Sunday, May 10, 2020

మాతృ పంచకం - అది శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు


మాతృ పంచకం

మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం

(అర్థ తాత్పర్యాలతో)
కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.

ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి.

ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కమ్.
తాత్పర్యము: అమ్మా ! "నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా ! , నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి " అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను.నన్నుక్షమించు.

అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జనన్యై రచితోయమంజలిః.
తాత్పర్యము: పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా ! అయ్యా ! శివా ! కృష్ణా ! హరా ! గోవిందా !" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

ఆస్తాం తావదియం ప్రసూతి
సమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమయీ
శయ్యా చ సంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార
భరణ క్లేశస్య యస్యాక్షమః
దాతుం నిష్కృతిమున్నతోపి
తనయః తస్యై జనన్యై నమః.
తాత్పర్యము: అమ్మా ! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను(కడుపునొప్పి) అనుభవించావో కదా !
కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా ! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? నీకు నమస్కారం చేస్తున్నాను.

గురుకు లముప సృ త్య
స్వప్న కాలే తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః.
తాత్పర్యము: కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి ,మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను.

న దత్తం మాతస్తే
మరణ సమయే తోయమపివా
స్వ ధా వా నో దత్తా
మరణదివసే శ్రాద్ధవిధినా
న జప్త్వా మాతస్తే మరణ
సమయే తారక మను-
రకాలే సంప్రాప్తే మయి
కురు దయాం మాతురతులామ్.
తాత్పర్యము: అమ్మా ! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని(ఓం రామాయనమః" అను ఆఱు అక్షరముల మంత్రమని కొందఱు "ఓం శ్రీరామరామ" అనునదే తారకమని మరికొందరు) చదవలేదు . నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ !!

No comments:

Post a Comment