ఉపదేశ సారం-31
బంధముక్తులకు అతీత స్థితి
బంధముక్త్యతీతం పరం సుఖం
విందతీ హాజీవస్తు దైవకః
దేవుడే అయిన జీవుడు (లేదా ) తనను తానూ ఆత్మస్వరూపుడిగా తెలుసుకున్న జీవుడు.ఇక్కడే ..ఈ దేహంలో ఉండగానే బంధముక్తులు లేని పరమ సుఖాన్ని , ఆత్మ సుఖాన్ని పొందుతాడని దీని అర్ధం . భగవాన్ రమణ మహర్షి లోకానికి అందించిన 30 శ్లోకాల ఆత్మ జ్ఞాన గ్రంధం "ఉపదేశ సారం "లోని 29 వ శ్లోకమిది . బంధముక్తులకు అతీతమైన పరిపూర్ణ సుఖాన్ని పొందే వారెవరో రమణులు ఈ శ్లోకం ద్వారా తెలిపారు . "నేను జీవుణ్ణి , అల్పుణ్ణి, పరిమితమైనవాడిని " అనే భావన కలిగి ఉన్నందువల్లనే మనకు ఏదో బంధంలో ఉన్న భావన కలుగుతుంది . అజ్ఞానం వల్ల, "నేను ఆత్మను " అని తెలియనందువల్లనే ఈ భావన ఉంటుంది. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానంలో నిలవడమే ముక్తి . అయితే , సాధన చేసి , ఆద్యంత రహితం , సూక్ష్మాతిసూక్ష్మం, సర్వవ్యాపకం , సచ్చిదానంద స్వరూపం అయిన ఆత్మగా ఉన్నట్లయితే ఇక బంధం ఏమిటి? ముక్తి ఏమిటి ? ఆత్మ సర్వస్వతంత్రం . అది ఒక్కటే . రెండోదేది లేదు . కనుక దాన్ని బంధించే మరొకటి ఉండే వీలు లేదు . కనుక బంధం నుంచి విడిపించుకుని ముక్తి పొందడం అన్న ప్రశ్నే లేదు .
జైల్లో ఉన్నట్టు కల వస్తే .."అయ్యో జైల్లో ఉన్నానే , ఎలా తప్పించుకోవాలి ? అని మధనపడతాం . ఏవో ప్రయత్నాలు చేస్తాం . మెలకువ వచ్చాక ..ఇంట్లోనే పరుపుపై హాయిగా పడుకుని ఉన్నాక ఆ ప్రయత్నం చేస్తామా ? తప్పించుకోవాలని అనుకుంటామా ? లేదు. స్వప్నంలో , భ్రమలో ఉన్నంతకాలమే ఆ భావన . మేలుకున్నాక బంధిపబడటమూ ఉండదు . బయటపడాలన్న తపనా ఉండదు . అదేకోవలో బ్రహానుభూతిలో .."నేను ఆత్మను " అనే ఆత్మనిష్ఠలో నిలిస్తే ఇక బంధమూ లేదు . ముక్తీ లేదు . చీకటిలో తాడును చూసి పాము అనుకోవడం మన భయానికి కారణం . వెలుగులో అది తాడేనని తెలుసుకుంటే భయం నుంచి విముక్తి . పాము అనే భావన భ్రమ . భ్రమలోనే భయం, తొలగించుకోవాలనే తాపత్రయం . తాడు అనుకుంటే భయమూ లేదు . తొలగించుకోవాలనే ప్రయత్నమూ ఉండదు . అలాగే ఆత్మగా ఉంటె భయమూ లేదు, తొలగించుకోవాలనే ప్రయత్నమూ ఉండదు . కనుక ఆత్మగా ఉంటె బంధమూ లేదు, ముక్తీ లేదు .
ఇలా ఆత్మగా ఉండడానికి , బ్రహ్మానందానుభవంలో నిలిచిపోవడానికి జీవుడు మరణం వరకూ ఎదురుచూడక్కర్లేదు. ఇక్కడే ఈ దేహంలో ఉండగానే .".నేను ఆత్మను . నన్ను నేను ఇంతవరకూ మరచిపోయాను . నేను ఎల్లప్పుడూ ఆత్మనే " అని సద్గురువు ద్వారా శ్రవణం చేసి , మనన నిధిధ్యాసనలతో అన్ని అర్హతలూ పొందిన జీవుడు ఆ అనుభూతిని పొందవచ్చు . జీవుడు ఆత్మగా మారక్కర్లేదు . "నేనసలు ఆత్మనే " అని గ్రహిస్తే సరిపోతుందంతే. అయితే , అట్టివారు అరుదుగా ఉంటారు . ఉన్న వారు పూజనీయులు . వారే దైవిక జీవులు . ఆత్మభావన సహజమైపోయిన తర్వాత బంధంలో ఉన్నాననే భావన పోతుంది . అది పొతే ముక్తిని పొందాననే స్మరణా పోతుంది. ఇదే బంధముక్తులకు అతీతమైన స్థితి .
- -by sri దేవిశెట్టి చలపతిరావు,
No comments:
Post a Comment