసూయా చ సావిత్రీ జానకీసతి*
*తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం*

అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది – ఈ అయిదుగురు స్త్రీలు సదా వందనీయులని పై శ్లోకానికి అర్థం.

అరుంధతి జన్మవృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు. ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనో సంకల్పంతో అత్యంత రూపవతి యైన కన్యను, వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్యపేరు సంధ్యా. ఆ యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి

*అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా*
*నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా*

 అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలమనే అయిదు బాణాలను ఇచ్చాడు. 

మన్మథుడు బాణ శక్తిని పరీక్షింపదలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అప్పుడు బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరూ సంధ్యను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుడిని ప్రార్థించగా, ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, పరిస్థితిని చక్కదిద్దాడు.

రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మథుడికి శాపం ఇచ్చాడు. తన వల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య , చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమై పోయింది. అప్పుడు బ్రహ్మ వశిష్ట మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాలిందిగా కోరాడు.

 వశిష్టుడు ఆమెకు శివ మంత్రానుష్టానం వివరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సంధ్య తదేక నిష్టతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మన్నాడు.

ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే వరాన్ని ఆమె కోరుకుంది. శివుడు ఆమెను మరొక వరాన్ని కూడా కోరుకోమన్నాడు. అపుడు సంధ్య నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టితో చూచి నట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోవాలనీ, అంతేకాక, తాను పుట్టగానే అనేకమందికి కామ వికారం కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాలని కోరుకుంది. శివుడు తథాస్తు అంటూ, 'మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలివై శరీరాన్ని దగ్ధం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండంనుంచి నీవు జన్మిస్తావు అని అంతేగాక నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడ'ని చెప్పి అంతర్థానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండంనుంచి తిరిగి జన్మించింది.

 సంస్కృత భాషలో 'అరుం' అంటే అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. 'ధతీ' అంటే ధరించినదనే అర్థం ఉంది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కనుక ఆమె 'అరుంధతి' అయింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి,వశిష్టునికి ఇచ్చి వివాహం చేశాడు. అరుంధతి తన పాతి వ్రత్య మహిమ వల్ల త్రిలోక పూజ్యురాలైంది.

 అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్ళి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం అన్యోన్యనురాగాలతో సుఖమయమవుతుందని పండితులు వధూవరుల కు చెబుతారు.

 మాఘ మాసాది పంచ మాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కానరాదు.

 రాత్రి పూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో వుండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున కనిపిస్తుంది.

 అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. '?' మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది. 

☘️**☘️**☘️**☘️**☘️

No comments:

Post a Comment