Tuesday, August 5, 2025

 ఉపదేశ సారం-31

బంధముక్తులకు అతీత స్థితి
బంధముక్త్యతీతం పరం సుఖం 
విందతీ హాజీవస్తు దైవకః 

దేవుడే అయిన జీవుడు (లేదా ) తనను తానూ ఆత్మస్వరూపుడిగా తెలుసుకున్న జీవుడు.ఇక్కడే ..ఈ దేహంలో ఉండగానే బంధముక్తులు లేని పరమ సుఖాన్ని , ఆత్మ సుఖాన్ని పొందుతాడని దీని అర్ధం .  భగవాన్ రమణ మహర్షి లోకానికి అందించిన 30 శ్లోకాల ఆత్మ జ్ఞాన గ్రంధం "ఉపదేశ సారం "లోని 29 వ శ్లోకమిది .  బంధముక్తులకు అతీతమైన పరిపూర్ణ సుఖాన్ని పొందే వారెవరో రమణులు ఈ శ్లోకం ద్వారా తెలిపారు .  "నేను జీవుణ్ణి , అల్పుణ్ణి, పరిమితమైనవాడిని " అనే భావన కలిగి ఉన్నందువల్లనే మనకు ఏదో బంధంలో  ఉన్న భావన కలుగుతుంది  .  అజ్ఞానం వల్ల, "నేను ఆత్మను " అని తెలియనందువల్లనే ఈ భావన ఉంటుంది.  ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానంలో నిలవడమే ముక్తి .  అయితే , సాధన చేసి , ఆద్యంత రహితం , సూక్ష్మాతిసూక్ష్మం, సర్వవ్యాపకం , సచ్చిదానంద స్వరూపం అయిన ఆత్మగా ఉన్నట్లయితే ఇక బంధం ఏమిటి?  ముక్తి ఏమిటి ? ఆత్మ సర్వస్వతంత్రం .  అది ఒక్కటే .  రెండోదేది లేదు .  కనుక దాన్ని బంధించే మరొకటి ఉండే వీలు లేదు .  కనుక బంధం నుంచి విడిపించుకుని ముక్తి పొందడం అన్న ప్రశ్నే లేదు .

జైల్లో ఉన్నట్టు కల వస్తే .."అయ్యో జైల్లో ఉన్నానే , ఎలా తప్పించుకోవాలి ? అని మధనపడతాం .  ఏవో ప్రయత్నాలు చేస్తాం .  మెలకువ వచ్చాక ..ఇంట్లోనే   పరుపుపై హాయిగా పడుకుని ఉన్నాక ఆ ప్రయత్నం చేస్తామా ? తప్పించుకోవాలని అనుకుంటామా ? లేదు. స్వప్నంలో , భ్రమలో ఉన్నంతకాలమే  ఆ భావన .  మేలుకున్నాక బంధిపబడటమూ ఉండదు .  బయటపడాలన్న తపనా ఉండదు .  అదేకోవలో బ్రహానుభూతిలో .."నేను ఆత్మను " అనే ఆత్మనిష్ఠలో నిలిస్తే ఇక బంధమూ లేదు . ముక్తీ లేదు .  చీకటిలో తాడును చూసి పాము అనుకోవడం మన భయానికి కారణం .  వెలుగులో అది తాడేనని  తెలుసుకుంటే భయం నుంచి విముక్తి .  పాము అనే భావన భ్రమ .  భ్రమలోనే భయం, తొలగించుకోవాలనే తాపత్రయం .  తాడు అనుకుంటే భయమూ లేదు .  తొలగించుకోవాలనే ప్రయత్నమూ ఉండదు .  అలాగే ఆత్మగా ఉంటె భయమూ లేదు, తొలగించుకోవాలనే ప్రయత్నమూ ఉండదు .  కనుక ఆత్మగా ఉంటె బంధమూ లేదు, ముక్తీ లేదు .

ఇలా ఆత్మగా ఉండడానికి , బ్రహ్మానందానుభవంలో నిలిచిపోవడానికి జీవుడు మరణం వరకూ ఎదురుచూడక్కర్లేదు. ఇక్కడే ఈ దేహంలో ఉండగానే .".నేను ఆత్మను .  నన్ను  నేను ఇంతవరకూ మరచిపోయాను .  నేను ఎల్లప్పుడూ ఆత్మనే " అని సద్గురువు ద్వారా శ్రవణం చేసి , మనన నిధిధ్యాసనలతో అన్ని అర్హతలూ పొందిన జీవుడు ఆ అనుభూతిని పొందవచ్చు .  జీవుడు ఆత్మగా మారక్కర్లేదు .  "నేనసలు ఆత్మనే "  అని గ్రహిస్తే సరిపోతుందంతే.  అయితే , అట్టివారు అరుదుగా ఉంటారు .  ఉన్న వారు పూజనీయులు .  వారే దైవిక జీవులు .  ఆత్మభావన సహజమైపోయిన తర్వాత బంధంలో ఉన్నాననే భావన పోతుంది .  అది పొతే ముక్తిని  పొందాననే స్మరణా పోతుంది.  ఇదే బంధముక్తులకు అతీతమైన స్థితి .
- -by sri  దేవిశెట్టి చలపతిరావు,

No comments:

Post a Comment