"కరుణశ్రీ" శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి జయంతి సందర్భంగా....
🙏🙏
*"నేనొక పూలకడనిల్చి
*చివాలున కొమ్మవంచి
*గొరానెడు నంతలోన విరులన్నియు
*జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము
*తీతువా యనుచు బావురుమన్నవి".....
శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు.
గొప్ప కవిగా పేరు పొందాడు. మృదుభాషిగా, సుమధుర కవిత్వానికి చిరునామాగా చెప్పబడ్డారు. ఇతని కలం పేరు కరుణశ్రీ. నవరసాలలో కరుణ రసానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపుగా ఉంటుంది. ఖండ కావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి "కరుణ శ్రీ"గా ప్రసిద్ధులైనారు.
విద్య- ఉద్యోగం:
కరుణశ్రీ, గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలములోని కొమ్మూరు గ్రామములో 1912 ఆగస్టు 4న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాధమిక, మాధ్యమిక విద్య చదివిన పాపయ్య శాస్త్రిగారికి సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్య శర్మ, కుప్పా ఆంజనేయ శాస్త్రిగార్ల వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా, విశారద, ఉభయ భాషాప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతి లోని రామకృష్ణ హిందూ హైస్కూల్ లోనూ, గుంటూరు స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనూ అధ్యాపకునిగా పనిచేసారు.
రామారావు,జగ్గయ్యగార్లు వీరి విద్యార్దులే:
ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో కరుణశ్రీ ఆంధ్రోపన్యాసకుడుగా పని చేస్తున్నపుడు ఎన్.టి. రామారావుగారు వీరి విద్యార్దే! ఆయన పద్యం చదివే తీరు, వారి కమనీయమైన గాత్రం ఇప్పటికీ నా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. చక్కని పంచెకట్టు, భుజంమీద శాలువా, చేతిలో పుస్తకం, ముఖంమీద చెరగని చిరునవ్వు, గంభీరమైన నడకతో వారు నడిచే తీరు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు ఉంటుందంటారు.
జగ్గయ్య మంచి నటుడిగానే గాక, గొప్ప సాహితీ పిపాసకుడుగా ఎదిగారు.
సాహిత్యమూర్తి- సంగీత మూర్తి:
ఆ కమనీయమూర్తిలో, మొదటిసారిగా విచారం/విషాదం చూసింది. ఘంటసాల గారి మరణవార్త విన్నప్పుడే! ఘంటసాల గారు, గుంటూరు వచ్చినప్పుడు విడిది చేసేది వారి ఇంటిలోనే. సరస్వతీదేవి యొక్క కవల పిల్లలు వారు. ఒకరు సాహిత్యమూర్తి, మరొకరు సంగీత మూర్తి. ఇద్దరూ కలసి, శారదాదేవి ఆస్థానంలో సాహిత్య, సంగీత సభలు నిర్వహించటానికే
ఈ లోకం విడిచి వెళ్ళారు.
బ్రతికినంత కాలం రిక్షా ఎక్కలేదు:
ఒక చెప్పులు కుట్టుకొనే మనిషి, వారి గీతాలను స్వర బద్ధంగా ఉఛ్ఛారణ దోషం లేకుండా పాడటం విని ఆయన ఎంత సంతోషించారో! బ్రతికినంత కాలం రిక్షా ఎక్కలేదు. మనిషిచే మోయించుకోవటం, మానవత్వానికే తీరని మచ్చ అని వారి అభిప్రాయం. తన దగ్గరికి వచ్చే ఒక బీద విద్యార్ధి అయిన, మహబూబ్ భాషాను పోషించటమే కాకుండా, అతను వ్రాసే పద్యాలను సవరించి, ప్రోత్సహించేవారు. మానవతా విలువులున్న మహామనీషి ఆయన. పద్యాన్ని చక్కగా భావయుక్తంగా చదవమని, అందరికీ సూచనలు ఇచ్చేవారు.
వారి శ్రీమతి అనసూయమ్మగారు. ఆయన సహధర్మచారిణి మాత్రమే కాదు, ఆయనకు ఉన్న ఒక గొప్ప స్నేహితురాలు. వారికి ఇద్దరు కొడుకులూ, ఒక కూతురూ ఉన్నారు. 'కళ్యాణ కల్పవల్లి' పేరుమీద తెలుగు లోని ప్రఖ్యాత కవులను గురించి ఒక కావ్యాన్ని చాలా గొప్పగా వ్రాసారు. 'ఉమర్ ఖయ్యాం' అనే పద్య కావ్యం కూడా కమనీయంగా ఉంటుంది. వారి కలంలో సిరాకు బదులుగా పంచదార, తేనే కలిపి వ్రాస్తారేమో! అంత మధురంగా ఉంటుంది వారి కవిత్వం. అంతేకాకుండా జనబాహుళ్యంలోకి విపరీతంగా చొచ్చుకొని వెళ్ళిన వారి పద్యాలను గురించి వారితో ముచ్చటిస్తుంటే, వారి ముఖంలో ఆనందరేఖలు స్పష్టంగా కనపడేవి. పిల్లలకోసం వారు వ్రాసిన 'తెలుగుబాల'--ఆ రోజులలో ఆనందంగా చదువుకునేవారు.
