#దేవుడు_ఉన్నాడా? 
ఉంటే ఎందుకు కనిపించడు?
ఇటువంటి ప్రశ్నలు భగవంతునిపై ఆర్తితో అడిగేవారు కొందరయితే, సంసార ఆవేదనతో అడిగేవారు కొందరు, ఇంకా ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో అడిగేవారు మరికొందరు. నిజానికి ఈ ప్రశ్నలకు మనఋషులు, గురువులు, పెద్దలు...ఎందరో ఎన్నో విధాలుగా సమాధానం తెలిపారు. మన పురాణాలు, శాస్త్రాలు కూడా స్పష్టంగా సమాధానం తెలుపుతున్నాయి. భాగవతంలో గజేంద్రుడు ఆర్తిగా ప్రార్ధనతో ప్రారంభించి, ఆవేదనతో "కలడు కలండనెడువాడు కలడో లేడో"...అని సందేహంతో ప్రశ్నించి, చివరికి సమర్పణాభావంతో(శరణాగతి) ఒదిగిపోయి, ఏ రీతిలో నారాయణుడిని దర్శించుకున్నాడో అందరికీ విధితమే.
పుష్పే గంధం తిలే తైలం కాష్ఠేఽగ్నిం పయసి ఘృతం |
ఇక్షౌ గుడం తథా దేహే పశ్యా ఽ త్మానం వివేకతః ||
పుష్పములో సుగంధం, నువ్వులలో నూనె, కట్టెలలో అగ్ని, పాలలో నెయ్యి, చెరకులో బెల్లము ఉన్నట్లుగా... దేహములో ఆత్మలా ఉన్న పరమాత్మను వివేకంతో దర్శించాలి.
మనలో పవిత్రంగా ఉన్న పరమాత్మను క్రియల్లోనే వెతకాలి.
మనం చేసిన క్రియలచే ఎలాగున సుగంధం, నూనె, నిప్పు, నెయ్యి, బెల్లం ప్రత్యక్షముగా గోచరించునో, అలాగునే వివేకజ్ఞానంచే దేహంలో నుండు ఈశ్వరున్ని చూడగలం.
రాయి ఒక ఉపకరణం. రాయి తనకు తానుగా శిల్పంగా మారదు. రాయిని శిల్పంగా మలచాలన్న సంకల్పం శిల్పికి రావాలి. శిల్పాన్ని నైపుణ్యంగా చెక్కడానికి ఉలి లాంటి ఉపకరణాలు కావాలి. ఆ ఉలితో రాయిలో వ్యర్ధరాయిని తొలగిస్తూ, శిల్పాకృతికి ఉండాల్సిన రాతిని నేర్పుగా గుర్తిస్తూ, కృషితో శిల్పాన్ని వెలికి తీయాలి. అట్లే, దేహం కూడా ఓ ఉపకరణమే. దేవుణ్ణి చూడాలనే సంకల్పంతో, చిత్తశ్శుద్ధి అనే ఉపకరణంతో మనలో పేర్కొన్న అజ్ఞానం అనే వ్యర్ధాన్ని తొలగించి సాధనతో లోపలున్న దైవాన్ని గుర్తించి దర్శించాలి.
చిత్తశుద్ధి అంటే నీతి నియమాల జాబితా కాదు. చిత్తశుద్ధి అనేది మీరుండే తీరు. మీరు ఆలోచించే పద్దతి. ఇంకా మీరు ప్రవర్తించే విధానం.
🚩 సర్వే జనాః సుఖినోభవంతు 🚩
No comments:
Post a Comment