అంతరాత్మ ప్రబోధం
ఒక పాడుపని చేసినప్పుడు లోపల ఏదో చివుక్కుమంటుంది. 'నువ్వు దారి తప్పుతున్నావు సుమా!' అని ఒక గొంతు మెల్లగా హెచ్చరిస్తుంది. అది అంతరాత్మ పిలుపు. గుండె తలుపు తెరిచి ఆ పిలుపు వింటే ఆపద తప్పుతుంది. పెడచెవిన పెడితే ప్రమాదం ముంచుకువస్తుంది. చేసిన తప్పునకు తగిన శిక్ష పడుతుంది. ఆ శిక్ష అనుభవించక తప్పదు. మనల్ని పెడదారి పట్టించేది మరొకటి ఉన్నది. దాని పేరు 'అహం'భావం.
మంచీ, చెడూ ఒకేగూటి పక్షులు. ఆ గూడు మన గుండె తప్ప మరొకటి కాదు. ఏమరుపాటుకు గురికాగానే, గుండె తలుపులు తోసుకుని అహంకారం రెక్కలు విప్పుతుంది. అంతరాత్మ నోరు నొక్కి మరింత రెచ్చిపోతుంది. అంతరాత్మ, అహంకారం- మనిషి ద్వంద్వ ప్రవృత్తికి కారణాలు. 'మన ఆత్మే మనకు బంధువు, అదే మన పాలిటి శత్రువు' అని కృష్ణపరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ప్రకృతి ప్రభావం వల్ల మానవుల స్వభావాలు ఒకసారి సత్వగుణం, మరొకసారి రజోగుణం, ఇంకొకసారి తమోగుణం పాలబడేలా చేసి, వారి చేత రకరకాల పనులు చేయిస్తాయి. మంచిమనిషి చెడుగా ప్రవర్తించడానికి, దుర్మార్గుడు మంచిమనిషిగా మారడానికి త్రిగుణాలే మూల కారణాలు.
సృష్టిలో మరే ప్రాణికీ లేని ఒక గొప్పవరం ఆలోచనాశక్తి. ఆచితూచి అడుగు కదిపే వెసులుబాటు మనిషికి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు. వివేకం అనే ఖడ్గం, వైరాగ్యం అనే కవచం ధరించి విజయం సాధించే అవకాశమూ ప్రసాదించాడు. వివేకమనే ఖడ్గంతో, అజ్ఞానపు పొర తొలగించుకుని, కర్మయోగివై విజయం కురుక్షేత్రంలో సాధించమని యదు భూషణుడు కురువీరుడికి ధర్మప్రబోధం చేశాడు. s వెలుగుబాటలో మనమూ ముందడుగులేసి, జీవన కురు క్షేత్రంలో విజయం సాధించ వచ్చు. అది మనం తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఈ నాలుగూ దుష్ట చతుష్టయంలా అంతరంగ కురుక్షేత్రాన్ని, అంతరాత్మకు విరుద్ధంగా ప్రకటిస్తూ ఉంటాయి. ముందువరసలో నిలబడి, అహంకారం అంతరాత్మను అడ్డుతుంది. మనం తప్పటడుగు వేయడానికి పరిస్థితులు, మనలో పందిరి వేసిన తీరని కోరికలు రంగంలోనికి ప్రవేశిస్తాయి. ఆవేశంలో మనం తీసుకునే నిర్ణయం, చేపట్టే కార్యక్రమం ఎలాంటి వైపరీత్యానికైనా దారితీయవచ్చు. సామాజిక స్పృహతో, నైతిక బాధ్యత కలిగి మనం అంతరాత్మ తలుపు తట్టితే, తప్పకుండా సమస్యకు తగ్గ పరిష్కారం స్ఫురిస్తుంది.
మనం చేసే అసాంఘిక, అనైతిక చర్యలకు అహంకారమే మూలకారణం. సంస్కార బలంతో మన చర్యలను నియంత్రించాలి. మనలోని పాపచింతనకు దైవభీతి పరమ ఔషధం! అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలన్న ఎరుక కలిగి ఉండటమే వివేకం. కర్మలను భగవదర్పితంగా చేయడమే వైరాగ్యం. మోహావేశంలో పరవశమైనప్పుడు నరుడిలా మనమూ కర్తవ్యానికి దూరం అవుతాం. అహంకారానికి అంకుశం వేస్తూ, అంతరాత్మను దాసోహం అని శరణు కోరితే, భయాలు తొలగుతాయి. భయపడకుండా భగవంతుడిపట్ల విశ్వాసంతో చేసే కర్మలు దివ్యకర్మలుగా మారి లోకకల్యాణానికి దోహదం చేస్తాయి.
భగవంతుడు వరంగా ఇచ్చిన ఆలోచనను, శక్తిని బాధ్యత కలిగి ఉపయోగించాలి. విచక్షణ కరవైతే వరాలు కూడా శాపాలవుతాయి. కర్మవీరులను కాపాడటానికి ఆ పరమాత్మ, జీవుడిలో అంతరాత్మగా తిష్టవేసి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. ఆ మాటే చివర అర్జునుడితో అంటాడు కృష్ణపరమాత్మ- 'నేనేమి చెప్పానో అంతా శ్రద్ధగా విన్నావు గాని నువ్వు ఏం చేయాలో నీవే నిర్ణయించుకో. అలాగే చేయి'. అంతరాత్మ ప్రబోధమే అందరికీ దారి దీపం!
ఉప్పు రాఘవేంద్రరావు
No comments:
Post a Comment