పిల్లలే కాదు, పెద్దలు కూడా చదవలసిన పద్య కావ్యమది. సులభ శైలిలో ఉంటుంది. సాంప్రదాయ కవితా రీతులతో, పిల్లలకు, పెద్దలకు, సామాన్య ప్రజలకు అర్ధమయేటట్లు కవితలల్లిన మొదటి 'ప్రజాకవి' ఆయనేనని చెప్పవచ్చు.
ఉదయశ్రీ, విజయశ్రీ:
ప్రఖ్యాత తెలుగు సినీ నటులు శ్రీ గుమ్మడి వేంకటేశ్వరరావు గారు, వారి అమ్మాయిలకు, ఉదయశ్రీ, విజయశ్రీ అనే పేర్లు పెట్టి* -- శ్రీ పాపయ్య శాస్త్రిగారి మీద ఉన్న అభిమానాన్ని, వారి కవిత్వం పట్ల ఆయనకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు, శ్రీ పాపయ్య శాస్త్రిగారు ఎంతో సంతోషించారు.
50 ముద్రణలు:
తెలుగు సాహిత్యంలో 50 ముద్రణలు చూసిన ఏకైక గ్రంధం ఒక్క 'ఉదయశ్రీ' నే! వారణాసిలో, ఒక కవి సమ్మేళనంలో, ఒక హిందీ కవి తన పుస్తకం పదిసార్లు ముద్రించ పడిందని ఆనందపడుతున్న సందర్భంలో, 50 ముద్రణలు చూసిన 'ఉదయశ్రీ' కావ్యకర్త శ్రీ పాపయ్య శాస్త్రిగారిని చూసి ఆశ్చర్యంతో, ఆదరంతో ఆలింగనం చేసుకున్నారు.
ఆయన కనపరచిన ప్రతిభకు ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు రాలేదు. అదే విషయం వారితో ప్రస్తావిస్తే, ప్రజల మెప్పే తనకు పద్మశ్రీ, పద్మభూషణ్ కన్నా గొప్ప బిరుదులు, అనే వారు. బుద్ధునిలోని కరుణ ఆయనను ఎక్కువగా ప్రభావితం చేసింది. అందుకనే, వారు 'కరుణశ్రీ' అనే పేరుతోనే అనేక కావ్యాలు వ్రాసి ప్రసిద్ధులయ్యారు.
పుష్పవిలాపం:
పుష్పవిలాపం మరియు కుంతీకుమారి వంటి కవితలు ఘంటసాలగారి గంధర్వగానం వల్ల మరింత ప్రసిద్ధి చెందాయి.
పుష్పవిలాపాన్ని' చిరకాలం తెలుగు వారు గుర్తుంచుకునేటట్లు చేసిన ఘనత ఘంటసాలదే! జీవించినంత కాలం కవిత్వం రాసి, రాసినంత కాలమే జీవించిన కవి కరుణశ్రీ. జనరంజకుడైన ఈ కవి తన కలాన్ని తేనెలో ముంచి మధురాతి మధురమైన కవితా పద చిత్రాలతో పఠితల హృదయాలను రసప్లావితం చేసాడు. ‘కరుణశ్రీ’గా ఖండాంతర ఖ్యాతినార్జించిన ఆయనకు పోతన భాగవతమే గురువు. పోతనలాగే లలిత పదకవితలనల్లుతూ పండిత, పామరుల ప్రశంసలను అందుకున్నారు.
పూబాలల గుండె కోతను వినిపించుకున్న వారు ఎవరున్నారు ? ఒక్క కరుణశ్రీ తప్ప. అలాగే ‘కుంతి కుమారి’ ఖండకావ్యము కూడాను. కరుణశ్రీ కలంనుంచి జాలువారిన అలాంటి కవితలెన్నని ఎంచి చెప్పగలం ?
అక్కినేని నాగేశ్వరరావుగారు, మనసు ప్రశాంతంగా లేనపుడు, ఘంటసాల గారు పాడిన పుష్పవిలాపం వింటానని, వారే పలుమార్లు చెప్పారు.
