Wednesday, August 6, 2025

 🐉🙏🐉🙏🐉🙏🐉🙏🐉

*సర్ప రక్షకురాలు* 
         *మానసాదేవి* 

🍀🍀🍀🍀🍀🍀🍀

*త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి... ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని బిల్వపర్వతంపై వెలసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తున్నారు. ఆమె దయ వుంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాదిమంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసిగానీ తెలియక గానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది. అందుకనే కాలసర్పదోష నివరణకు ఆ మాతను ప్రార్ధించాలి. అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.*

*సర్ప రక్షకురాలు మాతా మానసాదేవి అన్న వాసుకి, ఆమెను జరత్కారువు అనే మహర్షి కిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరో పేరు కూడా జరత్కారువు కావడం గమనార్హం. ఈ దంపతులకు ఆస్తీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒక రోజున* *జనమేజయ రాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు.*

*ఋత్వికుల మంత్ర పఠనంతో భూమండలం మీద వున్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి. నాగులలో శ్రేష్ఠుడైన వాసుకి భీతిల్లితుండటంతో సోదరి మానసదేవి తన కుమారుడైన అస్తికుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తీకుని తల్లి నాగ స్త్రీ. తండ్రి" బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో వున్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపి వేసేందుకు అర్హులు అని తెలియడంతో అస్తీకుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావించింది. యాగ ప్రదేశానికి వెళ్లిన ఆస్తీకునికి జనమేజయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు.*

*ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపి వేయమని విన్నవిస్తాడు. దీంతో మాటకు కట్టుబడిన జనమేజయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్ప సంహారం నిలిచిపోయింది. దీంతో నాగజాతి అస్తీకునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసాదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానలేమికి కూడా కాలసర్పదోషం కారణమని చెబుతారు.*

*అందుకనే ఆ మాతను పూజిస్తే సంతాన ఫలం కలుగుతుంది. బిల్వ పర్వతంపై ఆలయం హరిద్వార్ లోని బిల్వ పర్వతంపై అమ్మవారి ఆలయం వుంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, సుందర దృశ్యం మనకు అలౌకిక దివ్యానుభూతిని మిగుల్చుతుంది. సన్ని ధానంలో మాత మానసదేవిని సందర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వున్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేర్చాలని వేడు కోవాలి. అమ్మవారి అభీష్ఠంతో కోరికలు నెరవేరిన అనంతరం తిరిగి ఆలయాన్ని దర్శించుకోవాలి.*

🐉🙏🐉🙏🐉🙏🐉🙏🐉

No comments:

Post a Comment