Wednesday, May 20, 2020

దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దు కొనవలెను

దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దు కొనవలెను

" అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చేసే పని ఆపి వచ్చి ఇలా కూర్చో." చిన్నకోడలు , పెద్దకోడలితో అంది.

" ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు.విషయమేంటి? " అని అడిగింది పెద్దకోడలు.
" ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది.
కదా! మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ చేస్తున్నాము కదా! మనకు పిల్లలు , సంసారం ఉన్నాయి. మామగారిని ఎన్ని రోజులని చూడగలం.అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను."
అంది చిన్నకోడలు.

" ఏంటది? " అని అడిగింది పెద్దకోడలు." మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయస్సులో
ప్రశాంతంగ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం మన పిల్లలతో హయిగా ఉండవచ్చు." అంది చిన్నకోడలు.
" దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు." అంది పెద్దకోడలు." మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ప్రయత్నిద్దాం." అంది చిన్నకోడలు.

ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారు తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు. తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్దే ఉంచుకుని చూసుకోవలని వారి ఉద్దేశ్యం. కానీ రోజూ భార్యల నస భరించలేక
ఇద్దరు కొడుకులు తండ్రితో ఇలా చెప్పారు.

" నాన్నా! ఈ పిల్లలగొడవతో మీకు సమయానికి ఏవీ అందించలేకపోతున్నాం.
మీకు కూడా వయస్సు అయింది. అమ్మ ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి చూసుకునేది. దగ్గరిలోనే మంచి ఆశ్రమం ఉంది. మిమ్మల్ని అక్కడ
చేరుద్దామని అనుకుంటున్నాము. మీరేమంటారు? "
" నేను కూడా అదే ఆలోచిస్తున్నాను.

ఎన్నిరోజులని మీరు నన్ను చూసుకుంటారు. మంచి విషయం చెప్పారు. పెట్టే, బేడా సర్ధుకుని బయలు దేరండి ఇద్దరూ!? అన్నారు తండ్రి.
షాక్ కొట్టినంత పనైంది కొడుకులకు నాన్న అలా అనేసరికి.
" అదేంటి నాన్నా ! అలా అనేశారు. మేము వెళ్ళడం ఏంటి? బయట బాడుగలు పెట్టి మేము వేరు కాపురాలు ఎలా వెలగబెట్టాలి.
ఆస్తిని మాకే కదా ఇవ్వాలి. ఆలోచించండి ఒకసారి."

" నిజమే! మీకే ఇవ్వాలి నా ఆస్తిని. కానీ మీ అమ్మ నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇది. ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళూ చాలా సంతోషంగా ఉన్నాం. ఆమెను తలచుకుంటు నేను ఈ ఇంట్లోనే కన్నుమూయాలి.
నా తదనంతరం ఈ ఇల్లు మీకే! పైన ఇంటి బాడుగతో,నాకు వచ్చే పెన్షన్ తో ఎలాగోలా బ్రతికేస్తాను. బయలుదేరండి త్వరగా" అన్నారు
తండ్రి.

" అదేంటి మామగారూ! ఊర్లో జనాలు ఏమనుకుంటారు? బయటికివెళ్ళి అరకొర జీతాలతో ఎలా బ్రతకాలి. ఆలోచించండి" అన్నారు కోడళ్ళు.

ఊర్లో జనాలు ఎప్పుడూ మనకు వ్యతిరేకంగానే మాట్లాడుకుంటారు.
ఇది నా ఇల్లు. నా భార్య నాతో ప్రేమగా జీవించిన ఇల్లు. నేను పోయేదాకా ఇది నా సొంతం.

నా గురించి ఆలోచించని మీరు జనాల గురించి ఆలోచిస్తున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఈ ఆలోచన
మీదేనని నాకు తెలుసు. మరోదారిలేదు. మీరు ఇక్కడినుండి
వేరే కాపురానికి వెళ్ళడమే మంచిది. బయలుదేరండి."

అంటూ తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళిపో్యారు. షాక్ తో తల దిమ్మెక్కింది ఆ కొడుకులకూ....కోడళ్ళకు.....

తల్లిదండ్రులను భారంగా అనుకోవద్దు. వారు మిమ్మల్ని బాధపెట్టకుండా ఆశ్రమాలకు వెళ్ళిపోతున్నారు. వారు ఇలా తిరగబడితే తప్ప
గౌరవంగా బ్రతకలేరు. ఏమీ లేనివారి పరిస్థితి సరే! ఆధారం ఉన్న తల్లిదండ్రులను, ఆస్తిపాస్తి ఉన్న తల్లిదండ్రులు కూడా అనాధ శరణాలల్లో ఉంటున్నారు. వారు తప్పక తెలుసుకోవలసిన విషయం ఇది.

తల్లిదండ్రులను బిడ్డల్లా కాపాడండి. చివరి దశలో వారిని చిత్రవధ చేయకండి. వారికంటే మించిన దేవుళ్ళు లేరని తెలుసుకోండి.

కంటికి కనిపించని దేవుడకి ముక్కుతున్నం కాని కంటికి కనిపిస్తున్న కనిపెంచిన దేవుళ్లను గాలికి వదిలేస్తున్నాం.

దీనిని ఆ సర్వాంతర్యామి కూడా హర్షించాడు, వారు పోయిన తర్వాత వారి గొప్పతనం తెలుస్తుకున్న లాభం లేదు.

దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దు కొనవలెను.

ఆలోచనలు మారాలి అందరం హాయిగా ఉండాలి.

No comments:

Post a Comment