ఉదయశ్రీ-విజయశ్రీ-కరుణశ్రీ:
"ఉదయశ్రీ నా హృదయం, విజయశ్రీ నా శిరస్సు, కరుణశ్రీ నా జీవితం" అంటూ శాస్త్రిగారు ఖండాంతర ఖ్యాతి గాంచిన ఈ మూడు కావ్యాలను తనకు ప్రీతిపాత్రమైనవని పేర్కొన్నారు.
రచనలు:
కళ్యాణ కాదంబరి : ప్రసిద్ధి పొందిన బాణభట్టుడు సంస్కృతంలో కాదంబరి అనే వచన కావ్యం రచించారు. ఆ కాదంబరిని తన పద్యలాలిత్యం ద్వారా తెలుగు సాహిత్యాభిమానులకు పరిచితుడైన కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి సులభశైలిలో అనువదించారు.
పుష్పవిలాపము : ఘంటసాల గారి రికార్డుల పుష్పవిలాపం పద్యాలు బాగా ప్రాచుర్యము పొందాయి.
కుంతీకుమారి, ఉదయశ్రీ,
విజయశ్రీ, కరుణశ్రీ
ఉమర్ ఖయ్యూం,
ఆనంద లహరి,
ప్రేమమూర్తి (బుద్ధచరిత్రము)
అరుణకిరణాలు,
అనురాగలహరి మొదలైనవి.
బహుముఖ ప్రజ్ఞాశాలి:
కవిగా, పండితునిగా, విమర్శకునిగా, వ్యాఖ్యాతగా, సంపాదకునిగా, బాలసాహిత్య కథకునిగా, ఉపన్యాసకునిగా భాసిల్లిన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి 76 గ్రంథాలను రచించారు. ఆయన సాహిత్య కృషిపై కనీసం మూడు పీహెచ్డీ సిద్ధాంత వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
రాష్ట్ర జాతీయ స్థాయిలలో ఎన్నో పురస్కారాలు:
*రాష్ట్ర జాతీయ స్థాయిలలో ఎన్నో పురస్కారాలు
అందుకున్న ఆయనకు శ్రీవెంకటేశ్వర విద్యాలయం గౌరవ డాక్టరేటును ఇచ్చి గౌరవించింది.
*బంగారుపుష్ప సన్మానము, పుత్తడి కంకణధారణా సన్మానము, 1982 జూన్ 27న విజయవాడలో.
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారము, 1983 జనవరి 30న.
*గౌరవ రాష్ట్రపతి శ్రీ జ్ఞాని జైల్ సింఘ్ చేతులమీదుగా సన్మానము, 1987 ఏప్రిల్ 25న.
*రసమయి పురస్కారము,
ఆభినందన పురస్కారము,
శుభాంగి పురస్కారము,
ఆభిరుచి పురస్కారము,
డా|| బూర్గుల రామకృష్ణారావు పురస్కారము మొదలైనవి.
*భువన విజయము" నాటకములో ముక్కు తిమ్మనగాను, "భారతావతరణము" నాటకములో నన్నయ్యగాను, "ఇందిర మందిరము" నాటకములో చేమకూర వేంకట కవిగాను, "బ్రహ్మసభ" నాటకములో పోతనగాను పాత్రధారణ చేసారు.
తిరుమల తిరుపతి దేవస్థానంవారు పోతన భాగవత వ్యాఖ్యాన సంపాదుకులుగా పనిచేయడానికి కరుణశ్రీనే సరైన వ్యక్తిగా గుర్తించి గౌరవించింది.
21 -06 -1992 న వారు తమ కవితా ప్రస్థానానికి ముగింపు చెప్పి, శాశ్వత నిద్రలోకి వెళ్ళారు.
ఈయన కవిత్వము పాఠకులని ఆత్మజ్ఞాన శిఖరాంచులనే కాక సమాజాంతరళాలలోని దుఃఖాన్ని, వాటికి కారణాలని, పరిష్కార మార్గాలని కూడా చూపుతాయి. మనుషులలో ఉత్తమ మార్పుకై, సమాజములో శాంతికై, నైతిక విలువ అను సంపద్వృద్ధికై తన కవిత్వాన్ని వినియోగించారు. అందునే ఈనాటికి వారి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి.
https://youtu.be/E2qkEo8eiWs
పై link లో పుష్పవిలాపం వినండి.
🙏🙏🌸🌷🏵️🙏🙏
Collected by
Dr.A.Srinivasa Reddy
No comments:
Post a Comment